- దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక నగరం జోషిమఠ్ .. కుంగుబాటుకు కారణాలేమిటి..?
- ఉత్తరాఖండ్ లో ప్రమాదం పొంచి ఉందా..? అసలు జోషిమఠ్ మునిగిపోవడానికి కారణాలేమిటి..? దీనిపై నిపుణులు ఏమంటున్నారు..?
ఓవైపు ప్రకృతి ప్రకోపం.. మరోవైపు పట్టణీకరణ .. జోషిమఠ్ ను నిండా ముంచేస్తున్నాయని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అక్కడి పరిస్థితులపై
అవగాహనా లేమి .. ఈ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు.

ఉత్తరాఖండ్లో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక పట్టణం జోషిమఠ్ ప్రమాదంలో ఉంది. ఈ పట్టణం క్రమంగా మునిగిపోతోంది. ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయి. భూమి అంతకంతకూ కిందకు కుంగిపోతోంది. భూకంపం వచ్చినట్లుగా నెర్రలు చాస్తోంది. ఆ పగుళ్ల నుంచి నీళ్లు బయటకు వస్తున్నాయి. ఆ నీటితో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోజు రోజుకూ పరిస్థితి దిగజారుతుండడంతో.. అక్కడి ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఇళ్లకు పెద్ద ఎత్తున పగుళ్లు ఏర్పడుతుండడంతో భయంతో వణికిపోతున్నారు. పట్టణం మొత్తం భూమిలో కలిసిపోతుందని.. నీటిలో మునిగిపోతుందని టెన్షన్ పడుతున్నారు. ఇళ్లల్లో ఉండాలంటేనే జంకుతున్నారు. ఇప్పటికే పలు కుటుంబాలు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. అటు అధికారులు సైతం
అప్రమత్తమయ్యారు. పట్టణ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ కు జోషిమఠ్ గేట్ వేగా ఉంది. బద్రీనాథ్కు చేరుకోవాలంటే ఈ పట్టణం నుంచే వెళ్లాలి. అలాంటి జోషిమఠ్ ఇప్పుడు ప్రమాదపు అంచుల ఉంది. ఇక్కడ దాదాపు 700 ఇళ్లకు పగుళ్లు వచ్చాయని జోషిమఠ్ స్థానిక అధికారులు తెలిపారు.
ఇళ్లకు పగుళ్లు పడిన ప్రాంతాలను చమోలి జిల్లా పరిపాలన అధికారులు సందర్శించారు. పట్టణం క్రమంగా మునిగిపోయే అవకాశం ఉన్నందున.. ప్రజలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. జోషిమఠ్లో పగుళ్లపై సాధువులు, రుషులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏదో జరగరానిది కీడు జరుగుతోందని అభిప్రాయపడుతున్నారు. నిన్న జోషిమఠ్లో పెద్ద సంఖ్యలో ప్రజలు కాగడాలు చేతబట్టి ఆందోళన చేశారు. వీధుల్లో తిరుగుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జోషిమఠ్లో ఏం జరుగుతుందో ప్రభుత్వం చెప్పాలని..తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
హిమాయలన్ టౌన్ జోషిమఠ్ ఎందుకు కుంగిపోతోంది? ఇండ్లు, రోడ్లు ఎందుకు బీటలు వారుతున్నాయి? యాపిల్, ఇతర చెట్లు ఎందుకు నేలలోకి
కూరుకుపోతున్నాయి? కరెంట్ స్తంభాలు ఎందుకు ఒరిగిపోతున్నాయి? నేల నుంచి నీళ్లు పైకి ఎందుకు పొంగుకొస్తున్నాయి? పురాతన కాలంలో ఓ
పెద్ద పర్వతం నుంచి జారిపోయిన పెద్ద కొండచరియపైనే ఈ టౌన్ ఉండటం ప్రధాన కారణమైతే.. గత కొన్ని దశాబ్దాలుగా రోడ్లు, ఇండ్లు, ప్రాజెక్టులు
పెరగడంతో ఇక్కడి నేలపై మోయలేని భారం పడటం ఇంకో కారణమని చెప్తున్నారు.
