Homeఅంతర్జాతీయంపెన్షన్ సంస్కరణలు అతిపెద్ద నిరసనలకు దారితీశాయి...

పెన్షన్ సంస్కరణలు అతిపెద్ద నిరసనలకు దారితీశాయి…

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును మరో రెండేళ్లు పెంచుతూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యూయేల్ మాక్రాన్ పెన్షన్ సంస్కరణ దిశగా అడుగులు వేశారు.. అసలు రిటైర్మెంట్‌ వయసు పెంపు ఎందుకు..? ఇక వృద్ధులు భారమేనా..?

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ పెన్షన్‌ సంస్కరణలు దేశ చరిత్రలో అతి పెద్ద నిరసన ప్రదర్శనకు దారి తీశాయి. పదవీ విరమణ వయసుని 62 నుంచి 64కి పెంచుతూ ప్రతిపాదనలు చేసినందుకే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.. పెన్షన్‌ అందుకోవడానికి మరో రెండేళ్లు పని చేయాలా అంటూ ప్రజలు ఆందోళన బాట పట్టారు. రైళ్లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. పాఠశాలలు తెరుచుకోలేదు. కార్యాలయాలు మూతబడ్డాయి. ఈఫిల్‌ టవర్‌ ను మూసేశారు. పారిస్‌ సహా పలు నగరాల్లో 10 లక్షల మందికిపైగా నిరసనకారులు వీధుల్లోకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. 12 ట్రేడ్‌ యూనియన్లు, లెఫ్ట్‌ పార్టీలు, ఫార్‌ రైట్‌ పార్టీలు కలసికట్టుగా ఈ ఆందోళనల్లో పాల్గొనడం విశేషం.

ఫ్రాన్స్ లోని 68% ప్రజలు ఈ పెన్షన్‌ పథకాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా సర్వేలు చెబుతున్నాయి. రైట్‌ పార్టీల మద్దతుతో అధికారంలో ఉన్న సంకీర్ణ సర్కార్‌ వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే పెన్షన్‌ సంస్కరణల బిల్లుకు ఎంత వరకు మద్దతు లభిస్తుందన్న అనుమానాలున్నాయి. ప్రపంచమంతటా సగటు ఆయుఃప్రమాణం పెరుగుతోంది. జననాల రేటు తగ్గిపోతోంది. దీంతో వయసు మీద పడినా కష్టపడి పని చేయాల్సి వస్తోంది. అయితే రిటైర్మెంట్‌ వయసు యూరప్‌లోకెల్లా ఫ్రాన్స్‌లోనే తక్కువ.

స్పెయిన్‌ లో 65, యూకేలో 67, జర్మనీలో 67 ఏళ్లుగా ఉంది. జర్మనీ కూడా రిటైర్మెంట్‌ వయసును 70 ఏళ్లకు పెంచే యోచనలో ఉంది. ఫ్రాన్స్‌ కూడా పెన్షన్‌ నిధుల్ని పెంచుకోవడానికే ఈ సంస్కరణలను తీసుకొచ్చింది. రెండేళ్ల రిటైర్‌మెంట్‌ వయసు పెంపుతో ఏడాదికి 1,770 కోట్ల యూరోలు జమ అవుతాయి. 2027 నాటికి బ్రేక్‌ ఈవెన్‌ సాధ్యపడుతుంది. పదవీ విరమణ అనంతరం ఉద్యోగులు హాయిగా ఇంటి పట్టున ఉండి.. పెన్షన్‌ అందుకుందామని అనుకున్న వారు మరో రెండేళ్లు పనిచేయడానికి సుముఖంగా లేరు.

ఇంకా పని చేస్తే రిటైరవక ముందే ఆరోగ్యం పూర్తిగా పాడవుతుందని రైల్వే వర్కర్లు, మహిళలు, నైట్‌షిఫ్ట్‌ల్లో ఉండేవారు ఆందోళనగా ఉన్నారు. కనీసం 43 ఏళ్లు పని చేయాలన్ననిబంధనపైనా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆలస్యంగా మొదలు పెట్టే మహిళలు, ఉన్నత విద్య చదివే వారు 67 ఏళ్ల దాకా పని చేయాల్సి వస్తుంది. మరోవైపు నిరుద్యోగులు కూడా తమకు ఉద్యోగాలు పొందడం ఆలస్యం అవుతుందంటూ ఆందోళనల్లో పాల్గొన్నారు.ఫ్రాన్స్‌లో కనీస పెన్షన్‌ పెరుగుతున్న ధరలకి అనుగుణంగా లేదు. కరోనా, రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత ధరాభారం పెరిగింది.

