సిక్కుల ఆధునిక సమాజానికి చాలా ఏళ్ల క్రితమే బాటలు పడ్డాయా..? ఖాల్సా సాయంతో కుల వ్యవస్థను రద్దు చేసిందెవరు..? గురునానక్ సిక్కుల మొదటి గురువుగా భావించడానికి గల కారణం ఏంటి..?
విలువలతో కూడిన ఆదర్శవంతమైన సమాజానికి గురునానక్ సిద్దాంతాలు బాటలు వేశాయా..? నిరంకుశ పాలకులపై గళమెత్తడం, ప్రతిఘటించడం కేవలం గురునానక్ కే సాధ్యమైందా..?

సిక్కుల ఆధునిక సమాజానికి 300 ఏళ్లకు ముందే బాటలు పడ్డాయి. ఖాల్సా సాయంతో ఇక్కడి కుల వ్యవస్థను గురు గోబింద్ సింగ్ రద్దు చేశారు.
15వ శతాబ్దంలో ప్రజలకు ప్రబోధాలను ఇచ్చేందుకు దేశంలోని భిన్న ప్రాంతాలకు గురునానక్ వెళ్లేవారు. వెళ్లిన ప్రతిచోటా నియమావళిని ప్రజలకు ఆయన పరిచయం చేశారు. ఈ యాత్రల్లోని నియావళిని ఆచరణలోకి తీసుకొచ్చేందుకు 1669లో ఖాల్సాను గురు గోబింద్ సింగ్ ఏర్పాటు చేశారు. సిక్కుల మొదటి గురువుగా గురునానక్ ను భావిస్తారు. ఆ తర్వాత వచ్చిన గురువులు కూడా ఆయన్ను గౌరవించారు.
సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సామరస్యం తదితర విలువలతో ఆదర్శవంతమైన సమాజానికి గురునానక్ సిద్ధాంతాలు బాటలు వేశాయి. తన జీవిత కాలంలో ఈ విలువలను నిష్ఠతో ఆయన పాటించేవారు. ఆ తర్వాత రెండు వందల ఏళ్లలో వచ్చిన గురువులు కూడా వీటిని ఆచరించారు.. గురునానక్ సిద్ధాంతాలనే సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్గా మలిచారు. దీనిలో ఇతర మతాల గురువుల ప్రబోధాలు, కీర్తనలు కూడా కనిపిస్తాయి.
15వ శతాబ్దం చివర్లో, 16వ శతాబ్దం మొదట్లోని నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా మాట్లాడటం అనేది చాలా ప్రమాదం. దోపిడీ, వివక్షలతో ఆనాడు వేళ్లూనుకున్న సామాజిక-ఆర్థిక వ్యవస్థలను ఎదురిస్తే ప్రాణాలను తీసేందుకు కూడా పాలకులు లెక్క చేసేవారు కాదు.
కానీ, అలాంటి పాలకులు, శక్తిమంతమైన వ్యవస్థలకు వ్యతిరేకంగా గురు నానక్ గళమెత్తారు. సమాజంలో కొత్త చర్చలకు ఆయన బాటలు పరిచారు. మరోవైపు అప్పటి సమాజానికి వ్యతిరేకంగా ప్రజల్లోని ప్రతిఘటన కూడా దీనికి తోడైంది.
సిక్కులలో కుల వ్యవస్థ నిర్మూలన..
అప్పటి పాలకులు తమని తాము దేవుడి ప్రతినిధులుగా చెప్పుకునేవారు. అటు దేవుడు, ఇటు పాలకులు ఇద్దరినీ ఎదురించే ధైర్యాన్ని ప్రజలు చేసేవారు కాదు. కానీ, అమాయకులపై బాబర్ అకృత్యాలను గురునానక్ ఎదురించారు. అభాగ్యులు, బలహీనులపై బలాన్ని ప్రయోగిస్తున్నారని బాబర్ను ఆయన హెచ్చరించారు.
నానక్ చూపించిన మార్గంలో ఆ తర్వాత తొమ్మిది మంది గురువులు నడిచారు. ఈ క్రమంలోనే సిక్కుల జీవన నియమావళి అనేది వ్యవస్థీకృతమైంది.