అలాగే డ్రైనేజీ సిస్టం సరిగ్గా లేకపోవడం, వరదలతో నాలాలు పూడిపోవడంతో వాన, ఇండ్ల నుంచి విడుదలవుతున్న నీళ్లు ఇక్కడి మట్టిలోనే ఇంకిపోతున్నాయని.. ఫలితంగా ఏటవాలుగా ఉన్న ఈ ప్రాంతం నుంచి నీళ్లు ఇంకిపోతూ లూజ్ మట్టి కరిగిపోయి నేల కుంగుతోందని అంటున్నారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో హిమాలయ పర్వతపాదాల వద్ద ఓ పెద్ద పర్వతానికి దిగువన ఉంది జోషిమఠ్. ]
ఉత్తరాన అలకనంద నది.. తూర్పున ధౌలి గంగ.. మధ్యన భారీ కొండచరియపై ఉన్నది ఈ టౌన్. జోషిమఠ్ అడుగున ఉన్న నేల వాస్తవానికి.. ఇది కొండచరియ కావడంవల్లే దీనిలోని మట్టి, రాళ్లు ఎక్కువ బరువు మోసే అవకాశంలేదని చెబుతున్నారు. కొన్ని దశాబ్దాలుగా వేగంగా అభివృద్ధి చెందిన జోషిమఠ్ ఇప్పుడు చిన్న స్థాయి పట్టణంగా మారింది. అర్బనైజేషన్ కారణంగా బలహీనంగా ఉన్న నేలపై మోయలేని బరువు పడింది.
మరోవైపు, నీళ్లు సహజంగా కిందకు వెళ్లిపోయేందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఒక్కోచోట నీళ్లు కంట్రోల్ లేకుండా పెద్దమొత్తంలో ప్రవహించడంతో నేల కోతకు గురవుతోంది. 2013లో వరదలకు బురద పేరుకుపోయి ఇక్కడి నాలాలు బ్లాక్ అయ్యాయి. ఆ తర్వాత 2021లో వరదలు రావడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా తయారైందని సైంటిస్టుల అంచనా.
జోషిమఠ్కు ఉన్న ముప్పు గురించి 1976లోనే బయటపడింది..
అప్పట్లో కూడా నేలపై నుంచే నీళ్లు పైకి ఉబికివచ్చాయి. కొన్ని చోట్ల నేల కుంగింది. దీనిపై ప్రభుత్వం నియమించిన మిశ్రా కమిటీ అధ్యయనం చేసింది. అర్బనైజేషన్ కారణంగా భవిష్యత్తులో టౌన్ కుంగిపోయే ప్రమాదం ఉందని కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అయితే, అప్పట్లో ఆ కమిటీ రిపోర్ట్ను ప్రజలు తేలిగ్గా తీసిపారేశారు. ప్రభుత్వాలు కూడా పెద్దగా చర్యలు చేపట్టలేదు.
తాజాగా కేంద్రం జోషీమఠ్లో జరుగుతున్న పరిణామాలపై స్టడీ చేపట్టాలని ఓ నిపుణుల ప్యానెల్ను ఏర్పాటు చేసింది. భూమి ఎందుకు కుంచించుకుపోతుందో ఆ ప్యానెల్ అధ్యయనం చేయనుంది. బిల్డింగ్లు, హైవేలు, ఇతరమౌలిక సదుపాయాలు కూడా ఆ పట్టణంలో నేలకూలుతున్నాయి. దీంతో అక్కడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సీఎం పుష్కర్ సింగ్ థామి .. సమస్యను పరిష్కరించేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. అవసరం అయితే విమానాల్లో ప్రజల్ని తరలించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాతావరణ మార్పులు, నిరంతం డెవలప్మెంట్ పనులు జరగడం వల్లే జోషీమఠ్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడినట్లు భావిస్తున్నారు.
