Homeఅంతర్జాతీయం"యూఎన్​వరల్డ్​ వాటర్ డెవెలప్​మెంట్​ రిపోర్ట్​ 2023​"

“యూఎన్​వరల్డ్​ వాటర్ డెవెలప్​మెంట్​ రిపోర్ట్​ 2023​”

‘ప్రపంచంలో 26శాతం మందికి అసలు తాగునీరే అందడం లేదని ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్​ సంఖ్యలో జనాభాకు సురక్షితమైన తాగునీరు అందడం లేదని, 3.6 బిలియన్​ మంది పారిశుద్ధ్యానికి దూరంగా జీవిస్తున్నారని ఐక్యరాజ్య సమితి తాజా నివేదికలో తేలింది. తాగునీటి మితిమీరిన వినియోగం, వాతావరణ మార్పులే ఇందుకు కారణం అని నివేదిక తెలిపింది. మరీ ముఖ్యంగా..భూమిపై వాతావరణ మార్పుల కారణంగా రానున్న కాలంలో పరిస్థితుల మరింత దుర్భరంగా మారుతాయని, నీటి కొరత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. దాదాపు 45ఏళ్ల తర్వాత.. తాగునీరు అంశంపై యూఎన్​ కాన్ఫరెన్స్​ జరిగింది.

న్యూయార్క్​ వేదికగా మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముందు తాగునీరు, పారిశుద్ధ్యంపై.. యూఎన్​ వాటర్​ ఫారమ్​, యూఎన్​స్కో సంయుక్తంగా “యూఎన్​వరల్డ్​ వాటర్ డెవెలప్​మెంట్​ రిపోర్ట్​ 2023​” అనే పేరుతో ఓ నివేదికను విడుదల చేశాయి. ఇప్పటికే నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దారుణంగా మారనున్నాయని నివేదిక వెల్లడించింది. నివేదికను రూపొందించిన వారిలో ఒకరైన రీచర్డ్​ కానర్​ సైతం ప్రపంచంలో నెలకొన్న పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. “ప్రపంచంలో 2 బిలియన్​ మందికి మంచి తాగునీరు అందడం లేదు. ఇది దాదాపు 26శాతం. 46శాతం మందికి పారిశుద్ధ్య సదుపాయాలు కూడా అందడం లేదు. పరిస్థితులను మెరుగుపరిచేందుకు వెంటనే చర్యలు చేపట్టాలి.

తాగునీరు, పారిశుద్ధ్య విషయాలో మన లక్ష్యాలను సాధించుకునేందుకు ప్రతియేటా.. 600 బిలియన్​ డాలర్ల నుంచి 1 ట్రిలియన్​ డాలర్ల ఖర్చు అవుతుంది. అయితే.. డబ్బు ఖర్చు చేయడం ఒక్కటే ముఖ్యం కాదు. పెట్టుబడిదారులు, ఆర్థికవేత్తలు, ప్రభుత్వాలు, వాతావరణ మార్పును అడ్డుకునేందుకు కృషిచేస్తున్న సంఘాల మధ్య భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయడం కూడా కీలకమేనని రిచర్డ్​ అన్నారు. ఐరాస నివేదిక ప్రకారం.. 40ఏళ్లుగా.. తాగునీటి వినియోగం ప్రతియేటా 1శాతం చొప్పున పెరుగుతోంది.

2050 వరకు ఇదే విధంగా పెరిగే అవకాశం ఉంది. జనాభా పెరుగుదల, సామాజిక- ఆర్థిక అభివృద్ధి, నీటి వినియోగంలో మార్పులు వంటివి ఇందుకు కారణం. పారిశ్రామిక వృద్ధి, నగరాల్లో జనాభా పెరుగుదలతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే నీటి వినియోగం అధికంగా ఉంటోంది. ప్రపంచంలోని 10శాతం జనాభా.. తాగునీటి కొరత అత్యంత తీవ్రంగా ఉన్న దేశాల్లో నివాసముంటోంది. “ప్రపంచం.. ప్రమాదకరమైన మార్గంలో గుడ్డిగా ప్రయాణిస్తోంది,” అని.. ఈ నివేదికను ఉదాహరణగా చూపిస్తూ యూఎన్​ జనరల్​ సెక్రటరీ అంటోనియో గుటెర్రస్​ వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాధినేతలు ఇప్పటికైనా మేల్కొని, తగిన చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అయితే ప్రపంచమంతా నీటి కొరత ఎదుర్కుంటోంది.. నీళ్ల కోసం యుద్ధాలు జరగనున్నాయి..అవును.. భవిష్యత్తులో నీటి కోసమే యుద్ధం చేయాల్సి రావొచ్చు..