నిరంకుశ పాలకులపై గళమెత్తడం, ప్రతిఘటించడం లాంటివి నానక్ తర్వాత గురువులు, అనుచరుల జీవనక్రమంలో భాగమయ్యాయి. నేటికీ ఇలాంటి ప్రతిఘటన మనకు కనిపిస్తుంది. లక్షల మంది సిక్కు రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఏడాదికిపైగా దిల్లీ సరిహద్దుల్లో
నిరసనలు చేపట్టారు.
ఆనాటి మారుతున్న పరిస్థితుల నుంచి ఎదురయ్యే సవాళ్లను ప్రతిఘటించేందుకు గురు గోబింద్ సింగ్.. ఖాల్సాను ఏర్పాటుచేశారు. అమృత్ సంచార్ కూడా గురు గోబింద్ సింగ్ కొత్త ఆలోచనే.
నిజానికి ఖాల్సా అనేది రెండు వైపులా పదునైన కత్తి లాంటిది. విలువలు పతనమైన సమాజంలోని అణగారిన వర్గాలకు మొదట గౌరవప్రదమైన జీవితాన్ని ప్రసాదించాలి. మరోవైపు అకృత్యాలపై పోరాడేందుకు వారిని సిద్ధం చేయాలి.
గురు గోబింద్ సింగ్ సంస్కరణలకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. ముఖ్యంగా అణగారిన వర్గాల ప్రజలకు ఇవి మరింత చేరువయ్యాయి.
నిజానికి ఖాల్సాను 200 ఏళ్ల పాటు సిక్కు గురువులు చేసిన కృషికి ప్రతిఫలంగా చెప్పుకోవాలి. దీని సాయంతో సిక్కుల ప్రతిఘటనను గురు గోబింద్ సింగ్ పతకాస్థాయికి తీసుకెళ్లారు. పాకిస్తాన్ లోని సిలాకోట్కు చెందిన దయా రామ్, ఖత్రి; ద్వారకకు చెందిన రజకుడు మొహ్క్రమ్ చంద్, బీదర్కు చెందిన క్షురకుడు సాహిబ్ చంద్, హస్తినాపుర్కు చెందిన జాట్ ధరమ్ దాస్, జగన్నాథ్ పురీకి చెందిన వంట నిపుణుడు హిమ్మత్ చంద్ లాంటి వారితో గురు గోబింద్ సింగ్ నేరుగా ఖాల్సా ప్రమాణాలు చేయించారు. వీరిని గురుకు ప్రీతిపాత్రమైన పంజ్ పియారస్గా పిలుస్తారు.
వర్గాల పేరుతో చీలిపోయిన సమాజంలో ఖాల్సాతో సమానత్వం, సామాజిక ఐకమత్యం మళ్లీ వేళ్లూనుకుంది. ఖాల్సా లక్ష్యం కూడా అణగారిన వర్గాలపై వివక్ష, దోపిడీని పూర్తిగా తొలగించడమే.

కుల వ్యవస్థ, చెడు సంప్రదాయాలు, మూఢ నమ్మకాలను గురు గోబింద్ సింగ్ రూపుమాపారు.
నిజానికి ఇది అప్పటి వివక్ష పూరిత సమాజంపై చెంప పెట్టులాంటిది. సమాజంలో విప్లవాత్మక మార్పులకు ఖాల్సాను ఒక పునాదిగా చెప్పుకోవాలి. దీని ద్వారా ప్రజల్లో కొత్త ఆలోచనలు, కొత్త సమాజిక బంధాలు, గౌరవం లాంటివి పురుడుపోసుకున్నాయి. అందరూ దేవుడి సృష్టే అనే భావన ప్రజల్లోకి ఇది తీసుకెళ్లింది.
గురు-శిష్యుల మధ్య సంబంధాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లేందుకు అమృత్ అంటే ఖాల్సా ప్రమాణాలను గురు గోబింద్ సింగ్ చేయించేవారు. మరోవైపు ఆయన కూడా ఖాల్సాలో భాగమని ప్రకటించారు. పంజ్ పియారస్ చేతుల మీదుగా ఆయన ఖాల్సాలో చేరారు.
దీని ద్వారా అంతిమ అధికారం పంజ్ పియారస్ చేతుల్లోనే ఉంటుందనే సందేశాన్ని ఆయన ప్రజలకు ఇచ్చారు. ప్రమాణాలు తీసుకున్న తర్వాత ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆదర్శవంతమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థకు ఇది బాటలు పరుస్తుందని గురు చెప్పారు.