బద్రీనాథ్, హేమకుండ్ సాహిబ్కు వెళ్లేందుకు జోషీమఠ్ కీలక మార్గం. ఈ పట్టణం నుంచి ఆ రెండు క్షేత్రాలకు భక్తులు వెళ్తుంటారు. ఇండియా, చైనా
బోర్డర్ వద్ద ఉన్న మిలిటరీ బేస్ క్యాంప్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇక ఆసియాలోనే అతిపెద్ద అవులీ రోప్వే కూడా ఇక్కడే ఉంది. ప్రస్తుతం ఆ రోప్వే
ప్రాంతంలో క్రాక్లు రావడం వల్ల దాన్ని నిలిపివేశారు. ప్రస్తుతం హీలాండ్-మార్వారి బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను ఆపేశారు. దీనికి ప్రకృతి ప్రకోపమే
ప్రధానంగా చర్చకు వస్తోంది.
జోషిమఠ్ లో విచ్చల విడిగా భవన నిర్మాణాలు..!
పర్వత ప్రాంతమైన జోషిమఠ్ లో విచ్చల విడిగా భవన నిర్మాణాలు, అడ్డూ అదుపు లేకుండా కొండలు తవ్వేయడమే ఇప్పుడీ పరిస్థితికి కారణంగా
చెబుతున్నారు శాస్త్రవేత్తలు. పరమ పవిత్రంగా భావించే చార్ దామ్ యాత్రల్లో ఒకటైన బద్రినాథ్ క్షేత్రానికి ముఖ ద్వారం జోషిమఠ్. అంతేకాదు, అది
శంకరాచార్యులు నెలకొల్పిన నాలుగు పీఠాల్లో ఒకటి. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ పర్వత శిఖరం ఇప్పుడు పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది.

రోజురోజుకు కాలగర్భంలో కలిసిపోయేలా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. జోషిమఠ్ పట్టణంలో గత కొన్నేళ్లుగా భూమి పగుళ్లు ఇస్తోంది. నేల చీరటంతో ఇళ్లు బీటలు వారుతున్నాయి. భూమి లోపల నుంచి వస్తున్న శబ్దాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఉన్నట్టుండి భూగర్భం నుంచి ఉబికి వస్తున్న నీరు జోషిమఠ్ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. జోషిమఠ్ ప్రమాదకర స్థితికి చేరుకుంటోందని 50ఏళ్ల క్రితమే శాస్త్రవేత్తలు హెచ్చరించారట.
అప్పట్లో ఊరు భూమిలో కలిసిపోతుందని చెప్పిన శాస్త్రవేత్తలకు శాపనార్థాలు పెట్టిన స్థానికులు ఇప్పుడు జరుగుతున్నది చూసి ఆందోళన చెందుతున్నారు. జోషిమఠ్ లో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న కట్టడాలు, రోడ్ల నిర్మాణానికి బండ రాళ్ల తొలగింపు ఎప్పటికైనా ప్రమాదం అని 1976లోనే శాస్త్రవేత్తలు నివేదికలు ఇచ్చారట. అవే నివేదికలు ఇప్పుడు నిజమవుతున్నాయని పాతతరం వారు గుర్తు చేసుకుంటున్నారు.
అంతేకాదు, తరుచుగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విరిగిపడే కొండచరియలు, దెబ్బతిన్న సమతౌల్యం కూడా జోషిమఠ్ కుంగుబాటకు కారణం అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇండో టిబెటన్ బోర్డర్ లో ఉన్న ఈ చారిత్రక పట్టణం మానవాళి తప్పిదంతోనే చరిత్ర పుటల్లోకి చేరిపోతుందనే విషయం తేటతెల్లమవుతోంది. అందుకే, ప్రకృతి సమతౌల్యత దెబ్బతీయకుండా జాగ్రత్త పడాల్సి ఉంది.
కొండచరియపై ఏర్పడ్డ .. పట్టణంలో విపరీతంగా అర్బనైజేషన్ పెరగడమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు వెల్లడిస్తున్నారు.