ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉండుండి క్షిపణి పరీక్షలు చేయడం.. అమెరికాపై దాడి తప్పదని హెచ్చరికలు చేయడం సర్వసాధారణమైపోయింది. అంతే కాదు..అప్పుడప్పుడు తన దేశ ప్రజలకు వింత వింత ఆదేశాలు, నిషేధాల గురించి ప్రకటనలు చేస్తూ తన అస్థిత్వాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్తతో ప్రపంచానికి తానున్నానని చెప్పకనే చెబుతుంటారు కిమ్ జాంగ్ ఉన్. అది పక్కన బెడితే ఆయన పాలన తీరును చూస్తే ఆ మిలిటరీ గొప్పలు, ప్రచార యావ ప్రజలను ఆకలి చావులవైపు నడిపిస్తున్నాయి.
అవును లోలోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియకుండా కాపాడినా ఏదో ఒక రూపంలో అక్కడి వార్తలు దేశాన్ని దాటుతుంటాయి. అలా దాటిన సమాచారం పొరుగు దేశాలైన దక్షిణకొరియా, జపాన్ ద్వారా బయటి ప్రపంచానికి చేరుతూనే ఉన్నాయి. తాజా సమాచారం మేరకు ఉత్తర కొరియా తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని నిపుణులు అంటున్నారు. అయితే దీర్ఘకాలిక ఆహారకొరత ఆ దేశానికి కొత్తేమీ కాదు.కానీ, ఇటీవలి సంవత్సరాల్లో విధించిన సరిహద్దు నియంత్రణలు, దుర్భర వాతావరణ పరిస్థితులు, ఆంక్షలు అక్కడి పరిస్థితిని మరింత దిగజార్చాయి.
వ్యవసాయ విధానంలో చేయాల్సిన ఆవశ్యక మార్పుల గురించి చర్చించడం కోసం ఫిబ్రవరి నెలాఖరులో ఉన్నత అధికారులు సమావేశం కానున్నారని అక్కడి అధికారిక మీడియా తెలిపింది.వ్యవసాయ సమస్యలను ఎత్తి చూపడానికి ఇది అత్యంత కీలకమైన, అత్యంత అవసరమైన సమావేశం అని వార్తా సంస్థకేసీఎన్ఏ పేర్కొంది. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ తన మిలిటరీ బల ప్రదర్శనను కొనసాగిస్తున్న సమయంలో అక్కడి వ్యవసాయం, ఆహార సంక్షోభానికి సంబంధించిన వార్తలు వచ్చాయి. ఒక అధికారిక వార్తా పత్రిక, ఉత్తర కొరియాకు అందుతున్న విదేశీ సహాయాన్ని విషం కలిపిన క్యాండీగా పోల్చింది. సామ్రాజ్యవాదులు దేశాన్ని దోచుకోవడానికి, అణిచివేయడానికి ఉపయోగిస్తారని ఆ పత్రిక తెలిపింది.
ఇదిలా ఉండగా నాంఫో సిటీలో జరిగిన వరి నాటు కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే ఆహార కొరతపై హెచ్చరికలు జారీ చేసిన దక్షిణ కొరియా యూనిఫికేషన్ మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆహార కార్యక్రమం ‘డబ్ల్యూఎఫ్పీ’ నుంచి సహాయాన్ని కోరింది. 2021 కంటే 2022లో ఉత్తర కొరియా 1లక్షా 80వేల టన్నుల ఆహారాన్ని తక్కువగా ఉత్పత్తి చేసిందని దక్షిణ కొరియా అధికారుల వద్ద ఉన్న ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి. కరవు, వరదలు వంటి తీవ్రమైన దుర్భర వాతావరణ పరిస్థితుల కారణంగా చలికాలం, వసంతకాలంలో పంటల దిగుబడి తక్కువగా ఉంటుందని జూన్లోనే డబ్ల్యూఎఫ్పీ ఆందోళన వ్యక్తం చేసింది.
