భారత్, పాక్ మధ్య శాంతి చర్చల్లో యూఏఈ కీలక పాత్ర పోషించనుందా..? దీనికి కారణాలేమిటి..? అసలు యూఏఈ పాత్ర వెనుక ఉన్న అంశాలేమిటి..?గతంలో భారత్, పాకిస్తాన్లను ఒకచోట చేర్చడానికి యూఏఈ చేసిన ప్రయత్నాలేమిటి? భారత్-పాకిస్తాన్-యూఏఈ.. ఈ త్రయం ఎందుకు ప్రత్యేకమైనది? దీనివల్ల యూఏఈ పొందే లాభాలేమిటి?
అది 2019 ఫిబ్రవరి 14. భారత సైనికుల బస్సు కశ్మీర్ గుండా వెళుతోంది. పుల్వామా నగరంలో పేలుడు పదార్థాలు నింపుకున్న ఒక కారు బస్సుపై దూసుకెళ్లింది. ఈ ఆత్మాహుతి దాడిలో 40 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 2019 ఫిబ్రవరి 26.. పాకిస్తాన్లోని బాలాకోట్లో భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్ చేసిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత్ పగ తీర్చుకుందని, ఇంట్లోకి చొచ్చుకెళ్లి మరీ దెబ్బకొట్టిందని న్యూస్ చానల్స్ వార్తలను ప్రసారం చేశాయి.
2019 ఆగస్టు 5 .. అంతకు కొద్ది రోజుల క్రితం, కశ్మీర్ సందర్శనకు, అమర్నాథ్ యాత్రకు వెళ్లిన వారు వెనక్కి తిరిగి వచ్చేయాలని, సొంతూళ్లకు వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. మెల్లగా కశ్మీర్ వాతావరణంలో నిశ్శబ్దం అలుముకుంది. భారీగా సైనికులను మోహరించారు. ఆగస్టు 5న మోదీ ప్రభుత్వం కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసినట్లు ప్రకటించింది. గత కొన్నేళ్లుగా భారత్-పాకిస్తాన్ల మధ్య దూరాన్ని, ద్వేషాన్ని పెంచిన మూడు ఘటనలు ఇవి. ఏడాదిన్నర తరువాత 2021లో అకస్మాత్తుగా భారత్, పాకిస్తాన్ సైనిక అధికారుల సమావేశంలో శాంతియుతంగా చర్చలు సాగాయని అప్పటి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా ప్రకటన, పత్తి, చక్కెర వంటి దిగుమతులపై నిషేధాన్ని తొలగించాలన్న అంశాలు తెరపైకి వచ్చాయి.
ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ దారిలోకి వస్తున్నాయని చాలామంది భావించారు. దీనికి కారణం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీసుకున్న చొరవ అని చెప్పవచ్చు. భారత్, పాకిస్తాన్ల మధ్య స్తంభించిన సంబంధాలను కదిలించిందీ దేశం. మళ్లీ 2023 జనవరిలో యూఏఈ ద్వారా భారత్, పాకిస్తాన్ల మధ్య సంబంధాలు మెరుగుపడతాయనే ఆశలు మొలకెత్తుతున్నాయి.
భారత్, పాకిస్తాన్ల మధ్య వైరాన్ని తగ్గించడంలో యూఏఈ మరోసారి కీలక పాత్ర పోషించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఇటీవల చేసిన ఒక ప్రకటన ఈ విషయాన్ని తెలియజేస్తోందని అంటున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోందన్న సంగతి తెలిసిందే. షాబాజ్ షరీఫ్ అధికారం చేపట్టిన తరువాత మూడోసారి యూఏఈ పర్యటనకు వెళ్లారు. అక్కడ అల్-అరేబియా న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షరీఫ్ మాట్లాడుతూ, “భారత్, పాకిస్తాన్ల మధ్య సయోధ్య తీసుకురావాలని యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ను కోరాను. ఆయన మాకు మిత్రుడు. భారత్తో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి.
రెండు దేశాల మధ్య మాటలు మొదలయ్యేలా చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించగలరు. మేం హృదయపూర్వకంగా భారత్తో మాట్లాడతామని ఆయనకు మాటిచ్చాను” అని అన్నారు. “గుణపాఠాలు నేర్చుకోవడం”, “శాంతి కోసం సిద్ధంగా ఉండడం” మొదలైన విషయాలు కూడా షరీఫ్ ప్రస్తావించారు. “నేను భారత ప్రధాని మోదీకి ఈ సందేశం అందించాలనుకుంటున్నాను.. రండి, మనం కలిసి కూర్చుని కశ్మీర్ వంటి నిత్యం మండే విషయాలపై సీరియస్గా చర్చించుకుందాం” అని షరీఫ్ అన్నారు. మరోవైపు, భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ, ఇలాంటి చర్చలకు ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, ఇదే మా దృక్కోణమని అన్నారు. ఇదంతా చూస్తుంటే యూఏఈ నిజంగానే భారత్ పాకిస్తాన్ల మధ్య సయోధ్య తీసుకురాగలదని షరీఫ్ బలంగా నమ్ముతున్నట్టు తెలుస్తోంది. దీనికి ఈ మూడు దేశాల మధ్య సంబంధాలే కీలకమని అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మూడు దేశాల జనాభా, వాణిజ్యాన్ని పరిశీలించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
యూఏఈ జనాభా దాదాపు 93 లక్షలు. ఇందులో భారతీయుల సంఖ్య సుమారు 35 లక్షలు కాగా, పాకిస్తానీయుల సంఖ్య 13 లక్షలకు పైనే ఉంది. వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశానికి మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి యూఏఈ. 2021-22లో రెండు దేశాల మధ్య సుమారు 73 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. వచ్చే మూడేళ్లలో ఇది 100 బిలియన్ డాలర్లు దాటుతుందని అంచనా. భారతదేశంలో పెట్టుబడి పెడుతున్న దేశాల్లో యూఏఈ ఎనిమిదో స్థానంలో ఉంది.
