రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దారెటు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొన్నాళ్లుగా పార్టీపై అలక పూనిన కన్నా
.. తాజాగా నాదెండ్లతో భేటీ కావడం చర్చనీయాంశమవుతోంది.
రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఆయన పార్టీ మారడం ఖాయమని గత కొన్నేళ్లుగా
ప్రచారం జరుగుతోంది. టీడీపీ, జనసేనలో.. ఏదో ఒక పార్టీలో చేరతారని టాక్ నడిచింది. ప్రధానంగా టీడీపీకి వెళతారని.. అందుకే ఆయన కోసం
గుంటూరు2 స్థానాన్ని చంద్రబాబు ఖాళీగా పెట్టారని కూడా కామెంట్స్ వినిపించాయి. తాజాగా జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్ కన్నాను
కలిశారు. వైసీపీ విముక్త ఏపీ కోసం తాము చర్చించుకున్నట్టు ఇరువురు నేతలు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే జనసేన, బీజేపీ మిత్రులుగా
కొనసాగుతున్నాయి. ఇటువంటి సమయంలో కొత్తగా వైసీపీ విముక్త ఏపీ కోసం చర్చించాల్సిన పని ఏముంటుందన్న ప్రశ్న వినిపిస్తోంది.

అయితే కన్నా లక్ష్మీనారాయణ సొంత పార్టీపై చేసిన కామెంట్స్, ఆయన చర్యలు, తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం జనసేన వైపు చూస్తున్నట్టు కనిపిస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నేత. కాంగ్రెస్ లో కీలక పదవులు చేపట్టారు. లాంగ్ టర్మ్ మంత్రిగా ఉన్నారు. గత ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. వైసీపీలో చేరతారని భావించినా.. బీజేపీ హైకమాండ్ ఇచ్చిన ఆఫర్ తో ఆ పార్టీలో చేరారు.
ఇలా చేరిన కొద్దిరోజులకే రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. గత ఎన్నికల తరువాత కన్నా చొరవతోనే జనసేన, బీజేపీ మిత్రులుగా మారాయి. కానీ ఆయన్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి సోము వీర్రాజుకు అప్పగించారు. అప్పటి నుంచి కాస్త ముభావంతోనే ఉన్నారు. పార్టీలో కూడా ఏమంత యాక్టివ్ గా లేరు. అయితే ఇటీవల పవన్ బీజేపీ తనను దూరం పెట్టిందన్న కామెంట్స్ నేపథ్యంలో కన్నా రియాక్టు అయ్యారు. సోము వీర్రాజు వ్యవహార శైలే కారణమంటూ కామెంట్స్ చేశారు.
ఈ పరిణామాల క్రమంలో ఆయనకు టీడీపీ నుంచి ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. పార్టీలోకి వస్తే తగిన గౌరవం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో కన్నా టీడీపీలో చేరుతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా కన్నా జనసేన వైపు చూస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
చాలా ఈక్వేషన్స్ తో ఆయన పవన్ వైపు ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.
అయితే ఈ అంచనాల వేళ కన్నా ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి మాత్రం రాజకీయ వర్గాల్లో వెల్లువెత్తుతోంది. బీజేపీతో జనసేన పొత్తు వేళ పార్టీ మార్పు .. అటు కన్నాకు, ఇటు జనసేనకు ఏమేరకు లాభం తేనుందన్న చర్చ సైతం సర్వత్రా వినిపిస్తోంది.
సంక్రాంతి తరువాత చాలామంది నాయకులు జనసేనలో చేరే అవకాశముంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ తరువాత నాదేండ్ల మనోహర్
అన్నీతానై వ్యవహరిస్తున్నారు. కన్నాను రప్పించి కీలక బాధ్యతలు అప్పగించాలని పవన్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఒక వేళ పొత్తులు కుదిరితే
సీనియర్ల జాబితాను చూపించి వీలైనన్ని ఎక్కువ స్థానాలు అడగవచ్చన్న భావనలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. పైగా కన్నా లక్ష్మీనారాయణకు
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. పాత పరిచయాలు అధికం.
ఇతర జిల్లాల్లో సైతం అనుచరవర్గం ఉంది. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడంతో కాషాయ దళంతో కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కన్నాను కనుక జనసేనలో చేర్చుకుంటే లాభిస్తుందని పవన్భా విస్తున్నారు. అందుకే నాదేండ్ల మనోహర్ కన్నాతో కీలక చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ, జనసేన మధ్య పొత్తు కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో కలిసే నడవాలని భావిస్తున్నాయి. అటు టీడీపీ సైతం ఆ రెండు పార్టీలను కలుపుకోవాలని చూస్తోంది. బీజేపీ హైకమాండ్ మాత్రం టీడీపీని దూరం పెడుతోంది. అటు జనసేన సైతం ఆచీతూచీ అడుగులు వేస్తోంది.
