కాబూల్ బాగ్రామ్ ఎయిర్ బేస్ లో రాత్రివేళల్లో అక్కడ వెలుగులు విరజిమ్మేవి.. ఏదో ఒక రోజు తన కారును ఆ ఎయిర్ బేస్ పై నడపాలని కలలు కన్న ఓ ఇంజనీర్ కల ఎట్టకేలకు సాకారమైంది.. తాలిబాన్ ల పాలనలో అది ఎలా సాధ్యమైంది..?
అఫ్గానిస్తాన్ లో వాహనాల తయారీ పరిశ్రమ ఒక్కటి కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ సూపర్ కార్ను తయారు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది…? సూపర్ కారు తయారీకి ఎంత ఖర్చయింది..?
అమెరికా, దాని మిత్ర దేశాల దళాలు కాబూల్ బాగ్రామ్ ఎయిర్బేస్లో ఉన్నప్పుడు, రాత్రిపూట అక్కడ వెలుగులు విరజిమ్మేవి. ఏదో ఒక రోజు తన కారును ఆ ఎయిర్బేస్పై నడపాలని కలలు కన్నాడు కాబూల్కు చెందిన ఇంజనీర్ మహ్మద్ రజా అహ్మదీ.. ” తన కల కలలాగే మిగిలిపోతుంది, ఎప్పటికీ నెరవేరదు అనుకున్నాడు. కానీ ఇప్పుడు అది సాకారమైంది. అఫ్గానిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం తన కారును బాగ్రామ్ ఎయిర్బేస్లో ప్రదర్శించింది. అప్పుడు తాను కలగనట్టే ఆ ప్రాంతంలో వెలుగులు విరజిమ్మాయి. యుద్ధంతో నలిగిపోయిన అఫ్గానిస్తాన్లో మొదటి ‘సూపర్కార్’ని రూపొందించారు మహ్మద్ రజా అహ్మదీ.
ఎస్టాప్ అనే స్థానిక డిజైన్ స్టూడియో సోషల్ మీడియా పేజీలో మహ్మద్ రజా అహ్మదీ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. టెక్నికల్ అండ్ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్గానిస్తాన్తో కలిసి ఎస్టాప్కా ర్ డిజైన్ స్టూడియోలో ఈ కారును రూపొందించారు.
అఫ్గానిస్తాన్ లో వాహనాల తయారీ పరిశ్రమ ఒక్కటి కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ సూపర్ కార్ను తయారు చేయాలనే ఆలోచన వచ్చింది.. ఈ వాహనం తయారీకి 10 నుంచి 12 మందితో కూడిన బృందం పనిచేసినట్లు సమాచారం.. ఇది ప్రోటోటైప్ స్పోర్ట్స్ కారు. టయోటా ఇంజిన్ ఇందులో ఉపయోగించారు.
అఫ్గానిస్తాన్ లోని విద్య, సాంకేతిక విద్య విభాగాధిపతి మౌల్వీ గులాం హైదర్ షహమత్.. ఈ వాహనం నిర్మాణం ఐదేళ్లుగా కొనసాగుతోందని తెలిపారు.. అంటే కారు పని గత ప్రభుత్వంలో ప్రారంభించగా.. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత తయారీ పూర్తయింది..
ఇంతకు ముందు కేవలం 50 శాతం పని మాత్రమే జరిగిందని, అఫ్గానిస్తాన్లో ఇస్లామిక్ పాలన ఏర్పడినప్పుడు, మహ్మద్ రజా అహ్మదీ 8 నెలల క్రితం తమ సంస్థను సంప్రదించారని వెల్లడించారు.. ఆ తరువాత పని పూర్తయిందని వివరించారు హైదర్. అయితే కారు ఇంటీరియర్ పని ఇంకా బాకీ ఉందని.. ఈ వాహనం కోసం ఇప్పటి వరకు 40 నుంచి 50 వేల డాలర్లు వెచ్చించామని, ఇంటీరియర్ డిజైన్ పూర్తి చేయడానికి మరికొంత ఖర్చవుతుందని హైదర్ వెల్లడించారు..
ఈ కారును పూర్తిగా సిద్ధం చేసి ప్రపంచానికి చూపించి అఫ్గానిస్థాన్ పురోగతిని, ఉజ్వల భవిష్యత్తును చాటిచెప్పేందుకు ప్రయత్నిస్తానని హైదర్ వెల్లడించారు. ఈ ఏడాది ఖతార్ లో జరగనున్న వాహనాల ఎగ్జిబిషన్లో అఫ్గానిస్థాన్ ప్రభుత్వం ఈ కారును ప్రదర్శనకు ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వాహనం చిత్రాలు, కొన్ని వీడియోలు గతేడాది నవంబర్లో సోషల్ మీడియాలో కనిపించాయి. కొన్ని రోజుల క్రితమే ఈ కారును అఫ్గానిస్తాన్లో ప్రదర్శించారు. ఐక్యరాజ్యసమితికి ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్ ప్రతినిధిగా నామినేట్ అయిన సుహైల్ షాహీన్ మూడు రోజుల క్రితం ఒక ట్వీట్ చేశారు. ఇందులో అఫ్గానిస్థాన్ ఇంజినీర్ తయారు చేసిన వాహనం పనితీరు గురించి తెలిపారు.
