Homeఅంతర్జాతీయంప్రెడిక్టర్ బాబావంగా చెప్పిన జోస్యం నిజమయ్యేలా కనిపిస్తోంది

ప్రెడిక్టర్ బాబావంగా చెప్పిన జోస్యం నిజమయ్యేలా కనిపిస్తోంది

బల్గేరియా ప్రెడిక్టర్ బాబా వంగా చెప్పిన జోస్యం నిజమయ్యేలా కనిపిస్తోంది. 2023 సంవత్సరం అనేక అనర్థాలను చూడనుందనీ, వైరస్ ల ఉద్రుతి నానాటికీ పెరుగుతుందని చేసిన హెచ్చరికలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. మొన్న కరోనా, నిన్న బర్డ్ ఫ్లూ ఇన్ ఫ్లూయెంజా, ఇప్పుడు మార్ బర్గ్ వైరస్ గురించి వార్తలు జనం గుండెల్ని అధరగొడుతున్నాయి. ఆఫ్రికా దేశం టాంజానియాలో దీని తీవ్రత మరీ ఎక్కువగా ఉందని వార్తలు వస్తున్నాయి.

ఆఫ్రికా దేశం టాంజానియాలో మార్‌బర్గ్ వైరస్ సోకి అయిదుగురు మరణించడంతో పొరుగు దేశాలు అప్రమత్తమయ్యాయి. పొరుగునే ఉన్న కెన్యా, ఉగాండాలు టాంజానియాతో తమకు ఉన్న సరిహద్దుల మీదుగా రాకపోకలపై నిఘా పెంచాయి. ప్రతీ ఒక్కరినీ జాగ్రత్తగా పరిశీలించి ప్రవేశించడానికి అనుమతిస్తున్నారు. అక్కడ విపరీతంగా ప్రబలుతున్న మార్‌బర్గ్ వైరస్ కారణంగా తీవ్రంగా రక్తస్రావమై జనం చనిపోతున్నారు. ఈ వైరస్ సోకినవారిలో 50 శాతం మంది ఇప్పటికి మరణించారు, అయితే ఈ వైరస్ కోతుల నుంచి మనుషులకు సోకుతోందని అంటోంది డబ్ల్యూహెచ్‌వో. అందుకే సరిహద్దుల వెంట నిఘా పెరిగింది. టాంజానియాతో సరిహద్దుల వద్ద ఉగాండా ఆరోగ్య తనిఖీలు నిర్వహిస్తోంది. పెద్ద సంఖ్యలో ఆరోగ్య బృందాలను మోహరించి సరిహద్దుల మీదుగా ఉగాండాలోకి వస్తున్నవారికి పరీక్షలు చేస్తోంది.

ప్రస్తుతం టాంజానియాలోని కగెరా ప్రాంతంలో ఈ వైరస్ తీవ్రత అధికంగా ఉంది. వైరస్ సోకడం వల్ల చనిపోయినవారితో కాంటాక్ట్ అయిన 161 మందిని అధికారులు గుర్తించి వారిని పరీక్షిస్తున్నారు. టాంజానియాలో ఇప్పటివరకు 8 మందికి వైరస్ సోకగా వారిలో అయిదుగురు మరణించారు. ఈక్వటోరియల్ గినియాలోనూ ఈ వైరస్ కేసులను గుర్తించారు. ఎబోలా లాంటి ఈ మార్‌బర్గ్ వైరస్ లక్షణాలలో జ్వరం ప్రధానమైనది. అత్యంత తీవ్రంగా జ్వరం వస్తుంది. ఆ తరువాత రక్త స్రావమవుతుంది. అవయవాలు విఫలమై ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. ఈ వైరస్ సోకినవారిలో 50 శాతం మంది చనిపోతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెబుతోంది. చెట్లపై పండ్లు తినే గబ్బిలాల ద్వారా ఈ వైరస్ మనుషులకు సోకుతుంది. మనుషుల మధ్య కూడా శరీర స్రావాల ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.

