రాహుల్ .. మాత్రం జోడో యాత్ర .. తనకు ఓ మరిచిపోలేని అనుభవమని, దీనిద్వారా ప్రజా సమస్యల్ని తెలుసుకునే అవకాశం లభించిందని చెబుతున్నారు. అదేసమయంలో శ్రీనగర్ ప్రజల్లో మాత్రం తనకు సంతోషం కనిపించలేదనడం .. స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ మరిన్ని యాత్రలను చేపట్టనుందన్న వాదనలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి.
తాను చేపట్టిన భారత్ జోడో యాత్ర దక్షిణం నుంచి ఉత్తర భారతానికి సాగినా.. దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. భారత రాజకీయాలపై కచ్చితంగా ప్రభావం ఉంటుందని, అయితే ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేనని పేర్కొన్నారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ ల విద్వేష, దురంహకార వైఖరికి తన యాత్ర ప్రత్యామ్నాయ ఆలోచనా విధానాన్ని చూపిందన్నారు. విపక్షాలు చీలికలుపేలికలుగా ఉన్నాయన్న వాదన నిజం కాదని తెలిపారు. వాటి మధ్య విభేదాలున్న మాట వాస్తవమని, అయితే చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.
ఈ సైద్ధాంతిక పోరులో ఈ పార్టీలన్నీ కలిసికట్టుగా ఉంటాయని, సంఘ్-బీజేపీ ఓ వైపు, వాటిని వ్యతిరేకించేవారు మరోవైపు ఉన్నారని వివరించారు. 145 రోజులపాటు సాగిన రాహుల్ జోడోయాత్ర శ్రీనగర్లోని లాల్చౌక్లో త్రివర్ణ పతాకావిష్కరణతో సంపూర్ణమైంది. ఉదయం 10.45 గంటలకు శ్రీనగర్లోని పంథాచౌక్ నుంచి తన సోదరి ప్రియాంకాగాంధీ వాద్రా, జమ్మూకశ్మీరు కాంగ్రెస్ నేతలతో కలిసి రాహుల్ యాత్రను ప్రారంభించారు. కాంగ్రెస్ మద్దతుదారులు,
మహిళలు జాతీయ పతాకాలు, పార్టీ జెండాలను పట్టుకుని వెంట నడిచారు.
పీడీపీ నాయకురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వచ్చి రాహుల్, ప్రియాంకలతో జతకలిశారు. సొన్వార్ ప్రాంతం వరకు ఏడు కిలోమీటర్లు నడిచారు. అక్కడి నుంచి రాహుల్, ప్రియాంక, పార్టీ నాయకులు ఎంఏ రోడ్డులోని పీసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి లాల్చౌక్కు చేరుకుని మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి పోలీసు బలగాలు బహుముఖ భద్రత కల్పించాయి. లాల్చౌక్కు కిలోమీటరు పరిధిలో శనివారం రాత్రే రోడ్లన్నీ మూసివేశారు. పతాకావిష్కరణ తర్వాత భారత్ యాత్రీలతో కలిసి రాహుల్ నెహ్రూ పార్కు వరకు నడిచారు.
దీంతో సుమారు నాలుగు నెలలపాటు సాగిన జోడో యాత్ర పరిసమాప్తమైంది. జోడో యాత్ర తన జీవితంలో గాఢమైన, చాలా అందమైన అనుభవమని రాహుల్ పేర్కొన్నారు. ప్రజల నుంచి అద్భుత స్పందన, ప్రేమ లభించాయని అన్నారు. జోడో యాత్రలో లక్షల మందిని కలిసి మాట్లాడాను. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న విద్వేషం, హింసలకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేయడం యాత్ర ఉద్దేశం. ఇంత ప్రేమతో కూడిన స్పందన లభిస్తుందని ఊహించలేదు.
ప్రజల శక్తిసామర్థ్యాలను ప్రత్యక్షంగా చూశాం. రైతులు, నిరుద్యోగుల సమస్యలు విన్నామని రాహుల్ తెలిపారు. పశ్చిమ భారతం నుంచి తూర్పు భారతం వైపు మరో యాత్ర చేపట్టే ఉద్దేశం ఉందా అని అడుగగా.. తాను ఆలోచిస్తానని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలకు, ప్రజలకు మధ్య అంతరం ఏర్పడిందన్నారు. మీడియా, ఇంటర్వ్యూలు, ప్రెస్ కాన్ఫరెన్సుల ద్వారా మాత్రమే దగ్గరగా ఉంటున్నాయని.. ఈ అంతరాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రోడ్లపైకి వెళ్లి వారిని కలిసి ఆలింగనం చేసుకోవాలన్నారు. గతంలో ఇంటర్వ్యూలు, ప్రెస్ కాన్ఫరెన్సులకుసంబంధించి నిష్పక్షపాత రిపోర్టింగ్ ఉండేది. ఇప్పుడు మీడియాలోకీ వివక్ష ప్రవేశించింది.
ప్రతిపక్షానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని రాహుల్ ఆక్షేపించారు. జమ్మూకశ్మీరులో భద్రతా పరిస్థితిపై కేంద్ర హోం మంత్రి అమిత్షా, బీజేపీపై రాహుల్ మండిపడ్డారు. రోజూ కొందరిని లక్ష్యంగా చేసుకుని హత్యలు జరుగుతున్నాయని, పేలుళ్లు సంభవిస్తున్నాయని అన్నారు. నిజంగా జమ్మూకశ్మీరు పరిస్థితి బాగుంటే బీజేపీ నేతలు, అమిత్ షా జమ్ము నుంచి శ్రీనగర్ లాల్చౌక్ వరకు ఎందుకు పాదయాత్ర చేయరని నిలదీశారు. జమ్ము, లద్ధాఖ్, కశ్మీరు ప్రాంత ప్రజలను కలిశానని.. ఇక్కడి పరిణామాలపై ఎవరూ సంతోషంగా లేరని చెప్పారు.