2000 నుంచి 2021 వరకు భారత్లో సుమారు 11 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. మరోవైపు, భారతీయ కంపెనీలు యూఏఈలో ఇప్పటివరకు సుమారు 85 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాయని అంచనా. భారత్, యూఏఈకి విలువైన లోహాలు, రాళ్లు, ఆభరణాలు,ఖనిజాలు, చక్కెర, కూరగాయలు, పండ్లు, టీ, మాంసం, సీ ఫుడ్,వస్త్రాలు, ఇంజనీరింగ్, యంత్ర ఉత్పత్తులు, రసాయనాలను ఎగుమతి చేస్తుంది. పెట్రోలియం, విలువైన లోహాలు, రాళ్లు, రత్నాలు, ఆభరణాలు, కలప, కలప ఉత్పత్తులు, ముడి చమురు మొదలైనవాటిని యూఏఈ నుంచి దిగుమతి చేసుకుంటుంది. భారత్, యూఏఈల మధ్య మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. 2022లో మోదీ అబుదాబి వెళ్లినప్పుడు, యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి స్వాగతం పలికారు. అలాగే, పాకిస్తాన్కూ యూఏఈతో మంచి సంబంధాలు ఉన్నాయి.
2023 జనవరిలో పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ యూఏఈలో పర్యటించారు. ఆ సందర్భంగా యూఏఈ పాకిస్తాన్కు మూడు బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. 2021-22లో యూఏఈ, పాకిస్తాన్ల మధ్య సుమారు 10 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. రానున్న కాలంలో ఈ వ్యాపారం మరింత పెరగవచ్చని అంచనా.
డేటా వెబ్సైట్ ఓఈసీ ప్రకారం, 2020లో యూఏఈ నుంచి పాకిస్తాన్కు ఐదున్నర బిలియన్ డాలర్ల ఎగుమతులు వెళ్లాయి. పాకిస్తాన్ నుంచి యూఏఈకి సుమారు ఒక బిలియన్ డాలర్ల ఎగుమతులు అందాయి. యూఏఈ ప్రధానంగా చమురు, ‘స్క్రాప్ ఐరన్’లను పాకిస్తాన్కు ఎగుమతి చేస్తుంది. పాకిస్తాన్ యూఏఈకి బంగారం, మాంసం, బియ్యం ఎగుమతి చేస్తుంది. 2019లో పుల్వామా, బాలాకోట్, ఆర్టికల్ 370ని తొలగింపుతో భారత్-పాకిస్తాన్ మధ్య దూరం ఏర్పడింది. ఈ దూరాలు 2021 ఫిబ్రవరిలో తగ్గడం ప్రారంభించాయి. ఫిబ్రవరి 25న, కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి ‘2003 కాల్పుల విరమణ ఒప్పందాన్ని’ అనుసరించాలని భారత్, పాకిస్తాన్ సైనిక అధికారులు నిర్ణయించారు.
ఆ సమయంలోనే అప్పటి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా.. పాత వివాదాలను మరచిపోయి కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునే దిశలో ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు జరిగాయి. అదే సమయంలో, భారత్, పాక్ మధ్య సాన్నిహిత్యాన్ని పెంచే దిశగా యూఏఈ కూడా ప్రయత్నిస్తోందని 2021 ఏప్రిల్లో రాయిటర్స్ వార్తా సంస్థ ఒక నివేదికను ప్రచురించింది. ఇదే విషయమై 2021 జనవరిలో దుబాయ్లో భారత్, పాకిస్తాన్ అధికారుల మధ్య ‘రహస్య సమావేశం’ కూడా జరిగిందని పేర్కొంది. అమెరికాలోని యూఏఈ రాయబారి యూసుఫ్ అల్-ఉతేబా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ విషయాన్ని ధృవీకరించారు. కశ్మీర్కు సంబంధించి భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో యూఏఈ కీలక పాత్ర పోషించింది. ఇకపై ఇరు దేశాల మధ్య ‘ఆరోగ్యకరమైన’ సంబంధాలు నెలకొంటాయని విశ్వసిస్తున్నామని పేర్కొంది.
కశ్మీర్ అంశంలో మూడో జోక్యాన్ని అంగీకరించని భారత్ .. పాక్ ప్రధాని షరీఫ్ వ్యాఖ్యలపై సానుకూలంగా స్పందిస్తుందా అన్నదే చర్చనీయాంశంగా మారింది.