- తెలంగాణలో ముందస్తు టాక్ మళ్లీ సందడి చేస్తోంది.
- ఈ దఫా .. కేసీఆర్ మళ్లీ ముందస్తుకు అడుగులు ఎందుకు వేస్తున్నారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
- ఇక ఈ టాక్ వేళ విపక్షాల పరిస్థితి ఏమిటన్నదే సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోందట.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు విపరీతమైన స్పందన వస్తోంది. బీజేపీ బండి సంజయ్ పాదయాత్రకు, వైఎస్ షర్మిల పాదయాత్రకు రాని జనాలు.. రేవంత్ కు మాత్రం తెగ వచ్చేస్తున్నారు. ఇటీవల సర్వేల్లో కూడా బీఆర్ఎస్ తర్వాత రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది. దీంతో ఈసారి కాంగ్రెస్ కు అధికారం తథ్యం అని.. అందుకే కేసీఆర్ ముందస్తుకు ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జోరందుకుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి చంద్రబాబు, జగన్ ల వరకూ పాదయాత్రలు చేసిన వారందరూ అధికారం సాధించారు. సీఎంలు అయ్యారు. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి పాదయాత్రకు అదే హైప్ వస్తోంది.
దీంతో ప్రతిపక్షాలు బలపడకముందే వారిని దెబ్బకొట్టాలని కేసీఆర్ ముందస్తుకు రెడీ అవుతున్నట్టు ప్రచారం సాగుతోంది. తాజాగా బడ్జెట్ సందర్భంగా నిర్వహించిన కేబినెట్ మీటింగ్ లో మంత్రులకు ఒక సంచలన విషయం చెప్పారని.. ఓ మంత్రి పీఏ ఈ మేరకు ఈ రహస్యాన్ని మీడియాకు లీక్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ 2018లో లాగానే ఈసారి కాంగ్రెస్, బీజేపీలను దెబ్బకొట్టాలని ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈనెల 17న సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మూడో విడత సమావేశంలో ముందస్తు ఎన్నికలపై కీలక ప్రకటన చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇప్పుడు బలం దృష్ట్యా ఎన్నికలకు వెళితే తిరుగులేని శక్తిగా అవతరించేందుకు ఛాన్స్ ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. అసెంబ్లీ రద్దు చేయనున్నట్టు కేసీఆర్ ఇదివరకే మంత్రులకు చెప్పారని.. ఈ క్రమంలోనే సభను మొత్తాన్ని మంత్రి కేటీఆర్ కు అప్పగించేశారని తెలుస్తోంది. 2018లోనూ కేసీఆర్ ఇలాగే ప్రతిపక్షాలు సర్దుకోకముందే ముందస్తుకు వెళ్లి గెలిచారు. డిసెంబర్ వరకూ వేచిచూస్తే కాంగ్రెస్, బీజేపీ పాదయాత్రలతో బలపడుతాయని కేసీఆర్ ఆందోళన చెందుతున్నారు. అందుకే అవి బలపడకముందే ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నారు.
వారికి అవకాశం ఇచ్చే బదులు తనే సభను రద్దు చేసి మేలోనే ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లి గెలిస్తే.. మే నాటికి తెలంగాణ ఎన్నికలు పూర్తి చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకోసమే ముందస్తు వ్యూహం పన్నుతున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇదెంతమేరకు సక్సెస్ అవుతుందన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పుడే గెలిస్తే 10 నెలల సమయం ఉంటుందని.. ఈ సమయంలో కేంద్రంలో చక్రం తిప్పేందుకు అవసరమైన ప్రచారం రెడీ చేసుకునే అవకాశం ఉంటుందని కేసీఆర్ ఆలోచనగా ఉంది. జాతీయ రాజకీయాల్లో రాణించాలంటే ముందుగా తెలంగాణ ఎన్నికలను గెలవాలని.. అందుకే త్వరగా పూర్తి చేయాలని కేసీఆర్ ముందస్తుకు వెళుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
తెలంగాణలో ముందస్తు ఎన్నికల సందడి కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శరవేగంగా తీసుకుంటున్న నిర్ణయాలు .. వేగంగా అమలు చేస్తున్న పథకాలు అన్నీ ముందస్తు ఎన్నికల సంకేతాలేనని భావిస్తున్నారు. అయితే ఎన్నికల ఏడాది కాబట్టి కేసీఆర్ ఇలా పాలన పరుగులు పెట్టిస్తున్నారని సాధారణ సమయంలోనే ఎన్నికలు జరుగుతాయని కొంత మంది విశ్లేషిస్తున్నారు.
ఒక వేళ ముందస్తు ఎన్నికలు అంటూ వస్తే, బీఆర్ఎస్ ను ఓడిస్తామంటున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెడీగా ఉన్నాయా ? వెంటనే అభ్యర్థులను ఖరారు చేసుకోగలవా ? అన్నదే చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే, తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా వద్దా అన్నది కేసీఆర్ నిర్ణయం.