కుటుంబం, జాతి, మతం, వృత్తి లాంటి బంధాలను తెంచుకున్న పంజ్ పియారస్కు గురు గోబింద్ సింగ్ ఇచ్చిన సందేశంలో అద్వితీయ సమానత్వం కనిపిస్తుంది. సమాజంలో పడిపోయిన మానవ విలువలకు మళ్లీ జీవం పోయాలని ఆయన చెప్పారు. ఇక్కడ అందరికీ సింగ్ అనే ఒక పేరు ఇస్తారు. అంటే దేవుడిపై నమ్మకం ఉంచడం. సమాజంలో భిన్న వర్గాల మధ్య సమానత్వం నెలకొల్పడమే దీని లక్ష్యం.
కొన్ని హిందూ వర్గాల్లో ఆనాడు వేళ్లూనుకున్న మూఢ నమ్మకాలు, అపోహలను పారద్రోలి అందరినీ ఒకే గొడుగు కిందకు గురు గోబింద్ సింగ్ తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇక్కడ ఐదు కేలు.. కేశ్, కంఘా , కారా , కచేర , కిరప్పన్ లకు నిబద్ధులుగా ఉండేలా, ఇవి నిరంతరం తమ కర్తవ్యాన్ని గుర్తు చేస్తాయని ఆయన ప్రబోధించారు. మరోవైపు శారీరకంగానూ దృఢంగా ఉండాలని గురు గోబింద్ సింగ్ సూచించారు.
గురు బోధనల సారాంశం ఏమిటంటే.. సిక్కు అనుచరులు హిందువులు, ముస్లింల మధ్య వంతెనలా మారాలి. అదే సమయంలో కులం, వర్ణం, వర్గ బేధాలు లేకుండా అణగారిన వర్గాలకు సేవ చేయాలి. ఖాల్సాలో చేరే సిక్కులు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, పేదలకు వారు అండగా నిలబడాలి.
సమాజంలో విప్లవాత్మక మార్పులకు ఖాల్సాను ఒక పునాదిగా చెప్పుకోవాలి.
ఖాల్సా గురించి ఒక మాటలో చెప్పాలంటే కులాల నుంచి విముక్తి కల్పించే వ్యవస్థ ఇది. ఖాల్సాలో మనకు మూడు ముఖ్యమైన అంశాలు కనిపిస్తాయి. వీటిలో మొదటిది శారీరకంగా దృఢంగా ఉండటం, రెండోది మానసికంగా అప్రమత్తంగా ఉండటం, మూడోది ఆధ్యాత్మికంగా గురువుకు దగ్గర కావడం. ఖాల్సాలో మనకు బృంద స్ఫూర్తి కనిపిస్తుంది. సమాజ సేవ చేసేందుకు ఇక్కడ ఖాల్సా అనుచరులు కలిసి పనిచేస్తారు.
పాలకుల అణచివేత, నిరంకుశత్వాలపై పోరాడేందుకు ఖాల్సా కట్టుబడి ఉంటుంది. భారత్లో స్వాతంత్ర్యానికి ముందు, ఆ తర్వాత ఇలా ఖాల్సా పోరాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఖాల్సా అనుచరులు పోరాటంలో ప్రాణాలు అర్పించేందుకు కూడా వెనుకాడరు. ఖాల్సాలో ఎక్కువగా వినిపించే రాజ్ కరేగా ఖాల్సా అనే పదం గురించి మనం చెప్పుకోవాలి. దీనికి అర్థం పరిశుద్ధులు మాత్రమే పాలించాలి.
నేటి ఆధునిక సమాజానికి ఇది సరిగ్గా సరిపోతుంది. అంటే నిజాయితీపరులు, నైతిక విలువలు కలవారే ప్రజలను పాలించాలనే సూత్రానికి ఇది అద్దం పడుతోందని చెప్పవచ్చును. కుల వ్యవస్థ, చెడు సంప్రదాయాలు, మూఢ నమ్మకాలను గురు గోబింద్ సింగ్ రూపుమాపారు. నిజానికి ఇది అప్పటి వివక్ష పూరిత సమాజంపై చెంప పెట్టులాంటిది.
ఇది చదవండి :- అఫ్గాన్ మహిళల విద్యపై నిషేధం విధించిన తాలిబన్లు..!