ప్రపంచం అంతా ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల చేష్టలను వ్యతిరేకిస్తూ ఒంటరిని చేస్తుంటే డ్రాగన్ కంట్రీ చైనా మాత్రం దగ్గరకు తీసుకుని కోరిన సాయం అందిస్తోంది. తాజాగా వారికి అత్యాధునిక ఆయుధాలను అందిస్తోంది. అయితే ఈ కపట సాయం వెనుక కుట్ర దాగి ఉందని చెబుతున్నారు విశ్లేషకులు. ఆయుధాలే కాదు ఇంకే అవసరానికైనా తానున్నానంటూ తాలిబన్ ప్రభుత్వానికి మద్దతు పలికింది చైనా..
అవును..అప్ఘానిస్థాన్లో తాలిబన్ల పాలనను, అరాచక చర్యలను ప్రపంచమంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నా..చైనా మాత్రం అన్ని రకాలుగా మద్దతుగా ఉంటోంది. అప్ఘానిస్థాన్ను అమెరికా దళాల నుంచి ఆక్రమించుకుని…తాలిబన్లకు అప్పగించడంలో తెర వెనక కీలక పాత్ర పోషించిన చైనా ఇప్పుడు తాలిబన్ల పాలనను స్థిరీకరించేందుకు సాయం చేస్తోంది. తాలిబన్లకు అత్యాధునిక ఆయుధాలు అందిస్తోంది.
అయితే ఈ విషయం ‘తాలిబన్ల నీడలో అమెరికా-పాకిస్థాన్ సంబంధాలు’ అనే పుస్తకం రాసిన రచయిత జాఫర్ ఇక్బాల్ యూసఫ్ జాయ్ వెల్లడించారు. ఇన్నాళ్లూ తాలిబన్లకు మానవతా ద్రుక్పదంతో ఆహారం సఫ్లై చేస్తోందనే అంతా అనుకున్నారు. కానీ అరాచకం స్రుష్టిస్తోన్న తాలిబన్లకు చాటుమాటుగా ఆయుధాలు సరఫరా చేస్తోందని ఎవరూ ఊహించలేదు.
కాబూల్లో గత డిసెంబర్ 12న ఇస్లామిక్ స్టేట్ ఖోరసన్ ప్రావిన్స్ ఉగ్రవాదులు ఓ హోటల్పై దాడిచేశారు. చైనీయులే లక్ష్యంగా ఈ దాడి జరిగింది. ఈ హోటల్లో బసచేసిన వారిలో ఎక్కువమంది చైనీయులే ఉన్నారు. హోటల్ నిర్వాహకులు కూడా చైనీయులే అవడంతో ఆఫ్గనిస్తాన్ లో పని చేస్తోన్న చైనా ఇంజనీర్లు సిబ్బంది ఇక్కడే బస చేస్తుంటారు..అయితే ఈ దాడిలో మొత్తం 18మంది చైనీయులు గాయపడ్డారు.
చైనా ప్రతినిధులు, వ్యాపారులు ఈ హోటల్కు తరచుగా వస్తుంటారు. ఈ ఘటన తర్వాత చైనా ఓ నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదులను ఎదుర్కునేందుకు ఏకంగా తాలిబన్లకే అత్యాధునిక ఆయుధాలు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అలా ప్రభుత్వానికి అన్ని విధాలా మద్దతుగా ఉండేందుకు సిద్ధమయింది.
- ఉగ్రవాదులను తాలిబన్లు సమర్థవంతంగా ఎదుర్కొంనేందుకు మానవ రహిత విమానాలు సహా అత్యాధునిక ఆయుధాలు అందించడం మొదలుపెట్టింది..
అయితే ఈ మద్దతు సాయం వెనుక చైనాకు వేరే ఉద్దేశాలున్నాయి. అప్ఘానిస్థాన్తో చైనాకు అనేక ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అప్ఘానిస్తాన్ లోని చెట్లూ చేమా కనిపించని పర్వతాలలో అనేకమైన ఖనిజ నిక్షేపాలు దాగి ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో అయితే అరబ్ దేశాలతో పోటీ పడేంతగా చమురు నిల్వలు కూడా ఉన్నాయి. వీటిపై చైనాకు ఏనాటి నుంచో కన్ను పడింది. అయితే వాటిని కొల్లగొట్టేందుకు పాకిస్తాన్ ను వాడుకోవాలని చూసింది.

కానీ పాకిస్తాన్ ఆఫ్గనిస్తాన్ తాలిబన్లకు మొదటి నుంచీ పొసగడం లేదు. దాంతో తానే ఒంటరిగా రంగంలోకి దిగింది. ఇప్పటికే చైనాకు చెందిన ఓ కంపెనీకి చమురు వెలికితీసే కాంట్రాక్టుపై ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. అందుకు పెద్ద మొత్తంలో నిధులు కూడా అందజేసింది. దీంతో ఇక తాలిబన్లకు చైనా పట్ల నమ్మకం ఏర్పడింది.
రాబోయే రోజులలో మరిన్ని ప్రయోజనాలను చైనాకు కట్టబెట్టే ఆలోచనలు చేస్తున్నారు తాలిబన్లు..అంతే కాదు. గల్ఫ్, ఇరాన్తో చైనాను కలిపేందుకు డ్రాగన్ నిర్మిస్తున్నబెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ ఆఫ్గనిస్తాన్ నుంచి వెళుతుంది., చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ వంటివాటికి అప్ఘాన్ కీలకమైనది.
అందుకే తాలిబన్లకు మానవతాసాయం, ఆయుధసాయం అందించడంతో పాటు తాలిబన్ల పాలనకు ప్రపంచ మద్దతు కూడగట్టేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోంది. 2021లోనే మానవరహిత ఏరియల్ వాహనాలు, డ్రోన్లు చైనా తాలిబన్లకు అందించింది.
తాలిబన్లు కాబూల్ను ఆక్రమించుకున్న మరుసటి నెలే…ఈ అమ్మకాలు జరిగాయి. అంటే ఆగస్టులో తాలిబన్లు అఫ్ఘానిస్థాన్ ను ఆక్రించుకుంటే సెప్టెంబర్ లో చైనా తాలిబన్లకు ఏరియల్ వాహనాలు,డ్రోన్లు అందజేసింది. రెండు దశాబ్దాల తర్వాత రిక్తహస్తాలతో అప్ఘానిస్థాన్ నుంచి అమెరికా సంయుక్త బలగాలు వైదొలగడంలో చైనా పాత్ర ఉందని ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి.
తాలిబన్లకు తెరవెనక చైనా అన్నీ తానై వ్యవహరించిందని అంతర్జాతీయ నిపుణులు వెల్లడించారు. పాకిస్థాన్ తెర ముందు ఉంటే…తెర వెనక చైనా తాలిబన్లకు సహాయ సహకారాలు అందించాయని తెలిపారు.
అయితే అప్ఘానిస్తాన్పై వైఖరితో పాకిస్థాన్ ఇబ్బందులు పడుతోంది. అమెరికా, పాకిస్థాన్ మధ్య చిరకాల మిత్ర బంధం దెబ్బతింది. అదే సమయంలో చైనా, పాకిస్థాన్ బంధం మాత్రం బలోపేతమవుతోంది.