తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల .. ఎవరు వదిలిన బాణం అన్నదానిపై క్లారిటీ వచ్చిందా..? షర్మిలకు మోడీ ఫోన్ చేయడంతో .. అసలు కథ బయటకు వచ్చిందా…? అందుకే అరెస్ట్ ల పర్వంపై బీజేపీ మద్ధతు పలుకుతోందా..?
తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల .. ఎవరు వదిలిన బాణం ?
వైఎస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళకు .. ప్రధాని మోదీ ఫోన్ చేశారు. షర్మిళ పాదయాత్రకు టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పిస్తున్న అడ్డంకులు, ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు, తెలంగాణ రాజకీయ పరిస్థితులపై ప్రధాని మోదీ ఆరా తీసినట్టు సమాచారం. షర్మిళ నుంచి కీలక సమాచారం రాబట్టుకున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల షర్మిళను టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా రకాలుగా ఇబ్బంది పెట్టినట్టు వార్తలు వచ్చాయి. గంటల తరబడి రోడ్డుపైనే వాహనంలో ఉండిపోయిన షర్మిళను బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించడం తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనకు దారితీసింది.

ఈ నేపథ్యంలో నేరుగా ప్రధాని ఫోన్ చేసి పరామర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అటు తెలంగాణ పొలిటిక్స్ కు కొత్త సంకేతాలిచ్చినట్టయ్యింది. ఇప్పటికే జగన్ వద్ద ప్రధాని మోదీ షర్మిళ గురించి ఆరా తీసినట్టు వార్తలు వచ్చాయి. జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం నిర్వహించిన సన్నాహాక సమావేశానికి జగన్ హాజరయ్యారు.
ప్రధాని పలుకరించే క్రమంలో జగన్ వద్ద షర్మిళ విషయం ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మీరెందుకు స్పందించలేదని కూడా ప్రధాని అడిగినట్టు వార్తలు వచ్చాయి.కానీ జగన్ నుంచి మౌనమే సమధానం వచ్చిందని మీడియాలో కథనాలు సైతం ప్రసారమయ్యాయి.
కానీ ఇప్పుడు ప్రధాని నేరుగా షర్మిళకు ఫోన్ చేసేసరికి.. జగన్ తో నిజంగా చర్చించారన్న అనుమానాలకు బలం చేకూరినట్టయ్యింది. జగన్ వద్ద షర్మిళ ఇష్యూను ప్రశ్నించి ప్రధాని ఇరకాటంలో పడేశారన్న టాక్ నడుస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ తో బీజేపీ హోరాహోరీగా తలపడుతోంది.
అటు జగన్, కేసీఆర్ మంచి స్నేహితులు. అలాగని బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లి కేసీఆర్ తో స్నేహం చేయలేని పరిస్థితి జగన్ ది. అటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంతలా చీలితే అంత తనకు వర్కవుట్ అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలో షర్మిళ బలపడాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే షర్మిళకు హైప్ పెంచాలన్న ఉద్దేశ్యంతో ఆమెను అరెస్ట్ చేశారన్న ప్రచారమూ ఉంది.
ఇవన్నీ గుర్తెరిగే ప్రధాని అటు జగన్ ను, ఇటు కేసీఆర్ ను దెబ్బకొట్టేందుకే నేరుగా షర్మిళకు ఫోన్ చేసి ఓదార్చారన్న టాక్ పొలిటికల్ సర్కిల్ లో నడుస్తోంది. ఇదిలా ఉంటే, జగన్ జైలులో ఉన్నప్పుడు.. ఓదార్పు యాత్ర చేపట్టిన తీరు.. జగనన్న వదిలిన బాణం అనే డైలాగ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.
అంతటి సంచలనాలు రేపిన షర్మిల ఇప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టడమే ఎవరికీ అర్ధం కావట్లేదు. దీనికితోడు ఆమె ఏ పార్టీ వదిలిన బాణం అన్న చర్చ కూడా హాట్ టాపిక్ గా మారింది.
