2024 ఎన్నికలే టార్గెట్ గా జగన్ .. అసంతృప్తులకు చెక్ పెట్టనున్నారా..? ఎమ్మెల్సీ పదవుల పందేరంతో .. సీనియర్లకు, అసమ్మతి నేతలకు ఛాన్స్ ఇవ్వనున్నారా..? ఎమ్మెల్సీలపై జగన్ వ్యూహం ఏ మేరకు సక్సెస్ అవుతుందన్నదే చర్చనీయాంశంగా మారిందా..?
సీట్ల సర్దుబాటుకు జగన్ సిద్ధమయ్యారు. కుదిరితే ఎమ్మెల్యే.. కుదరకపోతే ఎమ్మెల్సీ అంటున్నారు. వై నాట్ 175 ప్రశ్నిస్తున్నారు. కుప్పంతో సహా అన్నీ మనవే అని చెబుతున్నారు. ఇక ఎన్నికలే తరువాయి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలకు డెడ్ లైన్లు పెడుతున్నారు. గెలుపే పరమావధిగా పని చేయాలని సూచిస్తున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా సీట్ల సర్దుబాటు కోసం జగన్ కుస్తీ పడుతున్నారు. సరిగా పనిచేయని వారిని పక్కన పెట్టే యోచనలో ఉన్నారు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు.
ఇప్పటికే 28 మంది ఎమ్మెల్యేలకు డెడ్ వైన్ విధించారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వారితో ఇంటి పోరు మొదలైంది. దీంతో కొందరికి ఎమ్మెల్యేలు, కొందరికి ఎమ్మెల్సీలు ఇవ్వాలని జగన్ ఒక అభిప్రాయానికి వచ్చారు. సిట్టింగ్ లకు .. ఎమ్మెల్యే పదవి ఇస్తూ.. ఆశావహులకు ఎమ్మెల్సీ ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలో 21 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. మొత్తం స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి.
నియోజకవర్గాల వారీగా సీనియర్లను, సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించాలని జగన్ ఆలోచిస్తున్నారు. తద్వారా ఎమ్మెల్యే అభ్యర్థులకు లైన్ క్లియర్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఎక్కువగా పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఈ సూత్రాన్ని అమలు చేయాలని జగన్ భావిస్తున్నారు. మార్పులు, చేర్పుల్లో భాగంగా విజయవాడ తూర్పు లో దేవినేని అవినాశ్ కు టికెట్ ఖరారు కావటంతో, అక్కడ నుంచి బొప్పన భవ కుమార్ కు, మండపేట నుంచి పట్టాభిరామయ్య చౌదరికి, పర్చూరు నుంచి రావి రామనాధంకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వొచ్చని భావిస్తున్నారు.
మండపేటలో తోట త్రిమూర్తులు, పర్చూరులో ఆమంచి కృష్ణమోహన్ కు ఇప్పటికే బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా చాలా కాలంగా మర్రి రాజశేఖర్, మేకా శేషుబాబు, జంకె వెంకటరెడ్డి వంటి నేతలకు ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కుతుందని వైసీపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. డొక్కా, పోతుల సునీత, గంగుల ప్రభాకర్ రెడ్డి, సూర్యనారాయణ రాజు పదవీ
కాలం మార్చి 29తో ముగియనుంది. వీరిలో కొందరికి సామాజిక సమీకరణాల్లో భాగంగా మరో అవకాశం దక్కనుంది. ఇటీవల మరణించిన చల్లా భగీరథ రెడ్డి స్థానంలో ఆయన భార్య లక్ష్మీకి అవకాశం దక్కనుందని తెలుస్తోంది. గన్నవరం నుంచి దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావుల్లో ఒకరికి ఎమ్మెల్సీ దక్కనుంది. సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి ఒక సీనియర్ నేతకు ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.
నారా లోకేష్, బచ్చుల అర్జునుడు ఎమ్మెల్సీ పదవీ కాలం మార్చి 29నే ముగియనుంది. అర్జునుడు కృష్ణా జిల్లాకు చెందిన నేత.. మరి ఆ స్థానాన్ని గన్నవరంలో లెక్కల ప్రకారం.. యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావుల పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే విజయనగరం జిల్లాకు చెందిన సూర్యనారాయణ రాజును కొనసాగింపు కష్టమనే చెబుతున్నారు. ఆయన బదులు అదే జిల్లా నుంచి ఆయన సామాజిక వర్గానికే చెందిన రఘురాజు ఎమ్మెల్సీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే మరికొందరు కూడా ఆశావహులు ఉన్నారు.. వారు కూడా తమవంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎమ్మెల్యే అభ్యర్థులను ఆరు నెలల ముందే ప్రకటిస్తానని జగన్ చెప్పారు. కానీ ఎమ్మెల్సీ అభ్యర్థులనే మొదటగా ప్రకటించి, ఎమ్మెల్యే అభ్యర్థులకు దారి సుగమం చేయాలని జగన్ భావిస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ సంచలన నిర్ణయాలు తీసుకోవడం ఎప్పుడు ముందు ఉంటారు.. గత ఎన్నికల ముందు అలాంటి నిర్ణయాలతో అనూహ్యం విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి సీట్ల సర్దుబాటుకు జగన్ సిద్ధమైనట్టు వైసీపీ వర్గాల టాక్. వచ్చే ఎన్నికలకు అభ్యర్థులను కూడా ఖరారు చేస్తున్న సీఎం జగన్ ఈసారి కొంత మంది సీనియర్లకు కూడా టిక్కెట్లు ఇవ్వకూడదని అనుకుంటున్నారు.
