మొన్నటిదాకా కరోనాతో తల్లడిల్లిన డ్రాగన్ కంట్రీకి ప్రస్తుతం కొత్త సమస్య వచ్చిపడింది. ఆ సమస్య మరేమిటో కాదు..తగ్గిపోయిన జనాభా గురించేనని అంటున్నారు అధికారులు. పెళ్లి కాకపోయినా ఫరవాలేదు పిల్లలను కనండి అని పిలుపు ఇచ్చినా స్పంధన రాలేదు. దీంతో చైనాలోని స్పెర్మ్ బ్యాంకులు మరో మార్గం ఎంచుకున్నాయి. ఇందుకోసం దేశవ్యాప్తంగా స్టూడెంట్లు, యువకుల నుంచి వీర్యం సేకరించడం మొదలుపెట్టాయి. అది కూడా ఊరికేనే కాదు డబ్బులిచ్చి సేకరిస్తున్నాయి..
మొన్నటి దాకా జనాభా ఎక్కువై ఇబ్బందులు పడ్డ చైనా.. ఇప్పుడు అదే జనాభా కోసం నానా రకాలుగా తాపత్రయపడుతోంది. దేశంలో ఒక్కసారిగా పడిపోయిన జననాల రేటును పెంచేందుకు తోచిన విధానంలో ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం విద్యార్ధులు, యువత నుంచి స్పెర్మ్ కలెక్షన్ కోసం ప్రయత్నాలు చేస్తోంది డ్రాగన్ కంట్రీ. జనాభా పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం చైనా. 2021 నాటికే ఆ దేశ జనాభా 141 కోట్లకు పైగా ఉన్నారు. అయినప్పటికీ ఆ దేశం కొన్ని వినూత్న సమస్యలను ఎదుర్కొంటోంది. అందులో ఒకటి.. యువత శాతం తగ్గిపోవడం. రెండోది.. జనాభా పెరుగుదల శాతం భారీగా పడిపోవడం. చైనాలో ప్రస్తుతం జనాభా పెరుగుదల రేటు కేవలం 0.1శాతం మాత్రమే. నిజానికి గత ఐదేళ్లుగా చైనాలో జనాభా వృద్ధి రేటు పడిపోతూ వస్తోంది.
ఒక్కరే ముద్దు.. ఇద్దరు వద్దు అనే కండీషన్ కారణంగా చైనా ఊహించని సమస్యను కొని తెచ్చుకుంది. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన డ్రాగన్.. పిల్లలు కనే విషయంలో సడలింపులు ఇచ్చింది. ఇద్దరు, ముగ్గురిని అయినా కనండి అంటూ ఆఫర్లు ప్రకటించింది. ఎంత ఎక్కువ పిల్లలు కంటే అన్ని బెనెఫిట్స్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ పెద్దగా మార్పు రాలేదు. గడిచిన ఐదేళ్లుగా జనాభా వృద్ధి రేటు పడిపోతూనే ఉంది. 61 ఏళ్ల తర్వాత తొలిసారి చైనా జనాభా వృద్ధిలో ప్రతికూలత నమోదైంది. ఇలాంటి సమయంలో స్పెర్మ్ బ్యాంక్ కాన్సెప్ట్ ముందుకు వచ్చింది. దేశంలోని యువకులు విద్యార్థులు వీర్యాన్ని దానం చేయాలంటూ యూనివర్సిటీ విద్యార్థులను చైనా స్పెర్మ్ బ్యాంకులు కోరుతున్నాయి. ఒక్కరు 8 నుంచి 12 సార్లు వీర్యం దానం చేస్తే 4వేల 500 యూవాన్లు ఇస్తానని ఆఫర్ చేస్తున్నాయి.
