ఐక్యరాజ్యసమితి సదస్సులో ఎట్టకేలకు చారిత్రక ఒప్పందం కుదిరిందా..? జీవవైవిధ్య పరిరక్షణకు ఏళ్ల తరబడి జరిగిన చర్చోపచర్చలు, సంప్రదింపులు ఓ కొలిక్కి వచ్చాయా..? భూమిపై జీవవైవిధ్యాన్ని పరిరక్షించే దిశగా కీలక ముందడుగు పడిందా…?
జీవ వైవిధ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ప్రపంచంలోని దాదాపు 200 దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరిందా..? ఈ ఒప్పందంలోని దేశాలు ప్రతి ఏటా ఎంత నిధిని సమకూర్చనున్నాయి..? ”కున్మింగ్-మాంట్రియల్’ ఒప్పందం ప్రధాన లక్ష్యాలేంటి….?
ఏళ్ల తరబడి జరిగిన చర్చోపచర్చలు, సంప్రదింపులు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చాయి. భూమిపై జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే దిశగా కీలక ముందడుగు పడింది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కెనడాలోని మాంట్రియల్లో డిసెంబర్ 7 నుంచి జరుగుతున్న కాప్-15 అంతర్జాతీయ సదస్సులో భారత్తో సహా దాదాపు 200 దేశాలు ఈ విషయంలో విభేదాలు వీడి ఒక్కతాటిపైకి వచ్చాయి.
కీలకమైన కుమ్నింగ్-మాంట్రియల్ జీవవైవిధ్య ప్రణాళికకు ఎట్టకేలకు అంగీకారం తెలిపాయి. ఈ మేరకు ”కున్మింగ్-మాంట్రియల్’ ఒప్పందం ఆమోదముద్ర పొందినట్టు సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న చైనా పర్యావరణ మంత్రి హువాంగ్ రుంక్యూ సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. పారిస్ ఒప్పందం తరహాలోనే పర్యావరణ పరిరక్షణ యత్నాల్లో దీన్నో కీలక మైలురాయిగా భావిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా వర్ధమాన దేశాల్లో భూ భాగాలు, సముద్ర జలాలతో పాటు జంతు జాతులను కాలుష్యం, వాతావరణ మార్పుల బారి నుంచి పూర్తిస్థాయిలో రక్షించడం ఈ ఒప్పందం లక్ష్యం. అయితే ఇందుకు సమకూర్చాల్సిన ఆర్థిక ప్యాకేజీపై ఎంతో కాలంగా పడ్డ పీటముడి ఎట్టకేలకు వీడింది.
ఆ మొత్తాన్ని ఇతోధికంగా పెంచి 2030 కల్లా ఏటా 200 బిలియన్ డాలర్లకు చేర్చాలని నిర్ణయం జరిగింది. 2020లో అంగీకరించిన మొత్తంతో పోలిస్తే ఇది రెట్టింపు.. ఈ కీలక అంగీకారం నేపథ్యంలో ఒప్పందానికి మార్గం సుగమమైంది. ఇందులో భాగంగా మొత్తం 23 లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. వాటిని
2030 కల్లా సాధించాలన్నది లక్ష్యం.
దీన్ని పలు పర్యావరణ సంస్థలు స్వాగతించగా…. ఆర్థిక, పరిరక్షణ పరమైన పలు కీలకాంశాలను పట్టించుకోలేదంటూ పర్యావరణ వేత్తలు పెదవి విరుస్తున్నారు. దీన్ని ప్రపంచ ప్రజల విజయంగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ జనరల్ మార్కో లాంబెర్టినీ అభివర్ణించారు. అయితే, లక్ష్యసాధనకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక లేకపోవడం ఈ ఒప్పందంలో కీలక లోపమని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ గ్లోబల్ పాలసీ సీనియర్ డైరెక్టర్ లిన్ లీ అన్నారు.
