సీనియర్ల వైఖరితో టీకాంగ్రెస్ ఇబ్బందులు పడుతోందా..?
తెలంగాణలో బలపడడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. రెండు సార్లు సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో, ఈ సారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోంది. ఆంధ్రాలో పత్తాలేకుండా పోతామని తెలిసినా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నామన్న మిలియన్ డాలర్ ప్రశ్న కాంగ్రెస్ మదిలో మెదులుతూనే ఉంది. అందుకే టీ కాంగ్రెస్ సీనియర్లు, టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎక్కడ ప్రచారం నిర్వహించినా, తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాందీ రుణం తీర్చుకోవాలని వ్యాఖ్యలు చేస్తున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్ హయాంలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను పేర్కొంటూ, ప్రజా సంక్షేమం కోసమే మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలంటూ పిలుపునిస్తున్నారు. మరోవైపు ప్రజల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకత ఈసారి తమకు కలిసొస్తుందని భావిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు తప్పదనే భావనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణలో సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రజల్లోకి బలంగా వెళ్లాలని టీ కాంగ్రెస్ నేతలు హాథ్ సే హాథ్ జోడో యాత్రను మార్గంగా ఎంచుకున్నారు. దీంతోపాటు ఆయా సెగ్మెంట్లలోని సీనియర్ల మధ్య ఉన్న పంచాయతీని సద్దుమణిగించడానికి అధిష్టానం నుండి కీలక సూచనలు ఇప్పించడానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తెలంగాణలోని చాలా నియోజకవర్గాల్లో ఒకరికి మించి కాంగ్రెస్ నేతలు టికెట్ రేసులో ఉండడంతో ఎవరికి టికెట్ ఇవ్వాలో, ఎవరిని బుజ్జగించాలో అర్థం కాక కాంగ్రెస్ అధిష్టానం కూడా తికమక పడుతోంది. ఒకవేళ కేసీఆర్ ముందస్తుకు వెళ్తే క్షేత్రస్థాయిలో నేతల బలాబలాలు తెలుసుకొని టికెట్లు అనౌన్స్ చేసే లోపే జరిగే నష్టం జరుగుతుందని భావిస్తున్నారట.
ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో మాత్రం క్రియాశీలకంగా పనిచేస్తూ, క్రమశిక్షణ కలిగిన నాయకులకే టికెట్లు ఇవ్వడానికి ఏఐసిసి సిద్ధమైనట్లు కాంగ్రెస్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం పోటీలో ఉండాల్సిన అభ్యర్థులపై బాగానే వర్కౌట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా సెగ్మెంట్లలో ఉన్న సీనియర్ నేతల చరిష్మాతో పాటు, ప్రజలతో మమేకమై ఉన్న నేతలకే టికెట్లు ఇవ్వడానికి రెడీ అయినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ లో గతంలోలాగా టికెట్ల విషయంలో సీనియర్లకు కోటా, వాటాలు ఉండవని చెప్పిన రేవంత్ .. టికెట్లు కన్ఫర్మ్ చేస్తే ఆ నేతల వ్యవహార తీరు ఎలా ఉంటుందోనని ముందే అంచనాలు వేస్తున్నారట.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలుగా గెలిచిన 12 మంది, అధికార పార్టీలోకి ఫిరాయించడంతో, వచ్చే రోజుల్లో అలాంటి ఘటనలు జరగకుండా ఆచితూచి అడుగులేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రేవంత్ ని వ్యతిరేకిస్తున్న సీనియర్లు, భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోననే అనుమానాలు కూడా కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ లో టికెట్ల విషయం కాస్త కఠినంగానే ఉండనున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. రాహుల్ గాంధీ నుంచి పూర్తిస్థాయి సపోర్ట్ తో, నేతల ఎంపికలో రేవంత్ మార్కు కనిపించనుందని జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
పార్టీ ప్రతిష్టను దిగజారుస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న కొంతమంది సీనియర్ల కంటే పార్టీని నమ్ముకొని ప్రజల్లోకి వెళ్తున్న యువనాయకత్వం ఉంటేనే బాగుంటుందనే ఆలోచనలో రేవంత్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే యూత్ కాంగ్రెస్ తో పాటు ఎన్ ఎస్ యు ఐ లో కీలకంగా వ్యవహరిస్తున్న యువతకు అవకాశం ఇస్తే బాగుంటుందని రేవంత్ ఆలోచిస్తున్నారట. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో బల్మూరి వెంకట్ ను బరిలోకి దింపడం వెనుక కూడా ఇదే కారణం అంటూ పలువురు చెప్పుకొస్తున్నారు.