దేశం రికార్డు స్థాయిలో రెండో అత్యంత దారుణమైన కరవు పరిస్థితులను ఎదుర్కొంటుందని గత ఏడాది చివర్లోనే అధికారిక మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే మొదట అంచనా వేసినట్లుగా ఈ ఏడాది ఆహార ధరలు అమాంతం పెరిగాయి. ప్రజలు చవకైన ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. నిజానికి ఉత్తర కొరియా మిలిటరీపైనే ఎక్కువగా ఖర్చు చేస్తుంది ప్రజలు ఎక్కువగా మొక్కజొన్నను కొనుగోలు చేస్తున్నారంటే, బియ్యం వంటి ప్రధాన ఆహార దినుసుల ధరలు బాగా పెరిగినట్లు అర్థం అంటున్నారు నిపుణులు.
ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ఉత్తర కొరియా కూడా ఒకటి. 2015లో ఉత్తర కొరియా స్థూల దేశీయోత్పత్తి సుమారు 1700 డాలర్లుగా సీఐఏ వరల్డ్ ఫ్యాక్ట్బుక్ అంచనా వేసింది. కానీ, ఇటీవల ఇది మరింత తక్కువ అయినట్లు అంచనా. పారదర్శకత లేని ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థను బట్టి చూస్తే వాస్తవ పరిస్థితులు మరింత అస్పష్టంగా ఉన్నాయని పేర్కొంది. ఉత్తర కొరియా అమలు చేసిన కఠినమైన కోవిడ్ సరిహద్దు ఆంక్షల కారణంగా, దేశంలో అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయో తనిఖీ చేసే అవకాశం బయటి వ్యక్తులు ఎవరికీ లభించలేదు. ఈ చర్యలు, ఉత్తర కొరియా వెలుపల ఉన్న సంస్థలు సంక్షోభ సమయాల్లో సహాయం పంపకుండా చేస్తున్నాయి. 2019 మే 12న నాంఫో సిటీలో జరిగిన వార్షిక వరి నాటే కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొన్నారు.
అయితే 2020 జనవరి నుంచి సరిహద్దు వాణిజ్యం, ట్రాఫిక్పై ఉత్తర కొరియా కఠిన ఆంక్షలు విధించింది. మహమ్మారి సమయంలో ఉత్తర కొరియా పాలకులు తీసుకున్న చర్యలు ‘విపరీతమైనవి, మతిలేనివి’ అని ఉత్తర కొరియాలోని లింక్ అనే స్వచ్ఛంద సంస్థ దక్షిణ కొరియా డైరెక్టర్ సొకీల్ పార్క్ అన్నారు. ఉత్తర అమెరికా శరణార్థులకు అమెరికాలో లేదా దక్షిణ కొరియాలో పునరావాసం కల్పించడంలో పార్క్కు చెందిన స్వచ్ఛంద సంస్థ పనిచేస్తుంది. మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి ఉత్తర అమెరికాలో ప్రాథమిక అవసరాలైన వస్తువుల సరఫరా తగ్గిపోయిందని పార్క్ అన్నారు. ఆకలి చావులకు సంబంధించిన అనేక విశ్వసనీయమైన కథనాలు తమ సంస్థ దృష్టికి వచ్చినట్లు పార్క్ చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా బెదరగొడుతున్న ఆర్థికమాంద్యం కారణంగా ఇన్నాళ్లూ ఉత్తర కొరియాకు అంతర్జాతీయ సమాజం నుంచి లభించిన మానవతా సహాయం కూడా గణనీయంగా తగ్గింది. గత ఏడాది ఉత్తర కొరియా ఇతర ఏజెన్సీలు, అంతర్జాతీయ సంస్థల నుంచి 2.3 మిలియన్ డాలర్ల మానవతా సహాయాన్ని అందుకుంది. 2021 కంటే ఇది 14 మిలియన్ డాలర్లు తక్కువ అని ఐక్యరాజ్యసమితికి చెందిన హ్యుమానిటేరియన్ అఫైర్స్ కార్యాలయం వెల్లడించింది. సుదీర్ఘ కాలం సరిహద్దులను మూసివేయడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చు.
