అన్ని రంగాల్లో రోజురోజుకు టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. అయితే.. స్మార్ట్ ఫోన్ టెక్నాలజీతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి.. ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా స్మార్ట్ఫోన్ ను ఉపయోగించి.. ఇంట్లోనే రక్తపరీక్షలు చేసుకోవచ్చని చెబుతుండటం సరికొత్త చర్చకు తెరలేపింది.
సెల్ఫీ వీడియోలతో రక్తం సరఫరా తీరును, గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చా…? స్మార్ట్ ఫోన్ ఉపయోగించి ఇంట్లోనే రక్తపరీక్ష చేసుకోవచ్చా…? సరికొత్త మొబైల్ టెక్నాలజీల అభివృద్ధి కోసం జరుగుతున్న పరిశోధనలు ఏం చెబుతున్నాయి..?’
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎన్నో టిప్స్ పాటించినా ఏటా గుండె సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. దీనిపై ప్రతి ఒక్కరికీ కచ్చితంగా అవగాహన ఉండాల్సిందే. ప్రాణాలు తీస్తున్నఈ భయంకరమైన వ్యాధి గురించి ముందు నుంచే జాగ్రత్త పడడం చాలా మంచిది. ఆరోగ్యకరమైన జీవనాన్ని పాటించడం, ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం, చెడు అలవాట్లకి దూరంగా ఉండడం చాలా మంచిది. ఆరోగ్య సమస్యలతో పాటు గుండె సమస్యల్ని దూరం చేయడంలో లైఫ్స్టైల్ విధానం చాలా హెల్ప్ చేస్తుంది. సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది పడే బదులు రాకముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని లక్షణాలు, ఇతర చిట్కాల ద్వారా గుండె ఆరోగ్యం గురించి ముందుగానే తెలుసుకోవచ్చు. రోజురోజుకి పెరుగుతున్న గుండె సమస్యలకి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా, పెరుగుతున్న వయసు, పొగత్రాగడం, వర్కౌట్స్ చేయకపోవడం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వంటివి ముఖ్యంగా ఉన్నాయి. నిజానికీ గుండె జబ్బులు ప్రాణాలకే ప్రమాదం. నేటి కాలంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ గుండె జబ్బులతోనే మరణించే వారి సంఖ్య పెరుగుతోంది.. ఇంత ప్రమాదకరమైన సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి.

రక్తం గడ్డకట్టడం’ అనే సమస్య ఎవరికైనా ప్రమాదకరమే. రక్తం అవసరమైన దానికన్నా తక్కువగా గడ్డకట్టినట్లయితే, అధిక రక్తస్రావం వల్ల ప్రాణాలు కోల్పోయే ముప్పుంది. రక్తం అవసరమైన దానికన్నా ఎక్కువగా గడ్డకట్టినట్లయితే, థ్రాంబోసిస్ ముప్పు తలెత్తుతుంది. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. సాధారణంగా ల్యాబ్లో వైద్య బృందం బ్లడ్ టెస్టులు చేస్తారు. అయితే, మీ రక్తం నమూనాలు లేనిదే ఆ టెస్టులు చేయడం అసాధ్యం. కానీ… త్వరలో స్మార్ట్ఫోన్ను ఉపయోగించి మీరే ఇంట్లోనే రక్త పరీక్ష చేసుకొనే టెక్నాలజీ రావొచ్చు. మొట్టమొదటి మొబైల్ ఫోన్ను అభివృద్ధి చేసిన బృందానికి మార్టిన్ కూపర్
నాయకత్వం వహించారు. మన ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవడానికి సెల్ఫోన్లు ఒక ముఖ్యమైన సాధనంగా మారతాయని ఆయన విశ్వసించారు. అది ఇప్పటికి నెరవేరుతోంది. మొబైల్ ఫోన్లో మొదటి కాల్ మాట్లాడి 50 ఏళ్లవుతోంది. ఈ ఐదు దశాబ్ధాల్లో కొత్త కొత్త వెర్షన్స్ వచ్చి వినియోగదారులను మెప్పించాయి. ఇంకా మెప్పిస్తూనే ఉన్నాయి.
