తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, కష్టాలు, నష్టాల్లో పడి కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ సర్కార్… కొత్తగా అమల్లోకి తెచ్చిన ఆంక్షలు జనాన్ని మరింత ఇబ్బందుల పాలు చేస్తున్నాయి.
సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ను ‘సేవ్ ఎనర్జీ ప్లాన్’గట్టెక్కిస్తుందా..? కేవలం విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పాక్ లో పరిస్థితులు సాధారణ స్థితికి రావడం సాధ్యమేనా..? పాక్ ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలను మరింతగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయా..?
పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే నిత్యావసరాలపై ఇచ్చే రాయితీలో కోత పెట్టింది. ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పాక్ ప్రజలు… గ్యాస్ పై సబ్సిడీ ఎత్తేస్తారేమో అన్న భయంతో ఆ దేశ ప్రజలు ఎల్పీజీ గ్యాస్ ను ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసుకుంటున్నారు. కరెంట్ ఆదా చేసుకునేందుకు షాపింగ్ మాల్స్, మార్కెట్లను రాత్రి 8గంటల30 నిమిషాలకే మూసివేయాలని సర్కారు ఆదేశించింది.
ఈ పరిస్థితులన్నీ చూస్తే.. పాకిస్తాన్ మరో శ్రీలంకగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు.. విదేశీ మారకద్రవ్య నిల్వలు కూడా కరిగిపోతున్నాయి. పాకిస్థాన్ మారక నిల్వలు 6.7 బిలియన్ డాలర్లకు తగ్గాయి. దీనికి తోడు పాకిస్థాన్కు చైనా ఎలాంటి ఆర్థిక సాయం చేయడం లేదు.. దీనికి తోడు ఇన్వెస్ట్మెంట్లు తగ్గించింది. మరోవైపు పాకిస్థాన్ ను రాజకీయ అనిశ్చితి వెంటాడుతున్నది.
నవంబర్లో పూర్తి కావాల్సిన తొమ్మిదో రివ్యూ ప్రోగ్రాంలో తలెత్తిన విభేదాల కారణంగా ఐఎంఎఫ్ 1.1 బిలియన్ డాలర్ల సాయాన్ని నిలిపివేసింది. దీంతో పాకిస్థాన్కు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్స్లో డిఫాల్ట్ భయం పట్టుకుంది. ఖర్చులు తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది.ఇక.. కరెంట్ ఆదా చేయడం కోసం ఫిబ్రవరి నుంచి బల్బులు, జులై నుంచి ఫ్యాన్ల తయారీని నిలిపివేస్తామని ప్రకటించింది. ఇప్పటికే దేశంలోని సగానికిపైగా వీధి లైట్లను ఆన్ చేయట్లేదు.
- శ్రీలంక కూడా పెరుగుతున్న ధరలతో పోరాడుతున్నది..!
శ్రీలంక కూడా ఇదే తరహాలో ఏడాదిగా పెరుగుతున్న ధరలతో పోరాడుతున్నది. ఏడు దశాబ్దాలతో పోలిస్తే.. అత్యంత ఘోరమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంది. కరోనా కారణంగా టూరిజం పడిపోయింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా దిగుమతులు పడిపోవడంతో సరుకుల ధరలు పెరిగాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. జులైలో ఆ దేశ అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయాడు. తర్వాత ఐఎంఎఫ్తో 2.9 బిలియన్ డాలర్ల లోన్ కోసం శ్రీలంక డీల్ కుదుర్చుకుంది.
ఆ టైంలో శ్రీలంకకు ఇండియా అండగా నిలిచింది. జనవరి నుంచి జులై మధ్య 4 బిలియన్ డాలర్ల సాయం అందించింది. పాకిస్తాన్ లో పెట్రోల్, డీజిల్పై సబ్సిడీ ఎత్తేసినట్టు గ్యాస్పై ఎత్తేస్తారేమో అని… నార్త్ వెస్ట్రన్ రీజియన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ ప్రజలు గ్యాస్ను స్టోర్ చేసుకుంటున్నారు. ఎల్పీజీ గ్యాస్ను
నిల్వ చేసుకునేందుకు పెద్ద పెద్ద ప్లాస్టిక్ బ్యాగులను ఉపయోగిస్తున్నారు.
