Homeఅంతర్జాతీయంఇరాన్ రహస్య ఆపరేషన్..?

ఇరాన్ రహస్య ఆపరేషన్..?

  • ఇరాన్ లోని ఇస్పహాన్ నగరంలో అత్యంత రహస్యంగా నిర్వహిస్తోన్న ఓ ఆయుధ కర్మాగార భవనంపై దాడి జరిగింది.
  • అదే రోజు కొన్ని గంటల్లోనే అజర్హహర్ లోని చమురు కేంద్రంలో భారీ మంటలు చెలరేగాయి..
  • ఇంతకూ ఈ దాడులు చేసిందెవరు..?

ఇస్పహాన్ లోని క్షిపణి కేంద్రాన్ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు…

చిన్న డ్రోన్లతో పెద్ద లక్ష్యాలపై దాడులు చేస్తున్నాయా..?

ఈ దాడులలో రష్యా, ఉక్రెయిన్ కోణం ఉందా..?

ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ హస్తం ఉందా..?

ఇరాన్‌ లోని ఇస్ఫహాన్‌ నగరంలో అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్న ఓ ఆయుధ కర్మాగార భవనంపై గతవారం ఓ భారీ పేలుడు చోటు చేసుకొంది.. అదే రోజు కొన్ని గంటల వ్యవధిలోనే అజర్షహర్‌లోని చమురు కేంద్రంలో భారీ మంటలు చెలరేగాయి. ఈ దాడులు ఎలా జరిగాయి..? ఎవరు చేశారు..? అక్కడేం ఉందనే విషయాలు వెంటనే ఇరాన్‌ బాహ్య ప్రపంచానికి వెల్లడించలేదు. ఇస్ఫహాన్‌ లో దాడికి మూడు డ్రోన్లు వస్తే.. రెండింటిని కూల్చివేశామని మాత్రమే వెల్లడించింది. అమెరికాలోని పత్రికలు మాత్రం ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్‌ సైలెంట్‌ గా ఈ దాడిని నిర్వహించిందని కథనాలు వెలువరించాయి. మొస్సాద్‌ మాత్రం ఎప్పటిలానే మౌనం వహించింది.

ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఇజ్రాయెలే ఈ దాడికి పాల్పడిందంటూ ఇరాన్‌ గగ్గోలు పెట్టడం మొదలుపెట్టింది. ఆ దేశ అధికారిక వార్తా సంస్థ ఐఎస్‌ఎన్‌ఏ ఈ మేరకు ప్రకటించింది. తమ ప్రాథమిక దర్యాప్తులో ఈ దాడి ఇజ్రాయెల్‌ పనే అని తేలిందని ఇరాన్‌ ఐక్యరాజ్యసమితి దూత అమిర్‌ సయీద్‌ ఇర్వానీ పేర్కొంటూ.. ఐరాస చీఫ్‌ కు లేఖ రాశారు. దేశ భద్రతను కాపాడుకొనే హక్కు తమకు ఉందని.. ఇజ్రాయెల్‌ చేసే తప్పులకు అవసరమైన చోట తగినట్లు ప్రతిస్పందిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనలతో పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారింది.

ఇస్ఫహాన్‌లో రెండు క్షిపణి అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి. వీటితో పాటు మరో రెండు క్షిపణి సాంకేతికతకు సంబంధించిన సంస్థలు కూడా ఇక్కడి నుంచి పనిచేస్తున్నాయని లండన్‌ లోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ పేర్కొంది. ఈ నగరంలో మరో నాలుగు అణు ప్రయోగశాలలు కూడా నిర్వహిస్తున్నారు.

తాజాగా దాడి జరిగిన ప్రదేశం ఇరాన్‌ హైపర్‌ సోనిక్‌ క్షిపణి అభివృద్ధి కేంద్రం కావొచ్చని మొస్సాద్‌ మాజీ చీఫ్‌ డానీ యాటమ్‌ ఇజ్రాయెల్‌ ఆర్మీ రేడియోలో పేర్కొన్నారు. ఇరాన్‌ వద్ద దాదాపు 3,000 బాలిస్టిక్‌ క్షిపణులు ఉన్నాయని.. వీటిల్లో కొన్ని టెల్‌ అవీవ్‌ ను కూడా చేరుకోగలవని డానీ తెలిపారు.
ఇరాన్‌ అణ్వాయుధాలు ప్రయోగించకుండా అడ్డుకోవడమే ఇజ్రాయెల్‌ తొలి ప్రాధాన్యం. ఇజ్రాయెల్‌ రెండు పనులు చేయాలి.

