Homeఅంతర్జాతీయంఢిల్లీ లిక్కర్ స్కాం .. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది

ఢిల్లీ లిక్కర్ స్కాం .. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది

దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, గవర్నర్ వ్యవస్థలతో రాజకీయం చేస్తున్నారన్న వాదనలు .. దేశవ్యాప్తంగా చర్చోపచర్చలకు తెర తీస్తోంది. తాజాగా విపక్ష నేతలు ప్రధానిపై లేఖ రాయడం .. హాట్ టాపిక్ గా మారింది. దీంతో మోడీపై విపక్షాలు ఐక్యంగా పోరాటానికి సన్నద్ధం అవుతున్నాయన్న వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా లిక్కర్ స్కాం.. వేదికగా లేఖాస్త్రం సంధించడంతో రాజకీయాలు వేడెక్కాయి.

మనీష్‌ సిసోడియా అరెస్టును ఖండిస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి 9 మందితో కూడిన విపక్ష బృందం లేఖ రాసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ, అప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేత భగవంత్‌మాన్, RJD నేత తేజస్వియాదవ్, JKNC నేత ఫరూక్ అబ్దుల్లా, NCP అధినేత శరద్‌పవార్, శివసేన UBT ఉద్ధవ్‌ఠాక్రే, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్ ప్రధాని మోదీకి జాయింట్‎గా లేఖ రాశాయి. లేఖలో కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తోందని లేఖలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థను రాజకీయాలకు వాడుకుంటున్నారని లేఖలో ప్రస్తావించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు..దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనిస్తోందని, ప్రతిపక్షాలపై ఇలాంటి చర్యలు నిరంకుశత్వమేనని అభిప్రాయపడ్డాయి. భారత్ ఇంకా ప్రజాస్వామ్య దేశమేనని నమ్ముతున్నాం.. ప్రజాతీర్పును గౌరవించాలని విపక్ష నేతలు లేఖలో పేర్కొన్నారు. భారతదేశం ఇప్పటికీ ప్రజాస్వామ్య దేశమని మీరు అంగీకరిస్తారని మేము ఆశిస్తున్నాము. ప్రతిపక్ష నేతలపై కేంద్ర సంస్థల దుర్వినియోగం మనం ప్రజాస్వామ్యం నుండి నిరంకుశ పాలనకు మారినట్లు సూచిస్తోంది.

మాజీ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా అక్రమాలకు సంబంధించి అరెస్టు చేసింది. సిసోడియాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, రాజకీయ కుట్రతో కూడినవి. అతని అరెస్ట్ దేశవ్యాప్తంగా ప్రజలను ఆగ్రహానికి గురి చేసింది. ఢిల్లీ పాఠశాల విద్యలో సంస్కరణలు తెచ్చిన మనీష్ సిసోడియా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. నిరంకుశ బిజెపి పాలనలో భారతదేశ ప్రజాస్వామ్య విలువలు ముప్పుగా ఉన్నాయని ప్రపంచం భావిస్తోంది.

శారదా చిట్ ఫండ్ కుంభకోణంపై 2014, 2015లో కాంగ్రెస్ మాజీ సభ్యుడు, ప్రస్తుత అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై సీబీఐ, ఈడి విచారణ జరిపాయి. ఆయన బీజేపీలో చేరిన తర్వాత కేసు పురోగతి సాధించలేదు. మాజీ TMC నాయకుడు సువేందు అధికారి, ముకుల్ రాయ్ నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో ED, CBI దృష్టిలో ఉన్నారు.

అయితే వారు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరిన తర్వాత కేసులు పురోగతి సాధించలేదు. మహారాష్ట్రకు చెందిన నారాయణ్ రాణేతో సహాఅనేక ఉదాహరణలు ఉన్నాయి. 2014 నుంచి ప్రతిపక్ష నేతలపై దాడులు, కేసులు నమోదు చేయడం, అరెస్టు చేయడం వంటివి గణనీయంగా పెరిగాయి.లాలూ ప్రసాద్ యాదవ్, సంజయ్ రౌత్, ఆజం ఖాన్, నవాబ్ మాలిక్, అనిల్ దేశ్‌ముఖ్, అభిషేక్ బెనర్జీలపై కేసుల నమోదు, దాడులు జరిగాయి. కేంద్ర ఏజెన్సీలు తరచుగా కేంద్రంలోని పాలక వ్యవస్థ చేతిలో పనిచేస్తున్నారనే అనుమానాన్ని రేకెత్తిస్తున్నాయి.

అనేక సందర్భాల్లో నమోదైన కేసులు, అరెస్టుల సమయాలు ఎన్నికల సమయానికి సమానంగా, రాజకీయ ప్రేరేపితమైనవిగా స్పష్టంగా తెలుస్తోంది. విపక్షాలకు చెందిన ముఖ్యమైన సభ్యులను లక్ష్యంగా చేసుకున్న తీరును చూస్తుంటే ప్రతిపక్షాలను రూపుమాపాలనే ఉద్దేశ్యంతో దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందన్న ఆరోపణకు బలం చేకూరుస్తోంది. మీ ప్రభుత్వం ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఉపయోగించిందని ఆరోపించిన ఏజెన్సీల జాబితా కేవలం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కే పరిమితం కాలేదని లేఖలో తెలిపారు. ఈ ఏజెన్సీల ప్రాధాన్యతలను తప్పుదారి పట్టించారని స్పష్టమైంది. అంతర్జాతీయ ఫోరెన్సిక్ ఆర్థిక పరిశోధన
నివేదిక ప్రకారం ఒక నిర్దిష్ట సంస్థలో పెట్టుబడుల అంశం బహిర్గతమైంది.

