తమ ఎమ్మెల్యేలను మారిస్తేనే గెలుపు సాధ్యమంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాటల తూటాలు పేల్చారు. ఆ వ్యాఖ్యలతో అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ తెప్పించారు. ఇంతకీ .. అసలు మంత్రి మాటల వెనుక మర్మమేమిటి అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందట..
రాజకీయాల్లో అపజయం ఎరుగని నాయకునిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంచి పేరుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా విజయం తన సొంతం చేసుకుంటున్నారు. ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రబెల్లి, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన రాజకీయ బలాన్ని చాటుకున్నారు.
జన హృదయనేతగా గుర్తింపు పొందిన ఎర్రబెల్లిని టీఆర్ఎస్ లోకి సీఎం కేసిఆర్ ఆహ్వానించి మంత్రి పదవి కట్టబెట్టారు. అప్పటినుండి ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కారుపార్టీ కీలక నేతగా మారారు. ఓరుగల్లు పాలిటిక్స్ అంటేనే ఆయన తర్వాతే ఎవరైనా అన్నట్లుగా గుర్తింపు తెచ్చుకున్నారంటేనే, ఆయన సత్తా ఏపాటిదో అర్థమవుతోంది. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన నేతగా ఎర్రబెల్లికి గుర్తింపు ఉంది.
పోలిటికల్ గా ఎంతో అనుభవం ఉన్న ఆయనకు సీఎం కేసీఆర్ కూడా విలువ ఇస్తారని పార్టీలో చెప్పుకుంటున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా 20మంది సిట్టింగ్ లను మార్చితే 100 సీట్లు గ్యారంటీ అంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటి వరకు తన సర్వేలు తప్పు కాలేదంటూ ఆయన ప్రకటించడంపై పెద్ద దుమారమే లేచింది.
సీఎం కేసీఆరే ఎర్రబెల్లితో సర్వే చేయించారా, లేక ఆయనే సొంతంగా సర్వే చేయించారా అన్న సందేహాలు పక్కన పెడితే, అసలు ఈ వ్యాఖ్యపైనే సర్వత్రా చర్చోపచర్చలు సాగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఎవరా 20 మంది ఎమ్మెల్యేలు అన్న చర్చ… రచ్చ రచ్చ అవుతోంది. అయితే అధిష్ఠానం సూచన మేరకే ఎర్రబెల్లి దయాకర్ రావు అలా మాట్లాడి ఉంటారన్న ప్రచారం కూడా పొలిటికల్ సర్కిల్స్ లో ఓ రేంజ్ లో నడుస్తోంది.
ఓవైపు సీఎం కేసీఆర్ సిట్టింగులకే సీట్లు ఇస్తామంటూ ప్రకటించారు. ప్రజల్లో వారికున్న వ్యతిరేకతను గుర్తించిన సీఎం కేసీఆర్ సైతం ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు పని తీరును మార్చుకోవాలంటూ దిశా నిర్దేశం చేశారు. ఆయన సూచనలతో పార్టీ కార్యాలయాలను వీడిన ఎమ్మెల్యేలు గ్రౌండ్ లెవల్ లో తిరుగుతూ పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకుపోతూ ప్రతిష్ఠ కోసం పాటుపడుతున్నారు.
ఈ తరుణంలో మంత్రి ఎర్రబెల్లి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆయన వ్యాఖ్యల వెనుక ఏముందోనన్న చర్చ సొంత పార్టీ నేతల్లోనే కాక రాజకీయ వర్గాల్లో కూడా వెల్లువెత్తుతోంది.
- ఎర్రబెల్లి వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్ లో కాక రేపుతున్నాయి..
ఏ ఇద్దరు నేతలు కలిసినా, ఇదే చర్చ నట. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేల పనితీరుపై ఎర్రబెల్లి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వారు మళ్లీ వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదని ఆయన అంచనా వేశారన్న ప్రచారం సాగుతోంది. అందుకే అలాంటి వారిని మార్చేయాలని సీఎం కేసీఆర్ కు ఎర్రబెల్లి సూచన చేసినట్లు సమాచారం. అయితే ఆయా స్థానాల్లో ప్రత్యామ్నాయ అభ్యర్థుల పేర్లను కూడా ఆయన సూచించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇంతకూ ఎర్రబెల్లి అసంతృప్తిగా ఉన్న సదరు ఎమ్మెల్యేలు ఎవరన్న దానిపై ఓరుగల్లు పాలిటిక్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు రిజర్వ్ ఎమ్మెల్యే లతో పాటు ఒక బీసీ, ఓ ఓసీ వర్గ ఎమ్మెల్యేలపై ఎర్రబెల్లి గుస్సాగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వారిని మార్చకపోతే బీఆర్ఎస్ కు నష్టం వాటిల్లుతుందని ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళారట. అయితే ఒకవేళ ఎర్రబెల్లి చెప్పినట్లు అయా స్థానాల్లో కొత్తవారికి అవకాశం ఇస్తారాలేక అందులో కొందరిని మార్చతారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోందట.
