ముందస్తు నగారా మ్రోగుతున్న వేళ వైసీపీ గర్జనలు ఏమేరకు కీలకంగా మారుతున్నాయి.దీనిపై వైసీపీ వ్యూహం ఏమిటి..? అసలు వీటిని పెట్టడం వెనుక దాగున్న వ్యూహం ఏమిటన్నదే చర్చనీయాంశంగా మారింది..
దశాబ్దాల రాయలసీమ ఉద్యమం ఉన్నట్టుండి వేడెక్కింది. ఈ దఫా ఉద్యమాన్ని ప్రభుత్వమే చేపట్టడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మూడు రాజధానులకు మద్దతుగా, కర్నూలులో న్యాయ రాజధాని కోసం రాయలసీమ జేఏసీ కర్నూలులోని ఎస్టీబీసీ మైదానంలో ‘రాయలసీమ గర్జన’ నిర్వహించింది.
“శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలోనే హైకోర్టు
పెట్టాలని డిమాండ్ చేస్తోంది.”
ఆంధ్రప్రదేశ్ లో గర్జనల కాలం నడుస్తోంది. విశాఖ గర్జన రేకెత్తించిన హడావుడి, రచ్చ అందరికీ తెలుసు. ఇప్పుడు వైసీపీ రాజధానుల వికేంద్రీకరణకు మద్దతుగా… సీమ అభివృద్ధి కోసం ఈ గర్జన నిర్వహించింది. అసలు ఈ గర్జనల వెనుక ఉన్న ఉద్దేశమేంటి.. వైసీపీ ఈ గర్జనలను ఎందుకు ప్రతిష్టాత్మకంగా
తీసుకుంటోంది.. లాంటి ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.
ముఖ్యంగా రాజధాని అంశం పీటముడిలా మారింది. దీన్ని విప్పే నాథుడెవరూ కనిపించట్లేదు. రాజధానులపై అన్ని పార్టీలదీ ఒక మాటైతే అధికార వైసీపీది మాత్రం మరో మాట. అధికారంలో ఎవరుంటారో వాళ్లు చెప్పేదే వేదం కాబట్టి ఇప్పుడు అమరావతి అంశం చర్చనీయాంశమైంది.
అమరావతితో పాటు 3 రాజధానులు ఏర్పాటు చేయాలనేది వైసీపీ సిద్ధాంతం. ఉత్తరాంధ్ర, కోస్తా,రాయలసీమల్లో 3 రాజధానులను ఏర్పాటు చేయడం ద్వారా ఆ 3 ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందుతాయనేది వైసీపీ చెప్తున్నమాట. అయితే అమరావతి ప్రాంతవాసులు మాత్రం వైసీపీ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. 30వేలకు పైగా ఎకరాల భూములను రాజధానికోసం ఇచ్చామని.. ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి చేయకుండా మరోచోటికి తరలిస్తామంటే ఒప్పుకునేది లేదని వాళ్లు తేల్చి చెప్తున్నారు.
ఇప్పుడీ అంశం కోర్టులో ఉంది. రాజధాని అంశం కోర్టులో ఉండగానే అధికార వైసీపీ మాత్రం అధికార వికేంద్రీకరణే తమ విధానమని స్పష్టం చేసింది. ఇందుకు 3 రాజధానులు ఏర్పాటు చేయడమే మార్గమని చెప్తోంది. అందుకోసం పార్టీ శ్రేణులను సమాయత్తం చేసింది. ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా
తీసుకెళ్లాలని ఆదేశించింది. టీడీపీ, జనసేన, బీజేపీ లాంటి పార్టీలు అమరావతే రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి.
అయితే అక్కడ రాజధాని ఉంటే ఒక్క ఏరియానే అభివృద్ధి చెందుతుందని, ఒక కులానికి చెందిన వారికి మాత్రమే మేలు జరుగుతుందని వైసీపీ నేతలు చెప్తున్నారు.
అందుకే విశాఖ, కర్నూలు, అమరావతిలో రాజధానులు ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందుతాయని వివరిస్తోంది. ఇదే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి వారిలో చైతన్యం తీసుకురావాలని పార్టీ నేతలను ఆదేశించింది. మూడు పార్టీలు ఒకవైపు, అధికార పార్టీ ఒకవైపు ఉండగా రాజధాని అంశం కోర్టులో ఉంది. కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందో తెలీదు. ఇందుకే తమ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ సర్కార్ భావిస్తోందని టాక్ వినిపిస్తోంది.
ఒకవేళ తమ 3 రాజధానుల విధానానికి మద్దతుగా తీర్పు వస్తే హ్యాపీ.. తమ మాటే నెగ్గిందని.. న్యాయం గెలిచిందని వైసీపీ చెప్పుకోవచ్చు. ఒకవేళ అలా కాకుండా అమరావతికి అనుకూలంగా తీర్పు వస్తే.. దానిపై మళ్లీ పైకోర్టుకు వెళ్లాలని వైసీపీ ఆలోచిస్తోంది. అదే సమయంలో అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టసవరణకోసం కేంద్రానికి పంపించాలని భావిస్తోంది. ఇదంతా జరగాలంటే చాలా సమయమే పట్టొచ్చు. అప్పటి వరకూ ఈ అంశం యాక్టివ్ గా ఉండాలంటే ఇలాంటి గర్జనలు చేయడమే మార్గం. అందుకే గర్జనల ద్వారా తమ 3 రాజధానుల విధానాన్ని ప్రజల్లో యాక్టివ్ లా ఉండేలా చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. విశాఖ గర్జన కోసం నానా హంగామా చేసేశారు.
” ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా రాయలసీమని లైట్ తీసుకోవడం వల్లే వైసీపీ మంత్రులు కూడా లైట్ తీసుకున్నారా.?”