గ్యాస్ పైపులైన్ నెట్వర్క్కు అనుసంధానమైన దుకాణల వద్దకు ప్లాస్టిక్ బ్యాగులను తీసుకెళ్లి అందులో వంట గ్యాస్ను నింపించుకుంటున్నారు. లీకేజ్ కాకుండా 3 నుంచి 4 కిలోల బ్యాగులకు నాజల్, వాల్వ్ ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత వాటిని ప్రజలకు అమ్ముతున్నట్టు అల్ అరేబియా సంస్థ చెప్పింది. దీనికితోడు ఆహార సంక్షోభం కూడా తీవ్రమైంది. ఫుడ్ ఇన్ ఫ్లేయేషన్ 35.5శాతానికి పెరిగింది. ట్రాన్స్పోర్ట్ధరలు డిసెంబర్లో 41.2 శాతం పెరిగాయి.
- ఆర్థిక కష్టాల్లో ప్రపంచ దేశాలు..
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఆర్థిక కష్టాల్లో ఉన్నాయి. దీనికి కోవిడ్ ఓ కారణం అయితే మరోవైపు ఆర్థిక సంక్షోభం. ఇలా కష్టాలకు పలు కారణాలున్నాయి. ఆ కష్టాల్లోంచి బయటపడటానికి ఆయా దేశాలు యత్నిస్తున్నాయి. కానీ పాకిస్థాన్ మాత్రం తన అనాలోచిత నిర్ణయాలతో మరింత సంక్షోభంలో కూరుకుపోతోంది. ఇటువంటి పిచ్చి నిర్ణయాల్లో భాగంగా పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల్ని మరింత కష్టాల్లోకి నెట్టేస్తోంది.
ఇది పాకిస్థాన్కు పట్టిన దరిద్రానికి ప్రతీకలా కనిపిస్తోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, కష్టాలు, నష్టాల్లో పడి కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ సర్కార్ కొత్తగా అమల్లోకి తెచ్చిన ఆంక్షలు జనాన్ని మరింత ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. అదే ‘సేవ్ ఎనర్జీ ప్లాన్’.. ఇదంతా చూస్తుంటే.. పాపం పాకిస్థాన్ అని అనాల్సి వస్తోంది… మరి.. ప్రపంచ దేశాలన్నీ ముందుకు వెళుతుంటే.. పాకిస్థాన్ మాత్రం వెనక్కి వెళుతోంది. కానీ తప్పదు. ఎందుకంటే.. దేశం పరిస్థితి అస్సలు బాగోలేదు.
ఇప్పట్లో.. ఏ మాత్రం కోలుకునే పరిస్థితి లేదు.. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలన్నా.. సంక్షోభం నుంచి బయటపడాలన్నా.. ఎంతో కొంత సేవ్ చేయాల్సిందే. ఎంతో కొంత కూడా కాదు.. కష్టమైనా, నష్టమైనా.. వీలైనంత ఎక్కువగా పొదుపు చేయాల్సిందే. ఆర్థిక సంక్షోభం మరింత ముదరకుండా అన్నీ అదుపు చేయాల్సిందే. అలాగే వదిలేస్తే.. చివరికి పొదుపు చేయడానికి కూడా ఏమీ మిగలక.. మరింత పాతాళానికి దిగజారాల్సి వస్తుంది. ఇంకా నయం.. ఇప్పటికైనా పాక్ ప్రభుత్వం మేల్కొంది..
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్.. దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కీలక చర్యలను ప్రకటించింది. విద్యుత్ ఉత్పత్తి ఖర్చును దక్కించుకునేందుకు మార్కెట్లను, షాపింగ్ మాల్స్ని రాత్రి ఎనిమిదిన్నరకే మూసేయాలని, ఫంక్షన్ హాల్స్ని కూడా రాత్రి 10 గంటలకే బంద్ చేయాలని ఆదేశాలిచ్చింది. పాకిస్థాన్ ప్రభుత్వం చేపట్టిన ఇంధన పొదుపు పథకం కింద.. ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇంధనాన్ని ఆదా చేసేందుకు, చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు.. నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ ప్లాన్కు పాకిస్థాన్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సాధారణ సమయానికంటే ముందుగానే మార్కెట్లు, మాల్స్, ఫంక్షన్ హాల్స్ క్లోజ్ చేయడం ద్వారా.. 6 వేల కోట్ల పాకిస్థానీ రూపాయలు ఆదా అవుతాయని చెబుతోంది ప్రభుత్వం. అంతేకాదు.. దేశంలో నెలకొన్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇంకా చాలానే చేయబోతోంది పాకిస్థాన్.