2022 మార్చిలో యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్త్రవేత్తలు ఒక చుక్క రక్తంలో గడ్డకట్టే ప్రక్రియను గుర్తించడానికి ఐఫోన్ను ఉపయోగించారు. డివైజ్లోని లైడార్ సెన్సర్తో పరీక్షించారు. పల్స్డ్ బీమ్లను ఉపయోగించి లైడార్ ఫోన్ పరిసరాల 3డీ చిత్రాలను రూపొందిస్తుంది. వస్తువులు లేదా దూరాల కచ్చితమైన కొలతలను తీసుకొని, వాస్తవ ప్రపంచాన్ని వర్చువల్ ప్రపంచాన్ని ఆగ్మెంటెడ్ రియాలిటీతో కలిపేందుకు మొబైల్కు సాయపడే టెక్నాలజీ ఇది. ఉదాహరణకు మీ గదిలో ఎలాంటి ఫర్నిచర్ ఉందో ఇది చెబుతుంది. ఫొటోలు తీసేటప్పుడు ఆటో ఫోకస్ను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. రక్తం గడ్డకట్టడం, పాలలో కల్తీని గుర్తించడంలో సెన్సర్ కచ్చితమైనదని తేలింది. గాజు ముక్కపై ఉంచిన చిన్న బిందువు నుంచి గడ్డకట్టిన, గడ్డకట్టని రక్తం మధ్య తేడాను గుర్తించగలిగామని పరిశోధకులు కనుగొన్నారు. రక్తం గడ్డకట్టడాన్ని అంచనా వేయడం కోసం ఒక చుక్క రక్తంలో రాగి కదలికను ట్రాక్ చేయడానికి పరిశోధనా బృందం ఇటీవల స్మార్ట్ఫోన్లో వైబ్రేషన్ మోటార్, కెమెరాను కూడా ఉపయోగించింది.
రక్తపోటు, గుండె ఆరోగ్యానికి సంబంధించిన ఇతర అంశాలను పరిశీలించడానికి పలువురు పరిశోధకులు ఫోన్ కెమెరా ఉపయోగించే టెక్నిక్లను అభివృద్ధి చేస్తున్నారు. స్మార్ట్ఫోన్ ఫ్రంట్ కెమెరాలతో తీసే వీడియోలతో ఆ వ్యక్తి ముఖంలో రక్తం సరఫరాలో మార్పులను గుర్తించగల అల్గారిథమ్లను కెనడాలోని టొరంటో యూనివర్శిటీ, చైనాలో జెజియాంగ్లోని హాంగ్జౌ నార్మల్ వర్సిటీల పరిశోధకులు అభివృద్ధి చేశారు. మరో చైనీస్ శాస్త్రవేత్తల బృందం డీప్-లెర్నింగ్ అల్గారిథమ్ అభివృద్ధి చేసింది. ఇది స్మార్ట్ఫోన్ ఉపయోగించి తీసిన నాలుగు రకాల చిత్రాల ఆధారంగా గుండె ఆరోగ్యంతో పాటు ఇతర సమస్యలను గుర్తించగలదు. ఈ అల్గారిథం ముఖ్యంగా ముక్కు, బుగ్గలు, నుదురు భాగాల్లో ముడతలు, చర్మం కింద కొవ్వు నిల్వలు లాంటి సూక్ష్మమైన మార్పులపై దృష్టి సారించింది.
సాధారణంగా ఇలాంటి మార్పులను మనిషి కంటితో గుర్తించడం కష్టం. ఇది 80 శాతం కేసులలో గుండె జబ్బులను సరిగ్గా గుర్తించగలదు. అయితే 46 శాతం కేసుల్లో ముప్పును తప్పుగా గుర్తించింది. అంటే వ్యక్తులు వైద్యులను కలిసి సమాచారాన్ని ధ్రువీకరించుకోవాలి. లేదంటే తప్పుడు ఫలితం వారిలో అనవసర ఆందోళనను కలిగించవచ్చు. రోగుల ఆరోగ్య పరిస్థితులను గుర్తించడానికి ఈ డివైజ్ “చౌకయిన, సరళమైన, ప్రభావవంతమైన” సాధానం కాగలదని ఈ అధ్యయనంలో భాగమైన చైనాలోని నేషనల్ సెంటర్ ఫర్ కార్డియోవాస్కులర్ డిసీజెస్లోని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. గుండె సమస్యలను గుర్తించడానికి స్మార్ట్ఫోన్ల రూపంలో చౌకయిన, మరింత పోర్టబుల్ మార్గం అందుబాటులోకి రావొచ్చని వారు నమ్ముతున్నారు.
