Homeఅంతర్జాతీయంఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ న్యాయవ్యవస్థపై కత్తిగట్టారు.

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ న్యాయవ్యవస్థపై కత్తిగట్టారు.

అంతా అనుకున్నట్టే అయింది. గత నవంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించి డిసెంబర్‌లో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ న్యాయవ్యవస్థపై కత్తిగట్టారు. ఆ వ్యవస్థలో సంస్కరణల పేరిట దాని అధికారాలు తెగ్గోసేందుకు సిద్ధపడ్డారు. కొన్ని నెలలక్రితం నెతన్యాహూ నాయకత్వంలోని లికుడ్‌ పార్టీకి ఎగబడి ఓట్లేసిన జనమే ఇప్పుడు న్యాయవ్యవస్థ రక్షణ కోసం వీధుల్లోకొస్తున్నారు. పార్లమెంటు వెలుపల అయిదారు రోజులుగా ఎడతెగకుండా నిరసన ప్రదర్శనలు సాగుతున్నాయి. వీటన్నిటినీ బేఖాతరు చేస్తూ చట్టసభలో న్యాయసంస్కరణల బిల్లు ప్రాథమిక స్థాయిలో విజయం సాధించింది. సోమవారం రాత్రి జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 63 ఓట్లు, వ్యతిరేకంగా 47 వచ్చాయి.

నెతన్యాహూ నేతృత్వంలోని అతి మితవాద, మత, ఛాందసవాద కూటమి ప్రభుత్వం పార్లమెంటులోని 120 స్థానాల్లో 64 గెల్చుకుంది. రాగల నెలల్లో న్యాయ సంస్కరణల బిల్లు మరో రెండు దశలు దాటాలి గనుక ఇప్పటికిప్పుడే అంతా అయిపోయినట్టు కాదు. అయితే అధికార కూటమి వరస చూస్తుంటే ఏది ఏమైనా చట్టం చేసి తీరాలన్న పట్టుదల కనిపిస్తోంది. ప్రచార సమయంలోనే నెతన్యాహూ తాము అధికారంలోకొస్తే న్యాయవ్యవస్థను సమూల ప్రక్షాళన చేస్తామని ఒకటికి పదిసార్లు ప్రకటించారు. దేశ శ్రేయస్సు కోసం చట్టాలు చేస్తుంటే సుప్రీంకోర్టు కొట్టివేస్తున్నదని, ఇందువల్ల దేశ భద్రత ప్రమాదంలో పడుతోందని ఆయన భావన. అంతే కాదు… న్యాయవ్యవస్థ నియామకాల్లో ప్రభుత్వానిదే పైచేయిగా ఉండాలన్నది ఆయన కోరిక. నెతన్యాహూ సుభాషితాల వెనకున్న అంతరార్థం వేరు. ఆ వ్యవస్థ తమకు సాగిలపడి వుండాలని ఆయన మాటల్లోని సారాంశం.

తాజా బిల్లు చట్టమైతే సుప్రీంకోర్టు కొట్టేసిన నిర్ణయాన్ని పార్లమెంటు తిరగదోడేందుకు వీలుంటుంది.

కనీస మెజారిటీతో పార్లమెంటులోని 120 మంది సభ్యుల్లో 61 మంది కాదంటే సుప్రీంకోర్టు తీర్పును రద్దుచేయొచ్చు. దేశ రాజ్యాంగంగా ఉండే మౌలిక చట్టంలోని అంశాలను సమీక్షించే అధికారాన్ని సుప్రీంకోర్టు నుంచి తొలగించటం మరో ప్రతిపాదన. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో రాజకీయ వర్గానిదే పైచేయి కావడం మూడో ప్రతిపాదన. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, న్యాయవాదులు సభ్యులుగా ఉండే నియామకాల కమిషన్‌ పనిచేస్తోంది. ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించటం ఆనవాయితీగా వస్తున్నా న్యాయవ్యవస్థ ప్రతినిధుల ఆధిక్యత ఉన్నందువల్ల చాలాసార్లు ఆ వ్యవస్థ నిర్ణయమే అంతిమంగా అమలవుతోంది. ఇప్పుడు చేసిన ప్రతిపాదన దాన్ని తారుమారు చేస్తుంది. అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న అతి ఛాందసవాద యూదు పార్టీలు తమ మతంలోని యువకులను నిర్బంధ సైనిక శిక్షణనుంచి తప్పించాలని ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తున్నాయి. ఆ చట్టం తీసుకొస్తే సమాన న్యాయం పేరిట సుప్రీంకోర్టు కొట్టేస్తుందన్న భయాందోళనలు ఆ పార్టీలకున్నాయి. అందుకే ఆ పార్టీలు గట్టిగా మద్దతునిస్తున్నాయి.

