కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ .. కేసుల విచారణలో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నాయి..? సంస్థల అధికారులు మారుతున్నా, విచారణలు మాత్రం ఎందుకు ఓ కొలిక్కి రావడం లేదు..? దీనిపై సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించింది..?
దేశంలో ఆర్థిక కుంభకోణాలు జరిగినప్పుడు సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రవేశించినప్పుడల్లా ఆ కేసుల విచారణలో తీవ్ర ఆలస్యం జరుగుతుందని అందరికీ తెలిసిందే. ఏళ్ల తరబడి విచారణ సాగుతూనే ఉంటుంది. ఇప్పటివరకు ఎన్ని ఆర్థిక కుంభకోణాలకు పరిష్కారాలు లభించాయో మీరు చెప్పగలరా?’అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ సి.టి.కుమార్లు గత వారం ప్రశ్నించారు.
ఈ ప్రశ్నలకు సిబిఐ, ఈడీ సంస్థల తరఫున న్యాయవాదులు సమాధానం చెప్పలేకపోయారు. దాదాపు పదేళ్ల క్రితం ఒడిషా, పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాం రాష్ట్రాల్లో దాదాపు పదివేల కోట్ల మేరకు సామాన్య ప్రజలనుంచి వసూలు చేసిన శారదా చిట్ ఫండ్ కుంభకోణం ఇంతవరకూ ఒక కొలిక్కి రాలేదు. నిజానికి 2014లోనే సుప్రీంకోర్టు ఈ కుంభకోణంపై విచారణకు ఆదేశించినప్పటికీ ప్రజలకు సిబిఐ న్యాయం చేయలేకపోయింది. వందల కోట్ల పెట్టుబడులు పెట్టిన బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు న్యాయం చేసే విషయంలో సిబిఐ డైరెక్టర్కు సమయం లేదా? పదేళ్లు, ఇరవై ఏళ్లు, ముప్పై ఏళ్లు… ఇలా విచారణకు ఎన్నేళ్లు పడుతుంది? విచారణ ప్రారంభించిన తర్వాత ఎంతమందికి డబ్బు చెల్లించారు?’అని సిబిఐని కోర్టు నిలదీసింది.
ఈ కుంభకోణానికి పాల్పడిన వారే ఇంకా ప్రజల డబ్బును అనుభవిస్తున్నారని, ఆ డబ్బుతోనే కేసులు వాదిస్తున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చాలా కేసుల్లో ఈ అక్రమ డబ్బు షెల్ కంపెనీల సహాయంతో విదేశాలకు తరలిపోతోందని, ఒకసారి నిందితులు విదేశాలకు పారిపోయాక వారిని దేశానికి రప్పించేందుకు అక్కడి కోర్టుల చుట్టూ మనం తిరగాల్సి వస్తోందని కూడా ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.
అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సిబిఐ పనితీరుపై వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ముఖేష్ కుమార్ రసిక్ భాయిషా గతంలో అయిదున్నరేళ్లు సిబిఐ తరఫున న్యాయవాదిగా ప్రాతినిధ్యం వహించారు. గుజరాత్కు చెందిన జస్టిస్ షాకు సిబిఐలో జరుగుతున్నదేమిటో బాగా తెలుసు. సిబిఐలో కస్టమ్స్ , ఎక్సైజ్ విభాగాలనుంచి అధికారులను డిప్యుటేషన్పై తీసుకువస్తారని, వారికి దర్యాప్తులో అనుభవమే ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. చిన్న చిన్న విషయాలకూ సిబిఐలో సమయం పడుతుందని, ప్రతి చిన్న విషయానికీ డైరెక్టర్ అనుమతి కావాలని ఆయన అన్నారు.
వ్యవస్థల్ని మార్చకుండా జరిగేదేముండదని ఆయన అభిప్రాయపడ్డారు. మరో అయిదునెలల్లో పదవీవిరమణ చేయనున్న జస్టిస్ షాకు తన హయాంలో కూడా చిట్ఫండ్ కుంభకోణంలో న్యాయం జరిగే అవకాశాలు తక్కువేనని తెలియకపోలేదు. అంతకు ముందు గత న్యాయమూర్తుల హయాంలో కూడా ఎన్నోసార్లు ఈ చిట్ఫండ్ కుంభకోణాల విచారణలు జరిగాయి. దర్యాప్తు సంస్థలు పలుసార్లు సుప్రీంకోర్టు మందలింపులకు కూడా గురయ్యాయి. కాని చివరకు న్యాయమూర్తులు, సిబిఐ డైరెక్టర్లు మారడమే కాని ప్రజలకు న్యాయం జరిగే అవకాశాలు చాలా తక్కువ. జస్టిస్ షాపేర్కొన్నట్లు ఒకసారి డబ్బు విదేశాలకు తరలి వెళ్లి, నిందితులు పారిపోయిన తర్వాత ఆ దర్యాప్తుకు ఎంతకాలం పడుతుందో కూడా తెలియదు.
లుక్అ వుట్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులకే చాలా సమయం పడుతుంది. ఫలానా దేశంలో కోర్టు విచారిస్తోందని, ఎప్పుడైనా నిందితులను సిబిఐ దేశానికి తీసుకురావచ్చని పత్రికల్లో చాలాసార్లు పతాక శీర్షికల్లో వార్తలు వస్తాయి. ఆర్థిక అక్రమాలతో విదేశాల్లో ఉన్న 72 మంది భారతీయుల్లో ముఖ్యంగా మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకువచ్చారన్నదే ఆసక్తికర ప్రశ్నగా మారింది.
