ఇది మొదటిసారిగా పాకిస్తాన్ ప్రధాని స్వయంగా వెల్లడించారు. దేశాన్ని పాలించాల్సిన ప్రధాని స్థానంలో ఉన్న తాను బిక్షాటనకు వెళ్లినట్టుగా దేశదేశాలకు అప్పుల కోసం తిరగడం ఎంబరాసింగ్ గా ఉందని తెలిపారు. దివాలా తీసేందుకు మరెంతో సమయం పట్టదన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో భారత్ పై భారత్ ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు పాకిస్తాన్ నేతలు మీడియా సంస్థలు.. ఓ రిపోర్ట్..
పాకిస్తాన్లో విదేశీ మారకద్రవ్యం సంక్షోభం తీవ్రంగా ఉంది. ఈ ఏడాది జనవరి 6వ తేదీ నాటికి స్టేట్ బ్యాంకు ఆఫ్ పాకిస్తాన్ వద్ద కేవలం 4.343 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యం మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మొత్తంతో దేశానికి కావాల్సిన నిత్యావసర వస్తువుల మాట అటుంచితే కరెంటు సరఫరా కోసం కూడా సరిపోవు. ఆ తర్వాత పరిస్థితులు మరింత దిగజారిపోయే ప్రమాదం మాత్రం ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. యూఈఏకి చెందిన రెండు బ్యాంకుల నుంచి తీసుకున్న బిలియన్ డాలర్ల రుణాన్ని ఇటీవలే పాకిస్తాన్ తిరిగి చెల్లించడంతో నిల్వలు ఒక బిలియన్ డాలర్లు తగ్గిపోయాయి. డాలర్ మారకంతో పాకిస్తాన్ రూపాయి స్థిరంగా 228.15 వద్ద ముగిసింది.
గత ఏడాది జనవరి చివరి నాటికి 16.60 బిలియన్ డాలర్లుగా ఉండేవి. అటు నుంచి నిల్వలు క్రమంగా తగ్గుకుంటూ వచ్చాయి.
దీనికి ప్రధాన కారణం విదేశాల నుంచి తీసుకువచ్చిన రుణాలకు వడ్డీలు చెల్లించడంతో పాటు దేశీయ అవసరాలకు గాను దిగుమతి చేసుకున్న వాటికి డాలర్ల రూపంలో చెల్లించాల్సి రావడమే కారణంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పాకిస్తాన్కు సౌదీ అరేబియా, చైనా, యూఏఈల నుంచి కొంత సాయం అందేఅవకాశం ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి లేదా ఐఎంఎఫ్ పాకిస్తాన్కు ఆరు బిలియన్ డాలర్ల వరకు రుణం ఇస్తామని తెలిపింది. ఈ నిధులను విడుదల చేయాలని ఐఎంఎఫ్ను కోరే అవకాశం కనిపిస్తోంది.వరదల వల్ల నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పించడానికి ఉదారంగా విరాళాలు ఇవ్వాలని పాకిస్తాన్ జెనీవాలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రపంచదేశాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది.
అయితే పునరావాసం కల్పించడానికి 16 బిలియన్ డాలర్లు అవసరం అవుతాయి.
అన్ని దేశాలు కలిసి కేవలం 10 బిలియన్ డాలర్లు సర్దుబాటు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మొత్తంలో 90 శాతం అప్పు కిందే లభిస్తుంది. కేవలం 10 శాతం మాత్రమే సాయం కింద దక్కుతుంది. నెల నెలా వడ్డీలు పాకిస్తాన్ కు గుదిబండ కానున్నాయి. సౌదీ షేక్లు దీర్థకాలంలో పాకిస్తాన్ పెట్రోలియం రంగంలో 10 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడుతామని హామీ ఇచ్చారు. అలాగే చైనా కూడా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో 9 బిలియన్ డాలర్లు సమకూరుస్తామని హామీ ఇచ్చింది. దీంతో పాటు పాక్ ప్రభుత్వం రెండు ఎల్ఎన్జీ ప్లాంట్లను ఖతర్కు విక్రయించి 1.5 బిలియన్ డాలర్లు సేకరించాలని నిర్ణయించింది. విదేశాల నుంచి పెద్ద మొత్తంలో డాలర్లు పాకిస్తాన్ స్టేట్ బ్యాంకులోకి వచ్చినా ఈ రుణాలు మాత్రం తీర్చాల్సిందే.
ఈ లెక్కన చూస్తే పాకిస్తాన్కు కౌంట్ డైన్ మొదలయినట్టే అనుకోవచ్చు. అప్పులు నానాటికీ పెరుగుతూండటంతో ఊబిలో కూరుకుపోతున్నట్లు భావించాల్సి ఉంటుంది. ఈ అప్పుల నుంచి బయట పడాలంటే పాకిస్తాన్ వెంటనే ఎగుమతులు పెంచుకోవాల్సి ఉంటుంది. పెద్ద ఎత్తున విదేశీ మారకద్రవ్యం సంపాదించుకుని కరిగిపోతున్న నిల్వలను పెంచుకుంటే తప్ప మోక్షం కనిపించడం లేదు. అదే సమయంలో విదేశాల్లో పనిచేస్తున్న పాక్పౌరులను పెద్ద ఎత్తున రెమిటెన్స్కు ప్రోత్సహించాలి. వారికి పెద్ద ఎత్తున వడ్డీ ఇస్తామంటూ ఆశ కల్పించి డాలర్లు రప్పించడానికి ప్రయత్నించాలి. విదేశీ ఇన్వెస్టర్లను పాకిస్తాన్ రెడ్ కార్పెట్వేసి ఆహ్వానిస్తే తప్ప పరిస్థితి మెరుగుపడే చాన్సే లేదు. ఇటీవల పాకిస్తాన్కు చెందిన టెక్స్టైల్స్ రంగానికి చెందిన ప్రతినిధులు ముడి సరకు దిగుమతి చేయమని అడిగారు.
పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే.. కేవలం 5వేల డాలర్ల అతి చిన్న మొత్తం లెటర్ ఆఫ్ క్రెడిట్ను కూడా స్టేట్ బ్యాంకు ఆఫ్ పాకిస్తాన్ తిరస్కరించింది.
దిగుమతి చేసుకొనే వంట నూనెలు, నెయ్యి, పప్పులువిడుదల చేయడానికి కూడా బ్యాంకులు కావాలని జాప్యం చేస్తున్నాయి. వీటన్నిటికి డాలర్లలో చెల్లింపులు చేయాలి కాబట్టి బ్యాంకులే ముఖం చాటేస్తున్నాయి. పౌల్ట్రీ రైతులు కూడా దిగుమతి చేసుకున్న దాణాను విడుదల చేయడానికి బ్యాంకులు విపరీతమైన జాప్యం చేస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విదేశాలకు వెళ్లి చదువుకోవాలను కొనే విద్యార్థులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకోవాలనుకొనే వారు డాలర్లు కొనుగోలు చేద్దామంటే వాటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ డాలర్లను అక్రమంగా ఆఫ్గానిస్తాన్కు తరలిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.