మనం తాగే గుక్కెడు నీటి కోసం ప్రాణాలను తీసే పరిస్థితి తలెత్తినా ఆశ్చర్యం ఉండకపోవచ్చు.. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న నీటి కొరత దృష్ట్యా ప్రపంచవేత్తల అంచనాలు కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే..ఎక్కడికక్కడ నదులు నిండుకుంటున్నాయి. ఎక్కడికక్కడ రిజర్వాయర్లుఎండిపోతున్నాయి. ఏ సరస్సు చూసినా, చెరువు చూసినా.. అన్నీ నెర్రెలువారి కనిపిస్తున్నాయి. ఒక దేశంలోనో, ఒక ఖండంలోనో కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. అగ్రరాజ్యం అమెరికా అయినా, రవి అస్తమించని సామ్రాజ్యం యూకే అయినా, మరే దేశమైనా.. ప్రపంచమంతా నీటి కొరత తీవ్రంగా వేధిస్తున్నది. భవిష్యత్తులో నీళ్ల పరిస్థితి చమురు మాదిరిగా తయారవుతుందని ప్రపంచవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇన్నేండ్లుగా ఏ ఒక్క దేశమూ నీటి సమస్యను పట్టించుకోలేదు. ఇప్పటికైనా తేరుకోకపోతే మనం అతిపెద్ద ముప్పును ఎదుర్కోక తప్పదని స్పష్టం చేసింది ఐక్యరాజ్యసమితి. అమెరికా మొదలుకొని.. ఆఫ్రికా ఖండం, యూరోపియన్‌ దేశాలైన ఇటలీ, పోర్చుగల్‌, స్పెయిన్‌ తదితర దేశాలన్నీ అత్యంత కరువును ఎదుర్కొంటున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే పలు దేశాల్లో నదులు, రిజర్వాయర్లు, సరస్సులు ఎండిపోయాయి. భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయాయి. ఈ మధ్యే నీటి కొరతపై అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాకు నీటి భద్రత అతిపెద్ద సమస్యగా పరిణమించే ప్రమాదం పొంచి ఉన్నదని వ్యాఖ్యానించారు. నీటి భద్రత కోసం వ్యూహం రచించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ఇప్పటికే యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేశామని వెల్లడించారు. అమెరికా సుస్థిరాభివృద్ధి, ఆర్థిక వృద్ధి జరగాలంటే నీటి భద్రత కచ్చితమని స్పష్టం చేశారు. మేడమ్ కమలా హ్యారిస్‌ అంచనా మేరకు .. 9 కోట్ల మంది అమెరికన్లు ప్రస్తుతం నీటి విషయంలో కరువు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులపైన కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నీటి కొరత ప్రపంచాన్ని అస్థిరపరుస్తుందని, అభద్రతలోకి నెడుతుందని వెల్లడించారు. నీటి వనరులు దేశాల మధ్య, వర్గాల మధ్య కొట్లాటలకు దారి తీసేలా చేస్తాయని, అవి పెరిగి పెరిగి యుద్ధాలకు దారి తీసే ప్రమాదం ఉంటుందని వివరించారు.

