పాకిస్తాన్ తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వెంబడి రక్షణ పరమైన మౌలిక వ్యవస్థలను భారత్ బలోపేతం చేస్తోంది. భారత్, పాకిస్తాన్ మధ్య 2, 289 కి.మీ. అంతర్జాతీయ సరిహద్దు ఉండగా, అందులో 192 కి.మీటర్లు .. జమ్మూ ప్రాంతంలోనే ఉంది. తొలి దశలో భాగంగా జమ్మూ ప్రాంతంలో 26 కి.మీ పొడవునా పనులు చేపట్టారు.
మరో 33 కి.మీ. ల పనులు కొనసాగుతున్నాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. సరిహద్దు భద్రతా దళం బంకర్లను పటిష్టం చేయడంతో పాటు సైనిక ట్యాంకుల రాకపోకలకు ర్యాంపులను నిర్మిస్తున్నాయి. గట్ల పునరుద్ధరణ, కంచెలకు మరమ్మతులు, బీఎస్ఎఫ్ పోస్టుల నవీకరణ వంటి తదితర పనులూ ఉన్నాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. సరిహద్దు చెక్ పోస్టులకు దళాలను తరలించే వాహనాలు సులువుగా ప్రయాణించేందుకు మట్టి రహదారులను చదును చేశారు.
కశ్మీర్ ప్రాంతంలోనూ ఎల్ఓసీ వెంబడి ఈ పనులను చేపట్టారు. 2021లో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత ఇంత భారీ ఎత్తున మౌలిక వ్యవస్థలను అభివృద్ధి చేయడం ఇదే తొలిసారి. అంతేగాక శ్రీనగర్ ను రైల్వేలతో అనుసంధానించడం లేదా కాశ్మీర్ నుండి లేహ్ కు అన్ని వాతావరణ రహదారి కనెక్టివిటీ పనులు పురోగతిలో ఉన్నాయి. సోనామార్గ్, మెగా టన్నెల్ ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు వేగంతో కొనసాగుతున్నాయి. ఈ మెగా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సమయం పట్టినా, వేగంగా కొనసాగుతున్నాయి. వాస్తవాధీనరేఖ పొడవునా మన భూభాగంలోకి విదేశీ సైనికులెవరూ చొచ్చుకుని రాకుండా పసిగట్టేందుకు దేశీయంగా అభివృద్ధి పర్చిన రాడార్లను లడఖ్లో ఏర్పాటు చేసేందుకు యత్నాలు సాగిస్తోంది.
ఈ రాడార్లు త్వరలోనే పని చేయడం ప్రారంభిస్తాయి. పదివేల కోట్ల రూపాయిల వ్యయంతో హెచ్పిఆర్ రాడార్లు, అశ్వినీరాడార్లను ఏర్పాటు చేసేందుకు
చకచకా పనులు సాగుతున్నాయి. ఈ రాడార్ల సాయంతో రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో కదలికలను పసిగట్టేందుకు వీలుంటుంది. మరోవైపు చైనా, ఇండియా మధ్య సైనిక ఘర్షణలు పూర్తిగా తొలగిపోలేదు.
ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేలా భారత్ సిద్ధమవుతోంది. నిజానికి వాస్తవాధీన రేఖ వెంబడి మౌలిక సదుపాయాలలో చైనా ముందుంది. అయితే ఈ అంతరాయాన్ని తగ్గించేందుకు ఇండియా చర్యలు తీసుకుంటోంది. రెండేళ్లలో ఎక్కువగా రోడ్లు, సొరంగాలు, వంతెనలు, సైనికుల నివాసాలు, శాశ్వత రక్షణ, హెలిప్యాడ్లు, ఎయిర్ఫీల్డ్ల నిర్మాణాలు చేపట్టిందని డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ సోర్సెస్ ద్వారా తెలిసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. గత వారం కూడా LAC వద్ద పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాల సంఖ్యలో గణనీయమైన తగ్గింపు లేదని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే హెచ్చరించారు. చైనా సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా జరుగుతోందని చెప్పారు.
కొత్త G-695 జాతీయ ఎక్స్ప్రెస్వే కోసం చైనా ప్రణాళికను జనరల్ పాండే ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది వివాదాస్పద భూభాగం అయిన అక్సాయ్ చిన్ ద్వారా LACకి సమాంతరంగా నడుస్తుంది. జిన్జియాంగ్ ప్రావిన్స్ను టిబెటన్అ టానమస్ రీజియన్తో కలుపుతుంది. ఇది PLAకి బలగాలను ముందుకు తరలించడమే కాకుండా ఒక సెక్టార్ నుంచి మరొక సెక్టార్కు బలగాలను మార్చగల సామర్థ్యాన్ని అందిస్తుందని తెలిపారు. ఇండియా తన రక్షణను కోల్పోవడానికి సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. తూర్పులడఖ్లో 30 నెలల మిలిటరీ కన్ఫ్రంటేషన్ కొనసాగుతోంది.
వరుసగా మూడో శీతాకాలం భారత్, చైనా దళాలు సరిహద్దుల వద్ద ముందుకు వచ్చి మోహరించి ఉన్నాయి. ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ద్వారా మరిన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాజెక్టులు మొదలవడానికి సిద్ధంగా ఉన్నాయి. తూర్పు లడఖ్లోని అధిక ఎత్తులో ఉన్న ప్రాంతాలలో 22,000 మంది సైనికులు, 450 ట్యాంకులు, హోవిట్జర్ల టెక్నికల్ స్టోరేజ్ ఫెసిలిటీ కోసం ‘మాడ్యులర్, టెంపరేచర్ కంట్రోల్డ్ అండ్ రీలొకేటబుల్ హబిటాట్’ నిర్మించారు. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ , సిక్కింలో 3,488-కిమీ LAC వెంట ఇలాంటి నిర్మాణాలు చేపడుతున్నారు.

