గుజరాత్ ఎన్నికల ఫలితాలు.. 2024 సార్వత్రికానికి కీలకంగా మారనున్నాయా..? ఈ రిజల్ట్ .. ప్రధాని మోడీని తిరుగులేని నేతగా నిలబెడుతున్నాయా..? మరి ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు.. మోడీని ఢీకొట్టే వ్యూహంలో బలోపేతం కాగలవా..?
వచ్చే ఎన్నికల్లో మోడీ హవాను.. గుజరాత్ ఎన్నికలే నిర్ణయిచేశాయా..?
తాజాగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల గురించి దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రెండు రాష్ట్రాలలోనూ మరియు దేశ వ్యాప్తంగా అందరూ ఊహించినట్టుగానే ఫలితాలు వచ్చాయని.. గుజరాత్ లో ఇంకో వందేళ్లయినా బీజేపీని ఓడించే సత్తా ఉన్న నాయకులు రావడం అన్నది కల అని చెప్పాలి.
బీజేపీ వరుసగా ఏడవసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మొత్తం 156 స్థానాలలో అధికారాన్ని దక్కించుకొని గుజరాత్ లో 27 సంవత్సరాలుగా కమలం జెండా ఎగరవేస్తోంది. ఇక ప్రతిపక్షముగా చెప్పుకునే కాంగ్రెస్ కేవలం 17 సీట్ లతో సరిపెట్టుకుంది. మూడో పార్టీగా సందింట్లో సడేమియాగా వచ్చిన ఆప్ కేవలం 5 చోట్ల మాత్రం గెలిచింది. అయితే దేశం అంతా అనుకుంటున్న విధంగా బీజేపీకి గుజరాత్ లో విజయం అంత ఈజీ గా దక్కలేదు. ఈ సారి గుజరాత్లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ల మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని, గతంలో కంటే.. బీజేపీకి సీట్లు పడిపోవచ్చని విశ్లేషకులు భావించారు.
కానీ..మోడీ చరిష్మా ముందు ప్రతిపక్షాలు పత్తా లేకుండా పోయాయి. ప్రధానంగా దూకుడు వ్యవహరించిన ఆప్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. కేవలం 5 సీట్లకే పరిమితమైంది. బీజేపీ అఖండ విజయంలో ప్రధాన పక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తప్పిదాలు కొన్నైతే.. దూకుడుగా వ్యవహరించిన ఆమ్ ఆద్మీ పార్టీ రూపంలో మరింత నష్టం వాటిల్లింది. ఈ ఎన్నికల్లో బీజేపీ గతంలో ఉన్న రికార్డులను తిరగరాసింది. 1985లో మాధవ్ సింగ్ సోలంకి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 149 సీట్లు గెలుచుకుంది.. ఇది ఇప్పటి వరకు ఇదే రికార్డు. 1995 నుంచి అధికారంలో ఉన్నట్టున్న బీజేపీ 2002లో నరేంద్ర మోదీ హయాంలో అత్యధికంగా 127 సీట్లు సాధించింది. ఇదే బీజేపీ అల్ టైం రికార్డు.
తాజా ఫలితాలు గత రికార్డులను బద్దలు కొట్లాయి. బీజేపీ ఏకంగా 157 స్థానాల్లోవిజయం సాధించింది. తొలుత దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ ప్రస్తానం ప్రారంభించిన ఆప్..క్రమంగా ఎదుగుతు వెళ్తుంది. అనంతరం పంజాబ్ అధికారాన్ని చేపట్టింది. గోవాలో చెప్పుకోదగిన ఓట్లను సాధించిన ఆప్. అదే ఊపులో గుజరాత్లో చక్రం తిప్పాలని ప్రయత్నించింది. ఖచ్చితంగా బీజేపీ కంచుకోటలో ఆప్ అధికారం చేపడుతుందని పార్టీ చీఫ్ కేజ్రివాల్ ప్రకటించారు.
ప్రధానంగా హిందూ ఓటర్లను ఆకట్టుకోవడానికి హామీల వర్షాన్ని గుప్పించారు.అనేక ఉచిత హామీలను, వాగ్దానాలను ఇచ్చారు. ఆప్ సింగిల్ డిజిట్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఆప్ భారీగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చిందని చెప్పాలి. ఇక ఆప్తో పాటు ఎంఐఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలకు గండి కొట్టారనీ చెప్పాలి. పరోక్షంగా బీజేపీ గెలుపుకు ఇవి సహకరించాయనే చెప్పాలి. ఆమ్ ఆద్మీ పార్టీ.. కాంగ్రెస్ ఓట్ల శాతాన్ని కైవసం చేసుకుంది.
ఆప్ పోటీ చేయకుంటే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయేదని కాదు కానీ, ఓట్ల శాతాన్ని చూస్తే.. గత ఎన్నికల కంటే బీజేపీకి దాదాపు ఐదు శాతం ఎక్కువ వచ్చాయి. బీజేపీ అఖండ విజయం సాధించడంలో ఆప్ దోహదపడింది. దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఆదరణ తగ్గలేదు. అతని ప్రజాదరణ చాలా ఎక్కువ. ఆయన ప్రధానమంత్రి అయినా.. ఆయన పేరు మీద గుజరాత్ ప్రజలు ఓటేశారు. ఫలితాలను పరిశీలిస్తే,, అహ్మదాబాద్, సూరత్, వడోదరలో ఆయన రోడ్షోలు నిర్వహించిన ప్రతిచోటా ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ప్రధాని మోడీకి ఇప్పటికీ ప్రజాదరణ చెక్కుచెదరలేదని, ఆయన పక్కన ఎవరూ నిలబడలేదని గుజరాత్ పోరు మరోసారి నిరూపించింది.
