ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది పాకిస్తాన్.. నిన్నమొన్నటి వరకు పాక్ లోని సాధారణ పౌరులే తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు.. కానీ.. పాక్ ప్రభుత్వంలోని మంత్రులపై కూడా సంక్షోభం ప్రభావం పడింది.. ఇంతకూ పాక్ సంక్షోభం ఆ దేశ మంత్రులపై ఎలాంటి ప్రభావం చూపిస్తోంది..? పాక్ లో దారిద్ర్యం తాండవిస్తోంది.. సాధారణ ప్రజలే కాదు.. ప్రభుత్వంలోని మంత్రుల జీతాల్లోనూ కోతలు తప్పడం లేదు.. ఉన్నతస్థాయి వ్యక్తులు సైతం ఖర్చులు తగ్గించకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి..?
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాక్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ఖర్చులు తగ్గించుకోడంలో భాగంగా మంత్రుల జీతాల్లో కోత విధిస్తోంది పాకిస్థాన్ ప్రభుత్వం. పాకిస్థాన్లోని ఆర్థిక సంక్షోభం సాధారణ ప్రజల్నే కాదు. మంత్రుల్ని కూడా ఇబ్బందులు పెడుతోంది. వాళ్లూ సొంత ఖర్చులు తగ్గించుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి వచ్చే జీతాల్లోనూ కోతలు తప్పడం లేదు. మంత్రులెవరైనా సరే ఇకపై విమాన ప్రయాణం చేయాల్సి వస్తే… బిజినెస్ క్లాస్లో వెళ్లడానికి వీల్లేదు. అంతే కాదు… ఫైవ్ స్టార్ హోటళ్లలోనూ స్టే చేయడానికి అవకాశం లేదు.

శాలరీల్లోనూ కోతలు విధించి ఇస్తున్నారు. 6.5 బిలియన్ డాలర్ల IMF బెయిల్ అవుట్ దక్కాలంటే…కాస్ట్ కట్టింగ్ తప్పదు. అందుకే ఇలా వీలైనంత వరకూ ఖర్చులు తగ్గించుకుంటోంది పాక్ ప్రభుత్వం. పాకిస్తాన్ ఇప్పటికే 764 మిలియన్ డాలర్ల కాస్ట్ కటింగ్ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే…ఈ ఖర్చులు తగ్గించుకునే ప్రక్రియ ఇక్కడితో ఆగేలా లేదు. మరి కొన్ని రోజుల పాటు ఇలాగే కొనసాగనుంది. జులైలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆ పద్దులోనే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రకటించనుంది. ఇదే విషయాన్ని ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు.
ప్రస్తుతానికి ఇంతకు మించి చేసేదేమీ లేదని స్పష్టం చేశారు. “ఇదొక్కటే తక్షణ పరిష్కారం. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మేం కొన్ని త్యాగాలు చేయక తప్పడం లేదు” అని అన్నారు షెహబాజ..ప్రస్తుతం పాక్ వద్ద 3 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇవి మరి కొద్ది వారాల్లో ఖర్చైపోతాయి. ఆ మధ్య వచ్చిన వరదల కారణంగా దేశం ఆర్థికంగా మరింత బలహీనపడిపోయింది. ఆహార కొరత వేధిస్తోంది. ద్రవ్యోల్బణం 30%కి పెరిగింది.
- ఇప్పటికే పాక్ లోని పౌరులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు..
అయినా షెహబాజ్ ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా కఠినంగా వ్యవహరిస్తోంది. మంత్రులు తమంతట తాముగా జీతాలు తక్కువగా తీసుకుంటామని చెప్పారు. లగ్జరీ వస్తువులు కొనొద్దని ప్రభుత్వం ప్రజల్ని ఆదేశించింది. విలాసవంతమైన వస్తువులపై ట్యాక్స్లను విపరీతంగా పెంచింది. ఈ వస్తువులు దిగుమతిపైనా సుంకాన్ని పెంచేసింది.
