ప్రముఖ బాలీవుడ్ హీరోహీరోయిన్లు సిద్ధార్థ్ మల్హోత్రా , కియారా అద్వానీ పెళ్లి చేసుకున్నారు. వివాహ బంధంతో ఈ ప్రేమికులు ఇద్దరూ ఒక్కటయ్యారు. రాజస్థాన్లోని సూర్యగఢ్ ప్యాలస్లో మంగళవారం సాయంత్రం కియారా, సిద్ధార్థ్ల వివాహ వేడుక ఘనంగా జరిగింది. అయితే, ఈ వివాహ వేడుకను చాలా ప్రైవేట్గా జరుపుకున్నారు. లోపల నుంచి ఒక్క ఫొటోను కూడా బయటికి రానివ్వలేదు. తాజాగా పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది కియార అద్వానీ.

బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్ర.. కియారా అద్వానీ పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యారు. కుటుంబ సభ్యులు మరియు ప్రముఖుల సమక్షంలో ఈ జంట ఏకం అయ్యింది. గత నెల రోజులుగా వీరి పెళ్లి గురించి జాతీయ మీడియా నుండి లోకల్ మీడియా వరకు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. వీరి పెళ్లికి రాజస్థాన్ లోని జైసల్మేర్ సూర్యగఢ్ ప్యాలెస్ వేదిక అయ్యింది. గత మూడు రోజులుగా పెళ్ళి వేడుక కొనసాగుతోంది. బాలీవుడ్ ప్రముఖులతో పాటు ఎంతో మంది సెలబ్రెటీలు కూడా ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. సినీ ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖులను రిసీవ్ చేసుకోవడం కోసం ఏకంగా 70 లగ్జరీ కార్లను వివాహ నిర్వాహకులు ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.
ఇక మంగళవారం రాత్రి కియారా అద్వానీ ట్విట్టర్ ద్వారా తమ పెళ్లి ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడు మా పర్మినెంట్ బుకింగ్ పూర్తయ్యిందని ఫొటోలకు కియారా అద్వానీ క్యాప్షన్ పెట్టారు. అలాగే, కొత్త జీవితం ప్రారంభించబోతున్న తమకు మీ అందరి ఆశీస్సులు, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నానని కియారా పేర్కొన్నారు. షేర్షా సినిమాలో జంటగా నటించిన కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీళ్లిద్దరూ పెళ్లిచేసుకోబోతున్నారు అంటూ… గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి పెళ్లిబంధంతో అధికారికంగా ఇద్దరూ ఒక్కటయ్యారు.
పెళ్లి వేడుకలో కియారా అద్వానీ లేత గులాబీ వర్ణం లెహంగాలో మెరిసిపోయారు. ఈ లెహంగాను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారని సమాచారం. ఇక పెళ్లికుమారుడు సిద్ధార్థ్ ఐవరీ షేర్వాణీ ధరించారు. పెళ్లి తంతు పూర్తిచేసుకున్న ఈ సెలబ్రిటీ జంట.. జైసల్మేర్లోని వివాహ వేదిక బయట మీడియాకు పోజులివ్వడమే మిగిలి ఉంది. నిజానికి కియారా, సిద్ధార్థ్ల వివాహ వేడుకలు ఈనెల 4వ తేదీ నుంచే మొదలయ్యాయి. సోమవారం నాడు మెహందీ, సంగీత్ కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా అతిథులకు వెల్కమ్ లంచ్ ఏర్పాటుచేసిన జంట.. సోమవారం రాత్రి గ్రాండ్ సంగీత్ నైట్ నిర్వహించినట్టు సమాచారం. ఈ పెళ్లిలో కియారా, సిద్ధార్థ్లకు చాలా దగ్గర బంధువులు, క్లోజ్ ఫ్రెండ్స్, ఇండస్ట్రీ నుంచి కొంత మంది నటీనటులు మాత్రమే హాజరయ్యారని తెలుస్తోంది. కరణ్ జోహార్, మనీష్, షాహిద్ కపూర్, మీరా రాజ్పుత్, జూహీ చావ్లా, రామ్ చరణ్ మరికొందరు సెలబ్రిటీలు ఈ పెళ్లికి హాజరయ్యారట.