ఇప్పటికి ఇద్దర్ని మాత్రమే తీసుకురాగలిగారని ఒక ఆర్టీఐ సమాచారాన్ని బట్టి తేలింది. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, నీషల్ మోడీ, మెహుల్ చోక్సీ లాంటి ఎందరో వ్యాపారులు తమ కుటుంబాలతో సహా విదేశాల్లో ఉన్నారు. వీరు కాక పరేఖ్లు, పటేల్లు, గోయల్లు ఎందరో! ఎంతమందిని ప్రభుత్వం తీసుకురాగలిగింది? తీసుకువచ్చిన వారిలో పదికోట్ల నుంచి 40 కోట్ల వరకు బ్యాంకులను మోసం చేసిన వారు ఉన్నారు కాని వందలాది కోట్లను మింగిన తిమింగలాలను ఇంకా భారత ప్రజలు చూడాల్సి ఉంది.
కొన్ని కేసుల్లో ఆస్తులను అమ్మి బ్యాంకులు కొంతవరకు డబ్బును సమకూర్చుకోగలిగాయి కాని ప్రభుత్వం నిందితులకు శిక్షపడేలా మాత్రం చేయలేకపోయింది. భారత ఏజెన్సీల కళ్లు కప్పి వారు విదేశాలకు పారిపోయారంటేనే మన ఏజెన్సీలు ఎంత కట్టుదిట్టంగా పనిచేస్తున్నాయో అర్థం అవుతుంది. విదేశీ పర్యటనలకు, అక్కడి కోర్టుల్లో వాదించేందుకు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయో కూడా చెప్పలేం. ఒక సందర్భంలో మెహుల్ చోక్సీని భారతదేశానికితీసుకువచ్చేందుకు ప్రైవేట్ విమానాన్ని కూడా డొమినికాకు తీసుకువెళ్లారు.
తాను భారతదేశ పౌరుడినే కాదని వాదిస్తున్న చోక్సీ అక్కడి నుంచి తాను నివసిస్తున్న ఆంటిగువాకు వెళ్లిపోయారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు ముగ్గురే దాదాపు రూ. 23 వేల కోట్ల మేరకు బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారు. తాము అవినీతిపై తీవ్ర పోరాటం చేస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ దేశాన్ని లూటీ చేసిన వారిని విదేశాలనుంచి రప్పిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదే పదే ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ ప్రకటనలు కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకేనన్న అనుమానాలు లేకపోలేదు. ఇంతవరకూ ఒక్క ఆర్థిక నేరస్థుడి పేరు కూడా ఆయన ప్రస్తావించలేదు.

పైగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కార్పొరేట్లకు భారీ రుణాలు లభిస్తూనే ఉన్నాయి. ప్రతి ఏటా లక్షల కోట్ల మేరకు ఈ రుణాలను రద్దు చేస్తున్నట్లు పార్లమెంట్లో ఆర్థిక మంత్రి ప్రకటిస్తూనే ఉన్నారు. సంపద సృష్టించేవారికి పెద్దఎత్తున రుణాలు ఇవ్వండని 2021లో ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో 2024 సార్వత్రక ఎన్నికలు వచ్చేలోగానైనా ఒక్క మహా ఆర్థిక నేరస్థుడినైనా ఆయన దేశానికి తీసుకువచ్చి జైలుకు పంపించగలరా అన్నది తేలాల్సి ఉంది.
కోర్టుల ద్వారానో, మరో రకంగానో సిబిఐ ఆర్థిక నేరాలను విచారిస్తున్నది కనుక మనకు కనీసం సమాచారం తెలుస్తోంది. కాని దేశంలో అనేక చోట్ల సిబిఐ దాకా రాని అనేక భారీ ఆర్థిక నేరాలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి స్వంత రాష్ట్రమైన గుజరాత్లో పదివేల కోట్ల మేరకు ఆదివాసీల నుంచి చిట్ఫండ్ల పేరుతో లూటీ చేశారని, ఇది శారదా కుంభకోణం కంటే ఎంతో పెద్దదని ఓఎన్జీవో సంస్థ వెల్లడించింది. ఇలాంటి ఆర్థిక నేరాలపై ఎప్పుడో ఒకప్పుడు కోర్టులు పట్టించుకుని సిబిఐ, ఈడీ విచారణకు ఆదేశించినా సరిపోదు.
అసలు బ్యాంకుల నుంచి వేల కోట్లు లూటీ చేసిన వారి గురించి ప్రజలకు ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదు? వారి పేర్లను ఎందుకు దాచిపెడుతోంది? రిజర్వు బ్యాంకు వర్గాల ప్రకారం 312 మంది బడా వ్యాపారులే 72 శాతం మేరకు బ్యాంకులకు రుణాలను ఎగ్గొట్టినా, ప్రభుత్వం ప్రజల డబ్బును వారికి దోచిపెడుతూనే ఉంది. బ్యాంకులు గత అయిదేళ్లలో రాబట్టిన రుణాలకు రెట్టింపు మేరకు రాని బాకీలు పెరిగిపోయాయి. రిజర్వు బ్యాంకు డేటా ప్రకారం
ప్రభుత్వ రంగ బ్యాంకులు, షెడ్యూల్డు వాణిజ్య బ్యాంకులు రూ.11,17,183 కోట్ల మేరకు రుణాలను రద్దు చేశామని, కేవలం 13 శాతం మాత్రమే వసూలు చేసుకోగలిగామని గత సమావేశంలో ఆర్థిక మంత్రే స్వయంగా వెల్లడించారు.