Homeజాతీయంభారత్ లో ఉష్ణోగ్రతలు .. వేలాది మంది మరణిస్తున్నారా..?

భారత్ లో ఉష్ణోగ్రతలు .. వేలాది మంది మరణిస్తున్నారా..?

ఇప్పుడీ చర్చ .. దేశవ్యాప్తంగా హీట్ ను పెంచుతోంది. ప్రపంచబ్యాంక్ తాజా నివేదికలో .. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలు.. సామాన్యులను వణికిస్తున్నాయి..

శ్రమశక్తి అధికంగా ఉన్న భారతదేశంలో .. ఆ శక్తికే ప్రమాదం ఏర్పడిందన్న వార్త .. అలజడికి కారణమవుతోంది. దేశంలో కొన్నేళ్లుగా పెరుగుతోన్న
ఉష్ణోగ్రతలు.. శ్రామికుల ఆయువు తీస్తున్నాయన్న వాదనలు .. ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌లో వేలాది మరణాలకు కారణమైన తీవ్రమైన వేడి గాలులు భయంకరంగా పెరుగుతున్నాయని, త్వరలో మనిషి మనుగడ పరిమితిని మించి వడగాల్పులు వీచే ప్రపంచంలోని మొదటి దేశంగా భారత్ మారొచ్చని ప్రపంచ బ్యాంకు నివేదిక హెచ్చరించింది. భారత శీతలీకరణ రంగంలో వాతావరణ పెట్టుబడుల అవకాశాలు పేరుతో ప్రపంచ బ్యాంకు ఓ నివేదికను రూపొందించింది. భారత్ ముందస్తు అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటోందని, ఇది చాలా కాలం పాటు ఉంటుందని నివేదికలో అంచనా వేసింది.

ఏప్రిల్‌ 2022లో వేసవి ప్రారంభంలోనే వేడిగాలులతో భారత్ ఉక్కిరిబిక్కిరయ్యింది. ఇది దేశాన్ని స్తంభింపజేసింది. రాజధాని న్యూఢిల్లీలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది మార్చి నెలలో అసాధారణ రీతిలో ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదయ్యిందని పేర్కొంది. కేరళ ప్రభుత్వంతో కలిసి ప్రపంచ బ్యాంకు నిర్వహిస్తున్న రెండు రోజుల ‘ఇండియా క్లైమేట్ అండ్ డెవలప్‌మెంట్ పార్టనర్స్ మీట్’సందర్భంగా ఈ నివేదికను విడుదల చేయనున్నారు.

భారత్‌లో వడగాల్పులు పరిస్థితి మానవ మనుగడ పరిమితిని విచ్ఛిన్నం చేయగలదని అంచనా వేసిన ప్రపంచ బ్యాంకు.. దక్షిణాసియా అంతటా పెరుగుతున్న ఉష్ణోగ్రతల గురించి అనేక మంది వాతావరణ శాస్త్రవేత్తలు చాలా కాలంగా హెచ్చరించిన దానికి ఇటీవల పరిస్థితులు మద్దతు ఇస్తాయని పేర్కొంది.

ఆగస్టు 2021లో వాతావరణ మార్పులపై ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆరో నివేదిక రాబోయే దశాబ్దంలో భారత ఉపఖండం మరింత తీవ్రమైన వేడి గాలులను ఎదుర్కొంటుందని చెప్పింది. దీని అంచనా ప్రకారం కార్బన్ ఉద్గారాలు ఎక్కువగా ఉంటే 2036-65 నాటికి భారత్ అంతటా వేడి గాలులు 25 రెట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉందని G20 క్లైమేట్ రిస్క్ అట్లాస్ 2021లో పేర్కొంది.