సమీప భవిష్యత్తులో ఎలాంటి మార్పు ఉండదని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు వెలువడుతాయని పలువురు విశ్లేషకులు తెలిపారు. దీంతో దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తి కనిపిస్తోందా? అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే మోడీకి ప్రత్యామ్నాయంగా కేజ్రీవాల్ ఎదుగుతున్నారనే సంకేతాలు వస్తున్నాయి. తాజాగా ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 15 ఏళ్ల బీజేపీ పాలనను పక్కన పెట్టి ఇక్కడ అధికారంలోకి వచ్చారు.
ఇదేమీ చిన్న విజయం కాదు. కేంద్రంలో ఉన్న ఒక బలమైన అధికార పార్టీని తోసిరాజని.. ప్రజలను మెప్పించడం. అదే సమయంలో లిక్కర్ కుంభకోణంలో తన సొంత మంత్రినే అరెస్టు చేసే ప్రయత్నం వరకు రావడం.. అడుగడుగునా.. లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డంకులు ఇలా ఎన్నో విషయాలను పక్కన పెట్టి ప్రజలను మెప్పించిన కేజ్రీవాల్కు ఇప్పుడు దేశాన్ని మెప్పించడం పెద్ద సమస్య కాదనేది విశ్లేషకుల అభిప్రాయం. మారుతున్న పరిణామాలను అంచనా వేయడంలోనూ.. అవినీతి రహిత పాలనపై తనదైన ముద్ర వేయడంలోనూ ఆయన సక్సెస్ అయ్యారు.
ప్రతిపక్షాలు.. మోడీని ఢీకొట్టే వ్యూహంలో బలోపేతం కాగలవా..?
అయితే, కొంత సమయం పట్టినా.. ఆయనే మోడీకి ప్రత్యామ్నాయమనే వాదన మాత్రం వినిపిస్తోంది. అదే సమయంలో మోదీ కాలంలో గాంధీగా ఉండటమే రాహుల్కున్న అతిపెద్ద సమస్య. ఇది ఎవరికైనా కష్టమే. మోదీ అయిదేళ్లపాటు ప్రధాని పదవిలో ఉన్న మోదీని ఓడించడం రాహుల్ కు అంత సులభం కాదని కూడా వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు తనకు మోదీని ఢీకొట్టేందుకు అవసరమైన శక్తిసామర్థ్యాలున్నాయని గడిచిన మూడు నెలల కాలంలో రాహుల్ నిరూపించారని మరికొందరు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో మోడీని ఢీకొట్టే నేతల లిస్ట్ లో రాహుల్ గాంధీ కూడా ఉన్నట్లేనని అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో రాహుల్ .. ఏవిధంగా నిలబెడతారన్న చర్చకు తాజాగా చేపట్టిన జోడో యాత్ర ఓ సమాధానం కాగలదన్న అభిప్రాయాలు కూడా సర్వత్రా వినిపిస్తున్నాయి.
ఇక వీరిద్దరితో పాటు .. బీహార్ సీఎం నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం మోడీపై కత్తులు నూరుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మోడీకి వీరిలో ఎవరు గట్టిపోటీ ఇస్తారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే గుజరాత్ ఫలితాలతో మోడీ తన పట్టు నిరూపించుకున్నారని, త్వరలో జరిగే మధ్యప్రదేశ్, కర్ణాటయ, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ తో పాటు ఈశాన్య రాష్ట్ర్రాల ఎన్నికల ఫలితాలే కీలకంగా మారతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అయితే గుజరాత్ పోల్స్ ఇచ్చిన మద్ధతుతో ఆప్ .. సైతం ఈ రాష్ట్రాల్లో పోరుకు సై అంటున్న వేళ .. వచ్చే ఎన్నికలు .. మరింత రసవత్తరంగా మారుతాయని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బలహీనంగా ఉన్న కాంగ్రెస్ .. ఏమేరకు బలం పుంజుకుంటుందో, దీని అధినేతగా .. రాహుల్ .. మోడీకి ఏమాత్రం పోటీ ఇస్తారో అన్నదే ఆసక్తిని రేకెత్తిస్తోంది. అదే సమయంలో కేజ్రీవాల్ .. తన రాజకీయ ఎత్తుగడలను మరింత దూకుడుగా మార్చుకుంటారో లేక ఢిల్లీ మోడల్ తోనే పోరాటానికి దిగుతారోనన్న చర్చ సర్వత్రా వెల్లువెత్తుతోంది. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ పేరిట జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తోన్న కేసీఆర్ .. పోటీకి దిగుతారో లేక మద్ధతిచ్చి ఊరుకుంటారో అన్నదీ చర్చనీయాంశంగా మారింది.
దీంతో 2024 కల్లా మోడీకి ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ పట్టు సాధిస్తుందన్నది .. ఇప్పుడిప్పుడే తేల్చే విషయం కాదని, ఈ రాష్ట్రాల్ ఎన్నికల తర్వాతే నిర్ణయానికి రావాల్సి ఉంటుందని కూడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో మోడీ ప్రత్యర్థిగా రాహుల్ గాంధీ నిలబడగలరా.. లేక కేజ్రీవాల్ నిలుస్తారా .. లేక .. పీఎం పీఠమే లక్ష్యంగా పావులు కదుపుతోన్న నితీష్, కేసీఆర్, మమత .. నిలబడతారా అన్నది మాత్రం .. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
ఇక మోడీ కథ ముగిసిందన్న విశ్లేషణలు దూదిపింజెలుగా మారాయన్న వాదన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దీంతో 2024 ఎన్నికలు .. అత్యంత రసవత్తరంగా మారుతున్నాయన్న చర్చ సర్వత్రా వెల్లువెత్తుతోంది.