ఇక త్వరలో ఇండియన్ నేవీ శత్రుదుర్భేద్యంగా మారనుందా..? హిందూ జలాల్లో ఉద్రిక్తతలకు పాల్పడుతోన్న చైనాకు చెక్ చెప్పనుందా..? అందుకోసమే అమెరికా ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేయనుందా..?
ప్రిడేటర్ డ్రోన్ .. మానవ రహితంగా నీటి అడుగున కూడా పని చేయగలగడం సత్తా .. ఇక భారత్ సొంతం కానుంది. వీటి కొనుగోలుకు ఏకంగా 3 బిలియన్ డాలర్లను చెల్లిస్తోంది. తద్వారా భారత్ పై నిఘాకు యత్నిస్తోన్న చైనాకు చెక్ చెప్పాలని యోచిస్తోంది.
సముద్రంలో ఇండియన్ నేవీని శత్రుదుర్భేద్యంగా మార్చేందుకు.. మానవరహిత విమానాలే కాదు.. నీటి అడుగుల ఉండే నౌకలను కూడా ఇండియన్ నేవీ పరిశీలిస్తోంది. ఈ అన్మ్యాన్డ్ అండర్ వాటర్ వెహికిల్స్.. నీటి లోపల నిఘా పెట్టడం మాత్రమే కాదు.. అవసరమైతే దాడి చేసేందుకు కూడా సిద్ధంగా ఉంటాయి. అలాగే.. హిందూమహాసముద్రంలో చైనాకు చెక్ పెట్టేందుకు.. అమెరికా నుంచి ఫ్లీట్ ప్రిడేటర్ డ్రోన్లు కొనుగోలు చేయాలని.. ఇండియన్ నేవి భావిస్తోంది. ఇండియన్ నేవీకి.. ఇప్పుడు అండర్ వాటర్ డొమైన్ అవేర్నెస్ అనేది అత్యంత కీలకంగా మారింది. ఇందుకోసం.. అన్మ్యాన్డ్ రోడ్ మ్యాప్ని భారత నావికాదళం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా.. మానవరహిత టెక్నాలజీ, వ్యవస్థలకు సంబంధించిన కెపాసిటీని పెంచుకోవాలన్నదే ముఖ్య ఉద్దేశం. భవిష్యత్తులో.. మానవరహిత వ్యవస్థలకు సంబంధించిన అవసరాలను.. కూడా ఇండియన్ నేవీ ఇటీవలే ఆవిష్కరించింది.
ఇందులో.. అండర్ వాటర్ డ్రోన్లు కూడా ఉన్నాయి. ఇవి.. మనిషి జోక్యం అవసరం లేకుండానే నీటి లోపల పనిచేయగలుగుతాయి.. వీటిని.. రిమోట్ ద్వారా ఆపరేట్ చేయగల అండర్ వాటర్ వెహికిల్స్గా చెప్పొచ్చు. అటానమస్ అండర్ వాటర్ వెహికిల్స్ అయితే.. పూర్తిగా ఆటోమేటెడ్గానూ, స్వతంత్రంగానూ పనిచేస్తాయి. కానీ.. రిమోట్లీ ఆపరేటెడ్ అండర్ వాటర్ వెహికిల్స్ మాత్రం.. మనుషులు ఆపరేటింగ్ చేయడం ద్వారా పనిచేస్తాయి. మానవరహిత వాహనాల్లో.. వీటిని సెకండ్ కేటగిరీగా చెప్పొచ్చు. ఈ మానవరహిత అండర్ వాటర్ డ్రోన్లు.. మైన్స్వీపర్ల అవసరాలను తగ్గిస్తాయి.
ఈ మధ్యకాలంలోనే.. ఎల్ అంట్ టీ మరోసారి తన అటానమస్ అండర్ వాటర్ వెహికిల్ని.. డిఫెన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించింది.