టీ కాంగ్రెస్ లో ఇప్పటికే సీనియర్లు వర్సెస్ రేవంత్ అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేతల వ్యవహార తీరు కూడా అందుకు బలాన్ని చేకూరుస్తోంది. రేవంత్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని సీనియర్లు ఎంత ప్రయత్నించినా రేవంత్ జోరు మాత్రం తగ్గడంలేదు. మరోవైపు రేవంత్ కు అధిష్టానం నుండి ఫుల్ సపోర్ట్ ఉండటంతో ఆయన్ని ఇబ్బంది పెట్టే సమయం కోసం వీరు ఎదురుచూస్తున్నట్లుగా కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత రేవంత్ ను సాకుగా చూపెట్టి పార్టీ మారితే కాంగ్రెస్ పరిస్థితి ఏంటని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.
అయితే రాబోయే పరిస్థితులపై రేవంత్ రెడ్డి ముందస్తుగానే ఓ అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే వివిధ నియోజకవర్గాల్లో సీనియర్ల వ్యవహార తీరుతో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలుగుతున్న స్థానాల్లో యూత్ కాంగ్రెస్ లో కీలకంగా ఉన్న వ్యక్తులను సిద్ధంగా ఉండాలంటూ సూచనలు చేసినట్లు సమాచారం. మరోవైపు ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్ లో పనిచేస్తున్న యువ నేతలకే ఎక్కువ అవకాశాలు ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో యూత్ నాయకులు తమకు సపోర్ట్ చేసే సాలిడ్ ఓటర్లను సిద్దం చేసుకుంటున్నారు. గెలిచినా ఓడినా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగడానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను ప్రజల్లోకి ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణుల్లోకి తీసుకెళ్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ అసెంబ్లీ సెగ్మెంట్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. జనగామ డిసిసి ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి, చేర్యాల మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ కాంగ్రెస్ శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నారు.
అయితే వీళ్ళ వ్యవహార శైలితో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి జనగామలో రోజురోజుకు ఇబ్బందికరంగా మారుతోంది. ఎవరు తగ్గేలా లేకపోవడంతో ఇలాంటి చోట్ల కొత్త నాయకున్ని బరిలోకి దింపాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. లింగాల గణపురం మండలానికి చెందిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీసర దిలీప్ రెడ్డి పేరు ముందంజలో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. స్థానికంగా ఉంటూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేసిన దిలీప్ రెడ్డిని బరిలోకి దించడానికి అధిష్టానం కూడా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
మరోవైపు దిలీప్ రెడ్డి రాహుల్ గాంధీతో టచ్ లో ఉండడంతో టికెట్ తనకే వస్తుందని ధీమాతో ఉన్నట్లుగా కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. అందుకోసమే జనగామ అసెంబ్లీ సెగ్మెంట్లోని కాంగ్రెస్ యూత్ నాయకులతో పాటు, ఎన్ ఎస్ యూ ఐ నేతలతో పూర్తిగా టచ్ లో ఉంటున్నట్లు యూత్ కాంగ్రెస్ నాయకుల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే 20 నుండి 30 వేల ఓట్లను సిద్దం చేసుకొని ఏ నుండి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాలని చూస్తున్నారని టాక్. సీనియర్ల వైఖరితో ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్న మరికొన్ని స్థానాల్లో కూడా యూత్ లీడర్లను సిద్ధం చేయడం, రేవంత్ వ్యూహమే అని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.
అయితే యువ నాయకత్వానికి అవకాశాలు కల్పిస్తే, గెలిచినా పార్టీ ఫిరాయింపులకు తలొగ్గరని, ఒకవేళ ఓడినా పార్టీని నమ్ముకునే పనిచేస్తారని రేవంత్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే యువ నాయకులకే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేయనున్నట్లు జోరుగా చర్చలు సాగుతున్నాయి.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్న వర్గం యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యూ ఐ మాత్రమేనని, టీపీసీసీగా రేవంత్ కు పగ్గాలు ఇవ్వడానికి కూడా ఇదే ప్రధాన అంశంగా భావిస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో కూడా యూత్ నాయకులకే అవకాశాలు ఉండనున్నట్లు ఏఐసిసి కూడా హింట్ ఇస్తోందట.