మరో కీలకమైనది పాలస్తీనా సమస్య. పాలస్తీనా పౌరులను ఎంతగా ఇబ్బంది పెడితే అంతగా యూదుల్లో తమకు మద్దతు పెరుగుతుందని దాదాపు అన్ని పార్టీలు కూడా భావిస్తాయి. యూదుల్లో జాతీయ భావాల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవటం వాటికి అలవాటుగా మారింది. ఒకపక్క ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్‌ వైదొలగాలన్న డిమాండ్‌ ప్రపంచ దేశాలన్నిటి నుంచీ వస్తుంటే ఆ ఆక్రమణలను మరింత పెంచుకోవటమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ పాలక పక్షాలు పని చేస్తున్నాయి. అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రకారం ఈ ఆక్రమణలు చట్టవిరుద్ధమైనవి. అయినా అవి ఉన్నకొద్దీ పెరుగుతున్నాయి.

ప్రస్తుతం వెస్ట్‌బ్యాంకు, తూర్పు జెరూసలెంలలో ఆక్రమిత భూభాగాల్లో దాదాపు ఏడున్నర లక్షలమంది ఇజ్రాయెల్‌ పౌరుల ఆవాసాలున్నాయి. వీటిని మరింత పెంచు కోవాలంటే సుప్రీంకోర్టు అడ్డంకిని తొలగించుకోవాలని నెతన్యాహూ కోరుకుంటున్నారు. న్యాయసంస్కరణల బిల్లుకు జనంలో పెద్దయెత్తున వ్యతిరేకత రావటం చూసి దేశాధ్యక్షుడు ఇసాక్‌ హెర్జోగ్‌ ఈ బిల్లుపై విపక్షాలతో చర్చించాకే తదుపరి చర్యలుండాలని హితవు పలికారు. అయితే నెతన్యాహూకు ఇది రుచించడం లేదు. విపక్షాలతో చర్చలకు సిద్ధమే అయినా చట్టం తీసుకురావటం ఖాయమని న్యాయశాఖ మంత్రి చెప్పారంటేనే ప్రభుత్వం ఎంత ద్రుడసంకల్పంతో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే మూడు అవినీతి ఆరోపణల్లో విచారణ ఎదుర్కొంటున్న నెతన్యాహూ తనకు శిక్షపడే ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే నెతన్యాహూ అందుకే ఈ బిల్లును తెచ్చారన్నది విపక్షాల ప్రధాన ఆరోపణ.

నిజానికి ఇజ్రాయెల్‌కు ఇప్పటివరకు నిర్దిష్టమైన రాజ్యాంగం లేదు. ఫెడరల్‌ వ్యవస్థ లేదు. దేశానికంతకూ ప్రాతినిధ్యం వహించే పార్లమెంటు నిర్ణయమే అంతిమ నిర్ణయంగా ఉంటుంది. ఏ కీలక నిర్ణయమైనా పార్లమెంటులో జరిగే ఓటింగ్ డిసైడ్ చేసేస్తుంది. పార్లమెంటులో బలాబలాలే అన్నిటినీ నిర్ణయిస్తాయి. ఈ స్థితిలో కార్యనిర్వాహక వ్యవస్థ నిర్ణయాలను సమీక్షించి సమతుల్యత సాధించే మరో వ్యవస్థ ఎంతో అవసరం. ఆ పాత్రను సుప్రీంకోర్టు సమర్థవంతంగా పోషిస్తోంది. దేశ జనాభా 90 లక్షలమందిలో అయిదో వంతు మంది అరబ్బులున్నారు. మరో 30 లక్షలమంది పాలస్తీనా పౌరులు వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరందరి ప్రయోజనాలనూ, శ్రేయస్సునూ దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు చేయాల్సిన నేపథ్యంలో.. మెజారిటీవాదమే చెల్లుబాటు కావాలనుకోవటం ఆత్మహత్యాసదృశమవుతుంది.

