ఇప్పటికే రూపీలో వాణిజ్యం చేసేందుకు పలు దేశాలు అంగీకరిస్తున్నాయి. తాజాగా శ్రీలంక సైతం అదే బాటలో పయనించేందుకు సిద్ధమైంది.
శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సమస్యలతో .. అంతర్జాతీయ వాణిజ్యానికి రూపీని వినియోగించుకోవాలని ఆ దేశం నిర్ణయించుకుంది. దీంతో భారత్ సైతం రూపీ వాణిజ్యానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా .. రూపీ బలోపేతానికి అవకాశం లభించినట్లైంది.

రూపాయి.. ఇప్పటి వరకూ ఇండియాకే పరిమితం.. కానీ, ఇప్పుడు అంతర్జాతీయ కరెన్సీగా మారుతోంది. రాబోయే రోజుల్లో డాలర్, పౌండ్ తదితరాల సరసన నిలవనుంది. ఇతర దేశాల్లోని సంక్షోభం భారత రూపాయికి వరంగా మారుతోంది. ఇప్పటికే రష్యా, శ్రీలంక, మారిషస్ దేశాలతో రూపాయిల్లోనే ఆర్థిక లావాదేవీలకు మార్గం సుగమం కాగా.. రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్, తజక్స్థాన్, క్యూబా, లగ్జెంబర్గ్, సుడాన్, గల్ఫ్, ఆఫ్రికన్ దేశాల మధ్య కూడా రూపాయిల్లో చెల్లింపులు జరగనున్నాయి. ఆయా దేశాలు కూడా రూపాయిల్లో చెల్లింపులకు అనుమతి ఇవ్వాలంటూ ఆర్బీఐని కోరుతున్నాయి కూడా.
ఎక్కువ దేశాల మధ్య రూపాయిల్లోనే లావాదేవీలు జరిగితే.. మన రూపాయి కూడా అంతర్జాతీయ కరెన్సీ కానుంది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి బలోపేతం కావడమే కాదు.. భారతదేశ వాణిజ్య లోటు కూడా తగ్గుముఖం పట్టనుంది. వివిధ దేశాల మధ్య ఎగుమతి, దిగుమతుల చెల్లింపులు డాలర్, పౌండ్ తదితర అంతర్జాతీయ కరెన్సీల ద్వారా ఇప్పటి వరకూ జరుగుతున్నాయి. మరికొన్ని దేశాలు వస్తు మార్పిడి పద్ధతిని కూడా అమలు చేస్తుంటాయి.
ఉదాహరణకు, ఇరాన్ మనకు చమురును పంపిస్తుంది. అందుకు ప్రతిగా మనం ఆ దేశానికి గోధుమలను ఎగుమతి చేస్తాము. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వచ్చినప్పుడు రష్యాతో వాణిజ్యంపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. రష్యా అతి తక్కువ ధరకు చమురు ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. అయితే, ఆంక్షల కారణంగా డాలర్లలో చెల్లింపులకు అవకాశం లేకపోవడంతో వోస్ట్రో ఖాతాల ద్వారా రూపాయలు-రూబుల్స్లోనే వాణిజ్యం చేయాలని భారత్-రష్యా నిర్ణయించాయి.
తాజాగా డాలర్లకు బదులు రూపాయల్లో వ్యాపారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘రుపీ ట్రేడ్సెటిల్మెంట్ మెకానిజం’లో చేరడానికి మరిన్ని దేశాలు ఆసక్తి చూపుతున్నాయి.
