Homeఅంతర్జాతీయంరోహింగ్యా ముస్లింలను కష్టాలు వెంబడిస్తూనే ఉన్నాయి...

రోహింగ్యా ముస్లింలను కష్టాలు వెంబడిస్తూనే ఉన్నాయి…

మయన్మార్ సైన్యం భారిన పడి వందలు వేల సంఖ్యలో మరణించిన రోహింగ్యా ముస్లింలను కష్టాలు వెంబడిస్తూనే ఉన్నాయి. మయన్మార్ లో రోహింగ్యాలపై ఊచకోత మొదలవగానే లక్షల సంఖ్యలో జనం ఒక్కసారిగా దేశాన్ని వీడి పొరుగుదేశాలకు వలసలు పోయారు. అలా బంగ్లాదేశ్ చేరుకున్న రోహంగ్యాలను ఏళ్లపాటు భరించడం ఆ దేశానికి భారంగా మారింది. దాంతో వారిని తాత్కాలిక శిబిరాలలో ఉంచింది. అక్కడ జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో రోహింగ్యాలు సమస్తం కోల్పోయారు.

బంగ్లాదేశ్‌లో ఆగ్నేయం వైపున్న రోహింగ్యా శరణార్థుల శిబిరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో వేలాదిమంది రోహింగ్యాలు నిరాశ్రయులయ్యారు. రద్దీగా ఉండే కాక్స్ బజార్ శిబిరంలో ఆదివారం మంటలు చెలరేగాయి. సుమారు 2,000 ఆవాసాలను అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఇక్కడ నివసిస్తున్నవారిలో అధికులు పొరుగు దేశమైన మయన్మార్ నుంచి పారిపోయి వచ్చినవారుగా చెబుతున్నారు.. సుమారు 12,000 మంది తమ నివాసాలను కోల్పోయారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికి మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు చెబుతున్నారు. మంటలు అంటుకోవడానికి కారణాలు ఇంకా తెలియలేదు. ఇప్పటివరకూ ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోయినట్టుగా కూడా సమాచారం రాలేదు. స్థానిక సమయం మధ్యహ్నం 2.45 గంటల ప్రాంతంలో నిప్పంటుకుంది.

రెప్ప పాటు కాలంలో వెదురు, టార్పాలిన్‌తో కట్టిన ఇళ్లు, గుడారాలకు మంటలు వ్యాపించాయని అధికారులు తెలిపారు.

“సుమారు 2,000 గుడారాలు కాలిపోయాయి. దాదాపు 12,000 మంది మియన్మార్ శరణార్థులు నిరాశ్రయులయ్యారు” అని బంగ్లాదేశ్ రెఫ్యూజీ కమిషనర్ మిజానూర్ రెహ్మాన్ ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు. మూడు గంటల్లో మంటలను చల్లార్చారు. కానీ, శరణార్థుల కోసం ఏర్పాటు చేసిన 35 మసీదులు, 21 విద్యా కేంద్రాలు దగ్ధమైపోయాయి. శరణార్థుల శిబిరాలకు “భారీ నష్టం” వాటిల్లింది. నీటి కేంద్రాలు, వైద్య కేంద్రాలు వంటి ప్రాథమిక సేవలు కూడా దెబ్బతిన్నాయి. బంగ్లాదేశ్, మియన్మార్ సరిహద్దుల్లో పది లక్షలకు పైగా రోహింజ్యా శరణార్థులు నివసిస్తున్నారు. వారి కోసం అక్కడ అనేక శిబిరాలు ఉన్నాయి. అరకొరగానే అయినా బంగ్లాదేశ్ వారికి ఆశ్రయం కలిగించింది.