ఫిబ్రవరి 2న నైరుతి చైనాలోని యునాన్ హ్యూమన్ స్పెర్మ్ బ్యాంక్ తొలిసారి దీనిపై ప్రకటన ఇచ్చింది. స్పెర్మ్ డొనేషన్ విధానం, రిజిస్ట్రేషన్ షరతులు, చెల్లించే ఫీజు గురించి అందులో స్పష్టంగా వివరించింది. 20 నుంచి 40 ఏళ్ల వయసు, 165 సెంటీమీటర్ల కంటే ఎత్తుగా ఉండి, డిగ్రీ పూర్తైన, లేదంటే చదువుతున్న ఆరోగ్యవంతులైన వారు దీనికి అర్హులు. స్పెర్మ్ దాతలు పూర్తి ఆరోగ్యవంతులై ఉండాలి. అలాంటి వారు 8 నుంచి 12 సార్లు వీర్యం దానం చేస్తే వారికి 4,500 యూవాన్లు ఇస్తారు.అంటే మన కరెన్సీలో ఇది 55వేల రూపాయలతో సమానం. అయితే తాము 7వేల యువాన్లను ఇస్తామంటోంది షాంఘై స్పెర్మ్ బ్యాంక్.. షాంగ్జీ స్పెర్మ్ బ్యాంక్ కూడా ఇలాంటి ఆఫర్ ప్రకటించింది. వీర్య దాతలు కనీసం 168 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలని తెలిపింది. వారికి 5,000 యూవాన్లు చెల్లిస్తామని చెప్పింది.
దాంతో ఓ అడుగు ముందుకేసిన షాంఘై స్పెర్మ్ బ్యాంక్ ఇంకాస్త ఎక్కువ రేటే ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఒక్కో దాతకు 7,000 యువాన్లనుఇస్తామంటోంది. అయితే బట్టతల, దృష్టి లోపం, బీపీ వంటి అనారోగ్య సమస్యలు ఉండకూడదు. స్మోకింగ్, మద్యం సేవించే అలవాట్లు లేనివారే అర్హులు. ఇలా చైనాలోని అన్ని స్పెర్మ్ బ్యాంకులు యూనివర్సిటీ విద్యార్థులకు ఆఫర్లు ఇస్తున్నాయి. దీంతో స్పెర్మ్ ఇచ్చేందుకు విద్యార్ధులు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. చైనాలో ప్రస్తుతం ఈ కొత్త ట్రెండ్ నడుస్తోంది. చైనా వ్యాప్తంగా వీర్యం కోసం పలు స్పెర్మ్ బ్యాంకులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసుకున్నాయి. స్పెర్మ్ బ్యాంకులు ముఖ్యంగా యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులను డొనేట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.
యూనివర్సిటీ విద్యార్థులు ఇది ఓ ఆదాయ మార్గంగా మార్చుకుంటున్నారు. చైనాలో పడిపోతున్న సంతానోత్పత్తి రేటును ఎదుర్కోవడానికి ఇది ఒక మార్గంగా దోహదం చేస్తుందని అక్కడి స్పెర్మ్ బ్యాంకులు భావిస్తున్నాయి. స్పెర్మ్ దానం చేయాలని వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో చైనీస్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ వైబోలో నెటిజెన్లు తెగ చర్చించుకుంటున్నారు. వీర్యదానం వల్ల ప్రయోజనాలు, రిజిస్ట్రేషన్ షరతులు, సబ్సిడీ, డొనేషన్ విధానం గురించి పరిచయం చేస్తున్నారు. ఇలా చైనాలోని అన్ని ప్రావిన్సుల్లో, నగరాల్లో స్పెర్మ్ బ్యాంకులు ఇలాగే ప్రకటనలు ఇస్తున్నాయి. అయితే దాతలు కచ్చితంగా ఆరోగ్యంతో ఉండాలని, అంటు వ్యాధులు ఉండవద్దని, బట్టతల, పొగతాగే అలవాటు, మధ్యసేవించే అలవాటు, బీపీ ఉన్న వారు వీర్యాన్ని దానం చేయడానికి అనర్హులని ప్రకటించాయి.