ఇది వరకే మారిషస్, శ్రీలంక, రష్యా వంటి దేశాలు ఈ పద్ధతికి మారాయి. తజికిస్థాన్, క్యూబా, లగ్జెంబర్గ్ , సూడాన్ ఈ విధాన వినియోగంపై మాట్లాడుతున్నాయని అంతర్జాతీయ వార్తాసంస్థ రాయిటర్స్ రిపోర్ట్ వెల్లడించింది. రుపీ ట్రేడ్సెటిల్మెంట్ మెకానిజాన్ని ఆర్బీఐ ఈ ఏడాది జూలైలో అందుబాటులోకి తెచ్చింది. డాలర్ల కొరత ఉన్న దేశాలను ఈ విధానంలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఇక వోస్ట్రో ఖాతాలు అని పిలిచే ప్రత్యేక రూపాయి ఖాతాలను తెరవడానికి ఈ నాలుగు దేశాలు ఆసక్తి చూపాయి. భారతదేశంలోని భాగస్వామ్య బ్యాంకులు ఇంకా సంబంధిత సౌకర్యాలను అందించలేదని తెలుస్తోంది. ఈ ఖాతాలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆమోదం అవసరం. మారిషస్, శ్రీలంక, రష్యా ఇది వరకే ప్రత్యేక వోస్ట్రో ఖాతాలను తెరిచాయి. వీటికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది.
రుపీ ట్రేడ్సెటిల్మెంట్ మెకానిజంలో కొత్త దేశాల చేరికపై అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు, వాణిజ్య మంత్రిత్వ శాఖకు, ఆర్బీఐకి పంపిన ప్రశ్నలకు సమాధానం రాలేదు. ఇటీవల పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు వాణిజ్య లావాదేవీలు జరపడానికి తగినంత విదేశీ మారక ద్రవ్యం లేదు. ఈ నేపథ్యంలో, రూపాయిల్లో అంతర్జాతీయ చెల్లింపులు జరుపుతామని, తమ దేశంలో విదేశీ కరెన్సీగా రూపాయికి అనుమతి ఇవ్వాలని భారత్కు శ్రీలంక విజ్ఞప్తి చేసింది. దాంతో, ఐదు వోస్ట్రో ఖాతాలు తెరిచేందుకు ఇటీవల ఆర్బీఐ అనుమతి తెలిపింది.
ఫలితంగా, పది వేల డాలర్లు అంటే దాదాపు రూ.8.2 లక్షల వరకూ శ్రీలంక పౌరులు రూపాయిల రూపంలో తమ వద్ద ఉంచకోవచ్చు. అంతర్జాతీయ లావాదేవీలకు డాలర్ల బదులు రూపాయిల్లోనే పరస్పరం చెల్లింపులు చేసుకోవచ్చు. దాంతో, శ్రీలంకతో ఐదు; మారిషస్ బ్యాంకుతో ఒక వోస్ట్రో ఖాతాలను తెరిచింది.
ఆఫ్రికన్ దేశాల్లో కూడా డాలర్లకు కొరత ఏర్పడుతోంది..!
వెరసి, భారత్లోని తమ బ్రాంచీల్లో 18 విదేశీ బ్యాంకులు వోస్ట్రో ఖాతాలను తెరిచాయి. ఆఫ్రికన్ దేశాల్లో కూడా డాలర్లకు కొరత ఏర్పడుతోంది. దాంతో, అవి కూడా రూపాయిల్లో చెల్లింపులు చేయాలని భావిస్తున్నాయి. ఏటా ఈజిప్టు నుంచి 3520 మిలియన్ డాలర్లు, అల్గేరియా నుంచి వెయ్యి మిలియన్ డాలర్లు, అంగోలా నుంచి దాదాపు 2700 మిలియన్ డాలర్ల వస్తువులను భారత్ దిగుమతి చేసుకుంటుంది.

మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ నుంచి ఏటా దాదాపు 2000 మిలియన్ డాలర్ల సరుకులు దిగుమతి అవుతాయి. డాలర్ల కొరత కారణంగా రూపాయిల్లోనే చెల్లింపులకు అనుమతించాలని ఆయా దేశాలు కోరుతున్నాయి. ఇందుకు ఆర్బీఐ ఇంకా అనుమతి ఇవ్వాల్సి ఉంది. అయితే, రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మార్చాలని భావిస్తున్న భారత్.. ఆయా దేశాలకు అనుమతి ఇచ్చేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయిని వాణిజ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. డాలర్లు లేని దేశాలతో రూపీ మారకం చేయాలని ఈ ఏడాది జూలై నుంచే భారత్ పావులు కదుపుతోంది.
