ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది మాట్లాడుతూ దేశంలో జనాన్ని రెచ్చగొడుతున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గొంతుకు తాళం పడింది. పాకిస్తాన్ మీడియా రెగ్యులేటరీ ఆయన ప్రసంగాలపై నిషేధం విధించింది. ఇకపై ఆయన ప్రభుత్వ సంస్థలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేయడానికి వీలుండదు. మొన్నటి ఆదివారం ఆయన అలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన కొన్ని గంటల తర్వాత పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా వాచ్ డాగ్’ ఖాన్ ప్రసంగాలపై నిషేధాన్ని ప్రకటించింది.
ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాలపై నిషేధం విధించింది పాకిస్తాన్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదివారం ప్రభుత్వ సంస్థలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రకటనలు’ చేసిన కొన్ని గంటల తర్వాత ఆయన ప్రసంగాలను పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా వాచ్డాగ్ ఆదివారం నిషేధించింది. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ‘పిటిఐ’ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్, లాహోర్లోని తన జమాన్ పార్క్ నివాసం వెలుపల పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తాను ఎప్పుడూ “ఏ వ్యక్తి లేదా సంస్థ ముందు వంగి ఉండలేదని” అన్నారు. ప్రభుత్వంలోని నాయకులపై కూడా ఆయన విరుచుకుపడ్డారు, వారు తమ సంపదను విదేశాల్లో దాచి ఉంచారనీ పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా చట్టపరమైన కేసులలో రక్షణ కల్పించారని ఆరోపించారు.
అయితే ఇమ్రాన్ ఖాన్ ఎదుర్కుంటోన్న తోషాఖానా కేసులో ఖాన్ను అరెస్టు చేసేందుకు ఆదివారం ఇస్లామాబాద్ పోలీసులు పెద్ద ఎత్తున ఆయన నివాసం ముందు మొహరించారు. అంతా అక్కడేదో సంచలనం జరగనుందని భావించారు. అయితే ఆయన లాహోర్ నివాసానికి చేరుకున్న తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి, అయితే ఆయన మార్చి 7న కోర్టుకు హాజరవుతానని ఆయన తరపున న్యాయ బృందం హామీ ఇవ్వడంతో తిరిగి వచ్చారు.ప్రభుత్వ సంస్థలకు వ్యతిరేకంగా ఏదైనా కంటెంట్ను ప్రసారం చేయకుండా ఉండాలని’ అన్ని లైసెన్స్డ్ మీడియా సంస్థలను ఆదేశించిన మునుపటి ఆదేశాలను ప్రస్తావిస్తూ, పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ ఖాన్ తన ప్రసంగంలో “నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారనీ, ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని ఎత్తి చూపింది.
ఏతావాతా గత ఏడాది కాలంగా ఇమ్రాన్ ఖాన్ తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇందుకోసం దేశమంతటా ర్యాలీలు నిర్వహిస్తూ జనాన్ని పోగు చేసుకుంటున్నారు. అయితే ఇమ్రాన్ ఖాన్ ప్రదర్శిస్తున్న ఈ వైఖరి ప్రభుత్వ సంస్థలపై ద్వేషపూరిత, అపవాదు మోపినట్టుగా ఉందని అథారిటీ తెలిపింది. ఇటు మీడియా సంస్థలు కూడా అనవసరమైన ప్రకటనలను ప్రసారం చేయడం “రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 మరియు సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా ఉల్లంఘించడమే” అని స్పష్టం చేసింది.PEMRA చట్టాలు, అత్యున్నత న్యాయస్థానాల తీర్పుల నిబంధనలను ఉల్లంఘిస్తూ టీవీ ఛానెళ్లు అటువంటి కంటెంట్ను ప్రసారం చేశాయని తెలిపింది. నిబంధనలను పాటించకపోతే టీవీ ఛానెళ్ల లైసెన్స్ను సస్పెండ్ చేస్తామని కూడా PEMRA హెచ్చరించింది.
పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో ఇమ్రాన్ ఖాన్ తనపై రెండవ హత్యాయత్నానికి సంబంధించి ఎదుర్కొంటున్న భద్రతాపరమైన ప్రమాదాలను ఎత్తిచూపారు. దేశ మాజీ ప్రధాని అయినప్పటికీ ప్రభుత్వం తనకు తగిన భద్రత కల్పించడం లేదని ఇమ్రాన్ ఖాన్ ఫిర్యాదు చేశారు. తనపై జరిగిన హత్యాయత్నంలో ప్రస్తుత ప్రధాని, అంతర్గత మంత్రి ప్రమేయం ఉందని ఆరోపించారు. తనపై మరో హత్యాయత్నం జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు.పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ వైస్-ఛైర్మెన్ మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ మాట్లాడుతూ, తోషాఖానా కేసులో ఇస్లామాబాద్ సెషన్స్ కోర్టు మార్చి 7 న తన ముందు హాజరు కావాలని కోరిందని వచ్చిన వారెంట్లలో “అరెస్ట్” ప్రస్తావన లేదన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని ఆరోపించారు.
ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో భారీగా వచ్చిన బహుమతులను తోషాఖానాలో జమ చేయకుండా అమ్ముకున్నాడని ఇమ్రాన్ఖాన్పై ఆరోపణలున్నాయి.
70 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్, తోషాఖానా అనే స్టేట్ డిపాజిటరీ నుండి రాయితీ ధరకు ప్రీమియర్గా అందుకున్న ఖరీదైన చేతి గడియారంతో సహా బహుమతులను లాభాల కోసం విక్రయించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఖాన్పై ఇస్లామాబాద్ సెషన్స్ కోర్టు గత వారం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఆయన కోర్టుకు హాజరు కాకపోవడంతో విచారణను మార్చి 7కి వాయిదా వేసింది. ఈ కేసులో ఇమ్రాన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు నాన్-బెయిల్బుల్ అరెస్టు వారెంట్తో లాహోర్లోని జమాన్ పార్క్ నివాసానికి చేరుకున్నారు. దీంతో ఇమ్రాన్ మద్దతుదారులు, పాకిస్థాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడకు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.