భారత స్మార్ట్ ఫోన్ల వినియోగం తగ్గుతోందా..? గతేడాది కన్నా కొనుగోళ్లు తగ్గాయా..? అయితే ప్రస్తుత ఏడాదిలో అమ్మకాలు పెరుగుతాయని టెలికాం రంగ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వచ్చేది .. 5జీ యుగం అన్నది అందరికీ తెలిసిందే. ఇదే సూత్రం మీద .. గతేడాది తగ్గినా, ఈ ఆర్థిక సంవత్సరం నుంచి భారత్ లో స్మార్ట్ ఫోన్ మార్కెట్ గణనీయంగా పుంజుకుంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి..
భారత్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం పడిపోతోంది. 2021తో పోలిస్తే ఆరు శాతం తగ్గి 151.6 మిలియన్ యూనిట్లకు పడిపోయాయి. ఇప్పటికీ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ నంబర్ వన్గా నిలిచిందని కెనాల్యిస్ నివేదిక తెలిపింది. 2017 మూడో త్రైమాసికం నుంచి తొలిసారి 2022 చివరి త్రైమాసికంలో నంబర్ వన్ స్థానంలోకి వచ్చి చేరింది శ్యామ్సంగ్. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 67 లక్షల స్మార్ట్ ఫోన్లు విక్రయించిన శ్యామ్సంగ్.. మార్కెట్లో 21 శాతం సొంతం చేసుకుంది. రెండో స్థానంలో చైనాకు చెందిన వివో కొనసాగుతోంది.
ప్రధానంగా ఆఫ్లైన్ చానెల్స్ ద్వారా విక్రయించినా 64 లక్షల స్మార్ట్ ఫోన్లు విక్రయించింది. ప్రపంచంలోని ఇతర మార్కెట్లతో పోలిస్తే భారత్లో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. కానీ, భారత్లో స్థానిక వినియోగదారులు ఖర్చు తగ్గిస్తున్నారు
అని విశ్లేషకులు అంటున్నారు. దీంతో ఫెస్టివ్ సీజన్లోనూ భారత్ మార్కెట్లో లావాదేవీలు తగ్గిపోతున్నాయి. రిటైల్ స్పెండింగ్, ఎలక్ట్రానిక్ దిగుమతులు పడిపోయాయి. 2022లో స్మార్ట్ ఫోన్ల వినియోగదారులు కరోనా మహమ్మారి వేళ కొనుగోలు చేసిన ఫోన్లను ఆల్రెడీ అప్డేట్ చేసుకున్నారు.
తదుపరి కొనుగోళ్లు ఆలస్యం చేస్తున్నారు. గిరాకీ లేకపోవడంతో నిల్వలు విక్రయించడానికి వివిధ స్మార్ట్ ఫోన్ల బ్రాండ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావం 2022 చివరికల్లా భారత్ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని ఆర్థిక నిపుణులు భావించారు. ఇప్పుడు 2023లో స్వల్పకాలికంగా గిరాకీ తగ్గుతుందని ఆర్థిక సూచికలు చెబుతున్నాయి. దీంతో 2023లో 5జీ స్మార్ట్ ఫోన్ల రీప్లేస్మెంట్తో స్వల్పంగా భారత స్మార్ట్ ఫోన్ల మార్కెట్ పెరుగుతుందని అంచనా వేస్తున్నామని వీరంతా అన్నారు.
ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్లు ఎప్పటికప్పుడూ రిలీజ్ అవుతుంటాయి. ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకునేలా అత్యాధునిక ఫీచర్లతో కంపెనీలు మొబైల్ ఫోన్లు తెస్తున్నాయి. అందుకే ఏటా మొబైల్ మార్కెట్ షేర్ పెరుగుతూ ఉంటుంది. కానీ గతేడాది మాత్రం సీన్ రివర్సైంది. చరిత్రలో తొలిసారి మొబైల్ మార్కెట్ డౌన్ అయింది. క్యానలీస్ రిపోర్టు ప్రకారం 2021తో పోల్చితే 2022లో మొబైల్ సేల్స్ 17శాతం తగ్గాయి. కోవిడ్ టైంలోనూ మొబైల్ మార్కెట్లో వృద్ధి ఉండగా, 2022లో ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు, మొబైల్ ధరలు పెరగడం సేల్స్ తగ్గేందుకు కారణమని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ సేల్స్ తగ్గినా గ్లోబల్ మొబైల్ మార్కెట్లో 25 శాతం వాటాతో యాపిల్ ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది.

తర్వాతి స్థానాల్లో శాంసంగ్ (20%), షావోమీ (11%), ఒప్పొ (10%) , వీవో (8%) ఉన్నాయి. 2022లో షావోమీ మార్కెట్ షేర్ మాత్రం 2 శాతం తగ్గింది. అయితే భారత్ లో వచ్చే ఏడాది 5జి హ్యాండ్ సెట్ల అమ్మకాలు జోరందుకోనుందని కౌంటర్ పాయింట్ సంస్థ అంచనా వేసింది. దేశవ్యాప్తంగా అన్ని టెలికాం సంస్థలు 5జి సేవల్ని విరివిగా అందుబాటులోకి తేనున్న నేపధ్యంలో 4జి ఫోన్ల కంటే 5జి హ్యాండ్ సెట్ల కొనుగోలుకే వినియోగదారులు మొగ్గుచూపనున్నట్లు తెలిపింది. తక్కువ ధరకే దొరికే 5జి హ్యాండ్ సెట్లకు భారీ డిమాండ్ ఏర్పడనుందని తెలిపింది. ఈ ఏడాది భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ గతేడాదితో పోల్చితే తగ్గిందన్న ఆ సంస్థ.. ఈ లోటును వచ్చే ఏడాది 5జి హ్యాండ్ సెట్ల అమ్మకాలు భర్తీ చేస్తుందని తెలిపింది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడని వారు అంటూ ఉండరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఇంట్లో 4,5 స్మార్ట్ఫోన్లు ఖచ్చితంగా ఉంటున్నాయి. ఇక రీసెంట్ గా వచ్చిన కరోనా లాక్ డౌన్ తో స్మార్ట్ ఫోన్ల వినియోగం కూడా పెరిగిపోయింది.
