బ్యాటు, బాలు ఆటకు తాము కూడా రెఢీ అంటున్నారీ అతివలు.. తాజాగా పొట్టి ఫార్మాట్ లోనూ రికార్డుల వరద పారించేందుకు సమాయాత్తం అవుతున్నారు. తాజాగా మహిళల ఐపీఎల్ కు సైరన్ మ్రోగనుండడంతో, తమ క్రికెట్లో మరో విప్లవం రానుందని వీరంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మహిళల ప్రీమియర్ లీగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. మార్చి 4 నుంచి మార్చి 26 వరకు ముంబైలో మహిళల ప్రీమియర్ లీగ్ జరుగుతుందని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు.
దీని ప్రకారం మహిళల ప్రీమియర్ లీగ్లో మొదటి మ్యాచ్ ముంబై, అహ్మదాబాద్ జట్ల మధ్య జరిగే అవకాశం ఉంది. భారత్లో పురుషుల ఐపీఎల్ ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందింది. కొత్తగా ఆరంభం కానున్న మహిళల ప్రీమియర్ లీగ్పై కూడా ఫ్రాంచైజీలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. పాక్షికంగా 2018 నుంచి, బీసీసీఐ ‘మహిళల ట్20 ఛాలెంజ్’ని నిర్వహిస్తోంది. ఇందులో ‘ఐపీఎల్ సూపర్నోవా’, ‘ఐపీఎల్ ట్రైల్బ్లేజర్స్’, ‘ఐపీఎల్ వెలాసిటీ’ జట్లు పాల్గొన్నాయి. డబ్ల్యూపీఎల్లో ఐదు వేర్వేరు ఫ్రాంచైజీలు మొత్తం రూ.4,669 కోట్లకు బిడ్ చేశాయి.
అదానీ స్పోర్ట్స్లైన్ ప్రైవేట్ లిమిటెడ్ అత్యంత ఖరీదైన అహ్మదాబాద్ జట్టును రూ. 1,289 కోట్లకు కొనుగోలు చేసింది. ఇండియావిన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబై టీంను రూ. 912.99 కోట్లకు, రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు టీంను రూ. 901 కోట్లకు కొనుగోలు చేశాయి. జేఎస్డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ దిల్లీ జట్టును రూ. 810 కోట్లకు, కాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లఖ్నవు జట్టును రూ. 757 కోట్లకు కొనుగోలు చేశాయి. ఫిబ్రవరి 13న పై జట్లకు క్రీడాకారిణల వేలం జరిగింది. ఒక్కో ఫ్రాంచైజీ ఆటగాళ్ల వేలం కోసం అధికంగా 12 కోట్ల మొత్తాన్ని వెచ్చించేందుకు అనుమతినిచ్చారు.
ఈ మొత్తంతో 15 నుంచి 18 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఆరుగురు విదేశీ ఆటగాళ్లు ఉండవచ్చు. వేలం ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ డబ్ల్యూపీఎల్ లోగోను ఆవిష్కరించారు. మొత్తం 409 మంది క్రికెటర్లు పోటీ పడుతుండగా, మొత్తం 90 బెర్త్ ల కోసం ఈ వేలం జరగనుంది. భారత వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన పేరుతో వేలం ప్రక్రియ మొదలైంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ స్మృతి మంధానను రూ. 3.4 కోట్లకు ఆమెను కొనుగోలు చేసింది. తొలుత ముంబై ఇండియన్స్ రూ.50 లక్షలకు ఆమె కోసం బిడ్డింగ్ను మొదలుపెట్టింది. వెంటనే ఆర్సీబీ పోటీకి దిగింది. చివరకు ఆర్సీబీ ఆమెను సొంతం చేసుకుంది. తరువాత, హర్మన్ ప్రీత్ కౌర్ను ముంబై ఇండియన్స్ జట్టు రూ. 1.8 కోట్లకు
కొనుగోలు చేసింది. భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ మంచి ధర పలికింది.
మార్క్యూ ప్లేయర్ల జాబితాలో రూ. 50 లక్షల బేస్ ప్రైజ్తో వచ్చిన దీప్తి శర్మను రూ. 2.6 కోట్లకు యూపీ వారియర్స్ దక్కించుకుంది. భారత బౌలర్ రేణుక సింగ్ కోసం ఆర్సీబీ, దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి.చివరకు రూ. 1.5 కోట్లకు రేణుక సింగ్ను ఆర్సీబీ జట్టు దక్కించుకుంది. భారత యువ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ను దిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ.2.2 కోట్లకు కొనుగోలు చేసింది. భారత హిట్టింగ్ బ్యాటర్ షెఫాలీ వర్మను దిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ బీసీసీఐ నిర్వహిస్తుంది.
దాని యాజమాన్య హక్కులు కూడా బోర్డుకే సొంతం. తొలి ఐదేళ్లలో మ్యాచ్ల ద్వారా వచ్చే లాభాల్లో 80 శాతం ఫ్రాంచైజీ యజమానులకు ఇస్తుంది. తదుపరి ఐదు సీజన్లలో 60 శాతం లాభం మాత్రమే ఇస్తుంది. సీజన్ 11 నుంచి సీజన్ 15 వరకు వచ్చే లాభాల్లో 50 శాతం ఫ్రాంఛైజీలకు అందిస్తుంది.ఇది కాకుండా, ఫ్రాంఛైజీలు సరుకులు విక్రయించడం, టిక్కెట్ల అమ్మకాలు, ప్రకటనల ద్వారా కూడా కొంత లాభం పొందవచ్చు. 1976 నుంచి భారతదేశంలో మహిళల క్రికెట్ జరుగుతోంది. ఆ సంవత్సరం భారత మహిళల జట్టు తొలి టెస్ట్ మ్యాచ్ ఆడింది. 1978లో ఈ జట్టు ప్రపంచ కప్ఆడింది.