ఇప్పుడు ఇజ్రాయెల్ లో సరిగ్గా అదే జరుగుతోంది.. ప్రజలు రోడ్లమీదకు వచ్చి తిరగబడుతున్నారు.

నెతన్యాహూ న్యాయవ్యవస్థమీద కత్తికట్టి, సంస్కరణల పేరిట తనకు అనుకూలంగా మార్పులు చేసేందుకు ప్రజాభిప్రాయాన్ని పక్కనబెట్టి ముందుకు పోతే ఇజ్రాయెలీలు ఆయనకు వ్యతిరేకంగా చివరకు ఆయనను గద్దె దింపేందుకు కూడా వెనుకాడరని అంటున్నారు విశ్లేషకులు. రెండుమూడు వారాలుగా దేశ ప్రజలు ఈ స్థాయిలో నిరసిస్తున్నారు. అమెరికా సహా ఆయాదేశాల్లోని ఇజ్రాయెలీలు, యూదు సంఘాలూ ప్లకార్డులతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఇజ్రాయెల్‌ మాజీ అటార్నీ జనరల్స్‌ అందరూ ఈ దుశ్చర్య వద్దని లేఖలు రాసినా నెతన్యాహూ తనపని తాను చేసుకుపోతున్నారు. న్యాయవ్యవస్థ తమకు లొంగివుండాలని ఇజ్రాయెల్‌ పాలకులు ఆశిస్తున్నారు. దేశశ్రేయస్సుకోసం తాము చట్టాలు చేస్తుంటే, న్యాయవ్యవస్థ వాటిని కొట్టివేయడం ద్వారా దేశభద్రతనే ప్రమాదంలో పడవేస్తున్నదని తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. అంతిమంగా న్యాయవ్యవస్థను తనకు సాగిలబడేట్టు చేసుకొని, కేసులనుంచి బయటపడేందుకు నెతన్యాహూ ఈ సంస్కరణల పేరిట ప్రయత్నిస్తున్నారు.

న్యాయవ్యవస్థను చెప్పుచేతల్లో ఉంచుకొనే ప్రయత్నాల్లో నెతన్యాహూ విజయవంతమవుతారా లేదా అన్న ప్రశ్నను అటుంచితే, గతంలో మాదిరిగా మాటవరుసకు కూడా పాలస్తీనియన్ల పక్షాన భారత్‌ ఇప్పుడు నోరువిప్పడం లేదు. తమదేశంలో వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన, దేశంలోనే రెండవ అతిపెద్ద హైఫా పోర్టును అదానీకి అప్పగించడం ఉభయదేశాల మధ్యా ఉన్న బాంధవ్యానికీ, పరస్పర విశ్వాసానికి నిదర్శనమని ఇజ్రాయెల్‌ రాయబారి బుధవారం ఓ వ్యాఖ్యనం చేశారు. త్వరలో రెండు దేశాల మధ్యా స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదరబోతున్నదనీ, అది ఉభయదేశాలనూ మరింత సన్నిహితం చేస్తుందని ఆయన అన్నారు. ఏది ఏమైనా ప్రస్తుత విషయానికొస్తే నెతన్యాహూ స్వప్రయోజనాల కోసం దేశాన్నే పణంగా పెట్టిన నేతగా చరిత్రలో నిలుస్తారో, జనాభి ప్రాయానికి తలొగ్గుతారో నెతన్యాహూ తేల్చుకోక తప్పదు.

Must Read

spot_img