యాబయ్యేళ్ల తరువాత చంద్రుడిపై మరోసారి కాలు మోపనేలేదు..అక్కడ కూరగాయలు పండించడం విషయంలో ప్రయోగాలు జరుగుతున్నాయి. యురోపియన్ స్పేస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే చంద్రుడిపై మట్టి వ్యవసాయానికి పనికిరాకపోవచ్చు. అందుకే నీటిపైనే వ్యవసాయం చేస్తే చంద్రుడిపై నివసించేందుకు మార్గం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే త్వరలోనే చంద్రుడిపై పంటలు పండే అవకాశం లేకపోలేదు..
ఇక చంద్రుడిపైనా వ్యవసాయం చేసేద్దాం.. జాబిల్లిపై పంటలు పండించేద్దాం అంటోంది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈసా.. చందమామపై మానవ శాశ్వత నివాసానికి ప్రణాళికలు వేస్తున్న కొన్ని దేశాలు, మనిషికి అవసరమైన నిత్యావసరాలు కూడా అక్కడే ఉత్పత్తి చేసుకునేలా ఇప్పటి నుంచే ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రుడిపై పంటల సాగుపై పలు అంతరిక్ష పరిశోధన సంస్థలు దృష్టిసారించాయి. చందమామపై మానవ శాశ్వత నివాసానికి ప్రణాళికలు వేస్తున్న కొన్ని దేశాలు, మనిషికి అవసరమైన నిత్యావసరాలు కూడా అక్కడే ఉత్పత్తి చేసేలా ఇప్పటి నుంచే ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రుడిపై పంటల సాగుపై పలు అంతరిక్ష పరిశోధన సంస్థలు దృష్టి సారించాయి. చంద్రుడిపై ఎలాగూ మంచు ఉందని ఇప్పటికే తేలడంతో ఆ నీటి ఆధారంగా వ్యవసాయం చేయాలని భావిస్తున్నారు.
తాజాగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సాయంతో నార్వేకు చెందిన సోల్సిస్ మైనింగ్ అనే సంస్థ చంద్రుడిపై హైడ్రోపోనిక్ విధానంలో పంటలు పండించాలని భావిస్తున్నట్టు ప్రకటించింది. మట్టితో సంబంధం లేకుండా నీటితో మాత్రమే పంటలు పండించటాన్ని హైడ్రోపోనిక్ ఫార్మింగ్ అంటారు. సాధారణంగా ఎక్కడైనా పంటలు పండించాలంటే మృత్తికలు అనబడే మట్టితోపాటు తగినంత నీరు ఉండటం అవసరం. భూమిపై పంటలు పండే మట్టిని మృత్తికలు అంటుండగా, చంద్రుడిపై ఉన్న మట్టిని రిగోలితిక్ అంటున్నారు. చంద్రుడి లోపలి పొరల్లో నీటి జాడలను గుర్తించారు కానీ, పంటలు పండించేందుకు సాధారణ నీరు లేదు. అక్కడి రిగోలితిక్లో కూడా పంటలు పండే లక్షణాలు తక్కువగా ఉన్నాయి. గతంలో చంద్రుడిపై నుంచి తెచ్చిన మట్టిపై ఈ తరహా ప్రయోగాలునిర్వహించారు.
పంటలు పండేందుకు అవసరమైన నైట్రోజన్ మూలకాలు అందులో ఉన్నట్టు తేలింది. అదేవిధంగా రిగోలితిక్లో విత్తనాలు మొలకెత్తకుండా, వేర్లు పెరగకుండా నిరోధించే మూలకాలు కూడా ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఆ మట్టిలో పంటలు పండించటం ఇప్పటికైతే సాధ్యం కాదని నిర్ధారణకు వచ్చారు. దీంతో హైడ్రోపోనిక్ పద్ధతిలో మట్టితో సంబంధం లేకుండా చంద్రుడిపై పంటలు పండించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్టు నార్వేకు చెందిన జియోటెక్నికల్ ఇన్స్టిట్యూట్ ‘ఎన్జీఐ’, ఇంటర్ డిసిప్లినరీ రిసెర్చ్ ఇన్ స్పేస్ వెల్లడించాయి. చంద్రుడి మట్టి లోపలి పొరల్లో మంచు రూపంలో నీరు ఉన్నట్టు ఇస్రో చంద్రయాన్ ద్వారా ఇప్పటికే గుర్తించింది. నాసాతోపాటు ఈఎస్ఏ కూడా దీన్ని ధ్రువీకరించాయి. ఇప్పుడు పంటలు పండించేందుకు ఆ నీటినే వాడుతామని సోల్సిస్ మైనింగ్ చెబుతోంది.
ప్రత్యేక మెకానికల్, కెమికల్, బయోలాజికల్ విధానాల ద్వారా రిగోలితిక్లోని నీటిని వెలికితీస్తారు. ఆ నీటి నుంచి పంటల పెరుగుదలను నిరోధించే మూలకాలను వేరుచేసి, పంట సాగుకు అవసరమైన ఖనిజాలు కలుపుతారు. ప్రత్యేక గుడారాల్లో ఏర్పాటుచేసిన పైపుల ద్వారా ఆ నీటిని సరఫరాచేసి, ఆ పైపుల్లోనే విత్తనాలు చల్లుతారు. నీటిలోని మినరల్స్ను వాడుకొని విత్తనం మొలకెత్తి మొక్కగా పెరుగుతుంది. చంద్రుడిపై దీర్ఘకాలం మనిషి మనుగడ సాగించాలంటే ఈ విధానంలో వ్యవసాయం చేయటం తప్పనిసరని ఈఎస్ఏ మెటీరియల్స్ అండ్ ప్రాసెసింగ్ ఇంజినీర్ మాల్గోర్జాటా హోలిన్స్కా తెలిపారు. అయితే అయిదు దశాబ్దాల సుదీర్ఘ విరామం తరువాత అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మరోసారి చంద్రుడిపైకి ప్రయాణాలకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా నిర్వహించిన ఆర్టెమిస్ ప్రోగ్రాం సక్సెస్ అయింది.
ఆర్టెమిస్ సిరీస్ లో మూన్ మిషన్ కు సంబంధించి మరో రెండు ప్రయోగాలు మానవరహితంగానే కొనసాగనున్నాయి. అత్యంత భారీగా ఉండే ఆర్టెమిస్ రాకెట్ ద్వారా త్వరలోనే చంద్రుడిపై మానవాళి కాలనీల నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో స్పేస్ ఎక్స్ రాకెట్ కంపెనీకి చంద్రమండలంపైకి మానవ సహిత అంతరిక్ష యాత్ర తాలూకు అగ్రిమెంట్లు జరిగాయి. మరో రెండు మూడేళ్లలో అమెరికా నుంచి తొలి మహిళ మరో పురుషుడు చంద్రుడిపై పాదం మోపనున్నారని సమాచారం. ఈ క్రమంలో రేపు చంద్రుడిపై శాశ్వత ఆవాసాలు నిర్మించాలనుకుంటే వారి కోసం ఆహారం కూడా అక్కడే ఉత్పత్తి చేయాలనే ఆలోచనకు రూపం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో దశాబ్దంలోగా చంద్రుడిపై అనేక దేశాలు తమ స్థావరాలు నిర్మించుకునే అవకాశాలున్నాయి.