అఫ్గానిస్తాన్ అభివృద్ధి కోసం అఫ్గాన్ యువకులందరూ తమ పాత్రలను పోషించాలని ఆయన వ్యాఖ్యానించిన వీడియో కూడా ఇందులో ఉంది. అఫ్గానిస్తాన్ సమాచార విభాగం హెడ్ జబీహుల్లా ముజాహిద్ ఈ ఘనతను ప్రశంసించారు. సోషల్ మీడియాలో చాలా మంది కారు నిర్మాణాన్ని ప్రశంసిస్తున్నారు.. 40 ఏళ్లుగా యుద్ధం జరుగుతున్న దేశంలోనూ నైపుణ్యం ఉన్నవారు దీన్ని చేయగలరని ముజాహిద్ అభిప్రాయపడ్డారు.
మరోవైపు… అఫ్గనిస్థాన్లో తాలిబన్ల పాలన మొదలైనప్పటి నుంచి మహిళా హక్కుల్ని పూర్తిగా అణిచివేస్తున్నారు.. ముఖ్యంగా వాళ్లు చదువుకోకుండా అడ్డుకుంటోంది తాలిబన్ ప్రభుత్వం. యూనివర్సిటీ విద్యపై ఇటీవలే నిషేధం విధించింది. స్వచ్ఛంద సంస్థల్లోనూ పని చేయకూడదని తేల్చి చెప్పింది. ఈ నిర్ణయాలపై అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. అయినా…తాలిబన్లు మాత్రం ఇవేవీ లెక్క చేయడం లేదు. పైగా…దీని గురించి మాట్లాడటానికీ ఆసక్తి చూపించడం లేదు. “మహిళలపై ఆంక్షల్ని తొలగించాలనే విషయం అసలు మా ప్రియారిటీ కానే కాదు” అని తాలిబన్ ప్రతినిధి ఒకరు చేసిన వ్యాఖ్యలు
సంచలనమవుతున్నాయి.

“మహిళల హక్కులు అనేది మా ప్రియారిటీ కాదు. ఇస్లామిక్ లా కి వ్యతిరేకంగా ఉండే దేన్నైనా మేం సహించం… ప్రస్తుతం దేశంలో ఏ నిబంధనలైతే ఉన్నాయో.. వాటికి అనుగుణంగానే నడుచుకుంటున్నాం” అంటూ వ్యాఖ్యలు చేశారు… ఇప్పటికే మహిళల చదువులపై తీవ్రమైన ఆంక్షలు విధిస్తున్నారు తాలిబన్లు. ఎన్జీవోల్లోనూ పని చేయకూడదన్న రూల్ తీసుకొచ్చాక మహిళల నిరసనలు తీవ్రమయ్యాయి. చాలా యూనివర్సిటీల ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు.
మహిళలనే లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు విపరీత ఆంక్షలు విధిస్తున్నారు. ఈ క్రమంలోనే…వాళ్ల చదువులపైనా తుపాకీ గురి పెడుతున్నారు. మహిళలు యూనివర్సిటీ విద్య అభ్యసించడంపై నిషేధం విధించారు. మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ అమెరికా సహా ఐక్యరాజ్య సమితి దేశాలు మండి పడుతున్నా… తాలిబన్లు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. “మేమేమీ అంత అరాచకవాదులం కాదు. ఎలా పాలించాలో తెలుసు” అంటూనే అప్ఘనిస్థాన్ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు…అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఇలాంటి విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారు. మహిళల వస్త్రధారణపై ఇప్పటికే ఆంక్షలు విధించగా…ఇప్పుడు వాళ్ల చదువులపైనా ఉక్కుపాదం మోపుతున్నారు.
నిజానికి తాలిబన్లు అధికారంలోకి వచ్చాక..యూనివర్సిటీలు అన్నీ ఇష్టం ఉన్నా లేకపోయినా…ఇలాంటి నిర్ణయాలను అమలు చేయాల్సి వస్తోంది. యువతీ యువకులకు ప్రత్యేక తరగతి గదులు ఏర్పాటు చేయడం, వేరువేరు ఎంట్రెన్స్లు పెట్టడం లాంటివి అమల్లోకి వచ్చాయి. అమెరికా, యూకే, జర్మనీ, ఈయూ సహా పలు దేశాలు తాలిబన్ల నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఈ ఆంక్షలన్నీ ఎత్తివేసి మహిళలు చదువుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి.
యూనిసెఫ్ రిపోర్ట్ ప్రకారం… అఫ్గాన్లో బాలికలు సెకండరీ ఎడ్యుకేషన్ కొనసాగించకపోవడం వల్ల దేశ జీడీపీ 2.5% మేర పడిపోయింది. కేవలం 12 నెలల్లోనే 500 మిలియన్ డాలర్ల మేర కోల్పోయింది. ఇప్పటికే 11 దేశాలు తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టాయి.
కాబూల్ కు చెందిన ఇంజనీర్ మహ్మద్ రజా అహ్మదీ.. తాను తయారు చేసిన సూపర్ కారును ఎయిర్ బేస్ పై నడపాలని కన్న కలలను ఎట్టకేలకు నిజం చేసుకున్నాడు..
అయితే.. అది తాలిబాన్ ల పాలనలో జరగడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..