HomeUncategorizedకేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ను కోరుతుందా..?

కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ను కోరుతుందా..?

  • దేశంలో మరో రెండు పెద్ద బ్యాంకుల ప్రైవేటీకరణకు కేంద్రం సిద్ధమవుతోందా..?
  • దీనిపై గత బడ్జెట్ లోనే కేంద్రం పేర్కొందా..?
  • దీనిపై మరి ఉద్యోగులు ఏమంటున్నారు..?
  • ఇప్పటికే 28 బ్యాంకులు కాస్తా .. 12 కు చేరాయి.. ఇప్పుడు మళ్లీ మరో రెండు బ్యాంకులను ప్రైవేటీకరణ చేయనున్నారు.. దీంతో ప్రజా సొమ్ము
  • భద్రత నుంచి కేంద్రం తప్పుకోవాలనుకుంటోందా..?

ప్రభుత్వ అధికారులు బ్యాంకింగ్ సంస్థల ప్రైవేటీకరణ కోసం విస్తృతమైన సన్నాహాలు చేస్తున్నారు. నీతి ఆయోగ్ ఏయే ఆర్థిక సంస్థలను ప్రైవేటీకరించనున్నదో, ఏవి ప్రైవేటీకరణకు దూరంగా ఉంటాయో ప్రకటించింది. ప్రభుత్వం ఇప్పుడు రెండు బ్యాంకులు, ఒక సాధారణ బీమా సంస్థను ప్రైవేటీకరించే యోచనలో ఉంది. 2019 ఆగస్టులో ప్రభుత్వం పది బ్యాంకుల్లో నాలుగింటిని ఏకీకృతం చేసింది. దేశంలోని మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను 27 నుండి 12కి తగ్గించింది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు ప్రకారం ఈ బ్యాంకులన్నీ ప్రైవేటీకరణకు పూనుకోకూడదు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా అన్నీ నీతి ఆయోగ్ విడుదల చేసిన జాబితాలో ఉన్నాయి. ఈ ఆర్థిక సంస్థలను ప్రైవేటీకరించే ఆలోచన లేదని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వ బ్యాంకు కన్సాలిడేషన్‌లో పాల్గొన్న ఎవరూ ప్రైవేటీకరణ ప్రక్రియలో పాల్గొనడానికి అర్హులు కాదని ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రైవేటీకరించనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన FY22లో ప్రస్తుత పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.1.75 లక్షల కోట్లు. 2019లో అనేక బ్యాంకులు ప్రభుత్వం ద్వారా ఏకీకృతం అయ్యాయి.

అయితే కొన్నింటి విషయంలో ఇంకా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఐడీబీఐతోపాటూ మరో రెండు ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఐడీబీఐ బ్యాంకును అమ్మే ప్రయత్నాలు అంతకు ముందు నుంచే నడుస్తున్నాయి. ఎల్ఐసీలో వాటాను అమ్మాలనుకుంటున్నట్లు గత ఏడాది బడ్జెట్లోనే చెప్పారు.

కానీ, ఇప్పటివరకూ ఏయే బ్యాంకుల్లో తమ వాటాను పూర్తిగా లేదా కొంత బాగాన్ని అమ్మాలనుకుంటోందో ప్రభుత్వం ఇంకా చెప్పలేదు. కానీ, నాలుగు బ్యాంకులను అమ్మడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, వాటిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. వీటిని ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.

కానీ, ఈ నాలుగు బ్యాంకుల్లో పనిచేసే దాదాపు లక్షా 30 వేల మంది సిబ్బందితోపాటూ మిగతా ప్రభుత్వ బ్యాంకుల్లో కూడా ఈ చర్చతో కలకలం రేగింది. 1969లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 14 బ్యాంకులను జాతీయం చేసింది. దేశంలోని అన్ని ప్రాంతాలను ముందుకు తీసుకెళ్లడంలో ఈ బ్యాంకులు తమ సామాజిక బాధ్యతను నిర్వహించడం లేదని, కేవలం తమ యాజమాన్యాల చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయని ఆరోపించారు.

