Homeఅంతర్జాతీయంఆదానీ వ్యాపార సామ్రాజ్యానికి తీరని నష్టం..!

ఆదానీ వ్యాపార సామ్రాజ్యానికి తీరని నష్టం..!

హిండెన్ బర్గ్ నివేదిక .. ఆదానీ వ్యాపార సామ్రాజ్యానికి తీరని నష్టాన్ని తెచ్చిపెట్టింది.. అయితే ఈ డబ్బులేవీ.. ఆయన సొంతం కాదన్న విషయం పక్కన పెడితే, అసలు .. ఈ నివేదిక వల్ల లాభం ఒనగూరింది .. ఎవరికి.. నష్టం తెచ్చిందెవరికి .. అన్నదే చర్చనీయాంశంగా మారింది. దీంతో నివేదిక వెనుక ఏం జరిగిందన్నది .. హాట్ టాపిక్ గా మారింది.

  • షార్ట్ సెల్లింగ్ .. హిండెన్ బర్గ్ నివేదికలో .. ఈ పదం ఎక్కువగా వినిపించింది. అసలు ఈ పదానికి .. ఆదానీ వ్యాపారాలకు ఏమిటి సంబంధం..?
  • అసలు ఈ పదం అంటే ఏమిటన్నదే కీలకంగా మారింది.
  • అదేసమయంలో ఈ షార్ట్ సెల్లింగ్ .. ప్రపంచ మార్కెట్లకు సర్వసాధారణమైనా.. భారతమార్కెట్ కు ఏవిధంగా సంబంధం ఉందన్నది తెరపైకి వచ్చింది.

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వల్ల గౌతమ్ అదానీకి సుమారు పది లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అయితే, ఈ డబ్బులన్నీ ఆయన జేబు నుంచి పోలేదు. కానీ, గతవారం రోజుల్లో ఆయన ఆస్తి విలువ బాగా పడిపోయింది. అంతకుముందు ప్రపంచ సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న అదానీ వారం రోజుల్లో కిందకు పడిపోయారు. అయితే, అదానీ గ్రూప్ షేర్ హోల్డర్లకు ఇంత భారీ నష్టం వాటిల్లడం వల్ల ఎవరికి లాభం? ఇదీ పెద్ద ప్రశ్న.

హిండెన్‌బర్గ్ నివేదిక ప్రారంభంలోనే ఒక విషయం స్పష్టంచేసింది. తమ సంస్థ అదానీ గ్రూప్ కంపెనీల్లో షార్ట్ పొజిషన్ తీసుకున్నట్టు తెలిపింది. ఇది, అమెరికా మార్కెట్‌లో బాండ్ ట్రేడింగ్ ద్వారా, ‘డిరైవేటివ్ ఇన్స్ట్రుమెంట్స్’ ద్వారా చేసి ఉండవచ్చు. షార్ట్ పొజిషన్, షార్ట్ సెల్లింగ్ లేదా షార్టింగ్..ఇవన్నీ ఒకటే. ఒక కంపెనీ షేర్ల ధరలు రానున్న రోజుల్లో పెరుగుతాయనే ఉద్దేశంతో వాటిని కొంటారు. అనుకున్నట్లుగా ధరలు పెరిగినప్పుడు ఈ షేర్లను అమ్మి, లాభాలు తీసుకుంటారు. సాధారణంగా స్టాక్ మార్కెట్లో ఇలా జరుగుతుంది. షార్ట్ సెల్లింగ్‌లో దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది.

షేర్ల ధరలు విపరీతంగా పెరిగినప్పుడు లేదా మరేదైనా కారణంతో కొద్ది రోజుల్లో పడిపోవచ్చని భావించినప్పుడు షార్ట్ సెల్లింగ్ చేస్తారు. ఇక్కడ షేర్లు కొనడం
ఉండదు. స్టాక్ బ్రోకర్ నుంచి షేర్లను అప్పుగా తీసుకుంటారు. వాటిని ప్రస్తుత మార్కెట్ ధర వద్ద అమ్ముతారు. ఆ తరువాత షేర్ల ధరలు పడిపోయాక తిరిగి వాటిని కొంటారు. అప్పు తీసుకున్న షేర్లను బ్రోకర్‌కు ఇచ్చేసి, లాభాన్ని జేబులో వేసుకుంటారు. అప్పుగా తీసుకున్న షేర్లు లేదా బాండ్లను తిరిగే ఇచ్చే ఒప్పందానికి ఒక నిర్దిష్టమైన కాలపరిమితి ఉంటుంది. ఇలాంటి ఒప్పందాలను ‘వాయిదా ఒప్పందాలు’ అని కూడా అంటారు.