లాస్ ఏంజిల్స్లో చిల్డ్రన్స్ హాస్పిటల్లోని కార్డియాలజిస్ట్ జెన్నిఫర్ మిల్లర్, యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలోని ఇంజినీర్లు కలిసి ఒక చిన్నపాటి అల్ట్రాసౌండ్ స్కానర్ను అభివృద్ధి చేశారు. గుండె ద్వారా రక్తం ఎలా ప్రవహిస్తుందో చూపించే ఎకోకార్డియోగ్రామ్లను రూపొందించేందుకు వీలుగా స్మార్ట్ఫోన్కు దీనిని అనుసంధానించవచ్చు. ఈ టెక్నాలజీల్లో చాలా వరకు ప్రయోగం, అభివృద్ధి దశల్లోనే ఉన్నప్పటికీ, స్మార్ట్ ఫోన్తో ఆరోగ్యాన్ని చెక్ చేసుకోవడానికి ఇప్పటికే కొన్ని మార్గాలు ఉన్నాయి. అనాటమీ ఆఫ్ యాన్ ఇండస్ట్రీ’ పుస్తక రచయిత అయిన ఎలిజబెత్ వోయ్క్ ‘రివా’ అనే ఒక అమెరికన్ స్టార్టప్
గురించి ప్రస్తావించారు. ఫోన్ కెమెరా, దాని ఫ్లాష్ను ఉపయోగించి రక్తపోటును ట్రాక్ చేసే టెక్నాలజీ రివాకు ఉంది.”ఈ టెక్నాలజీ ఏంటంటే.. స్మార్ట్ఫోన్ కెమెరాపై వేళ్లను ఉంచితే, రక్తనాళాల్లో తరంగ ఆకారాలను అది కొలుస్తుంది. అలా రక్తపోటును అంచనా వేస్తుంది. ఇదో అద్భుతమైన టెక్నాలజీ” అని ఎలిజబెత్ వోయ్క్ తెలిపారు.
ఇప్పటికే శాస్త్రవేత్తలు ఒక వినూత్న యాప్ ని అభివృద్ధి చేశారు. మీ గుండెకు ఎటువంటి హానిని తలపెట్టకుండానే, మీ గుండె యొక్క ఆరోగ్య స్థితిని మీ స్మార్ట్ ఫోన్ కెమెరా ఉపయోగించి ఆ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంతకు మునుపు గుండె ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలంటే 45 నిమిషాల సమయం పట్టేది. అల్ట్రాసౌండ్ యంత్రం ద్వారా స్కాన్ చేసేవారు. కానీ, ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్ ని మీ మెడకు దగ్గరగా ఒక రెండు నిముషాలు పెట్టుకోవడం ద్వారా గుండె యొక్క ఆరోగ్య స్థితిని సులభంగా తెలుసుకోగలరు. అమెరికా కు చెందిన కొంతమంది పరిశోధకులు ఒక వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. ఇది గుండెలో ఉన్న లెఫ్ట్ వెంట్రిక్యూలర్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనే ప్రక్రియ ఎలా జరుగుతుంది అనే విషయాన్ని, గుండె కొట్టుకుంటున్న ప్రతిసారి కంఠానికి రక్తాన్ని అందించే ధమని గుండా ఎంతమేర రక్తం వెళుతోంది అనే విషయాన్ని కొలుస్తుంది.
