రష్యా.. ఉక్రెయిన్..మధ్యలో అగ్రరాజ్యం అమెరికా..ఈ సీక్వెన్స్ ఎలా ఉందంటే ఆ యుధ్దాన్ని ఎన్నటికీ పూర్తి కాకుండా చూస్తోందని చెబుతున్నారు రక్షణ రంగ నిపుణులు. రష్యా చెబుతున్నది ఉక్రెయిన్ వినిపించుకోదు..ఉక్రెయిన్ డిమాండ్ పుతిన్ కు నచ్చదు..మధ్యలో ఎంట్రీ ఇచ్చే అమెరికా ఆయుధాలు ఆర్థిక సాయాలతో ఉక్రెయిన్ ను రెచ్చగొడుతూ ఉంటుది. ఈ కాంబినేషన్ కారణంగా ఈ యుధ్దం ఎన్నటికీ ఆగిపోని యుధ్దంగా ఉండిపోతుందంటున్నారు..
అయితే దీనికి రష్యా అధరలేదు బెదరలేదు. పైగా యురోపియన్ దేశాలకు కావలసిన చమురు గ్యాస్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి. అసలింత గొడవకు కారణం అమెరికా.. నాటో దేశాలను తన చెప్పు చేతల్లో ఉంచుకుని వారిని రష్యాపై ఉస్కో అంటే ఉస్కో అంటూ రెచ్చగొట్టింది అమెరికా. మీకేం సమస్య వచ్చినా నేనున్నానని వారికి హామీ ఇచ్చింది. దాంతో అవి గుడ్డిగా రష్యాపై రెచ్చిపోయాయి. ఆనాడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ పై బాంబులు వేసిన అమెరికా ఎంత రచ్చ రచ్చ చేసిందో ప్రపంచం ఇంకా మరచిపోలేదు.బిల్ క్లింటన్, జార్జ్ బుష్, ఒబామా, ట్రంప్, ఇప్పుడు బైడెన్.. అధ్యక్షులు మాత్రమే మారారు. అమెరికా సామ్రాజ్యవాదం మారలేదు. పైగా కొత్త పోకడలు పోతోంది.

నాటో దేశాల సభ్యత్వంలో చేరేందుకు ఉక్రెయిన్ మొగ్గు చూపుతున్న రోజుల్లో బెలారస్ వంటి దేశంపై యుద్ధం చేసి గెలిచింది రష్యా. కానీ వెనుక ఉన్న నాటో దేశాలు ఉక్రెయిన్ ను ఎగదోశాయి. ఈ పన్నాగం తెలియని కామెడీ నటుడు జెలేన్ స్కీ తాడో పేడో అనే సంకేతాలు ఇచ్చాడు. ఒళ్ళు మండిన పుతిన్ యుద్ధానికి సిద్ధమన్నాడు. అలా ఫిబ్రవరిలో మొదలైన యుద్ధం ఇప్పటికీ జీళ్ల పాకంలా కొనసాగుతూనే ఉంది. కీలకమైన కీవ్, మరియాపోల్ రష్యా సొంతమయ్యాయి. ఇప్పటికీ భీకరమైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఎంతటికి దారితీస్తాయో తెలియడం లేదు. పుతిన్ మాత్రం వెనకడుగు వేయడం లేదు. మరోవైపు నాటో దేశాలు కూడా యుద్ధాన్ని విరమించేలా కనిపించడం లేదు.. దీంతో పరిస్థితి నానాటికి చేయి దాటిపోతూ కనిపిస్తోంది.
ఇదే సమయంలో జపాన్ సరిహద్దుల్లో అటు రష్యా,ఇటు చైనా, ఉత్తర కొరియా దేశాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. దీంతో జపాన్ కూడా శాంతి మంత్రాన్ని పక్కనపెట్టి సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. తన దేశ జీడీపీలో రెండు శాతం ఆయుధాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ పరిస్థితులు మొత్తం చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందేమో అనే భయాలు కలుగుతున్నాయి. ఆ మధ్య అమెరికా ఇరాన్, ఇరాక్ పై యుద్ధాలు చేసింది. ఇందుకు కారణం లేకపోలేదు. ఆ రెండు దేశాల్లో చమరు నిల్వలు విస్తారంగా ఉంటాయి.. వాటిని చవకగా పొందేందుకు అమెరికా అనేక కుయుక్తులు పన్నింది. దీనికి ఆ దేశాలు ఒప్పుకోలేదు. దీంతో అమెరికా ఆదేశాలపై యుద్ధం ప్రకటించింది. తనకు తొత్తులుగా ఉండే వ్యక్తులను దేశ అధ్యక్షులను చేసింది.
ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ముస్లిం దేశాలు అమెరికాను ప్రతిఘటించకపోవడం గమనార్హం. అయితే ప్రస్తుతం అమెరికా లాగానే సమాంతర శక్తిగా రష్యా ఎదుగుతున్నది.. ఇది ఎలాగైనా తనకు ప్రమాదమేనని భావించిన అమెరికా.. ఉక్రెయిన్ అడ్డం పెట్టుకొని యుద్ధం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న అమెరికా… ఇప్పుడు హఠాత్తుగా రంగంలోకి దూకడం వెనక కారణం ఇదే అని విశ్లేషకులు చెబుతున్నారు.. ప్రస్తుతం ప్రపంచం అన్ని రంగాల్లో దూసుకుపోతున్న నేపథ్యంలో… మూడో ప్రపంచ యుద్ధం గనుక వస్తే ఈ భూమి మీద మనిషి మనగడే ఉండదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇటీవల పాకిస్తాన్ మంత్రి మా వద్ద అణు బాంబు ఉందని హెచ్చరించడం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతున్నది.