ఫ్రాన్స్‌ లో పెన్షన్‌ సంస్కరణలపై నిరసనలు ఇదేం మొదటి సారి కాదు. 2010లో రిటైర్‌మెంట్‌ వయసుని 60 నుంచి 62 ఏళ్లకు పెంచినప్పుడు కూడా ఇదే స్థాయి వ్యతిరేకత ఎదురైంది. ఫ్రాన్స్‌ అధ్యక్షుడయ్యాక మాక్రాన్‌ ఈ సంస్కరణలు తీసుకురావాలని గట్టిగా అనుకున్నారు. 2019లో ఈ ప్రతిపాదిత సంస్కరణలకి వ్యతిరేకంగా సమ్మె జరిగినా కరోనా సంక్షోభంతో సమ్మెని ఆపేశారు. పెన్షన్‌ నిధి పెంచుకోవాలంటే సంపన్నులకి పన్నులు పెంచాలని, పెన్షన్‌ పథకంలో యాజమాన్యాల వాటాను పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పెన్షన్‌ పథకంలో తాజా సంస్కరణలు…. రిటైర్మెంట్‌ వయసును ఏడాదికి మూడు నెలల చొప్పున పెంచుతూ 2030 నాటికి 64 ఏళ్లకు పెంచడం. 2027 తర్వాత చేరే ఉద్యోగులెవరైనా పూర్తి పెన్షన్‌ కోసం కనీసం 43 ఏళ్లు పని చేయాలి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రిటైరయ్యే నాటికి 43 ఏళ్ల సర్వీసు లేకపోతే 67 ఏళ్లు వచ్చేదాకా పని చేస్తేనే పెన్షన్‌ లభిస్తుంది. పూర్తి కాలం ఉద్యోగం చేసిన అల్పాదాయ వర్గాలకు 85% పెంపుతో పెన్షన్‌ 1200 యూరోలు అవుతుంది. 20 లక్షల మంది చిన్న ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది.

అయితే… పలు కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగిణిలు, ఇతర ఉద్యోగులు సైతం వారి కార్యాలయాల్లో ఇప్పటికే చాలా ఏళ్లుగా పనిచేస్తున్నామని.. మరో రెండేళ్లు పనిచేయడానికి అనువైన పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక శారీరక శ్రమతో పనిచేసే ఉద్యోగులు తాము ఎన్నేళ్లు ఈ పరిస్థితుల మధ్య పనిచేయాలంటూ ప్రశ్నిస్తున్నారు.. కనీసం 43 ఏళ్ల సర్వీస్ ఉంటేనే పెన్షన్ వస్తుందనడం చాలా అన్యాయం అంటూ ఆందోళనకు దిగారు..

ప్రపంచ దేశాలు పెన్షన్లను ఖరీదైన వ్యవహారంగా పరిగణిస్తున్నాయి. అమెరికాలో 50 ఏళ్ల క్రితం ప్రతీ 10 మందిలో 8 మందికి డిఫైన్డ్‌ బెనిఫిట్‌ పథకాలు వర్తిస్తే ఇప్పుడు ప్రతీ 10 మందిలో ఒక్కరికే వర్తిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం వృద్ధులలో దాదాపు మూడో వంతు మందికి పెన్షన్‌పై భరోసా లేదు. కొందరికి పెన్షన్‌ వస్తున్నా.. అది వారి కనీస అవసరాలకి సైతం సరిపోవడం లేదు.. వృద్ధులైన తల్లిదండ్రులకు పిల్లలు ఆర్థికంగా అండదండగా ఉంటారన్న నమ్మకం లేదు.

ఎందుకంటే పిల్లల సంఖ్య కూడా ప్రపంచమంతటా క్రమక్రమంగా తగ్గిపోతోంది. కుటుంబంలో పిల్లల సంఖ్య సగటున 1.7కి పడిపోయింది. 1960వ దశకంలో ప్రపంచ జనాభాలో ఒక వృద్ధునికి సగటున 12 మంది పని చేసే శ్రామికుల చొప్పున ఉండేవారు. కానీ ప్రస్తుతం అలా పని చేసేవారి సంఖ్య ఏకంగా ఎనిమిదికి పడిపోయింది.. 2050 నాటికల్లా ఈ సంఖ్య మరీ తక్కువగా 4కు పడిపోతుందని అంచనా. దీంతో పని చేయలేని వృద్ధులను ప్రభుత్వాలు భారంగా చూసే రోజులొస్తున్నాయి.

ఆధునిక కాలానికి తోడు మారుతున్న జీవన శైలికి ఒక ఉద్యోగి 62 ఏళ్ల వయసు వచ్చే వరకు పనిచేయడం లేదా 43 ఏళ్ల సర్వీస్ వరకు పనిచేయడం అంత సులభమైన విషయం కాదు.. అలాంటిది తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ పెన్షన్ వయోపరిమితిని 64 పెంచుతామని ప్రకటించడంతో.. దేశ ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవడం ఆశ్చర్యం ఏమీ లేదు..

ప్రజల జీవన ప్రమాణాలు, నిరుద్యోగుల భవిష్యత్, ఇప్పటికే పనిచేస్తోన్న ఉద్యోగుల పరిస్థితులు ఏవీ కూడా పెన్షన్ వయసును పెంచడం సులభమైన విషయం కాదనే విషయాన్ని తెలియజేస్తున్నాయి.. అయినప్పటికీ.. తమ ప్రభుత్వం భారం పడకూడదనే ఆలోచనలతోనే పెన్షన్ సంస్కరణలను చేపడుతోన్న మాక్రాన్ ప్రజల నుంచి వ్యతిరేకతను గుర్తించి.. సంస్కరణలను వెనక్కి తీసుకుంటాడా..? లేక తాజా సంస్కరణలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తాడా..? అనేది చూడాలి..

Must Read

spot_img