జీవ వైవిధ్యానికి గత 50 ఏళ్లలో కనీవినీ ఎరగని స్థాయిలో ముప్పు వాటిల్లింది. చాలా రకాల జీవ జాతులు 1970 నుంచి ఏకంగా 69 శాతం క్షీణించాయని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ – లివింగ్ ప్లానెట్ నివేదిక పేర్కొంది. పర్యావరణానికి జరుగుతున్న ఈ అపార నష్టానికి అడ్డుకట్ట వేసి జీవ వైవిధ్యాన్ని పెంపొందించేందుకు తాజాగా ఒప్పందమైతే కుదిరింది.
కాకపోతే దాని అమలులో దేశాలు ఏ మేరకు చిత్తశుద్ధి కనబరుస్తాయన్నది కీలకం. ఎందుకంటే ఇందుకోసం ఏటా 200 బిలియన్ డాలర్లు వెచ్చించేందుకు ఎట్టకేలకు అంగీకారం కుదిరినా, ఇందులో వర్ధమాన దేశాల అవసరాలు తీర్చేందుకు సంపన్న దేశాలు కేటాయించబోయే వాటా ఎంత వంటి కీలకాంశాలపై మాత్రం ఇంకా స్పష్టత లేదు.
జీవ వైవిధ్య పరిరక్షణకు 2010లో జపాన్లోని నగోయాలో జరిగిన కాప్-10 సదస్సులో దేశాలన్నీ పలు లక్ష్యాలు నిర్దేశించుకున్నాయి. అవి చాలా వరకు లక్ష్యాలుగానే మిగిలిపోయాయి. దాంతో మరోసారి అంతర్జాతీయ స్థాయి మేధోమథనం కోసం 2020 అక్టోబర్లో చైనాలోని కుమ్నింగ్లో తలపెట్టిన కాప్-15 సదస్సు కరోనా వల్ల వాయిదా పడింది. అది తాజాగా రెండు దశల్లో జరిగింది.
తొలి భాగం వర్చువల్ పద్ధతిలో ముగియగా… మాంట్రియల్ లో డిసెంబర్ 7 నుంచి 19 దాకా జరిగిన కీలకమైన రెండో భాగంలో చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా మొత్తం 23 లక్ష్యాలను ప్రపంచ దేశాలు నిర్దేశించుకున్నాయి. ఈ ప్రధానాంశాలలో 2030 కల్లా మొత్తం భూభాగం, సాధారణ జలాలు, తీర ప్రాంతాలు, సముద్రాల్లో కనీసం 30 శాతాన్ని పూర్తిస్థాయిలో సంరక్షించి, పరిరక్షించే చర్యలు చేపట్టడం.
అపార జీవ వైవిధ్యానికి నిలయమైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడం. ప్రస్తుతం 17 శాతం భూభాగం, కేవలం 10 సముద్ర జలాల్లో మాత్రమే పరిరక్షణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
అంతేకాదు.. జీవ వైవిధ్యపరంగా అపార ప్రాధాన్యమున్న ప్రాంతాల్లో పర్యావరణ నష్టాలను అరికట్టడం కూడా ఒకటి.. ఇందుకోసం పేద దేశాలకు చేసే కేటాయింపులను 2025కల్లా ఏటా 20 బిలియన్ డాలర్లకు, 2030 కల్లా 30 బిలియన్ డాలర్లకు పెంచాలని నిర్ణయించారు.. ప్రపంచ ఆహార వృథాను సగానికి తగ్గించడంతో పాటు వనరుల విచ్చలవిడి వాడకాన్ని, తద్వారా వ్యర్థాల ఉత్పత్తిని వీలైనంత కట్టడి చేయాలని ఒప్పందంలో కీలకాంశం..