అయితే, అంతకు ముందు 1955లోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత 1980లో మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ సర్కారు మరో ఆరు బ్యాంకులను జాతీయం చేసింది. కానీ బ్యాంకుల జాతీయీకరణ జరిగిన 52 సంవత్సరాల తర్వాత ప్రస్తుత ప్రభుత్వం ఆ చక్రాన్ని వెనక్కు తిప్పుతోంది. నిజానికి 1991 ఆర్థిక సవరణల తర్వాత నుంచి వ్యాపారం చేయడం తమ పని కాదని కేంద్రం పదే పదే చెబుతూ వస్తోంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా, ఇటీవల అదే మాటను పునరుద్ఘాటించారు. అన్ని రంగాల్లో భారీ స్థాయి ప్రైవేటీకరణ అంటే ప్రభుత్వ కంపెనీలను విక్రయించే పనిని కేంద్రం జోరుగా చేస్తోందనేది సుస్పష్టం. వ్యూహాత్మకంగా కీలక రంగాల్లో, అంటే స్ట్రాటజిక్ సెక్టార్లలోని కంపెనీలను కూడా తమ దగ్గర ఉంచుకోవాలనే ఉద్దేశం తమకు లేదని అదిప్పుడు చెప్పేసింది.

బ్యాంకుల విషయంలో ఒక పెద్ద సమస్య కూడా ఉంది. గత ప్రభుత్వాలన్నీ ప్రజలను ఊరించడానికి, ఓట్లు రాబట్టడానికి రకరకాల ప్రకటనలు చేస్తూ వచ్చాయి. ఆ భారమంతా ప్రభుత్వ బ్యాంకులు మోయాల్సొచ్చింది. రుణమాఫీలు దీనికి ఒక ఉదాహరణ. ఆ తర్వాత బ్యాంకుల పరిస్థితి అంతకంతకూ దిగజారింది. ప్రభుత్వం ఈ బ్యాంకులకు నిధులు ఇచ్చి మరీ, వాటిని తిరిగి నిలబెట్టాల్సి వస్తోంది.

బ్యాంకుల జాతీయీకరణ తర్వాత, అన్ని రకాల సవరణలు, ప్రభుత్వం తరఫున చాలాసార్లు మూలధనం పెట్టిన తర్వాత కూడా ఈ ప్రభుత్వ బ్యాంకుల సమస్యలు పూర్తిగా ముగిసిపోలేదు. డిపాజిట్, క్రెడిట్ విషయంలో ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులతో పోలిస్తే ఇవి వెనకబడినట్టు కూడా కనిపిస్తున్నాయి. ఇక స్ట్రెస్డ్ అసెట్స్ విషయానికి వస్తే ప్రభుత్వ బ్యాంకులు ముందున్నాయి. గత మూడేళ్లలోనే కేంద్రం ప్రభుత్వ బ్యాంకుల్లో లక్షన్నర కోట్ల రూపాయల మూలధనం పెట్టింది.

రీకాపిటలైజేషన్ బాండ్ ద్వారా లక్ష కోట్లకు పైగా మొత్తాన్ని కూడా ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఉద్దేశం సుస్పష్టం. అది ఒక సుదీర్ఘ ప్రణాళికపై పనిచేస్తోంది. దాని ప్రకారం గత కొన్నేళ్లలో ప్రభుత్వ బ్యాంకుల సంఖ్యను 28 కంటే తగ్గించి 12కు చేయాలనుకుంది. వాటిని కూడా ఇంకా తగ్గించాలనుకుంటోంది.