రెచ్చగొట్టేలా ఉన్న ఉత్తర కొరియా సైనిక చర్యలకు ప్రతిస్పందనగా అంతర్జాతీయ ఆంక్షలు కఠినతరం అయ్యాయి. మానవతా సామగ్రి పంపిణీకి దీనివల్ల కూడా ఆటంకం కలిగిందని కొంతమంది రిలీఫ్ వర్కర్లు చెబుతున్నారు. సరిహద్దు ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ ప్రారంభం అవుతున్నట్లు కొన్ని సంకేతాలు ఉన్నాయి. ఉత్తర కొరియా వాణిజ్యంలో 90 శాతానిపైగా రవాణా పనులు ట్రక్కుల ద్వారానే జరుగుతుంటాయి. ట్రక్కుల రవాణాను పునరుద్ధరించారని గత వారం నిక్కీ ఆసియా సంస్థ నివేదించింది. దీంతో ఇక ఉత్తర కొరియాలోని సాధారణ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అనుకోలేమని అంటున్నారు నిపుణులు.
ఉత్తర కొరియా ఎక్కువ భాగం మిలిటరీ కోసం ఖర్చు చేస్తుంది. ఫిబ్రవరి నెల ప్రారంభంలో తాజా క్షిపణి లాంచర్లను ఉత్తర కొరియా ప్రదర్శించింది. మిలిటరీ పరాక్రమాన్ని ప్రదర్శించడం, ప్రచారం కోసమే ఉత్తర కొరియా తన వనరులు అన్నింటినీ వినియోగిస్తోంది. గత ఏడాది ఉత్తర కొరియా రికార్డు స్థాయిలో 70కి పైగా క్షిపణులను ప్రయోగించింది. వీటిలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, అమెరికా భూభూగాన్ని చేరుకోగల సామర్థ్యం ఉన్న ఐసీబీఎంలు ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో జరిగిన మిలిటరీ పరేడ్లో భారీ స్థాయిలో ఐసీబీఎంలను ప్రదర్శించింది. ఉత్తర కొరియాలో సాధారణ పౌరులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని అక్కడి పాలన యంత్రాంగం అంగీకరించింది. కానీ, కిమ్ కుటుంబం కోసం మాత్రం బ్రహ్మాండమైన ప్రచారం కొనసాగుతోంది. లోలోపల మాత్రం క్షిపణి ప్రయోగాలు, జనాలపై కఠిన ఆంక్షలు వంటి అంశాలకే ఉత్తరకొరియా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది. దీని వల్ల క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరింత దిగజారుతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
1990లలో దేశం ఎదుర్కొన్నటువంటి వినాశకరమైన కరవు దిశగా మరోసారి ఉత్తర కొరియా దేశం ప్రయాణిస్తుందని వారు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే 1990ల్లో సంభవించిన కరవు పరిస్థితులకు నేడు దగ్గరగా ఉన్నట్లు కనిపించడం లేదు. కానీ, పరిస్థితులు ఎప్పుడైనా అదుపు తప్పొచ్చు. ఆహార సరఫరా కొద్దిగా తగ్గినా కూడా దేశంలో భయంకరమైన పరిణామాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు నిపుణులు. మొన్నటికి మొన్న తన కూతురి పేరును మరెవరూ పెట్టుకోకూడదని హుకుం జారీ చేసిన కిమ్ జాంగ్ ఉన్ ఇప్పుడు హాలివుడ్ సినిమాలు చూస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. ఎవరైనా అలా హాలివుడ్ సినిమాలు చూసినట్టు తేలితే వారి తల్లిదండ్రులను ప్రభుత్వం నిర్వహించే క్యాంపుల్లో ఏళ్ల తరబడి పని చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు అధికారులు.