పర్మినెంట్ డిఫెన్స్లో భాగంగా IIT గాంధీనగర్లోని స్టార్ట్అప్లతో కలిసి 100 మీటర్ల T-90 ట్యాంకుల నుంచి డైరెక్ట్ హిట్స్ తీసుకునే కొత్త హైటెక్ `3D ప్రింటింగ్’ నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే చాలా ట్రయల్స్ జరిగాయి. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది నుంచి తూర్పు లడఖ్లోనే కాకుండా ఉత్తర సరిహద్దుల వెంబడి అందుబాటులోకి వస్తుందని సోర్సెస్ వివరించాయి. ఆర్మీ ఇప్పుడు భారీ ఎక్స్కవేటర్లు, స్పైడర్ ఎక్స్కవేటర్లు, తేలికపాటి క్రాలర్ రాక్ డ్రిల్స్ వంటి కొత్త తరం డివైజెస్ మోహరించడంతో, తూర్పు లడఖ్, ఇతర ప్రాంతాలలో కాంబ్యాట్ ఇంజినీర్ల సామర్థ్యం మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగిందని అంచనా వేస్తున్నారు.
అన్ని వాతావరణాల్లో కనెక్టివిటీ, ఫార్వర్డ్ ప్రాంతాలలో త్వరితగతిన దళం మోహరింపులు, మందుగుండు సామగ్రి, క్షిపణులు, ఇంధనం, ఇతర సామాగ్రి
భూగర్భ నిల్వ కోసం టన్నెల్స్ కీలకం. ప్రస్తుతం తొమ్మిది కొత్త టన్నెల్స్ నిర్మాణంలో ఉన్నాయి. అరుణాచల్లోని తవాంగ్కు వ్యూహాత్మక 2.5-కిమీ సెలా టన్నెల్ను రూ.687 కోట్లతో 13,000 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు.
మరో 11 టన్నెల్స్ ప్రణాళికలో ఉన్నాయని పేర్కొన్నారు. అనేక రహదారుల ప్రాజెక్టులు కూడా జరుగుతున్నాయి. 2026 నాటికి మనాలి యాక్సిస్ నుంచి నేరుగా 298-కిమీ నేషనల్ హైవే డబుల్ లేన్ స్పెసిఫికేషన్ రోడ్డు ద్వారా పశ్చిమ లడఖ్, జంస్కార్ వ్యాలీకి ఆల్టర్నేటివ్ కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. రోడ్డులో 4.1-కిమీ ట్విన్ ట్యూబ్ షింకున్ లా టన్నెల్ ఉంది. దాదాపు 65 శాతం పనులు పూర్తయ్యాయని సోర్సెస్ వివరించాయి. అదేవిధంగా కీలకమైన దర్బుక్-ష్యోక్-దౌలత్ బేగ్ ఓల్డి రహదారిపై, కీలకమైన అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్, LAC సమీపంలో పోస్ట్కు కనెక్టివిటీని అందిస్తుంది.
35 వంతెనలు “క్లాస్-70” స్పెసిఫికేషన్లకు అప్గ్రేడ్ చేస్తున్నారని, వచ్చే వర్కింగ్ సీజన్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని సోర్సెస్ చెప్పాయి. ఈ నేపథ్యంలో రక్షణ రంగాన్ని బలోపేతం చేసే నిర్ణయం తీసుకుంది ఇండియన్ ఆర్మీ. ఫార్వర్డ్ ఏరియాల్లో రక్షణ దళాలను బలోపేతం చేసే దిశగా భారత సైన్యం చర్యలు చేపడుతోంది. చైనా, పాక్ ఉద్రిక్తతల మధ్య న్యూక్లియర్ షీల్డ్ను ఇండియన్ ఆర్మీ నిర్మించడం తాజాగా ప్రారంభించింది.
యుద్ధస్థావరాల సమీప ప్రాంతాల్లో సాయుధ బలగాల కోసం న్యూక్లియర్ హార్డెండ్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం స్టార్ట్ చేసింది. అంతేకాదు ఆయుధాల రక్షణార్థం సొరంగాల నిర్మాణానికి అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆర్మీ సంపాదిస్తోంది. పరికరాలను సైతం భారత సైన్యం కొనుగోలు చేస్తోందని నివేదికలు పేర్కొంటున్నాయి. మందుగుండు సామగ్రి స్టోరేజ్ కోసం సొరంగాలు ఇండియన్ ఆర్మీ శరవేగంగా నిర్మిస్తోంది. దీనికితోడు న్యూక్లియర్ పేలుడును తట్టుకునేలా బూట్క్యాంపులు మెరుగుపరిచేందుకు న్యూక్లియర్-హార్డెండ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తోంది.
పాక్ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలే ధ్యేయంగా భారత్ దృష్టి సారిస్తోంది. దీంతో సరిహద్దుల్లో అలజడికి చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది. ఇదీ ఇవాల్టి ఫోకస్.. రేపటి ఫోకస్ లో మళ్లీ కలుద్దాం..