ఇరాన్‌ అణ్వాయుధాల తయారీని ఆపడం.. వాటిని ప్రయోగించే వ్యవస్థలు ఆ దేశానికి దక్కకుండా చేయడమని ఇంటర్నేషనల్‌ క్రైసిస్‌ గ్రూప్‌ లోని డైరెక్టర్‌ అలీవేజ్‌ వివరించారు. దీనికి తోడు ఇరాన్‌ అభివృద్ధి చేసిన పలు రకాల ఆయుధాలను సిరియా, లెబనాన్‌, పాలస్తీనాకు సరఫరా చేయడం తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో ఇస్ఫహాన్‌ లోని క్షిపణి కేంద్రాన్ని ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్‌ లక్ష్యంగా చేసుకొని ఉండొచ్చనే విశ్లేషణలు ఉన్నాయి.

  • ఇస్ఫహాన్‌ లోని ఆయుధ కేంద్రంపై దాడికి మూడు డ్రోన్లు రాగా… వీటిల్లో రెండింటిని కూల్చివేశామని ఇరాన్‌ అధికారులు పేర్కొన్నారు..

క్వాడ్‌ కాప్టర్లకు బాంబులెట్స్‌ను అమర్చి దాడి చేసినట్లు పేర్కొన్నారు.. వీటిని రిమోట్‌ సాయంతో స్వల్ప దూరం నుంచి మాత్రమే ఆపరేట్‌ చేయవచ్చు. కొన్ని వాణిజ్య శ్రేణి క్వాడ్‌ కాప్టర్‌ శకలాలను కూడా ఇరాన్‌ టీవీలో ప్రసారం చేసింది. 2021లో ఇరాన్‌ సెంట్రిఫ్యూజ్‌ తయారీ కేంద్రంపై, 2022లో మిలిటరీ డ్రోన్‌ తయారీ కేంద్రంపై ఇటువంటి డ్రోన్లే దాడి చేసినట్లు టైమ్స్‌ ఇజ్రాయెల్‌ కథనంలో పేర్కొంది. కానీ, ఆ ఆయుధ స్థావరంపై మూడు నుంచి నాలుగు
పేలుళ్లు చోటు చేసుకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారని లండన్‌ లోని ఇరాన్‌ ఇంటర్నేషనల్‌ పేర్కొంది. అంటే భారీ నష్టమే జరిగే అవకాశం ఉంది.

ఈ దాడి వెనుక రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ కోణం కూడా ఉందని పశ్చిమ దేశాల పత్రికలు కథనాలు వెలువరించాయి. ఇరాన్‌ నుంచి అందిన చౌకబారు షహీన్‌ డ్రోన్లతో మాస్కో దళాలు ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్నాయి. తాజాగా ఇరాన్‌ నుంచి చౌకబారు క్షిపణులు కూడా కొనుగోలు చేయాలని రష్యా యత్నిస్తున్నట్లు అమెరికా ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ సాయంతో క్షిపణి కేంద్రంపై అమెరికానే దాడి చేయించిందనే ప్రచారం ఉంది. ఈ దాడి సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఇజ్రాయెల్‌ పర్యటనలోనే ఉన్నారు..

అంతేకాదు.. ఇరాన్‌ అణు ఒప్పందంపై ఆశలు కూడా మెల్లగా ఆవిరైపోతున్నాయి. ఈ సమయంలో జరిగే ఈ దాడులకు ఇరాన్‌ స్పందించి.. పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చడమో లేదా అమెరికా-ఐరోపా దేశాలతో అణుఒప్పందం చర్చలను కొనసాగించడమో తేల్చుకోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్‌ సైనిక ఇంటెలిజెన్స్‌ మాజీ అధికారి గ్రిన్‌ బెర్గ్‌.. రేడియో ఫ్రీ యూరప్‌ రేడియో లిబర్టీ పత్రికతో తెలిపారు..

ఇరాన్‌లో ఇలాంటి దాడి చేయగల సామర్థ్యం ఉన్న అతికొద్ది దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. ఇదివరకు కూడా ఇలాంటి పనిని ఆ దేశం చేసింది. అందుకే ఇజ్రాయెల్‌ను ఇరాన్ అనుమానిస్తోంది. 2010 నుంచి 2012 వరకు ఇరాన్ అణు కార్యక్రమంతో సంబంధమున్న నలుగురు శాస్త్రవేత్తలు హత్యకు గురయ్యారు. మరో శాస్త్రవేత్త ఓ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు.

