ఆంధ్రప్రదేశ్లో కాపు రాజకీయ నేతలు ఇటీవలి కాలంలో పార్టీలకు అతీతంగా సమావేశాలు నిర్వహిస్తూ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికార
వైసీపీ కాపు నేతలు మాత్రం ఇలా విడి సమావేశాలకు హాజరు కావడం లేదు. ఆ పార్టీ కాపు నేతలు మాత్రమే భేటీలు అవుతున్నారు. తాజాగా వంగవీటిరంగా వర్థంతి సందర్భంగా విశాఖలో భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పినట్లుగా ఇప్పుడు ఏం జరిగినా రాజకీయం ఉంటుంది.. రాజకీయం లేదంటే.. అబద్దం చెప్పినట్లే. అందుకే కాపు నాయకులు ఇప్పుడు రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోనున్నారు ? ఎలాంటి అడుగులు వేయనున్నారన్నది కీలకంగా మారింది. అన్ని పార్టీల్లోనూ కాపు సామాజికవర్గ నేతలు కీలకంగా ఉన్నారు. ముఖ్యమంత్రి స్థాయికి వెళ్లలేదు కానీ ముఖ్యమంత్రి నిర్ణయాలను ప్రభావితం చేయగలిగే స్థాయికి.. బలాన్ని కాపు నేతలు పొందారు. గత ప్రభుత్వంలో..ఈ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు. అయితే వారికి ఎంత పవర్ ఉందనే విషయం పక్కన పెడితే.. వారిని రాజకీయంగా ప్రాధాన్యపరంగా పార్టీలు గుర్తిస్తున్నాయి. అయితే వారికి సీఎం పదవి అనేది ఇంకా అందడం లేదనే అసంతృప్తి ఉంది. ఇటీవలి కాలంలో కాపు నేతలు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ మధ్య నిర్వహించిన రెండు సమావేశాలతో కాపు నేతలంతా కలిసి కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకూ అది సాకారం కాలేదు. తాజాగా మరోసారి భేటీలు అవుతున్నారు.
వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా వీరంతా మరోసారి భేటీ కానున్నారు. అన్ని పార్టీల్లోని కాపు నేతలు.. సమావేశమవుతున్నారు. వారికి పార్టీల అడ్డంకులు రావడం లేదు. తమ పార్టీకి ఇబ్బంది లేకుండా.. కుల సంఘ సమావేశాలు.. నేతల భేటీల్లో పాల్గొంటున్నారు. అది సామాజికవర్గ సమావేశమే కానీ.. రాజకీయం కాదని సర్ది చెప్పుకుంటున్నారు. ఈ సమావేశాల పట్ల వారు ఉన్న పార్టీలు కూడా పెద్దగా ఆందోళన చెందడం లేదు. పార్టీకి వారు నిబద్ధులై ఉంటారని నమ్మకంతో ఉన్నారు. అయితే వైసీపీ కాపు నేతలు మాత్రం..ఈ సమావేశాల్లో పాల్గొనడం లేదు. ఆ పార్టీ కాపు నేతలంతా భేటీ అవుతూంటారు. అయితే ఈ సమావేశాలు ప్రధానంగా పవన్ కల్యాణ్కు కౌంటర్ ఇవ్వడానికే పెడుతున్నారు. అందుకే.. వైసీపీ కాపు నేతలపై ఆ సామాజికవర్గంలోనే విమర్శలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశంగా మారిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
వరుస భేటీలతో సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోందా..?
కాపు నేతలంతా కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుందా అనే ఆలోచన కూడా గతంలో చేశారన్న ప్రచారం జరిగింది. కానీ కాపులు మాత్రమే ఓట్లు వేస్తే ఎవరూ
గెలవరు. అందుకే విరమించుకుని ఉంటారని టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఆ సామాజికవర్గం నుంచి పవన్ కల్యాణ్ .. మాస్ లీడర్గా రాజకీయ బరిలో ఉన్నారు. అందరూ కలిసి ఆయనను సమర్థిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా వారికి వచ్చి ఉండవచ్చు. కానీ అది అంత తేలికగా సాధ్యమయ్యే విషయం కాదు. పవన్ కల్యాణ్ కూడా ఒక్క కాపులు ఓటు వేస్తేనే తాను సీఎం కాలేనని తెలుసు. అందరి మద్దతూ ఆయన కోరుకుంటారు.
అదే సమయంలో కాపు నేతలు తమ రాజకీయ భవిష్యత్ ను కాదనుకుని.. పవన్ కు మద్దతు తెలుపడం కూడా కష్టమే. కాపు నేతలు సమావేశమైనా.. ఓ పార్టీకి ఏకపక్షంగా మద్దతు పలకడం కష్టం. ఎందుకంటే అన్ని పార్టీల్లోనూ కాపు నేతలు ఉన్నారు. వారికి ప్రాధాన్యం లభిస్తోంది. అందరూ బయటకు వచ్చి తమ సామాజికవర్గానికే మద్దతు ఇవ్వాలని అడగలేరు. కాపులు కూడా ఒకే కులం కాదు.. కాపు, తెలగ, ఒంటరి, బలిజ రకాలుగా ఉన్నాయి. అందులోనూ రాజకీయం చిచ్చు పెడుతుంది. అందుకే.. కాపు నేతలు సమావేశాలు ..తమ వర్గానికి మెరుగైన అవకాశాల పొందేలా చేయడం.. అవకాశం వచ్చినప్పుడు సీఎం పీఠాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేయాలనే కోణంలోనే జరిగే అవకాశం ఉందనేది ఎక్కువ మంది చెప్పేమాట. అయితే ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. తెర పైకి పార్టీలు..తెర వెనుక కీలక వ్యక్తులు వచ్చే ఎన్నికలకు వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఇదే సమయంలో సామాజిక సమీకరణాలపైనా పార్టీలు ఫోకస్ పెట్టాయి.
