దేశంలో అలజడులకు కారణమవుతోన్న ఉగ్ర సంస్థలపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పీఎఫ్ఐపై నిషేధం
విధించిన కేంద్రం .. తాజాగా మరో సంస్థను బ్యాన్ చేసింది.

ది రెసిస్టెన్స్ ఆఫ్ ఇండియా .. ఈ సంస్థ పేరులో ఇండియా ఉన్నా .. ఆ భావాలు మాత్రం లేవన్నది కేంద్ర ఆరోపణ.. లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు కొమ్ము కాస్తోన్న టీఆర్ఎఫ్ పైనా బ్యాన్ ముద్ర వేసింది.
దేశంలో ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న సంస్థలపై, ఉగ్రవాదం కార్యకలాపాలను కొనసాగిస్తున్న సంస్థలపై కేంద్ర ఉక్కు పాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఉగ్రవాదాన్ని లేకుండా చేయాలని, ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదాన్ని అణచి వేయడానికి కలిసికట్టుగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే అనేక మార్లు చెప్పిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే దేశంలో ఉగ్రవాద మూలాలు ఉన్న సంస్థలపై, ఉగ్రవాదులకు ఆర్థిక వనరులను అందిస్తున్న సంస్థలపై, కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలపై ఉక్కు పాదం మోపుతున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను దాని అనుబంధ సంస్థలను చట్టవిరుద్ధమైన సంస్థలని కేంద్రం ప్రకటించి, ఐదేళ్ల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే.
వారు ఉగ్రవాద చర్యలకు ఊతమిస్తున్నారు అన్న కారణంతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యాలయాలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాడులు నిర్వహించి పలువురిని అరెస్ట్ చేయగా, కేంద్ర ప్రభుత్వం ఆ పై పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పై అయిదేళ్ల పాటు నిషేధం విధించి వేటు వేసింది. ఇక తాజాగా పాక్ ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
1967 చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం ప్రకారం పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా యొక్క శాఖ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిషేధించింది. ఈ సంస్థ 2019లో ఉనికిలోకి వచ్చింది. ఇది కాశ్మీర్ లోయలో కాశ్మీరీ పండిట్ లు, వలస కార్మికులతో సహా, భద్రతా దళాలు, పౌరులపై దాడులు చేయడంలో కీలకంగా వ్యవహరించిందని పేర్కొంది. ఆన్లైన్ ద్వారా యువతని రిక్రూట్ చేస్తోందని, ఉగ్రవాద కార్యకలాపాలను పెంపొందించడానికి పనిచేస్తోందని కేంద్రం తెలిపింది.
పాకిస్తాన్ నుండి జమ్మూ కాశ్మీర్ లోకి ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు ఉగ్రవాదులకు కావాల్సిన సహకారాన్ని అందిస్తుందని కేంద్రం
పేర్కొంది. అంతేకాదు జమ్మూ కాశ్మీర్లో అమాయక పౌరుల హత్యలకు, భద్రతా సిబ్బందిని హతమార్చడానికి ప్లాన్ చేసినందుకు అనేకమంది టీఆర్ఎఫ్ సభ్యులపై పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా యువతను ఉగ్రవాద కార్యకలాపాలకు ఆకర్షిస్తుందని, ఉగ్రవాద సంస్థల లో చేరడానికి ప్రేరేపిస్తుంది అని పేర్కొంది.
టిఆర్ఎఫ్ కార్యకలాపాలు జాతీయ భద్రతకు, సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించేలా ఉన్నాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే నిషేధం విధించింది. ఇలాంటి సంస్థల ఏరివేతకు కేంద్రం ఎన్ఐఏ ని రంగంలోకి దింపి మరీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఉపా చట్టం కింద ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ‘ ను ఉగ్రవాద సంస్థగా కేంద్రం ప్రకటించింది.
రెసిస్టెన్స్ ఫ్రంట్ కమాండర్ షేక్ సజ్జద్ గుల్ను కూడా ఉగ్రవాదిగా ప్రకటించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. జమ్ముకాశ్మీర్ పౌరులు, భద్రతా బలగాలపై దాడులు చేశారంటూ రిసెస్టిన్సె సంస్థకి చెందిన సభ్యులపై పలు కేసులు నమోదైనట్లు పేర్కొంది.
అలాగే నిషేధిత ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలు అందిస్తున్నట్లు తేలిందని పేర్కొంది. ఆన్లైన్ ద్వారా యువతను ఉగ్రవాదులుగా నియమించుకుంటుందని, ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు సహాయం అందిస్తోందని తెలిపింది. పాకిస్థాన్ నుండి జమ్ముకాశ్మీర్లోకి డ్రగ్స్, ఆయుధాలు అక్రమ రవాణా చేస్తోందని కేంద్రం పేర్కొంది. లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ పరోక్ష సంస్థగా రెసిస్టెన్స్ ఫ్రంట్ 2019లో వెలుగులోకి వచ్చింది. జమ్ముకాశ్మీర్లో ఐదుగురు పౌరుల హత్యకు తాము బాధ్యత వహిస్తున్నట్లు 2021లో ప్రకటించింది.