ఇక్కడ విక్రేత నిర్దిష్ట తేదీలో నిర్దిష్ట ధరకు విక్రయిస్తానని, కొనుగోలుదారు అదే తేదీన అదే ధరకు కొనుగోలు చేస్తానని వాగ్దానం చేస్తారు. వాస్తవంలో డీల్ జరిగిన రోజు ధర తగ్గితే అమ్మకపుదారుడు లాభపడతాడు. ధర పెరిగితే కొనుగోలుదారుడు లాభపడతాడు. ఫ్యూచర్స్ మార్కెట్ లేదా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మార్కెట్ ఈ విధంగా పనిచేస్తుంది. ఉదాహరణకు, 100 షేర్లను ఒక్కొక్కట్టి రూ. 100 చొప్పున ఫిబ్రవరి 10వ తేదీన అమ్ముతానని, వాటిని అదే తేదీన అదే ధరకు కొంటానని ఒప్పందం చేసుకుంటారు. ఈ లావాదేవీ ఫిబ్రవరి 10న కాకుండా, 20వ తేదీన జరగవచ్చు. కానీ, ధరలు 10వ తేదీ ధరలే ఉంటాయి.

20వ తేదీన షేర్ ధర రూ. 80కి తగ్గితే అమ్మకపుదారుడు లాభపడతాడు. షేర్ ధర రూ.120 కి పెరిగితే కొనుగోలుదారుడు లాభపడతాడు. అయితే ఈ షార్ట్ సెల్లింగ్‌లో రెండు రకాలు ఉన్నాయి. కవర్డ్ షార్ట్, అన్‌కవర్డ్ షార్ట్ లేదా నేకెడ్ షార్ట్ అంటారు. నేకెడ్ షార్ట్ సెల్లింగ్ అంటే అమ్మకపుదారుడు షేర్లను అప్పుగా తీసుకోకముందే ఒప్పందంలోకి దిగడం. అప్పు తీసుకుంటానని ఎలాంటి నమ్మకం చూపించకుండా లావాదేవీకి పూనుకోవడం.

ఇది చాలా రిస్క్‌తో కూడిన వ్యవహారం. అనుకున్న కాలానికి ఈ లావాదేవీ పూర్తికాకపోవచ్చు. భారీ నష్టాలు చవిచూడవచ్చు. అందుకే 2007 తరువాత నేకెడ్ షార్ట్ సెల్లింగ్‌ను భారతదేశంలో నిషేధించారు. షార్ట్ సెల్లింగ్‌లో, షేర్ల ధరలు రాన్నున్న రోజుల్లో పడిపోతాయని ఊహించి ట్రేడింగ్ చేస్తారు. కానీ, ధరలు పడిపోకవచ్చు.

బాగా పెరగవచ్చు. గత మూడేళ్లుగా అదానీ గ్రూపు షేర్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వేగంగా కూడా పెరిగాయి. అలాంటప్పుడు, అదానీ గ్రూపు కంపెనీల షేర్ల మీద షార్ట్ సెల్లింగ్ చేసిన అమ్మకపుదారుడు ఎంత నష్టపోతాడో మీరే లెక్కించి చూడవచ్చు.

  • హిండెన్‌బర్గ్ అదానీ గ్రూపులో షార్ట్ పొజిషన్‌లో ఉన్నట్టు నివేదికలో చెప్పింది..

అయితే, అదానీ, హిండెన్‌బర్గ్ కేసు ఇంకొంచం క్లిష్టంగా ఉంది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్.. ఈ పేరు వినగానే, ఇది ఒక పెద్ద పరిశోధన సంస్థ అనుకుంటాం. కానీ, కాదు. అదొక షార్ట్ సెల్లర్. ఈ విషయాన్ని ఆ సంస్థే స్వయంగా చెప్పింది. అది కూడా ‘యాక్టివిస్ట్ షార్ట్ సెల్లర్’ అనే ప్రత్యేక రకం. షార్ట్ సెల్లింగ్ చేసేవారు వారి దగ్గర ఉన్న సమాచారం, మార్కెట్ వాతావరణం మొదలైనవాటిని లోతుగా పరిశీలించి ట్రేడింగ్‌లోకి దిగుతారు. దాని నుంచి అత్యధిక లాభాలు పొందేందుకు ప్రయత్నిస్తారు. అయితే, యాక్టివిస్ట్ షార్ట్ సెల్లర్లు అక్రమాలకు పాల్పడే కంపెనీల కోసం నిరంతరం అన్వేషిస్తుంటారు.

అలాంటి కంపెనీలను పట్టుకుని, వాటి డొల్లతనాన్ని బయటపెట్టి షేర్ల ధరలు పడిపోయేలా చేస్తారు. దీనికొక పద్ధతి ఉంటుంది. యాక్టివిస్ట్ షార్ట్ సెల్లర్లు ముందు కంపెనీలపై పరిశోధన చేస్తారు. ఏదైనా ఒక కంపెనీలో అవకతవకలు ఉన్నాయని తెలియగానే, ఆ కంపెనీ షేర్లపై షార్ట్ సెల్లింగ్ చేస్తారు. ఆ తరువాత, కంపెనీపై తమ పరిశోధనా పత్రాన్ని పబ్లిక్‌లో విడుదల చేస్తారు. దాంతో, ఆ కంపెనీ షేర్ల ధరలు పడిపోతాయి.