దీంతో SBI, LIC తమ షేర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రూ. 78,000 కోట్లకు పైగా నష్టపోయినట్లు నివేదించబడింది. ప్రజాధనం ప్రమాదంలో ఉన్నప్పటికీ సంస్థ ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేయడానికి కేంద్ర ఏజెన్సీలను ఎందుకు ముందుకు తీసుకురాలేదు? మన దేశ ఫెడరలిజానికి వ్యతిరేకంగా యుద్ధం జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా గవర్నర్ల కార్యాలయాలు రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ రాష్ట్ర పాలనకు విఘాతం కలిగిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వీర్యం చేస్తున్నారు. ఇష్టానుసారం పాలనను అడ్డుకోవడానికి యత్నిస్తున్నారు. తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తెలంగాణ, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌లు బీజేపీయేతర ప్రభుత్వాలు నడుపుతున్న కేంద్రం, రాష్ట్రాల మధ్య విస్తృతమైన విభేదాలకు కేంద్రంగా మారారు.

ఆయా రాష్ట్రాల స్ఫూర్తికి ముప్పు కలిగిస్తుందని ప్రస్తావించారు. కో-ఆపరేటివ్ ఫెడరలిజం…కేంద్రం వ్యక్తీకరణ లోపించినప్పటికీ రాష్ట్రాలు ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. దేశ ప్రజలు భారత ప్రజాస్వామ్యంలో గవర్నర్ల పాత్రను ప్రశ్నించడం ప్రారంభించారు. రాజ్యాంగబద్ధమైన కార్యాలయాలు, గవర్నర్ ఆఫీసు, కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేయడం మన ప్రజాస్వామ్యానికి మంచిది కాదు తీవ్రంగా ఖండిస్తున్నాం.

2014 నుండి ఈ ఏజెన్సీలను ఉపయోగిస్తున్న తీరు వారి ప్రతిష్టను దిగజార్చింది. ఏజెన్సీల స్వయంప్రతిపత్తి, నిష్పాక్షికత గురించి ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ ఏజెన్సీలపై భారత ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతూనే ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టమే అత్యున్నతమైనది. మీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నపార్టీకి అనుకూలంగా ఉన్నా ప్రజలు ఇచ్చిన ఆదేశాన్ని గౌరవించాలని లేఖలో ప్రస్తావించారు.ప్రధాని లక్ష్యంగా ప్రతిపక్ష నేతలు ఏకం అవుతున్నారు. దేశాన్ని ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వంగా మారుస్తున్నారని మండి పడుతున్నారు. విచారణ సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ వ్యవస్థ పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని మోదీకి రాసిన లేఖలో విపక్ష నేతలు కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అధికారాలు, ఆకాంక్షలే అన్నిటికంటే కీలకమని పేర్కొన్నాయి.

వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలను లేఖలో ప్రస్తావించారు. ఇందులో ప్రధానంగా ఒక పార్టీకో, వ్యక్తికో భిన్నంగా ఉన్న భావజాలాన్ని సైతం గౌరవించాలని ప్రధాని సూచించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తోందని లేఖలో ఫైర్ అయ్యారు. కేంద్ర నిఘా వర్గాలను ప్రతిపక్షాలపై కక్షపూరితంగా ప్రయోగిస్తున్నారని లేఖలో మండిపడ్డారు. లిక్కర్ స్కామ్‌లో ఆధారాలు లేకపోయినా… ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను CBI అరెస్టు చేసిందని విపక్ష నేతలు ఆరోపించారు. సిసోడియాపై చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవనీ, అంతా రాజకీయ కుట్ర అని పార్టీలు ఆ లేఖలో అభిప్రాయపడ్డాయి.

ప్రతిపక్షాలు ఇలా ఆరోపిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం తన చర్యలను సమర్థించుకుంటోంది. తప్పు చేయకపోతే.. ఉలుకెందుకు అంటోంది. తప్పు చేసేవాళ్లనూ, అవినీతికి పాల్పడేవాళ్లనూ వదిలేయాలా అని ప్రశ్నిస్తోంది. ఇటు కేంద్రం, అటు విపక్షాల డైలాగ్ వార్స్‌తో దేశ రాజకీయాలు వేడిగానే ఉన్నాయి. మరో ఏడాదిలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న సమయంలో… విపక్షాలు రాసిన ఈ లేఖపై కేంద్రం ఎలా స్పందిస్తుంది? దర్యాప్తు సంస్థల జోరును తగ్గిస్తుందా.. లేక మరింత దూకుడు పెంచేలా చేస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది.

Must Read

spot_img