బలహీనంగా ఉన్న కొన్ని బ్యాంకులను మిగతా పెద్ద బ్యాంకులతో కలిపేయాలి. మిగతా వాటిని అమ్మేయాలి. దీనివల్ల పదే పదే బ్యాంకులకు మూలధనం పెట్టి, వాటిని నిలబెట్టాలనే ఆందోళన నుంచి ప్రభుత్వానికి విముక్తి లభిస్తుంది. ఈ ఆలోచన రావడం ఇది మొదటిసారి కాదు. గత 20 ఏళ్లలో దీనిపై చాలాసార్లు చర్చ జరిగింది. కానీ అధికార, విపక్షాల వాదనల మధ్య నిలిచిపోయింది. బ్యాంకుల జాతీయీకరణ రాజకీయ నిర్ణయం, అందుకే వాటి ప్రైవేటీకరణ నిర్ణయం కూడా రాజకీయంగానే తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి అన్నారు.

బ్యాంకుల ప్రైవేటీకరణ ఆసక్తికరంగా మారింది..!

అందుకే, ఇప్పుడు రాజకీయ నిర్ణయం తీసుకున్నట్టే ఉంది. భారత్‌లో ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకుల వృద్ధి రేటును పోల్చిచూస్తే ప్రైవేటు బ్యాంకులు దాదాపు ప్రతి అంశంలో ప్రభుత్వ బ్యాంకులను దాటేశాయనేది స్పష్టంగా కనిపిస్తుంది. దానికి ఆ బ్యాంకుల లోపల, బ్యాంకులతో ప్రభుత్వ సంబంధాల్లో కారణం చూడవచ్చు. బ్యాంకుల ప్రైవేటీకరణ వల్ల కష్టంగానే ఉంటుంది.

అయితే, అలా చేయడం వల్ల ఈ బ్యాంకులు తమ సొంత నిబంధనలపై పనిచేయగలిగే స్వేచ్ఛను కూడా పొందుతాయి. కానీ, బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు ఈ వాదనలు పూర్తిగా నిరాధారం అంటున్నారు. ప్రైవేట్ బ్యాంకులు దేశ ప్రయోజనాలకోసం కాకుండా తమ యాజమాన్యం ప్రయోజనాలే చూస్తాయని గతంలో స్పష్టమైంది. అందుకే ఈ నిర్ణయం కేవలం సిబ్బందికే కాకుండా, మొత్తం దేశానికే ప్రమాదకరం.

గత కొన్నేళ్లుగా ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, లక్ష్మీవిలాస్ బ్యాంకుల్లో బయటపడిన అవకతవకలతో ప్రైవేటు బ్యాంకులపైనా అనుమానాలు తలెత్తాయి. ఏదైనా ఒక బ్యాంక్ పూర్తిగా మునిగిపోయే స్థితికి చేరుకున్నప్పుడు ప్రభుత్వమే ముందుకు వచ్చి దానిని ఆదుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆ బాధ్యతను ఏదో ఒక ప్రభుత్వ బ్యాంకు నెత్తిన రుద్దుతారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత్‌లో ఇప్పటివరకూ రీషెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఏదీ మునిగిపోకుండా ఉండడానికి అదే కారణం అంటున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని బ్యాంక్ యూనియన్లు చాలాకాలంగా ప్రతిఘటిస్తున్నాయి. ఎగవేత రుణాల వసూళ్లకు కఠిన చర్యలు చేపట్టడానికి బదులు, ఐబీసీ లాంటి చట్టాన్ని ఏర్పాటు చేయడం కూడా ఒక పెద్ద కుట్ర అని ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే, దీంతో ప్రభుత్వ బ్యాంకులు చివరికి తమ రుణాలను ‘హెయిర్ కట్’ పేరుతో, అంటే అసలు కంటే తక్కువ మొత్తం తీసుకుని, లావాదేవీలు పరిష్కరించుకునేలా రాజీ పడాల్సి వస్తోంది.

బ్యాంకుల ప్రైవేటీకరణతో లాభాలున్నా.. నష్టాలే ఎక్కువన్నది ఉద్యోగుల వాదన.. మరి కేంద్రం ఏం చేస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది.

Must Read

spot_img