Homeతెలంగాణతెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు .. చర్చనీయాంశంగా అవుతున్నాయా..?

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు .. చర్చనీయాంశంగా అవుతున్నాయా..?

తెలంగాణలో ఒక ఉపాధ్యాయ, మరో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజయింది. కానీ త్వరలో ఎమ్మెల్యే, గవర్నర్ కోటాలో మరో ఐదు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కనున్నాయి. వీటికోసం పార్టీలో చాలా మంది ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు. వచ్చేది ఎన్నికల కాలం కావడంతో టిక్కెట్ ఇవ్వలేని. పార్టీ వదులుకోలేని నేతలకు చాన్స్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో తమకు అవకాశం కల్పించాలంటూ.. కేసీఆర్ పై ఒత్తిడి పెంచుతున్న సీనియర్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వి. గంగాధర్‌గౌడ్‌, ఎలిమినేటి కృష్ణారెడ్డి, నవీన్‌కుమార్‌ ల పదవీకాలం మార్చి 29తో ముగుస్తుంది.

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నియామకమై డి. రాజేశ్వర్‌రావు, ఫరూక్‌ హుస్సేన్‌ పదవీ కాలం మే నెల 27న ముగుస్తోంది. అయితే ఈ ఐదింటికి ఎన్నికల కమిషన్‌ ఇంకా షెడ్యూల్‌ ఇవ్వలేదు. ఎమ్మెల్యే కోటా, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవులు నేరుగా రాజకీయ నియామకాలు కావడంతో ఎన్నికల ఏడాదిలో ఈ
పదవులను ఆశిస్తున్న పార్టీ నేతలు బీఆర్‌ఎస్‌ పెద్దల దగ్గర ఇప్పటికే తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే మెజారిటీ టికెట్లని అధినేత కేసీఆర్‌ ఇప్పటికే సంకేతాలివ్వడంతో ఈసారి టికెట్‌ ఆశిస్తున్న ఇతర నేతలు ముందుగా ఎమ్మెల్సీ పదవి చేజిక్కించుకుని తర్వాత టికెట్‌ల కోసం ప్రయత్నించవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఎమ్మెల్యే ఎమ్మెల్యే, గవర్నర్‌ కోటాల్లో ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్నవారిలో కొందరికి పదవి దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతుండడంతో పదవులు ఆశిస్తున్నవారి సంఖ్య పెరుగుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటును గతంలో ఇచ్చినట్లుగానే ఈసారి కూడా ఎంఐఎంకు ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ సీటు విషయంపై అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ ను కలిసి చర్చించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో దాదాపు సమానంగా కార్పొరేటర్‌ సీట్లు గెలిచినప్పటికీ మేయర్‌ పదవికి మజ్లిస్ పోటీ పడలేదు.

MLC elections for Telangana

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 127 ఓట్లుండగా సింహభాగం ఓట్లు బీఆర్‌ఎస్‌, ఎంఐఎంలకు చెందినవే. అసెంబ్లీలో కేటీఆర్, అక్బరుద్దీన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సమయంలో వచ్చే ఎన్నికల్లో తాము యాభై స్థానాల్లో పోటీ చేస్తామని సవాల్ చేశారు. అయితే అది వాగ్వాదం మాత్రమేనని రాజకీయంగా రెండు పార్టీల మధ్య కోపరేషన్ ఉంటుందని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నిరూపించాలని ఈ రెండు పార్టీల ముఖ్య నేతలు అనుకుంటున్నారు.