మరోవైపు ఈ ఊహాగానాలపై రాజకీయ విశ్లేషకులు మాత్రం నిప్పు లేనిదే పొగ రాదు అన్న సామెతను గుర్తు చేస్తుండగా సొంత పార్టీ నాయకుల మాత్రం అంతా ఉట్టిదేనంటూ కొట్టిపడేస్తున్నారు. అయితే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు సిట్టింగుల్లో గుబులు రేపితే, ఆశావహుల్లో మాత్రం ఆశలు రేకెత్తిస్తున్నాయి. సిట్టింగులను పక్కనపెడితే తమకే టికెట్ వస్తుందన్న ఆనందంలో ఉన్నారు కొందరు ఆశావాహులు. అయితే ఈ నలుగురిని దృష్టిలో పెట్టుకుని ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు .. 20 స్థానాలపై ఆశలు పెట్టుకున్న ఆశావహులకు కొత్త ఆశల్ని కల్పిస్తున్నాయి. పార్టీని నమ్ముకొని ఉన్నందుకు రానున్న రోజుల్లో మంచే జరుగుతుందన్న నమ్మకంతో ఉన్నారట మరికొందరు నాయకులు.
అయితే వారి అశలు నెరవేరుతాయా లేదా అన్నది సీఎం కెసిఆర్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఎర్రబెల్లి దయాకర్ రావు కేవలం 20 మందిని ఉద్దేశించి మాట్లాడలేదని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎదురీత తప్పదంటున్నారు. అధికార పార్టీ బీఆర్ఎస్ పై ప్రజలకు నమ్మకం పోయిందంటూ ప్రచారం చేస్తున్నారు. వీరి ప్రచారంతోనూ ఎర్రబెల్లి వ్యాఖ్యలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాక రేపుతున్నాయట.
ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు అలానే ఉంది.. రాహుల్ గాంధీ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వ వైభవం వచ్చిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. జోడో యాత్రకు మద్ధతుగా హాత్ సే హాత్ పేరిట రేవంత్ పాదయాత్ర పూర్తయితే పరిస్థితులు పూర్తిగా తమకు అనుకూలంగా మారుతాయని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. పార్టీ పుంజుకుంటే, బీఆర్ఎస్ లో టిక్కెట్ రాని నేతలు .. తమ పార్టీలోకే జంప్ అవుతారన్నది కాంగ్రెస్ నేతల అంచనా.
ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో తమ సర్వే లో నాలుగు సీట్లు కాంగ్రెస్ పరం కానున్నాయని, ఆ సీట్లలో అభ్యర్థుల్ని మార్చాలని ఎర్రబెల్లి వ్యూహం పన్నుతున్నారని సమాచారం. కేవలం ఆ నలుగురినే మార్చాలంటే, తనపై అసంతృప్తి తలెత్తుతుందేమోననే ఎర్రబెల్లి 20 సీట్లని వ్యాఖ్యానిస్తున్నారన్న చర్చ హాట్ టాపిక్ గా మారుతోంది. మరోవైపు ఈ సీట్ల మార్పు వెనుక .. ఎర్రబెల్లి వ్యక్తిగత వ్యూహం కూడా ఉందన్న టాక్ .. జిల్లావ్యాప్తంగా కూడా వెల్లువెత్తుతోంది. అయితే అవే స్థానాలో .. ఎర్రబెల్లి చెప్పకపోవడంతో, ఎవరా నలుగురు అన్నదీ చాప కింద నీరులా చర్చ జరుగుతోంది.
అదే సమయంలో వీరెవ్వరన్నదిహైకమాండ్వెల్లడించకుండా, తానే వెల్లడిస్తే, వీరి వ్యతిరేకతను, అధిష్టానం ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందన్న యోచనతోనే ఎర్రబెల్లి ఈ విధంగా వ్యాఖ్యానించారా అన్న చర్చ కూడా వినిపిస్తోంది. ఈ రచ్చ ఇలా సాగుతుంటే, విపక్షాలు మాత్రం ఆ .. సీట్లు ఏమిటన్నదానిపై కన్నేస్తున్నాయి.
ఆయా స్థానాల్లోని సిట్టింగ్ లను తమ పార్టీలోకి తెచ్చుకోవాలని ఓ పార్టీ యోచిస్తుంటే, మరో పార్టీ మాత్రం ఆ స్థానాల్లో గట్టి అభ్యర్థుల్ని నిలపాలని పావులు కదుపుతోందని తెలుస్తోంది.
ఏదేమైనా ఎర్రబెల్లి వ్యాఖ్యలు .. సొంత పార్టీ నేతల్లో గుబులు తెస్తే, విపక్షాల్లో మాత్రం కొ్త్త ఆశల్ని రేకెత్తిస్తున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో మంత్రి మాటల వెనుక మర్మం ఏంటి ? బీఆర్ఎస్ పై ఉన్నవ్యతిరేకతను మంత్రి ఎర్రబెల్లి చెప్పకనే చెప్పారా? అధికార పార్టీ సర్వేలోని అంశాలను బయటపెట్టారా అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారో గానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రం ఏం జరగనుందోనని టెన్షన్ పడుతున్నారట. ఒకవేళ ఎర్రబెల్లి గనుక టిక్కెట్ రాకుండా చేయగలిగితే, నెక్ట్స్ ఏం చేయాలోనని వీరంతా తర్జనభర్జనలు పడుతున్నారట.