5జీ టెలికాం ఉత్పత్తుల విషయంలో .. టాటా, రిలయన్స్ కంపెనీలు .. ఏకంగా చైనాకే చెక్ పెడుతున్నాయా..? దీనికి కేంద్ర నిర్ణయం సైతం మద్ధతు పలుకుతోందా..? ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన పరిస్థితులు సైతం కలిసివస్తున్నాయా..?
ప్రపంచ భౌగోళిక రాజకీయాలు, ఇతర ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్ని దేశాలకు కంపెనీలు దూరంగా జరుగుతున్నాయి. ఈ నిర్ణయాలు మరికొన్నింటికి అదృష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. రెండేళ్ల కిందట చైనా నుంచి చాలా కంపెనీలు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా టెలికాం రంగం చాలా వేగంగా విస్తరిస్తోంది. కొత్త జనరేషన్ హై స్పీడ్ సర్వీసులతో చాలా దేశాలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో చైనాలో తయారైన టెలికాం పరికరాలపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ విభాగంలో భారీ శూన్యత ఏర్పడింది. 5జీ పరికరాలకు ప్రపంచ వ్యాప్తంగా రోజురోజూకూ డిమాండ్ పెరుగుతోంది.
ఈ క్రమంలో డిమాండ్ కు తగినట్లుగా సరఫరా లేకపోవటంతో.. భారతదేశంలో తయారైన 5G పరికరాలకు గ్లోబల్ మార్కెట్లో భారీ అవకాశం ఉంది. టెలికాం రంగంలో పెద్ద పోటీగా ఉన్న చైనాకు ప్రపంచం చెక్ పెడుతుండగా ఈ ప్రయాణంలో భారత్కు చాలా అవకాశాలు వచ్చాయి. 5జీ టెలికాం పరికరాల సరఫరా అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు టాటా గ్రూప్, రిలయన్స్ జియో అగ్రగామిగా మారాయి. టాటా గ్రూప్ అభివృద్ధి చేసిన 4G ఆర్కిటెక్చర్ని ఉపయోగించడం ద్వారా BSNL మార్కెట్లో తన వేగాన్ని పెంచింది. ఇదే సమయంలో జియో సైతం సొంత 5జీ సాంకేతికతను మరింతగా అభివృద్ధి చేస్తోంది.
చైనాకు ప్రత్యామ్నాయంగా మారేందుకు భారతదేశానికి అమెరికా సహాయం చేయగలదని నిపుణులు సైతం భావిస్తున్నారు. ఇదిలా ఉండగా మల్టిపుల్-ఇన్పుట్ మల్టిపుల్-అవుట్పుట్ సాంకేతికతను కనుగొన్నారు. ఇది రోజువారీ వినియోగించే Wi-Fi, 4G, 5G వైర్లెస్ నెట్వర్క్ల్లో కీలక పాత్ర పోషిస్తుంది. మరోవైపు దేశంలో 4G నెట్వర్క్ కోసం దేశంలోని అతిపెద్ద IT సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్తో BSNL డీల్ కుదుర్చున్న సంగతి తెలిసిందే.

ఈ డీల్ విలువ దాదాపు రూ.16,000 కోట్లుగా ఉంది. దీనిద్వారా టాటా గ్రూప్ సొంత సాంకేతికతను అభివృద్ధి చేసే పనిలో ఉంది. ఇందుకు టాటాలకు చెందిన టీసీఎస్ ప్రభుత్వ సంస్థలైన ప్రభుత్వ సంస్థ C-DOT, ITI 4G నెట్వర్క్, పరికరాలను అభివృద్ధి చేయడంలో కలిసి పనిచేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వరంగ టెలికమ్ సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ లో 4జీ అప్గ్రేడ్లో చైనా పరికరాలను వినియోగించరాదని నిర్ణయించారు. బీఎస్ఎన్ఎల్ సంస్థలో మేడ్-ఇన్-చైనా పరికరాల వినియోగాన్ని తగ్గించాలని టెలికం విభాగం నిర్ణయించింది.
ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా ‘మేడ్ ఇన్ ఇండియా’వస్తువులను కొనుగోలు చేయాలని తన పరిధిలోని అన్ని సంస్థలకు త్వరలో కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది. ఈ మేరకు ప్రైవేట్ టెలికం సంస్థలు కూడా చైనా సంస్థలు ఉత్పత్తి చేసే పరికరాలపై ఆధారపడటాన్ని తగ్గించాలంటూ ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. అలాగే టెండర్ల ప్రక్రియలో చైనా కంపెనీలు పాల్గొనలేని విధంగా నిబంధనలను మార్చాలని రాష్ట్రంలోని సర్వీసు ప్రొవైడర్లను కోరడంతోపాటు, మునుపటి టెండర్లన్నింటినీ రద్దు చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే భారతి ఎయిర్టెల్, వోడాఫోన్ లాంటి టెలికం సంస్థలు చైనాకు చెందిన హువాయ్ నెట్వర్క్స్తోనూ, బీఎస్ఎన్ఎల్ జీటీఈతో కలిసి పనిచేస్తున్నాయి.
చైనా సంస్థలు ఉత్పత్తిచేసే నెట్వర్క్ పరికరాల భద్రతపై ముందు నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులు సైతం చైనా టెలికాం పరికరాలపై 2012లో సందేహాలు వ్యక్తం చేశారు. ఇది జరిగిన రెండేళ్ల తర్వాత బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ను హువాయ్ హ్యక్ చేసిందని భారత ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించి, దర్యాప్తునకు ఆదేశించింది.