ఈ అంతర్జాతీయ టోర్నమెంటుకు భారత్ ఆతిధ్యమిచ్చింది. 2007లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటికీ, మహిళా క్రికెటర్లను ఈ లీగ్లో చేర్చలేదు.భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ వుమెన్స్ ప్రీమియర్ లీగ్ గురించి రాసిన్ ట్వీట్ చూస్తే ఇది ఎందుకంత ప్రాముఖ్యమో అర్థమవుతుంది.డబ్ల్యూపీల్ భారతదేశంలో మహిళల క్రికెట్ను మలుపు తిప్పే ఘటన మాత్రమే కాదు. ఇదొక విప్లవం అని అన్నారామె. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ అదానీ స్పోర్ట్స్లైన్ ప్రైవేట్ లిమిటెడ్ హెడ్ సత్యం త్రివేది డబ్ల్యూపీఎల్ .. ఇది చాలా మంచి ప్రారంభం.
దీని కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామని, ఈ లీగ్ విదేశీ మహిళా క్రికెటర్లకు కూడా ప్రోత్సాహకంగా ఉంటుందని ప్రాంఛైజీలు ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక డబ్ల్యూపీల్ మహిళా క్రికెటర్ల నైపుణ్యాలను వెలికితీసే మంచి వేదిక అవుతుందనడంలో సందేహం లేదని కూడా పేర్కొంటున్నాయి. ఇది మహిళా క్రికెటర్ల అభ్యున్నతికి ముందడుగు అని చెబుతున్నాయి. దీనిద్వారా యువ మహిళా క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ లీగ్ ద్వారా కొత్త క్రీడాకారులకు గుర్తింపు లభిస్తుందని, పురుషుల క్రికెట్తో సమానంగా మహిళల క్రికెట్ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఫ్రాంచైజీలు అంటున్నాయి. 15 ఏళ్ల క్రితం 2008లో ఐపీఎల్ కోసం ఎనిమిది జట్లకు వేలంపాట జరిగింది. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక ప్రకారం, ప్రపంచంలో అత్యధికంగా వీక్షించే క్రికెట్ లీగ్ ఐపీఎల్. దీని తరువాత, ఇప్పుడు మహిళల ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్గా అవతరించింది. పురుష ఆటగాళ్లతో సమానంగా మహిళా ఆటగాళ్లను ముందుకు తీసుకురావడంలో ఈ లీగ్ కీలకమైన పాత్ర పోషించగలదు. 2022లో మహిళా క్రికెటర్లకు పురుష క్రికెట్ ప్లేయర్లతో సమానంగా ఫీజులు చెల్లిస్తామని చెప్పారు.
అయితే, గ్రేడ్ ఏ పురుష క్రీడాకారులు, మహిళా క్రీడాకారుల కాంట్రాక్టులు చాలా వివక్షాపూరితంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏటా గ్రేడ్ ఏ పురుష ఆటగాళ్లకు రూ. 7 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తుండగా, మహిళా ఆటగాళ్లకు రూ. 50 లక్షలకే కాంట్రాక్ట్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే, గత కొన్నేళ్లుగా, అభిమానులు, అనుభవజ్ఞులు, మహిళా ఆటగాళ్లు పురుషుల మాదిరిగానే మహిళలకు టీ20 లీగ్ను నిర్వహించాలని బీసీసీఐని డిమాండ్ చేస్తున్నారు. మహిళల టీ20 ఛాలెంజ్ ప్రారంభమైంది.
కానీ, అది ఐపీఎల్ స్థాయి మాత్రం కాదు. మహిళల ఐపీఎల్ తొలి సీజన్ను 2023లో నిర్వహించనున్నట్టు గతేడాది బీసీసీఐ ఎట్టకేలకు ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి బీసీసీఐ అందుకు సన్నాహాలు ప్రారంభించింది. తొలి సీజన్లో ఆరు జట్లతో 22 మ్యాచ్లు ఆడనున్నట్టు చెబుతున్నారు. లీగ్ మార్చిలో ప్రారంభమవుతుంది. అయితే దాని ఫైనల్ పురుషుల ఐపీఎల్ కంటే ముందు జరగనుంది.
తొలి సీజన్లో అన్ని మ్యాచ్లు ముంబైలో నిర్వహించవచ్చని తెలుస్తోంది. మహిళల ఐపీఎల్ మీడియా హక్కులను వయాకామ్ 18 కొనుగోలు చేసినట్లు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఐదేళ్లలో అత్యధికంగా రూ.951 కోట్ల బిడ్ వేశారు. సోనీ, డిస్నీ హాట్స్టార్ కూడా మీడియా హక్కుల కోసం వేలం వేశాయి. మహిళల ఐపీఎల్ తొలి సీజన్ ప్రైజ్ మనీ రూ.12 కోట్లు ఉంటుందని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అదే సమయంలో రన్నరప్కు రూ. 3 కోట్లు ఇచ్చే అవకాశం ఉంది. మూడో స్థానంలో నిలిచిన జట్టు రూ. కోటి రూపాయలు ఇవ్వనున్నారు. అయితే దీనిపై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. జట్లను కొనుగోలు చేసేందుకు 30కి పైగా కంపెనీలు ఐదు కోట్ల రూపాయలకు బిడ్ పత్రాలను కొనుగోలు చేశాయి. వీటిలో పురుషుల ఐపీఎల్ జట్లను కలిగి ఉన్న 10 కంపెనీలు ఉన్నాయి.