తమిళనాడు కాస్తా .. తమిళగం గా మారనుందా..? అలాగని .. ఆ రాష్ట్ర గవర్నర్ రవి.. ఎందుకు చెబుతున్నారు..? దీనిపై తమిళ సర్కార్ఏ మంటోంది..?
తమిళనాడులో అధికార డీఎంకే సర్కార్ కు, గవర్నర్ బీఎన్ రవికీ మధ్య వివాదం మరింత ముదిరింది. ఇప్పటికే ప్రభుత్వం పంపుతున్న పలు కీలక బిల్లుల్ని ఆమోదించకుండా పెండింగ్ లో పెడుతున్న గవర్నర్ బీఎన్ రవి మీద పోరు సలుపుతున్న డీఎంకే, మిత్రపక్షాలు.. నిన్న అసెంబ్లీలో తాము పంపిన ప్రసంగాన్ని చదవకుండా కొన్ని లైన్లు వదిలేసిన గవర్నర్ పై భగ్గుమన్నాయి.
అసెంబ్లీనే నిరసనకు దిగాయి. దీంతో గవర్నర్ వాకౌట్ చేశారు. తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ బీఎన్ రవి అసాధారణ రీతిలో వాకౌట్ చేసిన వ్యవహారంపై ఇప్పటికే జాతీయస్ధాయిలో చర్చ జరుగుతోంది. గవర్నర్ తీరును పలువురు తప్పుబడుతున్నారు. బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారి గవర్నర్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ డీఎంకే సహా మిత్రపక్షాలు ఆరోపిస్తున్నాయి. అదే సమయంలో చెన్నైతో పాటు పలు నగరాల్లో గెట్ అవుట్ రవీ బ్యానర్లు దర్శనమిచ్చాయి.
గవర్నర్ తీరును నిరసిస్తూ ఈ బ్యానర్లు పెట్టినట్లు తెలుస్తోంది. ట్విట్టర్ లో నంబర్ 1 ట్రెండింగ్ అంటూ గెట్ అవుట్ రవీ హ్యాష్ ట్యాగ్ తో ఈ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. వీటిపై సీఎం ఎంకే స్టాలిన్ గవర్నర్ బీఎన్ రవిని గెట్ అవుట్ అంటున్నట్లుగా ఈ ఫ్లెక్సీల్లో ఫొటోలు వేశారు. దీంతో ప్రభుత్వం
గవర్నర్ ను రాష్ట్రం నుంచి వెళ్లిపోమనే అర్ధం వచ్చేలా ఇవి కనిపిస్తున్నాయి. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అదే సమయంలో బీజేపీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పుబడుతూ గవర్నర్ ను వెనకేసుకొస్తోంది. దీంతో గవర్నర్ కూ, స్టాలిన్ సర్కార్ కూ మధ్య రాబోయే రోజుల్లో మరిన్ని తీవ్ర పరిణామాలు చోటు చేసుకునేలా కనిపిస్తున్నాయి. దీంతో తమిళనాడులో గవర్నర్ అండ్ సీఎం మధ్య సాగుతోన్న కోల్డ్ వార్ బరస్ట్ అయ్యింది.

తమిళనాడు అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ రవి, సీఎం స్టాలిన్ మధ్య రచ్చ జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం కాకుండా ఇతర అంశాలను గవర్నర్ ప్రస్తావించారంటూ డీఎంకే కూటమి ఎమ్మెల్యేలు సభలో ఆందోళనకు దిగారు. దాంతో, ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు గవర్నర్ రవి. అసెంబ్లీలో గవర్నర్ రవి ప్రసంగాన్ని డీఎంకేతో సహా మిత్రపక్ష ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. లౌకికవాదంతోపాటు పెరియార్, అంబేద్కర్, కె.కామరాజ్, సీఎన్ అన్నాదురై, కరుణానిధి లాంటి ప్రముఖ పేర్లను ప్రస్తావించకుండా గవర్నర్ ప్రసంగించడం అభ్యంతరం తెలిపారు.
తమిళనాడు పేరును తమిళగం అని మార్చాలన్న గవర్నర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే తమిళ ప్రజలను గవర్నర్ కించపరుస్తున్నారని ఆరోపించారు డీఎంకే సభ్యులు. తమిళనాడు చరిత్రను వక్రీకరించి పుస్తకాలు రాశారని, వాటిని సవరించాల్సిన అవసరం ఉందన్నారు గవర్నర్ రవి. తమిళనాడు అంటే ద్రవిడుల భూమి అన్న ప్రచారం జరిగిందని, కాని ఆ పేరు తమిళగం అని మార్చాలన్నారు. దీనిపై సీఎం స్టాలిన్తోపాటు డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల తీరును నిరసిస్తూ తన ప్రసంగాన్ని ఆపేసి వెళ్లిపోయారు గవర్నర్ రవి.
దాంతో, రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగాన్ని మాత్రమే రికార్డు చేయాలంటూ సీఎం స్టాలిన్ స్పీకర్ను కోరారు. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వ ప్రసంగాన్ని యథావిధిగా ఉంచాలంటూ అసెంబ్లీ తీర్మానాన్ని కూడా సభ ఆమోదించింది. అయితే, గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్నంతసేపు, అధికార సభ్యుల నినాదాలతో దద్దరిల్లిపోయింది తమిళనాడు అసెంబ్లీ. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఇక్కడ రుద్దొద్దు, దయచేసి తమిళనాడు వదిలి వెళ్లిపోండి అంటూ నినాదాలు చేశారు డీఎంకే అండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.