పీఎఫ్ఐ “రహస్య ఎజెండా..
ఇదిలా ఉంటే, 2022లో కశ్మీర్లో మొత్తం 93 ఎన్కౌంటర్లు జరిగినట్లు పోలీసులు చెప్పారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)/లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కు చెందిన 108 మంది ఉగ్రవాదులు, జైషే మహ్మద్ (జేఎం)కు చెందిన 35 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని అన్నారు. 2022లో 74 మంది లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఉగ్ర సంస్థలో చేరారని, వారిలో 18 మంది ఇంకా క్రియాశీలంగా ఉన్నారని ఏడీజీపీ కుమార్ తెలిపారు.

2022లో 100 మంది కొత్తగా ఉగ్రవాద సంస్థల్లో చేరారని, అంతకుముందు ఏడాది కన్నా ఇది 37 శాతం తక్కువని చెప్పారు. లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రరిస్టుల్లో 17 మందిని అరెస్టు చేయగా, 65 మంది హతమయ్యారని, 18 మంది ఇంకా క్రియాశీలంగా ఉన్నారని చెప్పారు. ఈ ఏడాదిలో ఉగ్రవాదుల నుంచి 360 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని, ఇందులో 121 చెప్పారు.
ఐఈడీలు, బాంబులు, గ్రెనేడ్లు స్వాధీనం చేసుకోవడం వల్ల భారీ ఉగ్ర కుట్రల్ని నివారించగలిగామని చెప్పారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 29 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని వారిలో ముగ్గురు కశ్మీర్ పండిట్లు ఉన్నారని తెలిపారు. కొద్దిరోజుల క్రితం కేంద్రం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) దాని అనుబంధ సంస్థలు ‘చట్టవిరుద్ధమైన సంస్థలు’ అని ప్రకటించింది.
చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద పీఎఫ్ఐపై అయిదేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. పీఎఫ్ఐ “రహస్య ఎజెండాను అమలుచేస్తూ ఒక వర్గాన్ని ప్రభావితం చేస్తోందని” ఈ నోటీసులో పేర్కొంది.
“పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలు లేదా సంబంధిత సంస్థలు సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్థలుగా పనిచేస్తాయి. అవి ఒక రహస్య ఎజెండాను అమలుచేస్తూ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి. ఇది దేశ సమైక్యతకు, సార్వభౌమాధికారానికి, భద్రతకు ముప్పు కలిగిస్తుంది. ప్రజా శాంతికి, సామరస్యానికి ఆంటకం కలిగిస్తుంది. దేశంలో ఉగ్రవాద చర్యలకు ఊతమిస్తుంది” అని నోటిఫికేషన్లో రాసినట్లు ఏఎన్ఐ తెలిపింది.
పీఎఫ్ఐకి ఉగ్రవాద సంస్థ ‘జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్’తో కూడా సంబంధాలు ఉన్నాయి. పీఎఫ్ఐ వ్యవస్థాపక సభ్యులలో కొందరు ‘స్టూడెంట్స్
ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా’ (సిమి) నాయకులుగా ఉన్నారు. ఈ రెండూ నిషేధిత సంస్థలు” అని పేర్కొంది. నిషేధిత రాడికల్ ఇస్లామిస్ట్
సంస్థ ‘స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా’ (సిమి)కి పీఎఫ్ఐ మరో రూపమని ఆ సంస్థ ఏర్పడినప్పటి నుంచి ఆరోపణలు ఉన్నాయి.
‘ఉగ్రవాద సంస్థ’గా ప్రకటించి, భారత ప్రభుత్వం నిషేధించిన సంస్థలలో ‘సిమి’ ఒకటి. 2001లో దీనిని ప్రభుత్వం నిషేధించింది. ఇస్లామిక్ తీవ్రవాద
సంస్థ ‘ఇండియన్ ముజాహిదీన్’తో సిమికి సంబంధాలు ఉన్నట్లు కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నదంటూ అప్పట్లో ఇండియన్ ముజాహిదీన్పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది.
ప్రభుత్వం సిమిని నిషేధించినందున, దాని స్థానంలో ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ను స్థాపించారని, అందుకే చాలామంది సిమి కార్యకర్తలు ఇందులో సభ్యులుగా ఉన్నారని కేంద్రం పేర్కొంది. ఇప్పుడు టీఆర్ఎఫ్ పైనా ఇటువంటి ఆరోపణలే వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై ఇంకా విస్తృత విచారణ జరగాల్సి ఉందని తెలుస్తోంది.
పీఎఫ్ఐ తరహాలో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తో్న్న టీఆర్ఎఫ్ పై కేంద్రం బ్యాన్ విధించడం చర్చనీయాంశంగా మారింది.