స్కూల్ పిల్లలకు సైతం స్మార్ట్ ఫోన్ లు కొని ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆన్లైన్ క్లాసుల కోసం స్కూల్ పిల్లలకు కూడా తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొనడం జరిగింది. ఇదిలా ఉంటే భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా రెండో స్థానంలో నిలిచింది. ఇండియాలో కి చైనా స్మార్ట్ ఫోన్ రాకతో తక్కువ ధరకు ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్ లు అందుబాటులోకి రావడంతో యూజర్ లు కూడా ఎగబడి కొనేస్తున్నారు. అంతేకాకుండా స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రెండో స్థానంలో ఉన్న అమెరికాను సైతం భారత్ వెనక్కి నెట్టేసింది. ఇక చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ తో ప్రపంచంలోనే నెంబర్ వన్ ర్యాంకు లో నిలిచింది.
ఆ తరవాత భారత్ రెండో స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో అమెరికా నిలిచింది. ఇండియా నుంచి స్మార్ట్ఫోన్ల ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం రూ.42 వేల కోట్ల విలువైన స్మార్ట్ఫోన్ ఎగుమతులు జరిగాయని సమాచారం. దీని ప్రకారం.. 2020-21లో, కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన సంక్షోభం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతింది. మైక్రోచిప్ల కొరత కారణంగా స్మార్ట్ఫోన్ ఎగుమతులు భారీగా తగ్గాయి. చిప్ల కొరత ఇంకా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. గడిచిన నాలుగేళ్లలో దేశీయ స్మార్ట్ఫోన్ ఎగుమతులు 32 శాతం పెరిగాయని తేలింది. 2017-18లో స్మార్ట్ఫోన్ ఎగుమతుల విలువ రూ.1,300 కోట్లుగా ఉన్నట్లు తేలింది. కేవలం నాలుగేళ్లలో ఈ విలువ రూ.42,000లకు చేరడం విశేషం. 2020-21లో రూ.42 వేల కోట్ల ఎగుమతులు నమోదవగా అందులో రూ.20 వేల కోట్ల విలువైన ఎగుమతులు కేవలం శాంసంగ్ ఫోన్లకు, రూ.12,000 వేల కోట్ల విలువైన ఎగుమతులు యాపిల్ ఐఫోన్లకు సంబంధించినవే కావడం గమనార్హం.
కరోనా విషయంలో చైనాపై వచ్చిన వ్యతిరేకత, భారత్ చైనా మధ్య జరిగిన గల్వాన్ ఘటన తర్వాత.. దేశీయంగా భారీ మార్పులు వచ్చాయి. ముఖ్యంగా స్మార్ట్ఫోన్ తయారీదారులకు.. తయారీ ఆధారిత ప్రోత్సాహకాలు ప్రకటించడం వంటి చర్యలతో భారత్లో ఉత్పత్తి భారీగా పెరిగింది. భారత్లో ఉత్పత్తయిన వివిధ కంపెనీల ఫోన్లకు దక్షిణాసియా, ఐరోపాల నుంచి డిమాండ్ పెరిగింది. దీనితో ఎగుమతులు ఈ స్థాయిలో పుంజుకున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా ఇప్పుడు భారత్ లో 5G నెట్ వర్క్ సేవలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. జియో, ఎయిర్ టెల్ లాంటి సెల్యూలార్ కంపెనీలు రోజు రోజు 5G నెట్ వర్క్ పరిధిని విస్తృతం చేస్తున్నాయి.
ఇప్పటికే సుమారు 60 నగరాలు, పట్టణాల ప్రజలకు ఈ సేవలను అందుబాటులోకి తెచ్చాయి. వచ్చే ఏడాది చివరి నాటికి దేశ వ్యాప్తంగా 5G సేవలు అందుబాటులోకి తేనున్నట్లు జియో వెల్లడించింది. అటు 2024 చివరి నాటికి దేశమంతటా 5G సేవలను విస్తరిస్తామని ఎయిర్ టెల్ తెలిపింది. 2023 చివరి నాటికి, 75-80 శాతం కొత్త స్మార్ట్ ఫోన్ లు లాంచ్ కాగా, ఇవన్నీ 5G నెట్ వర్క్ కు సపోర్టు చేసేలా ఉంటాయని నిపుణులు వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబర్ 1న ప్రధాని నరేంద్ర మోడీ 5G సేవలను అధికారికంగా ప్రారంభించారు. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఎంపిక చేసిన నగరాల్లో ఈ సేవలను ప్రారంభించారు. 2023 చివరి నాటికి లేదంటే 2024 ప్రారంభ నెలల్లో దేశ వ్యాప్తగా ఈ సేవలు విస్తరించేలా ప్లాన్ చేస్తున్నారు. భారత్లో తయారీ వేగం పుంజుకుంటుందని కేంద్ర ప్రభుత్వం కూడా ఆశిస్తోంది. దీంతో వచ్చే ఏడాదిలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ మరింత వృద్ధి చెందే అవకాశం ఉందని అంచనాలు
వెల్లువెత్తుతున్నాయి.
2023-24 ఆర్థిక సంవత్సరంలో స్మార్ట్ ఫోన్ల మార్కెట్ మరీ ముఖ్యంగా భారత్ లో గణనీయ వృద్ధిని సాధిస్తుందని మార్కెట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.