అయితే, ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ ఒక్కటే ఈ రహస్య ఆపరేషన్ల వెనుక ఉందన్న నిర్ణయానికి వచ్చే పరిస్థితి లేదు.. మొసాద్ ఇలాంటి ఆపరేషన్లను తాము చేశామని ఎప్పటికీ చెప్పదని, అలా చేస్తే ఇరాన్ ప్రతీకార చర్యలను ఆహ్వానించినట్లవుతుందని ఇజ్రాయెల్‌ అంచనా వేయగలదు.. ”కానీ, ఇరాన్‌లో జరిగే గూఢచర్య ఆపరేషన్లు, మరీ ముఖ్యంగా అణు కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఇలాంటి పనులు చేసే దేశాలు చాలా తక్కువ. సాధారణంగా మొసాద్ లేదా అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ లేదా రెండు కలిసి ఇలాంటివి చేస్తుంటాయి..

ఇరాన్ అణు కార్యక్రమాలకు అవరోధం కలిగించేందుకు గూఢచర్య సంస్థల ప్రయత్నాలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. ”ఇరాన్ అణు కార్యక్రమానికి సప్లై చైన్‌ను దెబ్బతీయాలని మొదటగా ప్రయత్నించాయి. ఇరాన్ ఈ కార్యకలాపాలను రహస్యంగా చేసేది. అవసరమైన సామగ్రిని బహిరంగంగా కొనలేదు. కాబట్టి, మధ్యవర్తుల సాయం తీసుకోవాల్సి వచ్చేది. ఐరాస, అమెరికా తదితర దేశాలు ఈ ప్రయత్నాలను అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. కొన్ని సార్లు సఫలమయ్యాయి కూడా..

  • 2007 నుంచి 2010 వరకు ఇరాన్ అణు కార్యక్రమాలే లక్ష్యంగా అనేక సైబర్ దాడులు జరిగాయి..

2010లో మోటార్ సైకిల్ బాంబు దాడిలో అణు శాస్త్రవేత్త మసూద్ అలీ మహమ్మద్ ప్రాణాలు కోల్పోయారు. అణు శాస్త్రవేత్తల హత్యలు ఆయనతోనే మొదలయ్యాయి. మరుసటి రెండేళ్లలో మరో ముగ్గురు అణు శాస్త్రవేత్తలు హత్యకు గురయ్యారు. 2015 జనవరిలో తమ శాస్త్రవేత్తను హత్య చేసేందుకు
జరిగిన ప్రయత్నాలను భగ్నం చేశామని ఇరాన్ ప్రకటించింది. అదే ఏడాది ఇరాన్ అణు ఒప్పందంపై సంతకం చేయడంతో గూఢచర్య ఆపరేషన్లు తగ్గుతూ వచ్చాయి.

2018 ఆరంభంలో ఇరాన్ అణు కార్యక్రమాలకు సంబంధించిన రహస్య పత్రాలు మొసాద్‌కు చిక్కాయి. 2020లో గూఢచర్య ఆపరేషన్లు బాగా పెరిగాయి. ఆ తర్వాత నైటాంజ్ అణు కేంద్రంలో ఓ పేలుడు జరిగింది. దీని వెనుక కూడా మొసాద్ హస్తం ఉందని ఇరాన్ ఆరోపించింది. అదే ఏడాది మోహసీన్ కూడా హత్యకు గురయ్యారు. ఆయన పత్రాలు రెండేళ్ల క్రితం చోరీకి గురయ్యాయి.

మోహసీన్ ఏఎమ్ఏడీ ప్రాజెక్టుకు డైరక్టర్‌గా ఉండేవారు. అణ్వాయుధాలు తయారుచేసుకునేందుకు ఇరాన్ మొదలుపెట్టిన రహస్య ప్రాజెక్ట్ ఇది. అయితే, 2003లో దీన్ని ఇరాన్ నిలిపివేసింది. ఇరాన్ అణు కార్యక్రమాలను సైనికపరంగా అడ్డుకునే సామర్థ్యం ఇజ్రాయెల్‌కు లేదు. వారు ఇలా గూఢచర్య ఆపరేషన్లు మాత్రమే చేయగలరు.

ఇరాన్‌లో ఇలాంటి దాడి చేయగల సామర్థ్యం ఉన్న అతికొద్ది దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. ఇదివరకు కూడా ఇలాంటి పనిని ఆ దేశం చేసింది. అందుకే ఇజ్రాయెల్‌ను ఇరాన్ అనుమానిస్తోంది.

Must Read

spot_img