బీజేపీకి చెక్ పెట్టేందుకు టీఆరెస్సే షర్మిలను రంగంలోకి దించిందా?
తెలంగాణలో తిరుగులేని పార్టీ కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్. అధికారంలోకి వచ్చి ఏడేళ్లవుతున్నా అదే ఏకచత్రాధిపత్యం టీఆర్ఎస్ సొంతం. అయితే.. ఇప్పుడిప్పుడే టీఆర్ఎస్ కోటకు తెలంగాణలో బీటలు పడుతున్నాయి. ఇన్నేళ్లలో తనకు ఎదురొచ్చిన ప్రతి పార్టీని తొక్కి పడేసిన కేసీఆర్ కు బీజేపీ ఎదురొస్తోంది.
నిజామాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. దీంతో ఏకు మేకవుతున్న బీజేపీకి చెక్ పెట్టేందుకు టీఆరెస్సే షర్మిలను రంగంలోకి దించిందా? అనే అనుమానం లేకపోలేదు. జగన్ తో కేసీఆర్ కు ఉన్న దోస్తీ ఇందుకు ఉపయోగపడే ఉంటుందని చెప్పాలి. షర్మిలను రంగంలోకి తీసుకొస్తే కాంగ్రెస్ గూటిలో ఉన్న రెడ్లు, బీజేపీకి ఆకర్షితులయ్యే వైఎస్ అభిమానులు షర్మిల వైపుకు వెళ్లడం ఖాయమనే ఇలా ప్లాన్ చేసినట్టు టాక్ వెల్లువెత్తింది.

అన్న పార్టీలతోపాటు టీఆర్ఎస్ కు ఓట్లు చీలినా.. కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు తగ్గడం ద్వారా టీఆర్ఎస్ కు లాభం కలుగుతుందనేది నిజం. ఇవన్నీ ఏపీ-తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఉన్న సఖ్యతను మరింత పెంచుతుంది కాబట్టి తద్వారా జగన్ కు, కేసీఆర్ కు ఇది ఆమోగ్యమైన,లాభదాయకమైన ఒప్పందం అని వార్తలు వినిపించాయి.
బీజేపీ విషయానికే వస్తే.. బీహార్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాను పన్నిన కుయుక్తులు తెలిసిందే. దాదాపు మూడు దశాబ్దాల నాటి మతపరమైన అంశాల్ని ఎంతో ధైర్యంగా తెర మీదకు తెచ్చింది. ఇందుకు ఎంఐఎం పార్టీని ఉపయోగించుకుంది. నాయకులు హిందు, ముస్లిం అంశాలను ప్రస్తావించి ప్రజల్లో మతపరమైన భావనలను తీసుకొచ్చి ఎవరి ఓట్లు వారికి వెళ్లేలా చక్కటి ప్లానింగ్ వేసింది బీజేపీ.
దీంతో రెండు చోట్లా బీజేపీకి లాభమే జరిగింది. ఇప్పుడిదే స్ట్రాటజీని తెలంగాణలో ఉపయోగించాలని యోచిస్తోంది. అయితే ఎంఐఎం దోస్తీతో చేసిన పని తెలిసిపోయింది కాబట్టి తెలంగాణలో మళ్లీ అదే గేమ్ ఆడలేదు. అందుకే వ్యూహాత్మకంగా షర్మిలను రంగంలోకి దించారని టాక్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను దించి బీజేపీ గద్దెనెక్కించాలంటే ఓట్లు చీల్చాల్సిందే.
అందుకే జగన్ తో చర్చించే షర్మిలతో పార్టీ పెట్టించారా అనే ఆలోచన రాకమానదు. ఫలితంగా కాంగ్రెస్ రెడ్లు, వైఎస్ అభిమానులు షర్మిల వైపు వెళ్తే తమకు లాభం జరుగుతందని బీజేపీ అధిష్టానం ఆలోచనగా అంచనాలు వెల్లువెత్తాయి.