దీనిని ఇప్పుడు వేగవంతం చేస్తోంది. మన దేశానికి యూఏఈ అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. దాంతో, ఆ దేశంతో రూపీ చెల్లింపుల విధానం దిశగా ఆర్బీఐ ఇప్పటికే విధాన పత్రాన్ని తయారు చేసింది కూడా. ఇరు దేశాల సెంట్రల్ బ్యాంకుల మధ్య దీనిపై సంప్రదింపులు జరుపుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే చాలా సమస్యలు పరిష్కరించామని, వోస్ట్రో ఖాతాలు తెరవాలంటూ ఇప్పటికే పలువురు ఎగుమతి, దిగుమతిదారులు బ్యాంకులను సంప్రదిస్తున్నారని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ సైతం వెల్లడించింది.
వివిధ దేశాల మధ్య అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలు జరపడానికి ఏర్పాటు చేసే ఖాతానే వోస్ట్రో అకౌంట్ అంటారు. విదేశీ బ్యాంకుతో ఆర్థిక లావాదేవీలు జరపడానికి స్థానిక బ్యాంకు లేదా బ్రాంచీల్లో వీటిని తెరుస్తారు.
ఎగుమతి, దిగుమతులు చేసినప్పుడు వాటికి ఎంత చెల్లించాలో రూపాయిల్లోనే ఇన్వాయిస్లు తయారు చేస్తారు. అప్పటి మార్కెట్లోని ఎక్స్చేంజ్ రేట్ల ప్రకారం చెల్లింపులు జరుగుతాయి. ఇన్వాయి్సల ప్రకారం ఆయా మొత్తాలను వారి వారి వోస్ట్రో ఖాతాల్లో జమ చేస్తారు. వివిధ దేశాలతో రూపాయిల్లో మారకం ఇప్పుడు కొత్తేమీ కాదు.
1960ల్లోనే ఖతార్, యూఏఈ, కువైత్, ఒమాన్ దేశాలతో రూపాయిల్లోనే లావాదేవీలు జరిగేవి. తూర్పు యూరప్ దేశాలతో కూడా భారత్కు ఇటువంటి ఒప్పందమే ఉండేది. అయితే, కారణాలు తెలియదు కానీ.. ఆ దశకం మధ్యలోనే ఈ విధానానికి చరమ గీతం పాడారు. చాలా రోజులుగా భారత్ అంతర్జాతీయ చెల్లింపుల్లో రూపాయిని వినియోగించాలని యోచిస్తోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
ముందుగా డాలర్ పై ఎక్కువగా ఆధారపడటంతో రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లలో రికార్డు స్థాయిల్లో కుప్పకూలింది. దీనికి తోడు స్నేహపూర్వకమైన దేశాలు రూపాయి చెల్లింపులకు ఆసక్తి చూపటంతో భారత్ అడుగులు క్రమంగా అటువైపు పడుతోంది. ఈ ఏడాది జూలై నుంచి భారత ప్రభుత్వం డాలర్ల కొరత ఉన్న దేశాలను రూపాయి సెటిల్మెంట్ విధానంలోకి తీసుకురావాలని చూస్తోంది. ఈ విధానం పరస్పరం లాభాన్ని చేకూరుస్తుందని నిపుణులు అంటున్నారు.
శ్రీలంకలో భారతీయ రూపాయి చట్టబద్ధమైన కరెన్సీగా పేర్కొనడటం జరిగింది. దీనివల్ల తగినన్ని డాలర్లు అందుబాటులో లేకపోవటం, ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడంలో సహాయపడటానికి దేశానికి అవసరమైన ద్రవ్య మద్దతును ఈ విధానం అందిస్తుంది. ఈ చర్యలు ఆర్థిక సంక్షోభం మరింత ముదరకుండా నిరోధించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. డాలర్తో రూపాయి మారకం విలువను తగ్గించడమే కాకుండా భారత కరెన్సీని అంతర్జాతీయంగా మార్చడమే దీని లక్ష్యం.
పలు ప్రపంచ దేశాలు రూపీ దిశగా పయనించడంతో .. త్వరలోనే ప్రపంచ మారకంగా రూపీ మారనుందన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో రూపీ వాణిజ్యం మరింత పెరుగుతుందన్న అంచనాలు వెల్లువెత్తుతున్నాయి.