భారత్ అంతటా పెరుగుతున్న వేడి ఆర్థిక ఉత్పాదకతను దెబ్బతీస్తుందని కూడా నివేదిక హెచ్చరించింది. భారతదేశంలోని శ్రామికశక్తిలో 75 శాతం లేదా 380 మిలియన్ల మంది ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు.. కొన్నిసార్లు ప్రాణాంతక ఉష్ణోగ్రతలలో పని చేస్తున్నారు. 2030 నాటికి 80 మిలియన్ల ప్రపంచ కార్మికులలో భారత్‌కు చెందిన 34 మిలియన్లను మంది ఉష్ణ ఒత్తిడితో సంబంధం ఉన్న ఉత్పాదకత క్షీణతతో నష్టపోతారని నివేదిక అంచనా వేసింది.

దక్షిణాసియా దేశాలలో భారత్ కార్మికులపై అత్యధిక ఉష్ణోగ్రత ప్రభావం చూపిందని, సంవత్సరానికి 101 బిలియన్ గంటల కంటే ఎక్కువ నష్టం వాటిల్లిందని పేర్కొంది. గ్లోబల్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ మెకిన్‌సే అండ్ కంపెనీ విశ్లేషణ ప్రకారం.. పెరుగుతున్న వేడి, తేమ కారణంగా కోల్పోయిన కార్మికులు ఈ దశాబ్దం చివరినాటికి భారతదేశ జీడీపీలో 4.5% అంటే సుమారు 150-250 బిలియన్ అమెరికా డాలర్లు ప్రమాదంలో పడొచ్చని పేర్కొంది. భారత్ దీర్ఘకాలిక ఆహార, ప్రజారోగ్య భద్రత నమ్మకమైన కోల్డ్ చైన్ నెట్‌వర్క్‌పై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది.

భారతదేశం అంతటా ఆహారం, ఔషధాలను రవాణా చేయడానికి అడుగడుగునా పనిచేసే కోల్డ్ చైన్ శీతలీకరణ వ్యవస్థ అవసరం. ప్రయాణంలో ఒక్కసారి ఉష్ణోగ్రత తగ్గడం వల్ల శీతలీకరణ వ్యవస్థ విచ్ఛినమై తాజా ఉత్పత్తులు చెడిపోవచ్చు.. టీకాల శక్తిని బలహీనపడుతుంది. భారతదేశంలో తాజా ఉత్పత్తుల్లో కేవలం 4 శాతం మాత్రమే కోల్డ్ చైన్ సౌకర్యాలతో ఉన్నాయి.

కోవిడ్-19కి ముందు ప్రపంచంలోని ఔషధాల ఉత్పత్తిలో మూడో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న భారత్.. శీతలీకరణ వ్యవస్థ చెడిపోవడంతో దాదాపు 20 శాతం
ఉష్ణోగ్రత-సున్నితమైన వైద్య ఉత్పత్తులు, 25 శాతం వ్యాక్సిన్‌లను కోల్పోయింది.

భారతదేశం అంతటా ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, శీతలీకరణకు డిమాండ్ పెరుగుతుంది.

ఏడాదిలో ఇది 313 మిలియ డాలర్లు నష్టానికి దారితీసిందని పేర్కొంది. భారతదేశం అంతటా ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, శీతలీకరణకు డిమాండ్ పెరుగుతుంది. అయితే, జనాభాలో మూడింట రెండొంతుల మంది రోజుకు 2 డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్న దేశంలో ఎయిర్ కండిషనింగ్ యూనిట్ సగటు ధర 260 నుంచి 500 డాలర్లకు చేరవచ్చు.

విలాసవంతమైన ఎయిర్-కూలింగ్ సిస్టమ్‌లు కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉంటాయి.. ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ లో సమర్పించిన విశ్లేషణ ప్రకారం.. కేవలం ఎనిమిది శాతం భారతీయ కుటుంబాలు మాత్రమే ఎయిర్ కండిషనింగ్ యూనిట్లను కలిగి ఉన్నాయి. ఇండోర్, ఎలక్ట్రిక్ ఫ్యాన్లు థర్మల్ సౌకర్యానికి సహాయపడతాయి.. అయితే ఇవి కొనడానికి చాలా ఖరీదైనవి.. అసమర్థమైనవి. తత్ఫలితంగా భారత్‌లోని అనేక పేద, అట్టడుగు వర్గాలకు తీవ్రమైన వేడి మరింత హాని కలిగిస్తుంది.