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా రంగంలోకి దిగారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, రోజా.. ఇలా చాలామంది విశాఖ వేదికగా గర్జించారు. కానీ, రాయలసీమలో.. అందునా ఆధ్మాత్మిక నగరం తిరుపతిలో ఎందుకు వైసీపీ ఆ స్థాయిలో గర్జన నిర్వహించలేకపోయింది.
రాయలసీమలో వైసీపీ నేత, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కదా తిరుపతి వేదికగా గర్జన ఆత్మగౌరవ నినాదం
అన్నారాయన. అంటే ఒక్కరంటే ఒక్క వైసీపీ నేత కూడా రాయలసీమ ఆత్మగౌరవాన్ని గుర్తించలేకపోయారా అన్నదే చర్చనీయాంశంగా మారింది. రాయలసీమేతర ప్రాంత వైసీపీ నేతలు, రాయలసీమ ఆత్మగౌరవాన్ని అస్సలు పట్టించుకోలేదు..
రాయలసీమ వైసీపీ నేతలు, ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని పట్టించుకున్నంతగా కాదన్న వాదన హాట్ టాపిక్ గా
మారింది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా రాయలసీమని లైట్ తీసుకోవడం వల్లే వైసీపీ మంత్రులు కూడా లైట్ తీసుకున్నారా.? అన్న ప్రశ్నకు సీమ వైసీపీ నేతలు ఏం సమాధానమిస్తారోనన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే, రాయలసీమ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోపాటు సర్పంచ్ నిధులను కూడా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు.
గత ప్రభుత్వంలో రాయలసీమ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేశాం.. ఈ మూడున్నర సంవత్సరాల్లో తామెంత ఖర్చుపెట్టారో సీమ గర్జనలో చెప్పాల్సిందని సూచించారు. ప్రభుత్వ న్యాయవాది అమరావతిలోనే హైకోర్టు ఉండాలంటారని, తెలంగాణ ప్రాజెక్టులపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇక్కడి ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చేందుకే గర్జన ఏర్పాటు చేశారన్నారు. మూడు రాజధానుల ఏర్పాటును అడ్డుకంటున్న చంద్రబాబును తరిమికొట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన రాయలసీమ ద్రోహి అని దుమ్మెత్తిపోస్తున్నారు.
ఈ గర్ఝనకు కారణం ముందస్తు ఎన్నికలేనని, ప్రభుత్వం తన అస్తిత్వం కాపాడుకోవడానికే ముందస్తు ఎన్నికలకు వెళ్లనుందని పయ్యావుల ఆరోపించారు. రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు కోరుతూ వివిధ ప్రజాసంఘాలు, జేఏసీల ఆధ్వర్యంలో జరిగిన రాయలసీమ గర్జనకు ప్రభుత్వ మంత్రులు పలువురు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం మూడు రాజధానులు ఎందుకు అంటుందో, దానివల్ల ఉపయోగాలేంటనేది ప్రజలకు వివరించారు. కర్నూలులో నిర్వహించిన సీమ
గర్జన సభపై వైసీపీ పెదవి విరుస్తోంది. సీమ గర్జన సభకు రాయలసీమ నలుమూలల నుంచి జనాన్ని తరలించారు.
అలాగే సీమ వ్యాప్తంగా వైసీపీ నేతలంతా హాజరయ్యారు. కానీ సీమ గర్జన సభ నిర్వహణలో దారుణంగా వైఫల్యం చెందారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సభకు భారీ జన సమీకరణ చేసినప్పటికీ, అధికార పార్టీ తాను చెప్పదలచుకున్న అంశాల్ని చెప్పడంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సభా వేదికపై భారీ సంఖ్యలో అధికార పార్టీ నేతలు ఉండడం, వాళ్లందరికీ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎవరినీ రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ సేపు మాట్లాడనివ్వలేదు. దీంతో వక్తలు ఏ ఒక్క విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతిలోనే హైకోర్టు వుంటుందని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం చెప్పిందంటూ సాగుతున్న దుష్ప్రచారాన్ని కూడా ఈ సభా వేదికపై నుంచి దీటుగా తిప్పికొట్టలేకపోయారు.అంతా మొక్కుబడి కార్యక్రమంలా సాగిపోయింది.
మూడు రాజధానుల బిల్లుల్ని వెనక్కి తీసుకోవడం, అలాగే హైకోర్టు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో… ఎప్పట్లాగే అమరావతినే ఏకైక రాజధాని అని సుప్రీంకోర్టులో చెప్పడాన్ని కూడా సభ ద్వారా గట్టిగా జనంలోకి తీసుకెళ్లలేకపోయారు. కర్నూలులో హైకోర్టు ఏ విధంగా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారో, అలాగే సాగు, తాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక వుందో అధికార పార్టీ నేతలు చెప్పలేకపోయారంటున్నారు.
తిరుపతిలో భారీ ర్యాలీ, బహిరంగ సభతో పోల్చుతూ కర్నూలు సీమ గర్జనపై అధికార పార్టీ నేతలు, సీమ ఉద్యమకారులు పెదవి విరుస్తున్నారు. జనాన్ని తరలించి కూడా ప్రయోజనం లేకపోయిందనే వాదన వెల్లువెత్తుతోంది.
అయిత ఈ గర్జన కేవలం వైసీపీ కోసమే చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో సీట్లు కోల్పోకుండా సీమ ప్రజలను మరోసారి దగా చేయాలన్నదే గర్జన లక్ష్యమని పలువురు మేధావులు మండిపడుతున్నారు.
మరి సీమ గర్జన వల్ల ఉపయోగం ఏమిటన్నదే కీలకంగా మారింది.