ఎన్నికల ఏడాది కావడంతో ప్రతి పదవిని ఆచితూచి అన్ని సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని భర్తీ చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఎమ్మెల్సీ పదవుల పందేరం బీఆర్‌ఎస్‌లో రసవత్తరంగా మారింది. కేసీఆర్ ఈ ఐదు ఎమ్మెల్సీ సీట్లతో వీలైనంత వరకూ సీనియర్ నేతల అసమ్మతిని తగ్గించేందుకు ఉపయోగించుకుంటారని చెబుతున్నారు. ఖమ్మం లాంటి చోట్ల కొంత మందికి సీట్లను సర్దుబాటు చేయడం కష్టంగా ఉంది. అలాంటి చోట.. ఎవరో ఒకర్ని ఒప్పించి.. ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల కాలపరిమితి మార్చినెలాఖరుకే ముగియనుండటంతో.. వచ్చే నెల ప్రారంభంలోనే షెడ్యూల్ రావొచ్చని అంచనా వేస్తున్నారు. గవర్నర్‌ కోటాలో మైనారిటీ వర్గానికి చెందిన రాజేశ్వర్, ఫారూక్‌ హుస్సేన్‌ పదవీ విరమణ చేయనుండగా, ఈ ఇద్దరిలో ఒకరికి మళ్లీ కేసీఆర్‌ అవకాశమిచ్చే సూచనలు ఉన్నాయి. సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడైన కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్‌కు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుందని పార్టీ వర్గాల్లో
ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్యే కోటాలో నవీన్‌కుమార్‌కు రెండో పర్యాయం దక్కనుండగా వి.గంగాధర్‌ గౌడ్‌ స్థానంలో కొత్తవారిని అదృష్టం వరించే అవకాశముంది. గతంలో బీజేపీలోకి వెళ్లి సొంతగూటికి తిరిగి వచ్చిన మండలి మాజీ చైర్మన్‌ వి.స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌ పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశముంది. రెడ్డి సామాజికవర్గం నుంచి కూడా ఒకరికి కేసీఆర్‌ అవకాశమిస్తారని సమాచారం. అయితే ఎన్నికల ఏడాది కావడంలో పదవి కోసం నేతలు తీవ్రంగప్రయత్నించడం..

ఆ పదవి దక్కని వాళ్లు పార్టీ మారడం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు పదవి రాని నేతలను ఆకర్షించేందుకు విపక్ష బీజేపీ , కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నాయి. అందులోనూ తెలంగాణలో బలపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ.. బీఆర్ఎస్ నేతలపై ఎక్కువగా ఫోకస్ చేసింది. దీంతో వచ్చే ఏడాది ఖాళీ కానున్న ఎమ్మెల్సీ సీట్లను భర్తీ చేయడం కేసీఆర్‌కు సవాల్‌గా మారనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో సత్తాచాటి తమ బలమేంటో చూపించాలని అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.

MLC ELECTIONS 2023

ఈ రెండు స్థానాలుకు 2017లో ఎన్నికలు జరగ్గా.. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థి సయ్యద్ అమీనుల్ హసద్ జాఫ్రీకి, మహబాబ్ నగర్ – రంగారెడ్డి – హైద్రాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికిగానూ పీఆర్టీయూ- టీఎస్ అభ్యర్థి కాటేపల్లి జనార్దన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఈసారి కూడా మజ్లి్స్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఉపాధ్యాయ నియోజవర్గానికి అభ్యర్థిని నిలిపే అవకాశం ఉన్నప్పటికీ గతంలో అనుసరించిన రాజకీయ విధానాన్నే అనుసరించాలని బీఆర్ఎస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా అధికారికంగా మారిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఇవే. దీంతో బీఆర్ఎస్ తప్పకుండా పోటీ చేస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే పాత స్ట్రాటజీనే అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా, ఎంఐఎం ఎవరిని నిలబెట్టినా బీఆర్ఎస్
మద్దతు తెలిపే అవకాశం ఉన్నది. అయితే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో పీఆర్టీయూ-టీఎస్‌కే మద్దతు ఇచ్చినా.. అభ్యర్థిని మార్చాలని కోరే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. పీఆర్టీయూ అభ్యర్థి పట్ల సీఎం కేసీఆర్ పలు సూచనలు చేయవచ్చని సమాచారం.

బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అధికారిక ప్రకటన చేయనప్పటికీ, గత ఏడాది డిసెంబర్ లో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా రీబ్రాండ్ చేసిన తరువాత రాష్ట్రంలో ఇదే మొదటి ఎన్నికలు కావడంతో పోటీ చేయడానికి అధికార పార్టీ నాయకత్వం సుముఖంగా లేకపోవడం కలకలం రేపింది. ఈ నిర్ణయానికి గల కారణాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే, తెలంగాణలో 2, ఏపీలో 13 ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది.

తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీతో పాటు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 16న నోటిఫికేషన్ జారీ చేయనుండగా.. 23వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పించారు. మార్చి 13న పోలింగ్ జరగనుంది. 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అయితే ఈ ఎన్నికలపై బీఆర్ఎస్ వ్యూహం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. ఈ విషయంలో సైలెంట్ కావడం వెనుక ఏముందోనన్న చర్చ పార్టీ వర్గాల్లో వెల్లువెత్తుతోంది.

Must Read

spot_img