పాకిస్థాన్లో ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోయింది. అక్కడి ప్రజలు ఎంతో దారుణమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు. కనీసం ఒక్క పూట తిండి తినడానికీ అవస్థలు పడుతున్నారు. ఆహార ధాన్యాల కోసం కొట్టుకుంటున్నారు. ద్రవ్యోల్బణం 30 శాతానికి చేరుకుంది. కిలో పిండి ధర రూ.250కు చేరుకుంది. ఇక పెట్రోల్, డీజిల్ ధరలైతే కొండెక్కి కూర్చున్నాయి. అయితే ఆపదలో ఉన్న టర్కీని ఆదుకుంటున్న భారత్.. పాకిస్తాన్ కు సాయం చేస్తుందా..? అన్న చర్చ చాలా రోజులుగా జరుగుతోంది.
ఈ క్రమంలోనే RSS నేత డాక్టర్ కృష్ణ గోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ప్రభుత్వానికి ఓ సూచన చేశారు. “పాకిస్థాన్ మనల్ని సాయం కోరకపోయినా భారత్ సహకరించాలి. అక్కడి ప్రజల గురించి ఆలోచించాలి. అక్కడి కుక్కలు కూడా ఆకలితో బాధ పడకుండా చూసుకోవాలి. ఆ దేశ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. భారత్ కనీసం 10-20 లక్షల టన్నుల గోధుమల్ని పాకిస్థాన్కు పంపితే బాగుంటుంది. కచ్చితంగా ఆ దేశం గురించి ఆలోచించాలి” అని సూచించారు..
గత ఏడాది ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది శ్రీలంక.. ఇప్పుడు పాకిస్తాన్లో కూడా ఆర్థిక సంక్షోభం ముదిరింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ దయాదాక్షిణ్యల మీద పాకిస్తాన్ నిలిచింది. ఫలితంగా ధరల సూచిక నిరంతరం పెరుగుతోంది. పాకిస్తాన్లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 272 రూపాయలకు చేరుకుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పాకిస్థాన్ కు సహాయం చేసేందుకు నిరాకరిస్తున్నది. ఇంకా పన్నులు పెంచితేనే సహాయం అందజేస్తామనిషరతులు విధిస్తోంది..
ఐఎంఎఫ్ ఇచ్చే ఏడు బిలియన్ డాలర్ల అదనపు ఆర్థిక సహాయం కోసం పాకిస్తాన్ ప్రజల మీద మరిన్ని పన్నులు బాదేందుకు సిద్ధమైంది. అంతే కాదు.. ఐఎంఎఫ్ సూచన మేరకు ప్రజల నుంచి అధిక పన్నులు వసూలు చేసేందుకు మినీ బడ్జెట్ ను సైతం పాక్ ఆమోదించాల్సి వచ్చింది.. ప్రజలను 12 రకాల రక్షిత, రక్షిత వినియోగదారులుగా విభజిస్తూ మంత్రివర్గ ఆర్థిక సమన్వయ సంఘం ఈనెల 13న నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చమురు ధరలను గడచిన గురువారం పెంచింది.
ఈ ఏడాది జూలై తో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో 639 మిలియన్ డాలర్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అమ్మకపు పన్నును 17 శాతం నుంచి 18 శాతానికి పెంచింది. ఇవన్నీ అక్కడి ప్రజలను ఇబ్బంది పెడతాయని, ధరల స్థాయిని మరింత పెంచుతాయని చెప్పాల్సిన అవసరం లేదు.. చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.
ప్రభుత్వం వద్ద విదేశీ ద్రవ్య నిధులు 3.1 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. వాటిని తిరిగి పెంచుకోకపోతే దిగుమతుల బిల్లును తట్టుకోవడం కష్టమవుతుంది. గత్యంతరం లేక పాక్ పాలకులు అనివార్యంగా ఐఎంఎఫ్ వద్ద చేతులు చాచారు. ప్రస్తుతం ఉన్న విదేశీ మారక నిల్వలు కొద్ది వారాల దిగుమతులకు మాత్రమే సరిపోతాయని చెబుతున్నారు.
- పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం ప్రభావం సామాన్య ప్రజలతో పాటు ప్రభుత్వంలోని మంత్రులపై చూపుతోంది..
2022 డిసెంబర్లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం పాక్ ద్రవ్యోల్బణం 2021 కంటే రెట్టింపై 24.5 శాతానికి చేరుకుంది. ఆహార ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం 35 శాతం వద్ద ఉంది. పాక్ జాతీయ బ్యాంకు ఇచ్చే అప్పులపై వడ్డీ రేట్లను గత 24 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా 100 బేసిస్ పాయింట్లు పెంచింది.
ఇక ఇన్ని రోజులు సొంత కాళ్ళ మీద నిలబడడానికి బదులు బయటి నుంచి వచ్చే ఉదారపూరిత సాయం మీద, గ్రాంట్ల మీద ఆధారపడి ఆర్థిక వ్యవస్థ నడిపించే నేపథ్యమే పాకిస్తాన్ ను ఇంతటి దురవస్థకు చేర్చింది. సాహితికమైన పన్ను విధానాన్ని పాటించి దేశీయంగా ఆదాయాన్ని పెంచుకోవడం అనే ఆరోగ్యకరమైన విధానానికి పాక్ పాలకులు స్వస్తి పలికారు. ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు.

విద్యుత్ పై అత్యధిక రాయితీ ఇవ్వటం, దక్షిణాసియాలోనే ఎక్కడా లేనంత స్వల్ప ధరలకు చమురు సరఫరా చేయడం వంటి చర్యలు ప్రస్తుత గడ్డు పరిస్థితికి కారణమని తెలుస్తోంది. 2004లో కేవలం 2.25 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్రవ్య లోటు… 2019 నాటికి 25.31 బిలియన్ డాలర్ల అత్యధిక స్థాయికి చేరుకుంది. తమ స్థూల దేశీయోత్పత్తికి తగిన రీతిలో పన్నులు లేకపోవడం ప్రభుత్వ ఖజానా దెబ్బతినేందుకు కారణమని, 2022 ఆర్థిక సంవత్సరంలో జిడిపితో పోల్చుకుంటే భారత దేశంలో పన్ను రేటు 17.1 శాతం గా ఉంటే, పాకిస్తాన్లో అది 9.2 శాతమే. చైనా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్ వంటి గల్ఫ్ దేశాల నుంచి అప్పులు చేసి పప్పుకూడు తింటూ వచ్చిన కారణంగా పాక్ ఆర్థికంగా నష్టపోయిందని విశ్లేషకులు అంటున్నారు.
క్రమశిక్షణాయుతమైన ఆర్థిక విధానాలు లేకపోవడం వల్ల పాకిస్తాన్ కు అదనపు నిధుల విడుదలలో ఐఎంఎఫ్ వల్లమాలిన జాప్యం చేస్తూ వచ్చిందని పరిశీలకులు భావిస్తున్నారు. గత ఏడాది సంభవించిన భారీ వరదలు కూడా పాక్ ఆర్థిక పతనానికి దోహదం చేశాయి. ఈ వరదలు అనేకమంది ప్రాణాలు బలి తీసుకున్నాయి. 40 బిలియన్ డాలర్ల మేరకు మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. 8 మిలియన్ ఎకరాల్లో పంటలను నష్టపరిచాయి. 33 మిలియన్ మంది ప్రజలు కట్టుబట్టలతో ఉన్న చోటనుంచి తరలిపోవాల్సి వచ్చింది. ఇలా ఒకటా రెండా పాక్ ఆర్థిక పతనానికి కారణాలు ఎన్నో ఉన్నాయి…
పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం ప్రభావం సామాన్య ప్రజలతో పాటు ప్రభుత్వంలోని మంత్రులపై చూపుతోంది.. వాళ్లూ సొంత ఖర్చులు తగ్గించుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి వచ్చే జీతాల్లోనూ కోతలు తప్పడం లేదు.