దీంతో కొన్ని దశాబ్దాల నుంచి వేలాది మందిని పొట్టనబెట్టుకుంటున్న వడగాడ్పులు మరింత ఉగ్రరూపం దాల్చనున్నాయి. వచ్చే ఏడాది వేసవి మహా డేంజర్ అని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా భారత్ లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశముందని అంటున్నారు. భారత దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటే, కూలింగ్ కోసం డిమాండ్ కూడా పెరుగుతుందని ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ నివేదిక చెప్తోంది. చాలా మంది నిరుపేదలు,
అణగారిన వర్గాలు ఉష్ణోగ్రతలకు దెబ్బతింటాయని తెలిపింది.

చల్లబరచే సాధనాలేవీ లేకుండా క్రిక్కిరిసిన, వెలుతురు లేని ఇళ్లలో నివసిస్తూ దెబ్బతింటారని పేర్కొంది. విపరీతమైన వేడి వాతావరణంలో చల్లదనంలో ఉండటం సదుపాయం కాదని, జీవన్మరణ సమస్య అని వివరించింది. దీంతో వీరంతా అందుబాటులో ఉండే వనరులతోనే ఎండ తీవ్రతను నియంత్రించుకోవాల్సి ఉందని తెలిపింది.

గత 122 ఏళ్ల నుంచి భారతదేశ చరిత్రలోనే ఈ ఏడాది మార్చి అత్యంత వేడి నెలగా నమోదైందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది 2010లో నమోదైన ఆల్ టైమ్-సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డును బద్దలు కొట్టింది. మార్చి 2010లో భారతదేశం సగటు నెలవారీ ఉష్ణోగ్రత 33.09 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగింది. అయితే, గత నెలలో సగటు నెలవారీ ఉష్ణోగ్రత 33.1 డిగ్రీలుగా నమోదైంది. 1901 నుంచి మార్చి నెలలో నమోదైన అన్ని అధిక ఉష్ణోగ్రతల రికార్డులను ఇది అధిగమించింది.

ఈ ఏడాది మార్చి 20న ఢిల్లీలోని పితంపుర పర్యవేక్షణ స్టేషన్‌లో 39.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గత కొన్నేళ్ల నుంచి మార్చి నెలలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. 2020, 2021లో మార్చి ఉష్ణోగ్రతలు గత రికార్డులను బద్దలు కొట్టాయి. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం, నెలవారీ సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత పరంగా 2021 మార్చి నెల గత 121 ఏళ్లలో మూడో అత్యంత వేడి నెలగా నమోదైంది. ఈ ఏడాది మార్చిలో దేశంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం.

దీంతో ప్రపంచవ్యాప్తంగా గత రెండు దశాబ్దాలలో అత్యంత వేడి నమోదైన సంవత్సరాలు ఉన్నాయి. వాతావరణ మార్పులు భారతదేశంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వేడిగాలులు, తుపాను తీవ్రత లేదా భారీ వర్షపాతం కూడా ఇందుకు కారణం కావచ్చని వాతావరణ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. వాయవ్య, మధ్య భారతం, ఈశాన్య ప్రాంతాల్లో సాధారణం కంటే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక దక్షిణం, తూర్పు ప్రాంతాలు, ఈశాన్య పరిసర ప్రాంతాలలో సాధారణం లేదా అంత కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.వాతావరణ మార్పుల ప్రభావం ఉంటుందన్న అంచనా ప్రతి ఒక్కరికీ ఏదో ఒకసారి అవగతమవుతోంది.

దేశంలో అధిక వేడి.. ఏకంగా ప్రాణాలు తీసేస్తోందన్నది మాత్రం .. భయాందోళనలకు దారి తీస్తోందని విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.

Must Read

spot_img