వాటిల్లో క్యాంప్ 11 శిబిరానికి మంటలు అంటుకున్నాయి. ఆ ప్రాంతంపై దట్టమైన నల్లటి పొగ మేఘాలు కమ్ముకోవడం కనిపించింది. ఈ శిబిరాలు ఇప్పటికే కిక్కిరిసిపోయి, అధ్వానంగా ఉంటాయి. వీటికి అగ్ని ప్రమాదాలు సంభవించే ముప్పు ఉందని అక్కడి వారికి, బంగ్లా అధికారులకు ముందే తెలుసు. బంగ్లాదేశ్ రక్షణ శాఖ గత నెల విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం, 2021 జనవరి నుంచి 2022 డిసెంబర్ మధ్య, రోహింగ్యా శిబిరాల్లో 222 అగ్నిప్రమాదాలు జరిగాయి. వాటిలో 60 దహనకాండలు కూడా ఉన్నాయి.
2021 మార్చిలో ఒక శిబిరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అందులో 15 మంది చనిపోయారు. సుమారు 50వేల మంది నిరాశ్రయులయ్యారు. ప్రపంచంలోనే, రోహింగ్యా శరణార్థులకు చెందిన అతిపెద్ద శిబిరాలు ఇవేనని చెబుతున్నారు.

మియన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని గుప్పిట్లో పెట్టున్నాక, రోహింగ్యా మైనారిటీలపై ఉక్కు పాదం మోపింది.

ఆ హింస నుంచి తప్పించుకోవడానికి లక్షలాది రోహింగ్యాలు అక్కడి నుంచి పారిపోయి బంగ్లాదేశ్ వచ్చి చేరారు. ఒక్క బంగ్లాదేశ్ లోనే కాదు పాకిస్తాన్, భారత్ దేశాలలోనికి కూడా చీమల బారుళ్లా రోహంగ్యాలు తరలి వచ్చారు. రోహింగ్యాలు ముస్లింలవడం, అధికంగా బుద్ధిస్ట్ మియన్మార్ ప్రాంతానికి చెందినవారవడంతో సమస్యలు తలెత్తాయి.. అక్కడ వారు తరతరాలుగా హింసను ఎదుర్కొంటున్నారు. 2017లో రోహింజ్యా తిరుగుబాటుదారులు పోలీస్ స్టేషన్లపై దాడికి దిగినప్పుడు, మియన్మార్ మిలటరీ వారిపై క్రూరంగా ప్రతీకారం తీర్చుకుంది. దాంతో, అదే ఏడాది ఆగస్టులో పెద్ద సంఖ్యలో రోహింజ్యాలు అక్కడి నుంచి పారిపోయి వచ్చారప్రపంచంలోనే అతిపెద్ద శరణార్థుల శిబిరాల్లో ఒకటైన కుటుపలాంగ్‌లోని క్యాంప్‌ నంబర్‌ 11 దగ్గర ఆదివారం (మార్చి 5) మంటలు చెలరేగాయి. వెదురు, టార్పాలిన్‌ షెల్టర్స్‌ కావడంతో క్షణాల్లోనే పక్కనున్న షెల్టర్స్‌నూ చుట్టుముట్టేశాయి.

ఒక్కసారిగా ఎగసిపడిన మంటలతో.. భయాందోళనకు గురైన స్థానికులు బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రస్తుతం వీరంతా బంగ్లాదేశ్‌లోనూ ఆశ్రయం కోల్పోయారు. సర్వం కోల్పోయి దిక్కులేకుండా రోడ్డున పడ్డారు. ఐతే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే వీరి గురించి ఐక్యరాజ్యసమితి పలు చర్యలు చేపట్టింది. మయన్మార్ సైనిక ప్రభుత్వంతో చర్చలు జరిపింది. అయితే మయన్మార్ సైన్యం రోహింగ్యాలను తమ దేశస్థులుగా అంగీకరించడం లేదు. వారు తమ దేశం వారే కాదని వాదిస్తున్నారు. దీంతో రోహింగ్యాల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిగా మారింది. ఇప్పుడు ఏకంగా భారీ అగ్ని ప్రమాదం జరగడంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టకుంటున్నారు. చేద్దామంటే పని లేక, రెండు పూటల తిండి లభించక ఇబ్బందులు పడుతున్నారు.

Must Read

spot_img