వారి కుటుంబసభ్యులకూ చాన్సివ్వకూడదని అనుకుంటున్న ఆయన.. వారికి ఎమ్మెల్సీగా ముందే అవకాశం కల్పించి కామ్ చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది ఈ ఏడాది 23 శాసన మండలి పదవులు ఖాళీ కానున్నాయి. పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీలు ఐదు తప్ప అన్నీ వైసీపీకే దక్కుతాయి. ఈ ఐదింటికీ అభ్యర్థులను ఖరారు చేశారు.
వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు సమయంలో అసంతృప్తుల్ని తగ్గించడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఉపయోగించుకోవాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా వైసీపీకి 18 ఎమ్మెల్సీ సీట్లు ఖాయంగా వస్తాయి. ఈ ఏడాది ఎమ్మెల్సీగా ఎన్నికైతే 2029 వరకు వారు ఆ పదవిలో కొనసాగే అవకాశముంది. 2024 ఎన్నికల్లో పార్టీ గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా ఆరేళ్ళపాటు ఎమ్మెల్సీ పదవిలో కొనసాగవచ్చు. దీంతో ఎమ్మెల్సీ పదవికి భారీ డిమాండ్ పెరిగింది. పలు జిల్లాల్లో సీనియర్ నాయకులు సైతం ఎమ్మెల్సీ పదవులకు పోటీపడున్నారు. పదవులు ఆశించే నేతలు పార్టీ పెద్దలను కలిసి తమ మనసులో మాట చెబుతున్నారు. పార్టీ పెద్దల వద్ద ఇప్పటికే తమ మనసులో మాట బయటపెట్టిన ఆశావహులు సీఎం జగన్ ను కలిసి హామీ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఎన్నికల వేడి పెరగడంతో ఎమ్మెల్సీ పదవుల భర్తీలో ఆచితుచి వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. గతంలో పలువురికి ఎమ్మెల్సీ హామీలు ఇచ్చి ఉన్నారు. వారంతా ఇప్పుడు పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వని వారిని ఎమ్మెల్సీలుగా పంపడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే అసంతృప్తి ఏమీ ఉండదని .. అందరూ సర్దుకుపోతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్ని.. ఎమ్మెల్యే, గవర్నర్ కోటాలతో పాటు స్థానిక సంస్థల కోటాతో భర్తీ చేయనున్నారు.
ఎమ్మెల్యే కోటాలో భర్తీ కావాల్సిన 7 స్థానాలు, గవర్నర్ కోటాలో భర్తీ అయ్యే రెండు స్థానాలు అధికార వైసీపీ ఖాతాలోనే పడతాయి. అటు స్థానిక సంస్థల కోటాలో భర్తీ కావాల్సిన 9 స్థానాల్లో కూడా వైసీపీనే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. జిల్లాల వారీగా సామాజిక సమీకరణాల్ని పరిశీలించి.. అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్సీల్లో కూడా ఎక్కువభాగం బీసీలకే ఇచ్చే ఛాన్స్ ఉందని పొలిటికల్ కారిడార్లో చర్చ నడుస్తోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం జగన్సా మాజిక సమీకరణలకు పెద్ద పీఠ వేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలకే పార్టీ పదవుల నుంచి మంత్రి పదవుల వరకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణతో ఈ విషయం మరింత స్పష్టం అయింది. 2024 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా నిర్ణయించిన జగన్ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇటీవలే విజయవాడలో బీసీ సదస్సు నిర్వహించి రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్ధేశం చేశారు. ఈక్రమంలో ఎమ్మెల్సీ పదవుల భర్తీలో ఆచితుచి వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.
ఈక్రమంలో ఎమ్మెల్సీ పదవుల ఆశిస్తు న్న ఆశావహులకు తనను కలిసే ఛాన్స్ కూడా జగన్ ఇవ్వడం లేదని భోగట్టా. జిల్లాల వారీగా సామాజిక సమీకరణాల్ని ముఖ్య అనుయాయులతో జగన్ బేరీజు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా 23 స్థానాలు వైసీపీ కోటాలోనే భర్తీ కావాల్సి ఉండటంతో శాసన మండలిలోనూ ఆ పార్టీ బలమైన పక్షంగా మారుతోంది. ఇప్పటి వరకు శాసన మండలిలో కొనసాగిన టీడీపీ హవాకు చెక్ పడనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరి ఈ పదవులు ఎవరికి దక్కనున్నాయన్నదే హాట్ టాపిక్ గా మారింది.