అంతా ఆయన చేతుల్లోనే ఉంది. ఎప్పుడు అసెంబ్లీని రద్దు చేస్తే ఆ తర్వాత రెండు, మూడు నెలల్లో ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఒక వేళ రద్దు చేయకపోయినా నవంబర్-డిసెంబర్లో జరుగుతాయి. అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడానికి మరోసారి ముందే ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతూ వస్తోంది. ఒక వేళ అదే నిజమైతే కేసీఆర్ అన్ని రకాలుగా సిద్ధమయి ఉంటారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ముందు కేసీఆర్ అభ్యర్థులపై కూడా పూర్తి కసరత్తు చేశారు. అన్ని రకాల సన్నాహాలు పూర్తి చేసుకుని రంగంలోకి దిగారు.
ఎక్కడా వెనుతిరిగి చూడకుండా ..మరోసారి విజయాన్ని అందుకున్నారు. ఈ సారి కూడా ముందస్తుకు వెళ్లాలనుకుంటే.. అంతే ప్రణాళిక ప్రకారం వెళ్తారు. అందులో ఎలాంటి సందేహాలు ఉండవు. అంటే.. కేసీఆర్ ప్రిపరేషన్స్ విషయంలో బీఆర్ఎస్ కు ఎలాంటి టెన్షన్స్ ఉండవు. ఈ వ్యూహంతోనే కేసీఆర్ ముందస్తు దిశగా అడుగులు వేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యూహంపై విపక్షాలు ఏవిధంగా స్పందిస్తాయన్నదే ఇప్పుడు తెలంగాణవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. దీంతో కేసీఆర్ ప్రకటన తర్వాత ఏం జరగనుందన్న చర్చ సొంత కేడర్ లోనే కాక .. ప్రజల్లోనూ వెల్లువెత్తుతోంది. అంతేగాక విపక్షాల బలాబలాలపైనా చర్చలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
ఎన్నికల వార్ లో గ్రౌండ్ రెడీ చేసుకుని కేసీఆర్ యుద్ధానికి సిద్ధమైపోయి ఉంటారు కానీ.. విపక్షాలు మాత్రం సిద్ధంగా ఉంటాయా లేదా అన్నది ఆలోచించాల్సిన విషయమే. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్న రెండు పార్టీలు జాతీయ పార్టీలే. వాటి నాయకత్వం ఢిల్లీలో ఉంటుంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఢిల్లీ నుంచే తీసుకోవాలి. అందుకే బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ తీసుకున్నంత వేగంగా నిర్ణయాలు తీసుకోలేరు. ఇంకా చెప్పాలంటే.. ముందస్తుగా కసరత్తు కూడా చేసుకోలేరు. అందుకే రెండు విపక్ష పార్టీల్లోనూ అలాంటి పరిస్థితి కనిపిస్తోంది.
ఇంకా ఎన్నికల ప్రిపరేషన్స్ ప్రారంభించలేని నిస్సహాయత కాంగ్రెస్, బీజేపీల్లో కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీకి ముందస్తు ఎన్నికలు వచ్చినా… సమయానికే ఎన్నికలు జరిగినా సిద్దమవడం అనే కసరత్తే ఉండదు. ఎన్నికల తేదీలు వచ్చాక.. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కూడా అభ్యర్థుల కసరత్తు జరుగుతూనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, నామినేషన్ల ఉపసంహరణ గడువు వరకూ ఈ పంచాయతీ జరుగుతుంది. ఇలాంటి రాజకీయ కసరత్తు ఉండే కాంగ్రెస్ పార్టీలో ముందస్తు ఎన్నికలు వచ్చినా రాకపోయినా పెద్దగా మార్పేమీ ఉండవు. అయితే ఈ సారి కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధమని ఆయన చెబుతున్నారు.. కానీ సీనియర్ల సహాయ నిరాకరణతో ఎప్పటికప్పుడు వెనక్కి తగ్గుతూనే ఉన్నారు.
ఆయన రెండు, మూడు రోజుల కిందటే పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పటికిప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తే రేవంత్ కిందా మీదా పడాల్సిందే. ఇక అధికారంలోకి వచ్చేస్తున్నామని ప్రకటనలు చేస్తున్న బీజేపీ నేతలకు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేవు. ముఖ్య నేతలు ఉన్న నియోజకవర్గాల్లో తప్ప ఆ పార్టీకి అభ్యర్థులు లేరు. చేరికల కోసం వేసిన మాస్టర్ ప్లాన్స్ అన్నీ విపలమయ్యాయి. ఇప్పటికిప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో టిక్కెట్లు రాని నేతలకు .. బీ ఫారాలు ఇచ్చి పోటీ చేయించడం మినహా ఆ పార్టీకి మరో దారి ఉండదన్న వాదన ఉంది.
మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలు … ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధమేనని ప్రకటనలు చేస్తూ ఉంటాయి. కానీ అసలు గ్రౌండ్లో మాత్రం అలా ఉండదు. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తే.. సన్నాహాల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీదే పైచేయి అని చెప్పక తప్పదు. అయితే.. పార్టీలో తలెత్తుతోన్న అసంతృప్తులు, టిక్కెట్ రేసులు .. ఏమాత్రం ప్రభావం చూపిస్తాయోనన్న ఆసక్తి మాత్రం సర్వత్రా వినిపిస్తోంది.