‘నీటి కొరత వల్ల ఆహారోత్పత్తి తగ్గుతుంది. ప్రజారోగ్యం కుంటుపడుతుంది. భారీ వలసలు చోటు చేసుకొంటాయి. వలసల కారణంగా పక్క దేశాలపై ఒత్తిడి పెరుగుతుంది’ అని ఆమె అన్నారు. ఆఫ్రికాలో అసలే పేదరికం ఎక్కువ. అలాంటిది ప్రస్తుతం ఆ దేశాలను నీటి కొరత తీవ్ర సమస్యగా మారింది. నీటి కొరత ఏ స్థాయిలో ఉన్నదంటే.. 40 ఏండ్ల కిందటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. కరువుతో లక్షల మంది ఆఫ్రికన్లు మృత్యువాతపడుతున్నారు. అమెరికా సర్వే ప్రకారం.. ఆఫ్రికాలో నీటి సమస్యను తీర్చేందుకు వందేండ్లలో ఏ ప్రభుత్వాలు చొరవతీసుకోలేదు. 2030 నాటికి ఆఫ్రికాలో నీళ్ల డిమాండ్‌ 283 శాతం పెరిగే అవకాశం ఉన్నది. ఏటా ఎండాకాలంలో కరువుతో అల్లాడిపోయే దేశాలేవంటే ఆఫ్రికా దేశాలనే చెప్తాం. కానీ ఈ ఎండాకాలంలో కొంత వాటాను పశ్చిమ ఐరోపా దేశాలు కూడా పంచుకొన్నాయి.

ఆ దేశాలను వడగాడ్పులు వణికిస్తున్నాయి. ఇటలీలో వేసవి ఉష్ణోగ్రతలు పెరిగి, వర్షపాతం తగ్గుతూ వస్తున్నది. ఆ దేశంలో పొడవైన నది.. ‘పో’ మొత్తం ఎండిపోయింది. గత 70 ఏండ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ తలెత్తలేదు. ఫలితంగా పంటలు పండక ఆహారోత్పత్తి తగ్గిపోతున్నది. నీటి వినియోగాన్ని తగ్గించుకోవాలని దాదాపు 100 నగరాల్లో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నీటి సమస్యను ఎదుర్కొనేందుకు ఆ దేశం 37 మిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైంది. వేరే నదులున్న చోట్లలో చాలా పంటలకు నీటి సరఫరాను తగ్గించింది. టైబర్‌, వెరోనా సిటీలో ఈ ఆగస్టు వరకు కార్లు కడగటం, తోటలకు నీళ్లు పట్టడం, స్విమ్మింగ్‌ పూల్స్‌లో నింపటంపై నిషేధం విధించారు.

అతిక్రమిస్తే 516 డాలర్ల ఫైన్‌ విధిస్తున్నారు. ఫ్రాన్స్‌లోని దక్షిణ భూభాగం కూడా కరువును ఎదుర్కొనే పరిస్థితికి దగ్గరవుతున్నది. పోర్చుగల్‌లోనూ అదే పరిస్థితి. అక్కడి డ్యాంలన్నీ అడుగంటిపోయాయి. హైడ్రోఎలక్ట్రిక్‌ పవర్‌ ప్లాంట్లు వారానికి రెండు గంటలే వాడాలని అక్కడి ప్రభుత్వం షరతు విధించింది. వ్యవసాయ ఆధారిత పట్టణాలు సిల్వెస్‌, లాగోవా, పోర్టిమావోల్లో పంటలను తగానికి తగ్గించేశారు. స్పెయిన్‌లో అయితే మూడింట రెండో వంతు భాగం ఎడారిమయమైపోయింది. నీటి వనరులు లేక సాగు భూములన్నీ మట్టిదిబ్బలా మారిపోతున్నాయి.

ఈ పరిస్థితి 1961 తర్వాత ఇదే తొలిసారి అంటున్నారు నిపుణులు. ఏది ఏమైనా భూతాపమే అన్నింటికీ మూలం..పర్యావరణాన్ని మనం రక్షించుకుంటేనే పర్యావరణం మనల్ని రక్షిస్తుంది. లేదంటే నెలల పాటు కార్చిచ్చులు రగులుతుంటాయి..విపరీతమైన శక్తితో భూకంపాలు దాపురిస్తాయి. సముద్రమట్టాలు పెరుగుతూ దేశాలను కనిపించకుండా పోతాయి. ఇన్ని అనర్థాలకు మూలం ఒకటే..అడవులను కాపాడుకోవడం, నీటిని పొదుపుగా వాడుకోవడం లేదా రక్షంచుకోవడం.. లేదంటే భూమి ఒకరోజు ఆవాస యోగ్యత కోల్పోతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

Must Read

spot_img