ఫిబ్రవరి నుంచి సాధారణ బల్బుల తయారీని కూడా నిలిపేస్తున్నారు. జులై నుంచి నాసిరకం ఫ్యాన్ల ఉత్పత్తిని కూడా ఆపేస్తున్నారు. దీంతో.. మరో 2 వేల 2 వందల కోట్లు ఆదా అవుతాయని పాకిస్థాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ఏడాది లోపే.. కొనికల్ గీజర్ల వాడకాన్ని కూడా తప్పనిసరి చేయనుంది పాక్ ప్రభుత్వం. ఫలితంగా.. తక్కువ గ్యాస్ వినియోగంతో 9 వేల 2 వందల కోట్లు మిగులుతాయి. స్ట్రీట్ లైట్స్లో మార్పులు చేయడం ద్వారా మరో 4 వందల కోట్లు ఆదా అవుతాయి.
ఇందుకోసం.. ఇంధన పొదుపు ప్రణాళికను వెంటనే అమలు చేస్తున్నట్లు పాక్ రక్షణమంత్రి తెలిపారు.. ఇకపై.. అన్ని ప్రభుత్వ భవనాలు ప్రణాళిక ప్రకారం ఇంధన వినియోగాన్ని తగ్గిస్తాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 30 శాతం విద్యుత్ ఆదా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
- వీలైనంత త్వరగా వర్క్ ఫ్రమ్ హోమ్..!
అంతేకాదు.. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కూడా వీలైనంత త్వరగా అమలు చేయబోతున్నారు. దీని ద్వారా 6 వేల 2 వందల కోట్లు ఆదా అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.. ఇక.. చమురు దిగుమతులను తగ్గించేందుకు.. ఈ ఏడాది చివరినాటికి ఎలక్ట్రిక్ బైక్లను కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తోంది పాక్ సర్కార్. ఇంధనాన్ని ఆదా చేసే ప్రణాళికను వెంటనే అమలు చేసేందుకు.. పాకిస్థాన్ మంత్రి వర్గమంతా ఆ పనిమీదే ఉండనుంది.
పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. ఆ దేశంతో పాటు అక్కడి ప్రజలపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. దెబ్బకు పాకిస్థాన్ పబ్లిక్ లైఫ్ స్టైలే మారబోతోంది. ఇప్పటిదాకా రాత్రి పూట ఎంతసేపు బయట తిరిగినా.. మాల్స్లో గంటలకొద్దీ సరదాగా గడిపినా.. ఫంక్షన్హాల్స్లో అర్ధరాత్రి దాటే దాకా ఈవెంట్స్లో ఎంజాయ్ చేసినా ఎవరూ అడిగేవారు కాదు. కానీ.. ఇకపై అలా కాదు.
మార్కెట్లు ఎనిమిదిన్నరకే క్లోజ్ అయిపోతాయి. ఫంక్షన్ హాల్ గేట్లు.. 10 గంటలకే మూసేస్తారు. సో.. ఇకపై.. అక్కడ ఇంతకుముందులా ఉండదు. కోవిడ్ ఆంక్షలు అమల్లో ఉన్నట్లుగానే ఉంటుంది. రాత్రిళ్లు ఎక్కడికి వెళదామనుకున్నా.. మార్కెట్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఎనిమిదిన్నర తర్వాత ఒక్క షాప్ కూడా తెరిచి ఉండదు. రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, హోటల్స్.. ఇలా ఎక్కడికెళ్లినా కిందికి దించిన షట్టర్లు, వాటికి వేసిన తాళాలే కనిపిస్తాయి.
పైగా.. దీనికి కచ్చితమైన టైమ్ పీరియడ్ కూడా ఏమీ లేదు. ఈ పరిస్థితులు ఎన్నాళ్లు కొనసాగుతాయో చెప్పలేం… పాకిస్థాన్ ఆర్థికపరిస్థితి మెరుగుపడి, దేశం సంక్షోభం నుంచి తేరుకునేదాకా.. ఇదిలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు పాక్ జనం నైట్లైఫ్ను మర్చిపోకతప్పదు.
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్.. దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కీలక చర్యలను చేపట్టింది.. ఈ చర్యలతో పాక్ లో ఎప్పటికీ సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయో చూడాలి మరీ..