గుండె కొట్టుకుంటున్న ప్రతిసారి మన గుండె ఎంతమేర రక్తాన్ని బయటకు పంపిస్తోంది అనే విషయాన్ని ఎల్ వి ఈ ఆఫ్ తెలియజేస్తుంది. సాధారణంగా ఎల్ వి ఈ ఆఫ్ స్థాయి 50% నుండి 70% మధ్యన ఉండాలి… ఎప్పుడైతే గుండె బలహీనంగా ఉంటుందో, అటువంటి సమయంలో గుండెకొట్టుకునేటప్పుడు తక్కువ మోతాదులో రక్తం గుండె నుండి బయటకు పంపబడుతుంది. ఆ సమయంలో ఎల్ వి ఈ ఆఫ్ విలువ కూడా తక్కువగా ఉంటుంది. గుండె యొక్క ఆరోగ్యాన్ని కొలవడంలో ఎల్ వి ఈ ఆఫ్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది అని పరిశోధకులు చెబుతున్నారు. వీటిని ఆధారంగా చేసుకొనే వైద్యలు నిర్ణయాలు తీసుకుంటారని.. గుండెకు సంబంధించిన జబ్బు ఏమైనా ఉందా అనే విషయమై ఒక నిర్ధారణకు వస్తారని చెబుతున్నారు. కాల్ టెక్ అనే సంస్థ అభివృద్ధి చేసిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎల్ వి ఈ ఆఫ్ ని చాలా సులభంగా కొలవవచ్చు. దీనిని ఉపయోగించి, వైద్యులు తమ స్మార్ట్ ఫోన్ లను స్వచ్ఛందంగా వచ్చిన వ్యక్తుల మెడకు ఎదురుగా రెండు నిముషాలు ఉంచడం ద్వారా ఎల్ వి ఈ ఆఫ్ స్థాయిలు సులువుగా తెలుసుకుంటున్నారు. దీని తరువాత పరీక్షలు చేయబడిన వ్యక్తులకు పరీక్షా ఫలితాలు, వారి యొక్క గుండె ఆరోగ్య స్థితి కూడా వెంటనే తెలిసిపోతోంది..
ఈ యాప్ ఇంత బాగా ఎలా ఎలా పనిచేస్తుందంటే, ధమనుల యొక్క గోడలు ఎంతో సాగే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇందువల్ల ప్రతి గుండె చప్పుడుకు అవి సంకోచిస్తాయి, వ్యాకోచిస్తాయి. ఈ సంకోచ వ్యాకోచాలను ఖచ్చితత్వంతో కొలుస్తుంది. వీటిని సూక్ష్మంగా పరీక్షించినప్పుడు ఒక తరంగిణి ఏర్పడుతుంది. దీనిని ఆధారంగా చేసుకొని ఈ యాప్ గుండెకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరిస్తుంది. ఈ అధ్యయనం చేయడానికి ఆ బృందం ఐ ఫోన్ 5 ని ఉపయోగించింది. కానీ ఏ కెమెరా ఉన్న స్మార్ట్ ఫోన్లో అయినా ఈ యాప్ పనిచేస్తుంది. ఈ యాప్ ని పరీక్షించడానికి పరిశోధకులు 20 నుండి 92 సంవత్సరాల వయస్సున్న 72 స్వచ్చంద వ్యక్తుల పై పరీక్షలు నిర్వహించారు. మాములుగా ఎల్ వి ఈ ఆఫ్ ని కొలవడానికి అల్ట్రాసౌండ్ యంత్రాన్ని ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియను ఎకో కార్డియో గ్రఫీ అని అంటారు. ఈ ఎకో కార్డియో గ్రఫీ అనే పరీక్షను సొంతంగా ఎవరికీ వారు చేసుకోలేరు. ఈ పరీక్ష చేయాలంటే ఖచ్చితంగా ఒక శిక్షణ పొందిన నిపుణుడు ఉండాలి. చాలా ఖరీదైన అల్ట్రాసౌండ్ యంత్రం ఉండాలి. దాంతో పాటు రోగి 45 నిమిషాల పాటు ఈ పరీక్షలో పాల్గొనాల్సి ఉంటుంది.
ఫోన్ కెమెరా ఉపయోగించి రక్తపోటు, గుండె ఆరోగ్యానికి సంబంధించిన ఇతర అంశాలను పరిశీలించడానికి పలువురు పరిశోధకులు టెక్నిక్లను అభివృద్ధి చేస్తున్నారు. స్మార్ట్ఫోన్ ఫ్రంట్ కెమెరాలతో తీసే వీడియోలతో ఆ వ్యక్తి ముఖంలో రక్తం సరఫరాలో మార్పులను గుర్తించగల అల్గారిథమ్లను అభివృద్ధి చేశారు.