ఆర్టెమిస్ ప్రాజెక్టులో భాగంగా తొలి మానవ రహిత రాకెట్ చంద్రుడిని చుట్టేసింది. ఒరాయిన్ క్యాప్సూల్ చంద్రుడిని వీడి భూమికి తిరుగు ప్రయాణం విజయవంతంగా పూర్తి చేసుకుంది. అనుకున్నట్టుగానే అన్ని అవాంతరాలను అధిగమించి క్షేమంగా పసిఫిక్ మహా సముద్రంలో పారాచూట్ల సాయంతో దిగిపోయింది. దీంతో నాసా తలపెట్టిన ఆర్టెమిస్ ప్రాజెక్టు తొలి అంకం సక్సెస్ ఫుల్ గా పూర్తయింది..
చంద్రున్ని చుట్టేసి సురక్షితంగా భూమికి చేరింది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించిన ఒరాయిన్ స్పేస్ షిప్. 26 రోజుల ప్రయాణం తర్వాత సురక్షితంగా భూమికి చేరింది ఒరైన్ క్యాప్సుల్. భూ వాతావరణంలోకి గంటకు 40వేల కి.మీల వేగంతో దూసుకువచ్చిన ఒరైన్ క్యాప్సూల్ వినూత్నంగా రూపొందించిన పారాచూట్ల సాయంతో పసిఫిక్ మహా సముద్రంలో క్షేమంగా దిగింది. పనితీరును పరీక్షించడంలో భాగంగా చంద్రుని వద్దకు ఒరైన్ను పంపించారు కాబట్టి ఇందులో మనుషులు ఎవరూ ప్రయాణించలేదు. రాబోయే రోజుల్లో మాత్రం అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ క్యాప్సూల్ లో నలుగురు ఆస్ట్రోనాట్స్ ప్రయాణించడం జరుగుతుంది. చంద్రుని మీదకు తొలిమహిళ మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకెళ్తుంది.
అయితే 2024 చివర్లో లేదా 2026 మధ్యలో మరొకసారి మనుషులను చంద్రుని మీదకు పంపాలని నాసా భావిస్తోంది.

సరిగ్గా 50ఏళ్ల కిందట ఇదే రోజు అపోలో-17 ద్వారా ఆస్ట్రోనాట్స్ చంద్రుని మీద దిగారు. అయితే అది తొలిసారి కాదు.. నాసా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పేరు ఆర్టెమిస్. గ్రీకు పురణాల ప్రకారం ఆర్టెమిస్ అనేది అప్పట్లో చంద్రుడిని చేరిన రాకెట్ అయిన అపోలోకు సోదరి. మేం అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించాం. ఇపుడు మరొకసారి చంద్రుని మీదకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నాం. కానీ, ఈసారి అవసరం వేరు అంటున్నారు నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నీల్సన్. జీవించడం నేర్చుకోవడానికి, పని చేయడానికి, ఆవిష్కరణలు చేయడానికి, కొత్తవాటిని సృష్టించడానికి వెళ్తున్నాం. ఇదొక ఉద్విగ్నభరిత క్షణం అన్నారు నీల్సన్.
చంద్రున్ని భూమికి అవుట్ పోస్టుగా చేసుకుని ఇంధనం నింపుకోవడానికి ఓ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకుని విశ్వాంతరాలను శోధించేందుకు వెళుతున్నాం.. అందులో భాగంగానే ఈ ప్రయత్నాలు. చంద్రుడిపై శాశ్వత ఆవాసం నిర్మించడం, అక్కడ రాకెట్లకు ఇంధన సదుపాయం కలుగజేయడం భవిశ్యత్తు ప్రాజెక్టులలో ఒకటి. నాసా తలపెట్టినట్టు 2030 చివరి నాటికి అంగారకుని మీదకు మానవులను తీసుకెళ్లడానికి సిద్ధం కావాలన్నది శాస్త్రవేత్తల ఆలోచన. అంగారకున్ని కూడా దాటి ముందుకు వెళ్లాలని తాము భావిస్తున్నామని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ మీడియాతో అన్నారు. తన హయాంలో ఆర్టెమిస్ ప్రాజెక్టును విజయవంతం కావడం పట్ల ఆయన చాలా ఆనందంగా ఉన్నారు.
గత మూడు వారాలుగా మీడియా సమావేశాలలో తరచూ కనిపించిన ఆర్టెమిస్ ప్రాజెక్ట్ మేనేజర్ మైక్ సరాఫిన్… ఒరైన్ క్షేమంగా కిందకు రావడంతో తన ఆనందాన్ని దాచుకోలేకపోయారు. ఆ చివరి ఏడు నిముషాలు అందరి వదనాలలో ఉద్విగ్నత కనిపించింది. ఎందుకంటే చంద్రుని నుంచి తిరిగి వచ్చే స్పేస్ షిప్స్, అత్యంత వేగంతో భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. దాదాపు గంటకు 40 వేల కిలోమీటర్ల వేగంతో భూమి దిశగా అవి ప్రయాణిస్తాయి. విపరీతమైన వేగంతో భూమిపైకి రాలిపడుతున్నట్టుగా ఒరాయిన్ దూసుకువచ్చే సమయంలో కమాండ్ సెంటర్ తో అన్ని కమ్యూనికేషన్లు తెగిపోతాయి. అప్పుడు ఏం జరుగుతుందన్నది ఎవరికీ తెలియదు. అయితే ఆ ఏడు నిమిషాల తరువాత మళ్లీ సిగ్నల్ అందడంతో సస్పెన్స్ తొలగిపోయింది.
అప్పటికే సముద్రంపై ఒరాయన్ కోసం ఎదురుచూస్తున్న రికవరీ టీం కంట పారాచూట్లు కనిపించడంతో కమాండ్ సెంటర్ లో ఆనందం వెల్లివిరిసింది. అంతా హర్షధ్వానాలతో ఒకరినొకరు గ్రీట్ చేసుకున్నారు. నిజానికి ఇంత వేగంతో ప్రయాణించే స్పేస్ షిప్, భూవాతావరణం లోకి ప్రవేశించాక వాతావరణంతో జరిగే ఘర్షణ వల్ల ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి. షిప్ బయటి ఉష్ణోగ్రత 3వేల సెల్సియస్ డిగ్రీల వరకు చేరుతుంది. కాబట్టి ఇంతటి వేడిని తట్టుకుని నిలబడేలా షిప్ను నిర్మించాల్సి ఉంటుంది. పాత స్పేస్ షిప్స్తో పోలిస్తే ఒరాయిన్లో భిన్నమైన హీట్ షీల్డ్స్ వాడారు. పాత డిజైన్ను కూడా మార్చారు. ఆస్ట్రోనాట్స్ ప్రాణాలకు ఏమాత్రం ముప్పు కలగకుండా ఉండాలన్నది నాసా లక్ష్యం.