దాని నుంచి యాక్టివిస్ట్ షార్ట్ సెల్లర్లు ప్రయోజనం పొందుతారు. అదానీ గ్రూపుతో హిండెన్‌బర్గ్ చేసింది ఇదే. రెండేళ్ల పాటు తాము అదానీ వ్యాపారాన్ని నిశితంగా పరిశీలించామని, అదానీ గ్రూపుకు సంబంధించిన వాస్తవాలు, పత్రాలను పరిశోధించామని పేర్కొన్నారు. కానీ, హిండెన్‌బర్గ్‌కు భారతీయ మార్కెట్లో అదానీ కంపెనీలలో షార్ట్ సెల్లింగ్ చేయడం అంత సులభం కాదు. దీనిపై అమెరికాకు చెందిన ఇతర షార్ట్ సెల్లర్లు విస్తుపోతున్నారని, హిండెన్‌బర్గ్ నిజానికి ఎలాంటి ట్రేడింగ్ చేసింది? ఎలా చేసింది? తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కథనాలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే, విదేశీయులకు భారతీయ కంపెనీలలో షార్ట్ సెల్లింగ్ చేయడం చాలా కష్టం. దీనికి ఒక కారణం, 2007లో షార్ట్ సెల్లింగ్‌పై సెబి తీసుకొచ్చిన కొత్త నిబంధనలు. మరొక కారణం, విదేశీ సంస్థలకు తమ షార్ట్ సెల్లింగ్ ట్రేడింగ్‌కు సంబంధించిన సమాచారం మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది హిండెన్‌బర్గ్ వంటి యాక్టివిస్ట్ షార్ట్ సెల్లర్‌కు కష్టం. యాక్టివిస్ట్ షార్ట్ సెల్లర్లు తాము టార్గెట్ చేసే కంపెనీలో షార్ట్ సెల్లింగ్ చాలా రహస్యంగా చేయాల్సి ఉంటుంది.

ఈ విషయం బయటికొస్తే వెంటనే ఆ కంపెనీ షేర్ల ధరలలో భారీ పతనం ఉంటుంది. ఇది షార్ట్ సెల్లర్‌కు మంచిది కాదు. అందుకే వాళ్ల ట్రేడింగ్ పూర్తయ్యేవరకు ఈ విషయన్ని రహస్యంగా ఉంచాలి. హిండెన్‌బర్గ్ స్వయంగా చెప్పిన వివరాల ప్రకారం, ఈ ట్రేడింగ్ చేసి డబ్బు సంపాదించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది, అమెరికా మార్కెట్లో ట్రేడింగ్ జరిగే అదానీ కంపెనీ షేర్లు లేదా బ్లాండ్లను అమ్మడం, రెండోది డెరివేటివ్ సాధనాల ద్వారా ట్రేడింగ్ చేయడం. సాధారణ పెట్టుబడిదారుడికి కూడా వాటిపై 32 శాతం వరకు సంపాదించే మార్గం కనిపిస్తోంది.

అయితే, హిండెన్‌బర్గ్‌కు కేవలం దీనిపై ఆధారపడే లాభం వస్తుందంటే నమ్మడం కష్టం. అమెరికాలో అదానీ కంపెనీలకు కొన్ని వందల కోట్ల డాలర్ల షేర్లు మాత్రమే ఉన్నాయి. వాటిని అప్పుగా తీసుకుని, షార్ట్ సెల్లింగ్ చేసి భారీ లాభాలు సంపాదిస్తారన్న లెక్క చాలా చిన్నదిగా అనిపిస్తోంది. రెండో మార్గం డెరివేటివ్స్. అంటే ట్రేడింగ్ నేరుగా షేర్ల అమ్మకాలు, కొనుగోళ్లు కాకుండా వేరే అంశాలపై ఆధారపడి జరగడం. ఉదాహరణకు, సింగపూర్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో భారతదేశంలోని నిఫ్టీకి చెందిన ఒక డెరివేటివ్ నడుస్తుంటుంది. ఎస్‌జీఎక్స్ నిఫ్టీలో ట్రేడింగ్ చేయాలంటే భారతదేశ స్టాక్ మార్కెట్ చట్టాలు పాటించక్కర్లేదు. అయితే, ఎస్‌జీఎక్స్ నిఫ్టీలో హెచ్చుతగ్గులు భారతదేశంలో నిఫ్టీ హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటాయి.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన .. ఆదానీ హిండెన్ బర్గ్ కథ .. ఇప్పుడు తెరపైకి కొత్త ప్రశ్నల్ని తీసుకువచ్చాయి. దీంతో ఈ కథనాల్లో ఏం జరిగిందన్న చర్చ నిపుణుల్లోనే కాక సామాన్యుల్లోనూ ఆసక్తిని పెంచుతోంది.

Must Read

spot_img