ఈ వైరస్‌కు ఇంతవరకు వ్యాక్సీన్ కూడా కనిపెట్టబడలేదు. ఆఫ్రికాలోని ఘనా, టాంజేనియా సహా పలు దేశాలలో ఈ వైరస్ బాధితులను గుర్తించారు. అయితే ప్రాణాంతక ఎబోలా వైరస్ తరహాగానే మార్‌బర్గ్ వైరస్ ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్న వివరాల ప్రకారం 1967లో తొలిసారి జర్మనీలోని మార్‌బర్గ్, ఫ్రాంక్‌ఫర్ట్, సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో గుర్తించారు. ఈ పట్టణాలలో 31 మందికి వైరస్ సోకగా ఏడుగురు చనిపోయారు. ఉగాండా నుంచి తీసుకొచ్చిన గ్రీన్ మంకీస్ వల్ల ఈ వైరస్ వచ్చినట్లు గుర్తించారు. అయితే, ఇతర జంతువులూ ఈ వైరస్‌కు కారణమవుతున్నట్లు తరువాత కాలంలో బయటపడింది. గుహల వెంట తిరిగే మనుషులు, భూగర్భ గనులలో పనిచేసే వారికి ఇది సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు వైద్యనిపుణులు. అలాంటి చోట ఉండే గబ్బిలాల నుంచి మనుషులకు ఈ వైరస్ వ్యాపించిన ఉదంతాలున్నాయి.

ఆఫ్రికాలో ఇటీవల కాలంలో ఘనా, టాంజానియాలలో కేసులు వెలుగుచూడగా ఇంతకుముందు డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, కెన్యా, దక్షిణాఫ్రికా, ఉగాండా, అంగోలా, జింబాబ్వేలలోనూ ఈ కేసులు బయటపడ్డాయి. 2005లో అంగోలాలో ఈ వైరస్ ప్రబలి 300 మందికిపైగా మరణించారు. అయితే, గత 40 ఏళ్ల కాలంలో యూరప్‌లో ఈ వైరస్ కారణంగా చనిపోయింది కేవలం ఒక్కరే అంటే విచిత్రంగా అనిపిస్తుంది. అమెరికాలో కూడా ఒకరు మరణించారు. ఉగాండాలోని గుహలలోకి వెళ్లి తిరిగి అమెరికా వచ్చిన వ్యక్తి ఈ వైరస్‌తో మరణించాడు. 1967లో జర్మనీలో 29 కేసులు బయటపడగా అందులో ఏడుగురు చనిపోయారని ప్రపంచ ఆరోగ్యసంస్థ లెక్కలు చెబుతున్నాయి. ఆపై 1998 నుంచి 2000 సంవత్సరం మధ్యలో డీఆర్ కాంగోలోనూ 154 కేసులు బయటపడ్డాయి. వారిలో 128 మంది మరణించారు. 2005 సంవత్సరంలో అంగోలాలో 374 కేసులు, 329 మరణాలు సంభవించాయి.

2012 సం.లో ఉగాండాలో 15 కేసులు వెలుగు చూడగా అందులో నలుగురు మరణించారు. 2017 సంవత్సరంలో ఉగాండాలో ముగ్గురికి సోకింది..అయితే చికిత్స అందించినప్పటికీ ఆ ముగ్గురూ మరణించారు. ఈ వైరస్ సోకితే ముందుగా భరించలేనంతగా జ్వరం వస్తుంది. దాంతో పాటే తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు కలుగుతాయి. ఇలా మూడు రోజులు తీవ్రమైన లక్షణాల తరువాత నీళ్ల విరేచనాలు, కడుపు నొప్పి, వాంతులు మొదలవుతాయి. ఇలాంటి పరిస్థితులలో రోగి కళ్లు లోపలికి పీక్కుపోయి ప్రేత కళ కనిపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. సాధారణంగా ఇది సోకినవారిలో సగం మంది ప్రాణాలు కోల్పోతారని.. ఇందులో అత్యంత తీవ్రమైన వైరస్ స్ట్రెయిన్స్ సోకినవారిలో 88 శాతం మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

Must Read

spot_img