ఇక.. సాగులో పురుగు మందులు, ఇతర అత్యంత ప్రమాదకర రసాయనాల వాడకాన్ని కనీసం సగానికి తగ్గించడం…. జీవ వైవిధ్యానికి అపారమైన హాని కలిగించే సాగు సబ్సిడీలను 2030 నాటికి ఏటా 500 బిలియన్ డాలర్ల చొప్పున తగ్గించాలని నిర్ణయించారు.. జీవ వైవిధ్య సంరక్షణకు దోహదపడే పథకాలు, చర్యలకు ప్రోత్సాహకాలను పెంచడం… భారీ, అంతర్జాతీయ కంపెనీలు, ఆర్థిక సంస్థలు, తమ కార్యకలాపాల వల్ల పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి కలిగే నష్టాన్ని ఎప్పటికప్పుడు పారదర్శకంగా వెల్లడించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవడంతో పాటు ఆ నష్టాలను అవి కనీస స్థాయికి పరిమితం చేసేలా చర్యలు తీసుకోవడం చారిత్రక ఒప్పందంలో కీలకాంశాలుగా ఉన్నాయి..
జీవనశైలితో పర్యావరణం కాలుష్యం చెందడంతో భూగోళం వేడెక్కిపోతుంది..!
భూమిపై జీవాల మధ్య భేదాన్నే ‘జీవవైవిద్యం’ అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిద్యం సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల పరిణామం. మన జీవనశైలితో పర్యావరణం కాలుష్యం చెందడంతో భూగోళం వేడెక్కిపోతుంది. దీంతో జీవవైవిద్యం దెబ్బతింటోంది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఇదివరకూ ప్రతి ఇంటిలో పిచ్చుకలు ఉండేవి.
రాను రానూ అవి కనుమరుగైపోతున్నాయి. ప్రపంచంలోని 12 మహా జీవవైవిద్య ప్రాంతాలలో భారత దేశం ఒకటి. సుమారు 45 వేల వృక్ష జాతులు, దాదాపు 77 వేల జంతు జాతులు ఈ దేశంలో ఉన్నాయి. కానీ ఇదంతా గతం. నేడు ఆ విస్తారమైన జీవ సంపదలో 10 శాతానికిపైగా ప్రమాదంలో ఉంది. వాటిలో చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలలో 50 శాతానికిపైగా అరణ్యాలు, 70 శాతానికి పైగా నీటి వనరులు లుప్తమైపోయాయి. విస్తారంగా ఉన్న పచ్చిక బయళ్ళను మన జీవనశైలితో రూపుమాపేశాము. సముద్రతీరాలను అతలాకుతలం చేసేశాము.
ఇవన్నీ చాలవన్నట్టు అరణ్యాలలోని వన్యప్రాణుల్ని వేటాడి కొందరు అంతమొందిస్తున్నారు.
వ్యవసాయంలో రసాయనిక ఎరువులకు, కీటక నాశనులకు ప్రాధాన్యత పెరిగింది. మందుల కంపెనీల లాభాపేక్ష వాటిని అధికంగా, విచక్షణారహితంగా వాడేలా చేసింది. దీంతో మన నేలను, దానిపై నివసించే విలువైన జీవసంపదను కోల్పోవాల్సి వచ్చింది. జన్యుమార్పిడి కూడా జీవవైవిద్యాన్ని దెబ్బతీస్తోంది.
వీటిని రూపొందించే, ప్రవేశపెట్టే విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రక్షణ సంబంధమైన నియంత్రణలను పాటించాలి. జన్యుమార్పిడివల్ల వచ్చే ప్రభావాలు స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో ఎలా ఉంటాయో పూర్తి అధ్య యనం చేయకుండా వీటిని ఏ జీవజాతుల్లోనూ ప్రవేశ పెట్టకూడదు. తొందరపడితే ప్రస్తుతం మనుగడలోని జీవజాతికే ప్రమాదం వాటిల్లు తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
జీవ వైవిధ్య పరిరక్షణకు మాంట్రియల్ లో డిసెంబర్ 7 నుంచి 19 దాకా జరిగిన కీలకమైన రెండో భాగంలో చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా మొత్తం 23 లక్ష్యాలను ప్రపంచ దేశాలు నిర్దేశించుకున్నాయి. మరి.. ఈ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు ఆయా దేశాలు ఏ మేరకు చిత్తశుద్దితో పనిచేస్తాయో చూడాలి..