తెలంగాణలో షర్మిల పాదయాత్రపై దాడి జరిగిన దగ్గర్నుంచి రాజకీయం ఆమె చుట్టూనే తిరుగుతోంది.
తెలంగాణలో షర్మిల పాదయాత్రపై దాడి జరిగిన దగ్గర్నుంచి రాజకీయం ఆమె చుట్టూనే తిరుగుతోంది. అదే సమయంలో టీఆర్ఎస్ ఆమెపై తీవ్రమైన విమర్శలతో విరుచుకుపడుతోంది.అదే సమయంలో బీజేపీ మాత్రం షర్మిల విషయంలో సాఫ్ట్గా వ్యవహరిస్తోంది. గవర్నర్ మద్దతు పలికారు.

అందుకే టీఆర్ఎస్ షర్మిల పార్టీని బీజేపీ వదిలిన బాణం అని అంటోంది. తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాలని వైఎస్ షర్మిల అనుకోవడమే ఓ సంచలనం. ఎందుకంటే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడ్డారు. ఆయనపై టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శలు గుప్పించేవారు.
అంతకు మించి షర్మిలకు నేటివిటీ లేదు. కడప బిడ్డగానే ప్రసిద్ధి పొందారు. అయితే తాను తెలంగాణ కోడలినని చెప్పుకుని పార్టీ ప్రారంభించేశారు. ఆమే ధైర్యం ఏమిటన్నదానిపై మొదట్లోనే చర్చలు జరిగాయి. కొంత మంది టీఆర్ఎస్ వదిలిన బాణం అని చెప్పుకున్నారు. మరికొంత మంది ఆమె వెనుక బీజేపీ ఉందన్నారు. అందు కోసం రకరకాల విశ్లేషణలు చేశారు. అయితే తాజా ఘటనతో అనూహ్యంగా బీజేపీ షర్మిలకు మద్దతుగా నిలుస్తోంది.
ఆమె విషయంలో ప్రభుత్వం తీరును ఖండిస్తోంది. గవర్నర్ స్వయంగా మద్దతు పలికారు. అందుకే టీఆర్ఎస్ నేతలు ఆమెను బీజేపీ వదిలిన బాణం అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ అంశంలో సైలెంట్ గా ఆరోపణల వరకే సాగినా, తాజాగా మోడీ ఫోన్ చేసి, పరామర్శించడంతో, బీజేపీ అండ అన్న విషయం తేటతెల్లమైపోయిందని టాక్ వెల్లువెత్తుతోంది.
ఇప్పటివరకు ఎవ్వరికీ ఫోన్ చేయని మోడీ .. ఏకంగా ఫోన్ చేసి, మాట్లాడడం వెనుక కారణమేంటన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఇప్పుడీ
అంశం తెలంగాణలో రాజకీయ హీట్ ను రగుల్చుతుందన్న అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు మీ పార్టీ వదిలిన బాణం అంటే కాదు .. మీ పార్టీనే అన్న బీజేపీ .. తాజా పరిణామంతో ఏం చెబుతుందన్న చర్చ .. సర్వత్రా వినిపిస్తోంది. దీన్నే హైలెట్ చేస్తూ, కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు .. ఇప్పటికే విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో షర్మిల పోటీ .. బీజేపీకి ఏమేరకు కలిసివస్తుందన్న అంచనాలు సైతం స్థానికంగా వెల్లువెత్తుతున్నాయి. ఇక షర్మిల పార్టీని సైతం .. బీజేపీ గాటన కట్టివేసే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు ఒంటరిపోరు చేసిన షర్మిల .. నెక్ట్స్ స్టెప్ కమలనాథులే డిసైడ్ చేస్తారా అన్న సెటైర్ సైతం వెల్లువెత్తుతోంది.
మరి దీనిపై అటు షర్మిల, ఇటు బీజేపీ ఏం చేస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.