. ఈ టెన్ ట్యూబ్ లాంచ్డ్ ఏయూవీలను కొనుగోలు చేసేందుకు.. ఇండియన్ నేవీ ఆసక్తి చూపిస్తోంది. ఎల్ అండ్ టీ తయారుచేసిన ఈ ఏయూవీలు.. ఐదు మీటర్ల పొడవుతో, భారీ బరువుతో ఉన్నాయి. వీటిని.. సబ్మెరైన్ల టార్పెడో ట్యూబ్ నుంచి కూడా లాంచ్ చేయొచ్చు. అదేవిధంగా.. సర్ఫేస్ షిప్స్ నుంచి కూడా వీటిని ఉపయోగించొచ్చు. ఇది.. నీటి అడుగున 8 గంటల పాటు పనిచేస్తుంది. నీటిలో.. 5 వందల మీటర్ల కింద వరకు ఇది వెళ్లగలుగుతుంది. మరోవైపు.. డీఆర్డీవో కూడా యూఏవీలను, అండర్ వాటర్ డ్రోన్లను డెవలప్ చేసేందుకు కృషి చేస్తోంది. అండర్ వాటర్ లాంచ్డ్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్.. స్టేషన్ డేటా కనెక్షన్ ద్వారా నియంత్రించబడుతుంది.
మిషన్ పూర్తయ్యాక.. తిరిగి తన స్థానానికి చేరుకునేందుకు.. సింగిల్ పాయింట్ రికవరీ మెకానిజంని డెవలప్ చేస్తున్నారు. ఈ.. యూఎల్యూఏవీలను.. ప్రధానంగా ఐఎస్ఆర్ కార్యకలాపాలు, రియల్ టైమ్ టార్గెట్ ట్రాకింగ్, బీచ్ నిఘా, స్పెషల్ ఆపరేషన్స్, సముద్ర డొమైన్ అవేర్నెస్ కోసం వాడనుంది ఇండియన్ నేవీ. ఓవరాల్గా చూసుకుంటే.. సముద్రంలో దేశ భద్రతను భంగం వాటిల్లకుండా ఇండియన్ నేవీ ఆధునిక వ్యవస్థలను సమకూర్చుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే.. స్వదేశీ, విదేశీ టెక్నాలజీతో రూపొందిన అటానమస్ అండర్ వాటర్ వెహికిల్స్ కోసం చూస్తోంది. అయితే.. ఇండియన్ మేడ్ అండర్ వాటర్ డ్రోన్లు అందుబాటులోకి రావడానికి ఇంకొంత సమయం పట్టే అవకాశముంది.
వాస్తవానికి.. భారత్కు హిందూ మహాసముద్రం చాలా కీలకమైన ప్రాంతం. దాని మీదుగానే.. పెద్ద ఎత్తున వాణిజ్యం, రవాణా లాంటి కార్యకలాపాలు సాగుతుంటాయి. అందువల్ల.. ఇండియన్ ఓషియన్ రీజియన్లో.. భారత ప్రయోజనాలను కాపాడుకోవడమే ఇండియన్ నేవీకి ప్రధాన విధి. ఈ విషయంలో.. నౌకాదళం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఈ విషయంలో.. చైనా నుంచి గానీ.. మరో దేశం నుంచి గానీ.. తనను తాను రక్షించుకునేందుకు.. భారత్ ఇతర దేశాలపై ఆధారపడే అవసరం లేదు. ఇందుకోసం.. నేవీ లక్ష్యాలను సాధించే దిశగా.. ఇండియన్ యూఏవీ రంగం ఇప్పటికే అడుగులు ప్రారంభించింది. సొంతంగా భారత్ మానవరహిత డ్రోన్లను తయారుచేసుకునే కెపాసిటీని సాధించేవరకు.. విదేశాల నుంచి కొనుగోలు చేసిన అండర్ వాటర్ డ్రోన్లను.. భారత సముద్ర జలాల్లో మోహరించనున్నారు. అయితే.. మొదటగా.. అటానమమ్ అండర్ వాటర్ వెహికిల్స్ని.. సబ్మెరైన్ల నుంచి ప్రారంభించనున్నారు.