ఇప్పుడు ఏపీలో కాపు నేతలు పార్టీలకు అతీతంగా ఏకం అవుతున్నారు. గత కొంత కాలంగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమ సమావేశాలు ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల వేళ పార్టీల్లో మార్పులు..కొత్తగా చేరికలతో కాపు నేతల తాజా సమావేశం రాజకీయంగా కీలకంగా మారుతోంది. తాజాగా ఏపీలోని కాపు నేతల వరుస సామవేశాలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. పార్టీలకు అతీతంగా కాపు నేతలు భేటీలు నిర్వహిస్తున్నారు. కొద్ది నెలల క్రితం కాపు నేతలు హైదరాబాద్ – విశాఖ కేంద్రంగా సమావేశం అయ్యారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా.. రాజకీయంగా ప్రాధాన్యత దక్కకుండా చూసుకోవాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లోనూ కాపులకు గుర్తింపు దక్కేలా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అయితే వీరి అడుగులు ఏ రాజకీయ పార్టీ వైపు అన్నది కూడా చర్చనీయాంశంగా మారుతోంది.
ఇంతకీ కాపు భేటీల వెనుక ఉద్దేశ్యమేమిటి..?
దీని ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఏవిధంగా ఉండనుందన్నదే చర్చనీయాంశమవుతోంది…
ఇదే సమయంలో ఇప్పుడు జనసేన చుట్టూ ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. జనసేన ప్రస్తుతం బీజేపీతో పొత్తుతో ఉన్నా..ఈ మైత్రి కొనసాగుతుందా….
లేక ప్రచారం సాగుతున్నట్లుగా టీడీపీతో జత కడుతుందా అనేది రాజకీయాలను మలుపు తిప్పే అంశంగా మారుతోంది. మెజార్టీ కాపు నేతలు జనసేన వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కేంద్రంగా కాపు నేతల సమావేశాలు కొనసాగుతున్నాయి. కాపు వర్గంలో బలమైన నేతగా గుర్తింపు ఉన్న గంటా..అటు మెగాస్టార్ చిరంజీవితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో ప్రజారాజ్యంలోనూ పని చేసారు. ఈ నెల 26న విశాఖలో కాపు నాడు సభకు నిర్ణయించారు. వంగవీటి రంగా వర్దంతి నాడు ఈ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్ ను గంటా విడుదల చేసారు. పోస్టర్ పైన రంగాతో పాటుగా చిరంజీవి – పవన్ బొమ్మలు ముద్రించారు. తాజాగా కన్నా లక్ష్మీనారాయణ తో నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. కన్నా జనసేనలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా విజయవాడలో గంటా నివాసంలో జరిగిన సమావేశంలో కన్నాతో పాటుగా టీడీపీ నేత బోండా ఉమ.. చీరాల నేత ఎడం బాలాజీ పాల్గొన్నారు. ఇది కాపు నేతల సమావేశంగా భావించాల్సిన అసవరం లేదని..కాపు నేతల సమావేశం అయితే మిగిలిన నేతలు పాల్గొనే వారని చెబుతున్నారు.
ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని చెప్పుకొచ్చారు. ఈ నెల 26న విశాఖ కేంద్రంగా జరిగే సభకు వంగవీటి రాధా కూడా హజరు కానున్నారని తెలుస్తోంది. ఈ సభ ద్వారా కాపు నేతలంతా తమ ఐక్యత చాటేందుకు సిద్దం అవుతున్నారు. వైసీపీ నేతలు మినహా మిగిలిన వారంతా ఈ సభకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ సభ పార్టీలకు అతీతంగా జరుగుతోంది. కానగతంలో ప్రజారాజ్యంలో పని చేసిన నేతలు..మెగా ఫ్యాన్స్ ఇప్పటికే జనసేనకు మద్దతు ప్రకటిస్తున్నారు. దీంతో..ఇప్పుడు కాపు నేతల సమావేశాలు భవిష్యత్ నిర్ణయాలపై అటు వైసీపీలో.. ఇటు టీడీపీలోనూ చర్చకు కారణమవుతున్నాయి.
పొత్తుల పైన ఈ భేటీలు ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో, ఈ సమావేశాల పై రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. కాపు నేతల ఐక్యతా రాగం వెనుక జనసేనకు మద్దతు ఇవ్వటమా, లేక కొత్త అజెండాతో ముందుకు వస్తారా అనేది స్పష్టత రావటం లేదు. రాజకీయ పరిస్థితులపైన చర్చలే కానీ, రాజకీయ నిర్ణయాలు లేవని కాపు నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారి తీస్తున్నాయి. మరి కాపుల దారెటు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.