ఈ క్రమంలో బీజేపీ నేతలను జనసేన వైపు చేర్చుకుంటే ఢిల్లీపెద్దలు ఎలా రియాక్టవుతారన్నదే ప్రశ్న.
అయితే రాజకీయ పార్టీలు ఎవరికి వారు బలపడాలన్నది వ్యూహం అని.. దానికి అభ్యంతరాలు వ్యక్తమయ్యే చాన్సే లేదని జన సైనికులు భావిస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ చేరికతో జనసేనలోకి నాయకులు క్యూకడతారని వారు నమ్మకంగా చెబుతున్నారు. బలమైన నేతలను పార్టీలోకి తీసుకోవడం వల్ల పార్టీకి కొత్త ఊపు వస్తోందని లెక్కలు వేసుకుంటోంది. ఈ క్రమంలో ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కన్నా లక్ష్మీనారాయణను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఏపీలో బీజేపీ, జనసేన కలిసే వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటాయని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు.
అలాంటప్పుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడి జనసేనలో చేరడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో అనే చర్చ కూడా సాగుతోంది. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి ఎన్నికలకు వెళుతుందనే వార్తలు కూడా వినిపించాయి. ఈ క్రమంలో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు వీలుగా బలమైన నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించాలని జనసేన భావిస్తోందని.. ఈ వ్యూహంలో భాగంగానే కన్నా లక్ష్మీనారాయణను జనసేనలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఊహాగానాలు జోరందుకున్నాయి.

మరోవైపు ఏపీ బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజుతో కన్నా లక్ష్మీనారాయణకు గ్యాప్ ఉందనే చర్చ చాలాకాలంగా సాగుతోంది. రెండు నెలల క్రితం ఏపీ బీజేపీ నాయకత్వంపై కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీని నడిపే విషయంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తమతో పొత్తులో ఉన్న జనసేనతో సమన్వయంలోనూ రాష్ట్ర నాయకత్వం విఫలమైందని ఆయన అన్నారు. ఈ భావన ఇప్పటిదాకా తన మనసులోనే ఉన్నదని, ఇప్పుడది బయటకు వచ్చిందని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై పార్టీ అధినాయకత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా కన్నా వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన జనసేన ముఖ్యనేతతో భేటీ కావడంతో పార్టీ మార్పు విషయంలో నిర్ణయం తీసుకున్నారేమో అనే వార్తలు జోరందుకున్నాయి. అయితే ఇది సాధారణ సమావేశమే అని చెబుతున్నా, దీని వెనుక ఉన్న రాజకీయం మాత్రం ఆసక్తిగా కనిపిస్తోంది. మరోవైపు ఈ భేటీ ద్వారా కన్నా కు జనసేనలోకి రూటు క్లియర్ అయిందని విశ్వసనీయ సమాచారం. అయితే, బీజేపీ నేతలనే జనసేన తమ పార్టీలోకి తీసుకుంటే, పొత్తు మీద ప్రభావం చూపటంతో పాటుగా.. ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, బీజేపీ తో మిత్రపక్షంగా ఉన్న సమయంలో
కమలం పార్టీ నేతలను జనసేనలోకి ఆహ్వనిస్తే మైత్రి మీద ప్రభావం పడుతుందనే వాదన ఉంది. అయినా..ఇప్పుడు మనోహర్ – కన్నాతో భేటీ భవిష్యత్ నిర్ణయాల కోసమేనని విశ్వసనీయ సమాచారం.
ఇప్పటి వరకు బీజేపీలోని ఏ నేత ఇంటికి జనసేన నేతలు వెళ్లలేదు. ఇప్పుడు కన్నాతో నాదెండ్ల భేటీతో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. కన్నా కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్న సమయంలో మనోహర్ స్పీకర్ గా ఉన్నారు. ఇద్దరూ ఒకే జిల్లా రాజకీయ నేతలు. బీజేపీ – జనసేన పొత్తు సమయంలో ఇద్దరూ సన్నిహితంగా ఉండేవారు. ఇక, ఇప్పుడు కన్నా బీజేపీ నుంచి జనసేనలోకి చేరితే రాజకీయంగా ఏపీలో కొత్త సమీకరణాలకు నాంది కానుంది. దీంతో ఇప్పుడు కన్నాతో మనోహర్ భేటీ లో ఏం జరుగుతోంది..
ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు..ఈ భేటీ రెండు పార్టీల పొత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ ఆసక్తికరంగా మారింది. దీంతో ఏపీలో
రాజకీయాలు కన్నా టార్గెట్ గా సాగుతున్నాయన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. కన్నా అడుగులు ఎటువైపు అన్నది .. రాష్ట్ర రాజకీయాల్లో
కీలకంగా మారుతుందని, దీనికి కారణం ఆయనకు ఉన్న సుదీర్ఘ అనుభవం, అనుచరులేనని విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.
మరి కన్నా దారెటు అన్నదే చర్చనీయాంశంగా మారింది.