రాష్ట్ర ప్రతిపత్తి, ప్రజాస్వామ్యం పునరుద్ధరణ ఇక్కడ కీలకంగా వేయాల్సిన ముందడుగులని.. తర్వాతి చర్యలు కాలానుగుణంగా చేపట్టాలని తెలిపారు. చైనాపట్ల మనం కఠినంగా వ్యవహరించాలన్నారు. మన భూభాగంలో తిష్ఠ వేయడాన్ని సహించమని ఆ దేశానికి తెగేసి చెప్పాలని రాహుల్ అన్నారు. చైనా మన భూభాగాన్ని ఆక్రమించిందని అంటుంటే ప్రభుత్వం అదే పనిగా ఖండిస్తోంది. ఇది చాలా ప్రమాదకరం. చైనా మన భూభాగాన్ని ఆక్రమించలేదన్నఅభిప్రాయంతో ఉన్నది దేశంలో ఒక్క ప్రధాని మోదీ మాత్రమేనని విమర్శించారు. ప్రేమకే ఎల్లప్పుడూ విజయమని.. విద్వేషంఓడిపోతుందని చెప్పారు. భారత్లో ఆశావాదానికి కొత్త ఉషోదయం రానుందని తెలిపారు.
భారత్ జోడో యాత్ర పూర్తిచేసి దేశానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని అంతకుముందు ట్వీట్ చేశారు. కాగా.. జోడో యాత్ర దేశవ్యాప్తంగా ప్రేమ సందేశాన్ని వ్యాపింపజేసిందని ప్రియాంక ట్వీట్ చేశారు. రాహుల్ గత ఏడాది సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభించిన భారత్ జోడో యాత్ర .. మొత్తం 145 రోజులపాటు జరిగింది. 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 75 జిల్లాల్లో మొత్తం 4,080 కిలోమీటర్లు నడిచారు. రాహుల్ 12 బహిరంగ సభల్లో, వందకుపైగా వీధి సమావేశాల్లో, 13 విలేకరుల సమావేశాల్లో ప్రసంగించారు.
వాస్తవానికి త్రివర్ణ పతాకావిష్కరణ సోమవారం చేయాలని అనుకోగా.. అధికార యంత్రాంగం పీసీసీ కార్యాలయంలో చేసుకునేందుకు మాత్రమే తొలుతఅనుమతి ఇచ్చిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ట్విటర్లో తెలిపారు. చివరకు లాల్చౌక్లో ఎగురవేసేందుకు శనివారం సాయంత్రం పర్మిషన్ ఇచ్చిందని, అయితే ఆదివారమే పతాకావిష్కరణ చేసుకోవాలని షరతు పెట్టిందని ఆక్షేపించారు.
కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మీదుగా జమ్మూ కాశ్మీర్కు చేరింది. మధ్యలో కొంత విరామం తీసుకుంటూ ఆయన ఈ యాత్రను పూర్తి చేశారు. జోడో యాత్ర ముగింపు నేపథ్యంలో.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. లక్షలాది మందిని కలిశాను..ఎంతో తెలుసుకున్నానని.. చిరువ్యాపారులు తమ ఇబ్బందులు, కష్టాలను చెప్పారని వెల్లడించారు. అందరికీ కృతజ్ణతలు. చెప్పేందుకు మాటలు రావడం లేదన్నారు రాహుల్ గాంధీ.
ఇది కేవలం ఆరంభం మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఇంకా పలు బృహత్తర కార్యక్రమాలు నిర్వహిస్తుందని.. పాదయాత్ర దక్షిణం నుంచి ఉత్తరం వరకు జరిగినా, దేశవ్యాప్తంగా జోడో యాత్ర ప్రభావం బాగా ఉందని చెప్పగలనని.. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితి పట్ల సంతోషంగా లేనని రాహుల్ అన్నారు. ఈ ప్రాంతంలో సంతోషంగా ఉన్న వారెవరినీ నా పాదయాత్ర లో చూడలేదని..నిరుద్యోగం, విద్వేషం ప్రబలిపోతోందని కేంద్రంపై ఫైర్ అయ్యారు. నేను ఏమి చేయగలనో, చేసేందుకు సిధ్ధంగా ఉన్నాను.
చాలా స్పష్టంగా ఉన్నానని.. జమ్మూ కాశ్మీర్ ప్రజలు చూపించిన ప్రేమ, ఆదరణకు నేను చాలా కృతజ్ణతతో ఉన్నానని అన్నారు. పాదయాత్ర ద్వారా చాలా నేర్చుకున్నాను. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రాధమికాంశమన్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు తెలంగాణలో ఊహించని రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుండి రాహుల్ పాదయాత్ర ప్రారంభం కాగా
కాశ్మీర్ వరకు యాత్ర సాగింది. జీవితంలో ఒక్కసారైనా రాహుల్ గాంధీని చూడాలనే కోరిక జోడో యాత్రతో సాకారమైంది. అయితే జోడో యాత్ర రాజకీయాలకు సంబంధం లేదని రాహుల్ ఎన్నోమార్లు చెప్పారు.