అవసరమైతే.. ఈ ఏయూవీలు.. భవిష్యత్తులో సైనికపరమైన దాడులకు కూడా ఉపయోగించనున్నారు. దీనిలో భాగంగా త్రివిధ దళాల అవసరాల కోసం చిరకాల స్వప్నంగా ప్రతిపాదనలో ఉన్న 30 బహుళ సామర్ధ సాయుధ నిఘా డ్రోన్లను 3 బిలియన్ డాలర్లతో అమెరికా నుంచి కొనుగోలు చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ ప్రతిపాదన ప్రకారం సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించగల గగన తలం నుంచి నేలపై లక్షాన్ని ఛేదించగల క్షిపణులతో కూడిన ఎంక్యు9బి డ్రోన్లు సమకూరతాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భారత నావికాదళంతోపాటు మొత్తం త్రివిధ దళాలు ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చాయి. ఒక్కో దళానికి 10 డ్రోన్లు వంతున అందుతాయి.
రిమోట్ పైలట్తో పనిచేసే ఈ మానవ రహిత డ్రోన్లను అమెరికా రక్షణ విభాగానికి చెందిన జనరల్ అటామిక్స్ తయారు చేసింది.
గాలిలో 35 గంటలపాటు స్థిరంగా ఉండి శత్రువర్గాలపై పర్యవేక్షణ, నిఘా, రహస్యసమాచార సేకరణ తదితర కీలకమైన విధులను నిర్వర్తిస్తాయి. క్షణాల్లో శత్రులక్షాలను నాశనం చేస్తాయి. చాలా ఎత్తు నుంచి నిఘా కార్యకలాపాలు సుదీర్ఘకాలం నిర్వర్తించే సామర్ధం కలిగిన ఈ ప్రిడేటర్ బి డ్రోన్లు మానవ ప్రమేయం లేని శత్రునాశన ఆయుధాలుగా డిజైన్ చేయబడ్డాయి. తూర్పులడఖ్ ప్రాంతంలో చైనాతో ప్రతిష్ఠంభన ఏర్పడిన దగ్గర నుంచి వీటిని సంపాదించుకోవాలన్న లక్షంతో భారత్ ఉంటోంది. దేశ సరిహద్దులు, సముద్ర తీరం వెంబడి నిఘా కోసం అత్యాధునిక 30 ఎంక్యూ-9బీ ప్రిడేటర్ సాయుధ డ్రోన్లు కొనుగోలు చేసేందుకు భారత్ అగ్రరాజ్యం అమెరికాతో జరుపుతున్న చర్చలు ఫలవంతం అయ్యాయి. ఎంక్యూ-9బీ డ్రోన్లు వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ), సముద్ర తీర ప్రాంతలో నిఘా, జలాంతర్గాముల దాడులను గుర్తించడం, స్థిరమైన భూ లక్ష్యాలను చేధించడం వంటి వివిధ ప్రాతాలు నిర్వర్తించగలవు,
గతనెల కాబూల్లో అల్ కాయిదా నేత జవహరిని హతమార్చడంలో కీలక పాత్ర పోషించిన ఎంక్యూ9 డ్రోన్కు ఈ ఎంక్యూ
9బీ డ్రోన్ మరింత అధునాతన వెర్షన్ గా నిపుణులు చెబుతున్నారు. భారతదేశం కూడా 2000 లలో డ్రోన్లపై పని ప్రారంభించింది. ప్రారంభంలో, డ్రోన్లను నిఘా కోసం ఉపయోగించడం ప్రారంభించారు. మిలిటరీ ఇన్ఫర్మేషన్ గ్రూప్ జెన్స్ ప్రకారం, భారతదేశంలో 90 ఇజ్రాయెల్ డ్రోన్లు ఉన్నాయి, వీటిలో 75 ఎయిర్ ఫోర్స్ మరియు 10 ఇండియన్ నేవీకి చెందినవి.
నానాటికీ పెరుగుతోన్న డ్రోన్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే అమెరికా ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. ఇదీ ఇవాల్టి ఫోకస్.. రేపటి ఫోకస్ లో మళ్లీ కలుద్దాం..