పరిస్థితులు ఇలా ఉంటే 5 జి నెట్వర్క్లో రిలయన్స్ జియోకు ఒక్క చైనా నెట్వర్క్ భాగం కూడా ఉండదని ముఖేష్ అంబానీ హామీ ఇచ్చారు. చైనా పరికరాలను వాడని ప్రపంచంలోని ఏకైక నెట్వర్క్ రిలయన్స్ జియో అని గత ట్రంప్ పర్యటనలో ఆయనకి చెప్పారు. ఇప్పుడు జియో 4జి, 5 జి నెట్వర్కింగ్ భాగస్వామిగా దక్షిణ కొరియాకు చెందిన శామ్సంగ్ కొనసాగుతోంది. ప్రపంచంలో టెలికాం పరికరాల తయారీ, మార్కెటింగ్లో అగ్రగణ్యంగా వెలుగొందుతున్న హవాయ్ స్మార్ట్ఫోన్ల తయారీలో సైతం ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే భద్రతా పరమైన కారణాలు చూపి అమెరికా హవాయ్ టెలికాం పరికరాలపై నిషేధం వించడం జరిగింది. అయితే 5జీ నెట్వర్క్ విషయంలో భారత్ పూర్తిగా సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుందని కేంద్ర సమాచార శాఖ వెల్లడించింది. దీనిలో భాగంగా తేజస్ నెట్వర్క్స్ నుంచి టాటా గ్రూప్ పెద్దయెత్తున వాటాలు కొనుగోలు చేసింది.
తద్వారా టెలికామ్ పరికరాల తయారీ మార్కెట్లోకి ప్రవేశించింది టాటా గ్రూప్. టెలికామ్ సిస్టమ్ ఇంటిగ్రేషన్లో ఇప్పటికే టాటా గ్రూప్కు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సత్తా చాటుతోంది. హార్డ్వేర్ సామర్థ్యం లేనికారణంగా 5జీ పరికరాల తయారీ విషయంలో వెనుకబడిపోయింది. ఇప్పుడు తేజస్తో కలిసి ఆ లోటును బర్తీ చేసుకోవాలనుకుంటోంది టాటా గ్రూప్. నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీ అయిన 5జీ అభివృద్ధి.. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ కలియికతోనే సాధ్యం. అందుకే, టాటా గ్రూప్ తేజస్తో జతకట్టింది. సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్, హార్డ్వేర్ దిగ్గజం తేజస్ కలిసి దేశంలో బలమైన 5జీ మార్కెట్ శక్తిగా అవతరించనున్నాయి. టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం.. దేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లైన ఎయిర్టెల్, టాటా టెలీ కమ్యూనికేషన్స్ వంటి సంస్థలు.. ఇప్పటికే టాటా గ్రూప్తో కాంట్రాక్టులు కుదుర్చుకుంటున్నాయి.
భారత ప్రభుత్వం 5జీ అభివృద్ధిలో తేజస్తో కలిసి పనిచేసేందుకు భారత ప్రభుత్వం కూడా వుంది. ఎందుకంటే, చైనా ప్రభుత్వం అక్కడ హువావేతో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్గా అవతరించింది. ఈ కోవలోనే తేజస్తో కలిసి బీఎస్ఎన్ఎల్ను కూడా నేషనల్ ఛాంపియన్ గా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశీయంగా.. 4జీ, 5జీ రేడియో ఆక్సెస్ నెట్వర్క్, వైర్లెస్ ఎక్విప్మెంట్, ఐవోటీ యాక్సెస్ డివైజెస్, ఇంకా ఇతర వైర్లెస్ పరికరాలు, స్విచ్చులు, రౌటర్ల అభివృద్ధిని మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా.. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీమ్ ద్వారా ఇప్పటికే 12 వేల కోట్ల రూపాయలను కేటాయించింది.
దేశంలో టెలికాం పరికరాల తయారీ ద్వారా.. పీఎల్ఐ స్కీమ్ నుంచి తేజస్ కూడా భారీగా ప్రోత్సాహకాలు అందుకోవాలని భావిస్తోంది. రానున్న ఐదేళ్లో దేశంలో టెలికాం పరికరాలను తయారుచేసే స్వదేశీ కంపెనీలకు.. మోదీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది. మోదీ ప్రభుత్వం ఇదంతా చేస్తున్నది.. టెలీకమ్యూనికేషన్స్ పరికరాల తయారీలో భారత్ ‘ఆత్మనిర్భరం’గా మారడానికి మాత్రమే కాదు.. టెలీకమ్యూనికేషన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా చైనా కంపెనీల పెత్తనాన్ని అంతం చేయడానికి కూడానని తెలిసిందే. మోదీ ప్రభుత్వం.. టెలీకమ్యూనికేషన్ పరికరాల తయారీలో స్వదేశీ సంస్థలను ప్రోత్సహించడమే కాదు.. తద్వారా.. దేశంలో టెలికాం మౌలిక సదుపాయాల మెరుగుదలకు, టెలికాం ఆధారిత ఐటీ రంగం ఎగుదలకు బాటలు వేస్తోంది. అంతేకాదు, 5జీ టెక్నాలజీకి సంబంధించిన టెలికాం ఉత్పత్తుల ఎగుమతులను కూడా ప్రోత్సహిస్తోంది. రానున్న ఐదేళ్లలో చైనాకు చెందిన హువావే, ZTE తరహాలో.. 5జీ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకుంటుంది.
చైనాకు చెక్ పెట్టే వ్యూహంలో భారత్ సైతం .. 5జీ ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహం అందించడమే .. దేశీ కంపెనీల దూకుడుకు కారణమవుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదీ ఇవాల్టి ఫోకస్.. రేపటి ఫోకస్ లో మళ్లీ కలుద్దాం..