తైవాన్ కు చెందిన ఎవర్ గ్రీన్ మెరైన్ కంపెనీ తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల విషయంలో ఉదాత్తంగా ప్రకటించింది. సిబ్బందికి నాలుగేండ్ల జీతాన్ని బోనస్గా ప్రకటించింది. అంటే దాదాపు 50 నెలల జీతాన్ని ఇవ్వనుంది. ఒకవైపు ప్రపంచ ఆర్థిక మాంద్యం విషయంలో దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ తమ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలిగిస్తున్న సమయంలో ఈ కంపెనీ ప్రకటన సంచలనం స్రుష్టించింది.
తైవాన్ చెందిన ఎవర్గ్రీన్ మెరైన్ కంపెనీ తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు నాలుగేండ్ల వేతనం శాలరీని బోనస్గా అందజేసింది. కంపెనీలు తమ సిబ్బంది శ్రేయస్సు, సంక్షేమానికి పెద్దపీట వేస్తాయి. వాటిల్లో కొన్ని తమ సిబ్బంది జీవితంలో హాయిగా స్థిరపడేలా బహుమతులు ఇస్తుంటాయి.
దాదాపు అన్ని కంపెనీలు బోనస్లు ఇస్తుంటాయి. ఆ బోనస్ ప్రతి ఉద్యోగి వేతనంలో కొంత శాతంగా నిర్ణయిస్తాయి. కానీ ఓ కంపెనీ ఏకంగా ఉద్యోగి 50 నుంచి 52 నెలల వేతనంతో సమానమైన బోనస్ అందచేసిందని సమాచారం.
తైవాన్కు చెందిన ఎవర్గ్రీన్ మెరైన్ కంపెనీ తమ ఉద్యోగులకు సగటున నాలుగేండ్లకు పైగా వేతనంతో సమానమైన బోనస్ గత ఏడాది చివర్లో ఇచ్చినట్లు చెబుతున్నారు. తైవాన్ ఆధారిత కాంట్రాక్ట్లతో సంబంధం ఉన్న ఉద్యోగులకు మాత్రమే ఈ బోనస్లు వర్తింపజేస్తున్నది ఎవర్గ్రీన్ మెరైన్ కంపెనీ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఉద్యోగి వెల్లడించారు.
ప్రతి కంపెనీ యేటా సంస్థ సాధించే లాభాలు, వ్యక్తిగతంగా ఉద్యోగుల పనితీరు ఆధారంగా బోనస్లు ఇస్తూ ఉంటుందని ఎవర్గ్రీన్ గతవారం మీడియా ప్రకటనలో తెలిపింది. అయితే ఈ సందర్భంగా పూర్తి వివరాలు వెల్లడించడానికి నిరాకరించింది.
కరోనా మహమ్మారి వేళ ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ తెగిపోవడంతో వస్తువుల సరఫరా నిలిచిపోయింది. కొవిడ్-19 ఉధృతి తగ్గిన తర్వాత గత రెండేండ్లుగా వినియోగ వస్తువులకు గిరాకీతోపాటు వాటి రవాణా చార్జీలు పెరిగిపోయాయి. దీనివల్ల ఎవర్గ్రీన్ కంపెనీ 2022 ఆదాయం 20.7 బిలియన్ డాలర్లుగా నిలిచింది.
- 2020 సేల్స్తో పోలిస్తే చాలా పెద్ద మొత్తం..
ఇది 2020 సేల్స్తో పోలిస్తే చాలా పెద్ద మొత్తంగా చెబుతున్నారు. అంటే మూడు రెట్లు ఎక్కువగా అనుకోవచ్చు. అయితే 2021లో అనేక ఇబ్బందులు ఎదుర్కుంది ఎవర్గ్రీన్ కంపెనీ. 2021 ప్రారంభంలో సమస్యలు, ఇబ్బందుల వల్ల ఎవర్గ్రీన్పై మీడియాలో వార్తలు పతాక శీర్షికలకెక్కాయి. ఎవర్గ్రీన్ మెరైన్ నిర్వహిస్తున్న ఒక ఓడ.. సూయెజ్ కెనాల్లో చిక్కుబడి పోవడంతో ప్రపంచ దేశాల మధ్య వస్తువుల సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.
ఆ నష్టం ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. కొన్ని వారాల పాటు ఆ రూట్ లో ప్రయాణించాల్సిన అనేక నౌకలు నిలిచిపోయాయి. ఆఫ్రికాకు యూరప్ కు మధ్య జీవనాడిగా చెప్పుకునే సూయజ్ కెనాల్ అత్యంత ప్రాధాన్యత కలిగిన షార్ట్ కట్ అని చెబుతున్నారు.
అలాంటి కష్టకాలంలో కంపెనీకి సిబ్బంది అందించిన సహకారం వల్ల కంపెనీ నష్టాల నుంచి లాభాల బాట పట్టింది. దాంతో వారికి ఈ విధంగా 52 నెలల వేతనం బోనస్ ఇచ్చిందని తైపే ఎకనమిక్ డైలీ న్యూస్ గత వారం వార్త ప్రచురించింది. ఎవర్గ్రీన్లో కొందరు ఉద్యోగులు 65 వేల డాలర్లకు పైగా బోనస్ అందుకున్నారని తైపై ఎకనమిక్ డైలీ వార్తా కథనం. దీని సమాచారం, పూర్తి వివరాలను మాత్రం బయటపెట్టలేదు.
అలాగే ఎవర్గ్రీన్ మెరైన్ సిబ్బందిలో కొంత మందికి ఈ లక్కీ ఛాన్స్ లభించలేదని చెబుతున్నారు. కంపెనీ కోసం పనిచేయని వారి లిస్టు అంతర్గతంగా తయారైంది. అందుకే సదరు ఉద్యోగులకు చెల్లించలేదు. షాంఘై కేంద్రంగా పని చేస్తున్న సంస్థ సిబ్బంది.. యాజమాన్యం అనుచిత తీరుపై ఫిర్యాదు చేశారని సమాచారం.
ఇటీవలి బోనస్ చెల్లింపులు శుభ పరిణామమే అయినా.. భవిష్యత్లోనూ కొనసాగుతాయా? అన్న చర్చ సాగుతున్నది. అయితే, ఆర్థిక మాంద్యం ముప్పు నేపథ్యంలో ప్రపంచ వృద్ధిరేటు బలహీన పడుతుందని వార్తలొస్తున్నాయి. ఈ తరుణంలో ఈ ఏడాది లాభాలు తగ్గిపోతాయని షిప్పింగ్ కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. 2021లో 250 శాతానికి పైగా పుంజుకున్న ఎవర్గ్రీన్ మెరైన్ స్టాక్.. గతేడాది 54 శాతం పతనమైంది.
ఏది ఏమైనా పనిచేస్తే ఇలాంటి కంపెనీలో చేయాలని ఎవర్ గ్రీన్ కంపెనీ సిబ్బంది తమ కంపెనీని ఆకాశానికెత్తుతున్నారు. వారిచ్చిన బోనస్ కారణంగా తమకు పనిలో ఉత్సాహం కలిగిందని చెబుతున్నారు. ఈ కంపెనీ నౌక అడ్డం తిరిగిన సూయజ్ కాలువలో నిన్న మరో నౌక కూడా ఒకవైపు వంగిపోవడంతో అంతా ఉలిక్కిపడ్డారు. కానీ కొంత సేపటికి అది సరైన విధంగా ప్రయాణించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.