ఇదిలాఉండగా, గవర్నర్ వ్యవహారం శృతిమించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న డీఎంకే నేతలు.. ఊహించని విధంగా ‘గెట్ అవుట్ రవి’అంటూ
ప్రచారం చేస్తున్నారు. గవర్నర్కు వ్యతిరేకంగా ‘గెట్ అవుట్ రవి’అంటూ తమిళనాడు వ్యాప్తంగా పోస్టర్లు అంటించారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలోనూ ఇదే స్లోగన్తో హ్యాష్ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడిది దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పశ్చిమ చెన్నైలోని వల్లువర్ కొట్టం, అన్నాసాలై ప్రాంతాల్లో ‘#GetoutRavi’అని ఉన్న పోస్టర్లు కనిపించాయి.
గవర్నర్కు, సర్కార్కు మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. గత కొన్ని రోజులుగా ట్విట్టర్లో ‘#గెటౌట్ రవి’టాప్ ట్రెండ్గా మారింది. కోయంబత్తూరులో గవర్నర్ రవికి వ్యతిరేకంగా తంథై పెరియార్ ద్రవిడర్ కజగం ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. అక్కడ ఆందోళనకారులు రవి దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించారు. ఈ ఘటనను ఖండిస్తూ మరో చోట స్థానిక బీజేపీ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్
కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి అసెంబ్లీలో సోమవారం చోటుచేసుకున్న పరిణామాలపై స్పందిస్తూ.. సభ చరిత్రలో ఇది అపూర్వమైన
సంఘటన అని అన్నారు.
సాధారణంగా మా నాయకుడు స్టాలిన్ తన ప్రత్యుత్తరాలతో అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని పరిగెత్తించేలా చేస్తారు. కానీ ఈసారి ఈయన గవర్నర్ను పరుగెత్తేలా చేశారు. మన హక్కులు దెబ్బతిన్నప్పుడల్లా ఆందోళన వ్యక్తం చేసే మొదటి ముఖ్యమంత్రి స్టాలిన్ అని ఉదయనిధి అన్నారు. మరోవైపు పుదుకోట్టైలో గవర్నర్ ఆర్ఎన్ రవిని అభినందిస్తూ స్థానిక బీజేపీ కార్యకర్తలు పోస్టర్లు వేశారు. బీజేపీకి మద్దతుగా ఉండే ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా.. గవర్నర్ రవికి మద్దతుగా నిలుస్తున్నాయి. అధికార డీఎంకేపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
అయితే, ఎవరేం చేసుకున్నా తన దారి తనదే అంటున్నారు గవర్నర్ రవి. అసెంబ్లీ స్పీచ్కి కొనసాగింపుగా పొంగల్ ఇన్విటేషన్తో మంటలను మరింత
రాజేశారు. ఆహ్వాన పత్రాల్లో తమిళనాడు బదులు తమిళిగం అని రాశారు. వీవీఐపీలకు గవర్నర్ రవి పంపిన ఈ ఆహ్వానాలు ఇప్పుడు మరింత వివాదాన్ని రాజేస్తున్నాయి. తమిళనాడు పేరును తమిళిగం గా మార్చాలన్న గవర్నర్ రవి మాటలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సినీ నటులు సైతం గవర్నర్ రవి తీరు తప్పుబడుతున్నారు. అసెంబ్లీలో గవర్నర్కు సీఎం స్టాలిన్ దీటుగా సమాధానం చెప్పారంటూ హాట్ కామెంట్స్ చేశారు యాక్టర్ సత్యరాజ్.
ఒకవైపు అధికార పార్టీ డీఎంకే నుంచి, మరోవైపు తమిళుల నుంచి భారీ నిరసనను ఎదుర్కొంటున్నారు గవర్నర్ రవి. డీఎంకేతో పాటు అన్ని రాజకీయా పక్షాలు గవర్నర్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తమిళనాట ప్రజలు ఏకంగా సోషల్ మీడియా లో మండిపడుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్కీ, గవర్నర్ రవికీ చాలా కాలంగా పడటం లేదు. ప్రభుత్వం పంపిన బిల్లులను లేదా ప్రతిపాదనల ను గవర్నర్ తొక్కిపెడుతున్నారని స్టాలిన్ ఆరోపించారు.
తమిళనాడులో గవర్నర్ రవి కేంద్రం చెప్పినట్టు నడుచుకుంటున్నారన్న అనుమానాలను తమిళ నేతలు పలు సందర్భాల్లో వ్యక్తపరిచారు. ఆయన పోకడలు వారి అనుమానాలను బలపరుస్తున్నాయి. రాష్ట్ర శాసనసభ సమావేశాలను ప్రారంభిస్తూ గవర్నర్ ప్రభుత్వం రాసి చ్చిన ప్రసంగాన్నే చదవాలి. కానీ, తమిళ నాడు గవర్నర్ తన ప్రసంగంలో కొన్ని పంక్తులనూ, పేరాలనూ వదిలివేశారు. అవి తమిళ సంస్కృతీ సంప్ర దాయాలను ప్రత్యేకంగా ప్రస్తావించేవనీ, వాటిని వదిలి వేయడం తమిళ సంప్రదాయాన్ని అగౌరవ పర్చినట్టేనని డీఎంకె సభ్యులు అభ్యంతరం చెప్పారు.
తమిళ నాట కూడా సీఎం వర్సెస్ గవర్నర్ రచ్చ షురూ అయిందన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి.